PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
18 APR 2020 6:48PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378కి చేరింది.
- కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలిస్తోంది. ఈ మేరకు కొన్ని జిల్లాల్లో గత 28 రోజులుగా, మరికొన్ని జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
- భారత పర్యటన కోసం విదేశీయులకు జారీచేసిన వీసాలన్నిటినీ ప్రభుత్వం మే 3దాకా సస్పెన్షన్లో ఉంచింది.
- కోవిడ్-19 నేపథ్యంలో రూ.10 లక్షల నష్ట పరిహారం వెసులుబాటు గ్రామీణ డాక్ సేవక్లుసహా తపాలా శాఖ ఉద్యోగులందరికీ వర్తింపు
- దేశంలోని 8.2 లక్షల చిన్న వ్యాపార సంస్థలకు ఏప్రిల్ 8 నుంచి రూ.5,204 కోట్ల ఆదాయపు పన్ను వాపసు
- కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అవకాశవాద స్వాధీనం/కొనుగోళ్ల నుంచి భారతీయ కంపెనీలకు రక్షణ దిశగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం సవరణ
కోవిడ్-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం
దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378కి చేరింది. కాగా, మొత్తం కేసులకుగాను 13.82 శాతం వైరస్ బారినపడి కోలుకుని/పూర్తిగా నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 1,992గా నమోదైంది. కోవిడ్-19 నియంత్రణకు అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 47 జిల్లాల్లో సత్ఫలితాలిస్తోంది. ఈ మేరకు గడచిన 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాని ఈ జిల్లాల జాబితాలో తాజాగా కర్ణాటకలోని కొడగు, పుదుచ్చేరిలోని మాహే జిల్లాలు చేరాయి. అలాగే 12 రాష్ట్రాల్లో గడచిన 14 రోజులుగా కొత్తకేసు నమోదుకాని జిల్లాల సంఖ్య 22కు చేరింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615810
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఆరోగ్యశాఖ మంత్రి, రాజధానిలోని వివిధ ఆసుపత్రుల వైద్య సూపరింటెండెంట్లు, కేంద్ర-ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖాధికారులతో డాక్టర్ హర్షవర్ధన్ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం
అనారోగ్యంపై పోరాటంలో భాగంగా కోవిడ్-19తో నిమిత్తం లేకుండా ఇతర సంక్లిష్ట రుగ్మతలతో బాధపడేవారికి కరుణతో చికిత్స చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆసుపత్రులను కోరారు. స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించడంతోపాటు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మొబైల్ రక్త సేకరణ వాహనాలద్వారా తగినంత రక్తం సేకరించి, రక్తమార్పిడి అవసరమైన వారికోసం సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైన రోగులకు చికిత్స నిరాకరించి వెనక్కు పంపివేస్తే సంబంధిత ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై చర్య తప్పదని ఆయన హెచ్చరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615614
కొన్ని కేటగిరీలవారు మినహా విదేశీయులు, ఇమ్మిగ్రేషన్ తనిఖీ కేంద్రాలద్వారా వచ్చే ప్రయాణికులకు జారీచేసిన వీసాలపై మే 3వ తేదీవరకూ సస్పెన్షన్
దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీయులకు జారీచేసిన వీసాలపై మే 3వ తేదీదాకా సస్పెన్షన్ను పొడిగించాలని దేశీయాంగ శాఖ నిర్ణయించింది. అయితే- దౌత్య, అధికారిక, ఐక్యరాజ్య సమితి/అంతర్జాతీయ సంస్థల, ఉద్యోగ-ప్రాజెక్టు కేటగిరీలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇచ్చింది. కాగా, భారత్లో ప్రవేశించే వీలున్న 107 ఇమ్మిగ్రేషన్ తనిఖీ కేంద్రాలద్వారా ప్రయాణికుల రాకపోకలను కూడా మే 3 వరకూ నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, అత్యవసర లేదా అంతగా అత్యవసరంకాని వస్తువులు, ఇతర సామగ్రి తరలించే వాహనాలు, విమానాలు, నౌకలు, రవాణా వాహనాలు, రైళ్లు తదితరాలకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615546
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్లో ఉండిపోయిన విదేశీయులకు దౌత్యసేవల ప్రదానం 2020 మే 3దాకా పొడిగింపు
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్లో ఉండిపోయిన విదేశీయులకు కారుణ్య ప్రాతిపదికన దౌత్యసేవల లభ్యతను 30.04.2020దాకా పొడిగిస్తూ దేశీయాంగ శాఖ 28.03.2020న ఆదేశాలిచ్చింది. అయితే, తాజా పరిస్థితులపై సమీక్ష మేరకు విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారులు/విదేశీయుల రిజిస్ట్రేషన్ అధికారులు దౌత్యసేవలు అందించేందుకు వీలుగా ఈ గడువును మరోసారి పొడిగించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615617
తపాలా శాఖ ఉద్యోగులందరికీ రూ.10 లక్షల పరిహారం
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధినిర్వహణలోగల ఉద్యోగులు వైరస్ బారినపడి మరణిస్తే రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తాజాగా గ్రామీణ డాక్సేవక్లుసహా తపాలా శాఖ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి తక్షణం అమలులోకి రానున్న మార్గదర్శకాలు కోవిడ్-19 సంక్షోభం ముగిసేదాకా అమలులో ఉంటాయని పేర్కొంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615653
కోవిడ్-19 పరిస్థితుల్లో వస్తుసేవల పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటు: సీబీఐసీ
కేంద్ర పరోక్ష పన్నులు-సుంకాల బోర్డు (సీబీఐసీ) 2020 మార్చి 30 నుంచి రూ.5,575 కోట్ల విలువైన 12,923 పన్ను వాపసు అభ్యర్థనలను పరిష్కరించింది. కాగా గడచిన వారం వ్యవధిలోనే రూ.3,854 కోట్ల విలువైన 7873 అభ్యర్థనలను పరిష్కరించింది. జీఎస్టీ రిటర్నులు దాఖలుచేసే వారికి సాయపడే నిమిత్తం వాణిజ్యహిత చర్యల్లో భాగంగా 31.03.2020న నం.133 సర్క్యులర్ను జారీచేసినట్లు సీబీఐసీ తెలిపింది. కొనుగోలు పన్ను వాపసు సత్వర పరిష్కారంతోపాటు సరైన సమాచారం లేని వాపసు అభ్యర్థనలను పరిశీలించేది లేదని అందులో పేర్కొన్నట్లు వివరించింది. అయితే, కోవిడ్-19 పరిస్థితుల నడుమ పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్నట్లు ఈ సర్క్యులర్పై కొన్ని సామాజిక మాధ్యమాలలో తప్పుదోవ పట్టించే ప్రచారం జరిగిందని విచారం వ్యక్తంచేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615616
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ గడచిన 10 రోజుల్లో రూ.5,204 కోట్ల ఆదాయపు పన్ను వాపసు
దేశంలోని దాదాపు 8.2 లక్షల చిన్న వ్యాపారాల (యజమానులు, సంస్థలు, కార్పొరేట్లు, ట్రస్టులు)కు ఊరటనిస్తూ 2020 ఏప్రిల్ 8 నుంచి రూ.5,204 కోట్లమేర ఆదాయపు పన్ను వాపసు సొమ్ము నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. దీనివల్ల కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో ఉద్యోగులకు జీతాల కోత, తాత్కాలిక మూసివేతతో నిమిత్తం లేకుండా సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు కొనసాగే అవకాశం లభిస్తుందని పేర్కొంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615538
కోవిడ్ -19 నేపథ్యంలో అవకాశవాద స్వాధీనం/కొనుగోళ్ల నుంచి భారతీయ కంపెనీల రక్షణ దిశగా ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సవరించిన ప్రభుత్వం
కోవిడ్ -19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అవకాశవాద స్వాధీనం/కొనుగోళ్ల నుంచి భారతీయ కంపెనీలకు రక్షణ దిశగా ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. తదనుగుణంగా సమీకృత విదేశీ పెట్టుబడుల విధానం-2017ను సవరించింది. ఈ మేరకు భారతదేశంలో భౌగోళిక సరిహద్దుగల ఏదైనా దేశానికి చెందిన సంస్థ లేదా భారత్లో పెట్టుబడి లబ్ధిని పొందే అటువంటి దేశానికి చెందిన సంస్థ యజమాని సదరు పెట్టుబడులను ప్రభుత్వ మార్గంలో మాత్రమే పెట్టాలన్నది ఈ సవరణ సారాంశం.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615753
గణతంత్ర దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా గణతంత్ర దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మాననీయ సిరిల్ రమ్ఫోసాతో సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విసిరిన జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై దేశాధినేతలిద్దరూ పరస్పరం అభిప్రాయాలు వెల్లడించుకున్నారు. తమతమ దేశాల్లో ప్రజారోగ్య పరిరక్షణతోపాటు ఆర్థిక దుష్ప్రభావాలను ఉపశమింప చేసేదిశగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల గురించి వారిద్దరూ చర్చించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో అత్యవసర మందుల సరఫరా పరంగా దక్షిణాఫ్రికాకు భారత్ అన్నివిధాలా మద్దతిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615521
ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈజిప్టు అధ్యక్షుడు మాననీయ అబ్దెల్ ఫతే అల్-సిసీతో సంభాషించారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా సంభవిస్తున్న పరిణామాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే తమతమ దేశాల్లో ప్రజా పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుత పరీక్షా సమయంలో ఔషధ సరఫరాలకు కొరత లేకుండా చూస్తామని అల్-సిసీకి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615548
దిగ్బంధం సమయంలో వ్యవసాయ కార్యకలాపాలు వెసులుబాటు దిశగా వివిధ వ్యాపార కొనసాగింపు చర్యలపై వ్యవసాయశాఖ మంత్రి చర్చ
దేశంలో ట్రాక్టర్లు, టిల్లర్లు, పంటకోత యంత్రాలు తదితర 51 రకాల వ్యవసాయ ఉపకరణాల నాణ్యత నిర్ధారణకు నిర్వహించే నమూనాల పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరుదాకా వాయిదా వేసింది; అలాగే విత్తన విక్రేతలు, దిగుమతిదారుల లైసెన్సుల చెల్లుబాటు గడువును 2020 సెప్టెంబరుదాకా పొడిగించింది. అంతేకాకుండా జూన్ 30తో ముగియనున్న ప్యాకేజింగ్ సంస్థలు, ఆహారతయారీ యూనిట్లు శుద్ధి సదుపాయాల లైసెన్సులను కూడా సంవత్సరంపాటు పొడిగించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615615
రైతులనుంచి నేరుగా కనీస మద్దతు ధరకు పప్పులు, నూనెగింజల కొనుగోలు
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని కేంద్రీయ ప్రధాన సంస్థలైన నాఫెడ్, ఎఫ్సీఐలద్వారా విశేషంగా కృషిచేస్తోంది. ఈ మేరకు అనేక రాష్ట్రాలలో 2020-20 రబీ సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా ప్రకటిత వస్తు కొనుగోళ్లను ప్రారంభించింది. దిగ్బంధం నడుమ రైతులకు ఈ విధంగా సకాలంలో మార్కెట్పరంగా మద్దతునిస్తోంది. ఆ మేరకు కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ అత్యధిక సంఖ్యలో రైతులకు ప్రయోజనం కల్పించే చర్యలు చేపట్టింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615894
కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా సమన్వయ కృషి కోసం నోడల్ అధికారి నియామకం చేపట్టాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ సంతోష్ గాంగ్వార్ సూచన
దేశంలో కోవిడ్-19 దిగ్బంధం సందర్భంగా కార్మికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 కంట్రోల్ రూములతో సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం తమ కార్మికశాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ సంతోష్ గాంగ్వార్ కోరారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615759
కోవిడ్-19పై పోరులో భాగంగా పీపీఈ, ఇతర ఉత్పత్తుల తయారీపై వెబినార్
కోవిడ్ -19 నియంత్రణ కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఇతర ఉత్పత్తుల అవసరం విపరీతంగా పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కోసం వాటి ఉత్పత్తికి అవసరమైన తయారీ సామర్థ్యాన్ని దేశీయ పరిశ్రమలు పెంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సహకారంతో భారత రక్షణ ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఐడీఎం) వెబినార్ను నిర్వహించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615468
దిగుమతులకు ప్రత్యామ్నాయం కోసం కృషిచేయాలని, వినూత్న సాంకేతికతను అందిపుచ్చుకుని స్పర్థాత్మకతను పెంచుకోవాలని పరిశ్రమ వర్గాలకు శ్రీ గడ్కరీ పిలుపు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి దిగ్బంధం నిబంధనలు సడలించనున్న నేపథ్యంలో ఆర్ధిక కార్యకలాపాల పునరుద్ధరణపై పారిశ్రామిక సంఘాలతో మంత్రి చర్చించారు. ఇక సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగం పునరుద్దరణకు సంబంధించి ఎగుమతుల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఇంధనం, రవాణా, ఉత్పాదక వ్యయాల తగ్గింపు దిశగా అవసరమైన విధానాలను పాటిస్తూ అంతర్జాతీయ విపణిలో పోటీపడే స్థాయికి ఎదగాలని సలహా ఇచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615512
దేశవ్యాప్తంగా వైద్య సరఫరాలు చేసిన 274 లైఫ్లైన్ ఉడాన్ విమానాలు
కోవిడ్-19పై జాతి పోరాటానికి మద్దతుగా పౌర విమానయాన మంత్రిత్వశాఖ దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సరఫరాలు చేసేందుకు ‘లైఫ్లైన్ ఉడాన్’ విమానాలను నడిపింది. ఈ మేరకు ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్సహా ప్రైవేటు విమానయాన సంస్థల సహకారంతో 274 విమానాలను నడిపించింది. వీటిలో 175 విమానాల ద్వారా ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్ సంస్థలు తమ సేవలందించాయి. ఈ మేరకు లైఫ్లైన్ ఉడాన్ విమానాలు 2,73,275 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 463.15 టన్నుల సరఫరాలను రవాణా చేశాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615749
కోవిడ్ -19 దిగ్బంధం వేళ వినూత్న ఆలోచనలతో రికార్డు స్థాయిలో సరకు రవాణాచేస్తున్న భారత రైల్వేశాఖ
దేశంలో అత్యంత వేగవంతమైన దూరప్రాంత భారీ ప్రత్యేక సరకు రవాణా రైళ్లకు నాంది పలుకుతూ భారత రైల్వేశాఖ ఉత్తర భారతం నుంచి ‘అన్నపూర్ణ’ రైళ్లను, దక్షిణ భారతం నుంచి ‘జైకిసాన్’ రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు దేశం రెండు కొసలనూ అనుసంధానిస్తూ 80కిపైగా రైళ్లు దాదాపు 5,000 టన్నుల ఆహారధాన్యాలతో దీర్ఘాతిదీర్ఘంగా ప్రయాణిస్తున్నాయి. తదనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 16వరకూ 3.2 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను మోసుకెళ్లాయి. నిరుడు ఇదే వ్యవధిలో రవాణా చేసిన ఆహార ధాన్యాలు 1.29 మిలియన్ టన్నులు మాత్రమే కావడం ఈ సందర్భంగా గమనార్హం.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615469
ప్రజా పంపిణీ వ్యవస్థకు సముచిత ఆహార ధాన్యాల లభ్యత దిశగా నిరుటికన్నా రెట్టింపు స్థాయిలో ఆహారధాన్యాలు రవాణా చేస్తున్న భారత రైల్వేశాఖ
దేశంలో దిగ్బంధం ప్రకటించాక మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 17దాకా రైల్వేశాఖ 1500కిపైగా రైళ్లద్వారా 4.2 మిలియన్ టన్నులకుపైగా ఆహార ధాన్యాలను రవాణా చేసింది. నిరుడు ఇదే వ్యవధిలో రైల్వేలు రవాణా చేసిన ఆహారధాన్యాలు 2.31 మిలియన్ టన్నులు మాత్రమే కావడం ఈ సందర్భంగా గమనార్హం. కాగా, ఆహారధాన్యాలవంటి పలు వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో చేరవేయడంద్వారా నిరంతర సరఫరాకు భరోసా ఇచ్చేందుకు రైల్వేశాఖ ఇతోధికంగా కృషిచేస్తోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615802
ఆహార వస్తువులు సత్వరం అవసరమైనవారిపై తపాలాశాఖ దృష్టి సారించాలి: శ్రీ రవిశంకర్ ప్రసాద్
ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభ సమయంలో దేశంలోని ప్రజలకు తనవంతు సాయం అందించడంలో తపాలా శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా విశేష కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలు, నిరుపేదల అత్యవసర ఆహార అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని శ్రీ రవిశంకర్ ప్రసాద్ తపాలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు దేశంలోని తపాలా ఉద్యోగులు తమ పొదుపు మొత్తాలను పోగుచేసి మురికివాడల్లో పేదలకు, వలస కార్మికులకు, రోజుకూలీలకు ఆహారం, ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా వ్యాధి వ్యాప్తి నియంత్రణ లక్ష్యంతో మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615860
దిగ్బంధ సమయంలో ఇంటినుంచి పని పద్ధతిలో తయారుచేసిన 50,000 పునరుపయోగ ఫేస్మాస్కులను సరఫరా చేసిన ఢిల్లీ రోటరీక్లబ్ (ఆర్సిడి);
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615438
కోవిడ్-19పై పోరాటానికి వనరులు మోహరించిన ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్బి)
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో పౌర యంత్రాంగానికి సహకరించడంలో రక్షణశాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్బి) తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ప్రాణాంతక వైరస్పై పోరాటంలో భాగంగా ఈ కీలక సంస్థలన్నీ తమ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, మానవశక్తి తదితరాలను మోహరించాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615635
కోవిడ్-19పై పోరులో భాగంగా రక్షణ కవరాల్ సూట్ రూపొందించిన సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్
సీఎస్ఐఆర్ పరిధిలో బెంగళూరులోగల సీఎస్ఐఆర్-నేషనల్ ఎయిరోస్పేస్ లేబొరేటరీస్ సంస్థ ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం కవరాల్ను రూపొందించడంతోపాటు దానికి ధ్రువీకరణను కూడా సాధించింది. పోలీప్రోపెలిన్ దారంతో, లామినేషన్ చేసిన బహుళ పొరలుగల, కుట్టుతో అవసరంలేని వస్త్రంతో ఈ కవరాల్ను రూపొందించింది. కోవిడ్-19పై పోరులో 24 గంటలూ శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిసహా ఇతర ఆరోగ్య సంరక్షణ రంగ కార్యకర్తలు తదితరుకు ఇది వైరస్నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615714
కోవిడ్-19పై ప్రభుత్వ పోరాటానికి మద్దతుగా ఆహారం, మందులవంటి అత్యవసరాల సరఫరాలో చురుగ్గా పాలుపంచుకుంటున్న నేషనల్ ఫెర్టిలైజర్స్ సంస్థ
కోవిడ్-19పై ప్రభుత్వ పోరాటానికి మద్దతుగా ఆహారం, మందులు, మాస్కులవంటి అత్యవసరాల సరఫరాలో కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రసిద్ధ ఎరువుల తయారీ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ చురుగ్గా పాలుపంచుకుంటోంది. ఇందులో భాగంగా భటిండాలోని ఎన్ఎఫ్ఎల్ శాఖ జిల్లా యంత్రాంగానికి 3,000 మాస్కులు అందజేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615795
‘దేఖో అప్నాదేశ్’ వెబినార్ సిరీస్ వేదికగా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం-2020ని వెబినార్ సిరీస్ వేదికపై ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పర్యాటక-సంస్కృతి శాఖ (ఇన్చార్జి) మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రసంగిస్తూ- మన సంప్రదాయాలు, సంస్కృతి అత్యంత ప్రాచీనమైనవేగాక అమూల్యమైనవని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన విలువలు, మానవత్వం, ఆతిథ్య స్ఫూర్తి భారతదేశమంటే ఏమిటో లోకానికి ప్రస్ఫుటం చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615808
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు 3,323కు చేరాయి. దీంతో వ్యాధిగ్రస్థులతోపాటు మరణాల సంఖ్య రీత్యా దేశంలో అగ్రస్థానంలో ఉంది. కాగా, సుమారు 20 మంది భారత నావికాదళ సిబ్బందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీళ్లంతా పశ్చిమ నావికాదళ కమాండ్కు చెందిన రవాణా సదుపాయాలకు సంబంధించిన ఐఎన్ఎస్ ఆంగ్రీ సిబ్బంది.
- గుజరాత్: రాష్ట్రంలో శనివారం 176 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,272కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కాగా, కొత్త కేసులలో 142 అహ్మదాబాద్లో నమోదు కాగా నగరంలో మొత్తం కేసుల సంఖ్య 765కు చేరింది. మొత్తంమీద ఇప్పటివరకూ 48 మంది మరణించారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో 98 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,229కి చేరింది. ఇప్పటివరకూ వ్యాధిబారిన పడినవారిలో 183 మంది కోలుకోగా 11 మంది మరణించారు.
- కేరళ: రాష్ట్రంలోని మళప్పురంలో వ్యక్తి మరణానికి కారణం కోవిడ్-19 వైరస్ కారణం కాదని ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ప్రకటించారు. అతని నమూనాలు మూడుసార్లు పరీక్షించగా వైరస్ సోకలేదని తేలినట్లు వివరించారు. కాగా, నిన్న రాష్ట్రంలో ఒకే ఒక కోవిడ్-19 కేసు నమోదు కాగా, 10 మంది కోలుకున్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలోని తీవ్రముప్పున్న ప్రాంతాల్లో 36,000 సత్వర పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. కాగా, తమిళనాడుసహా ఇతర రాష్ట్రాలలో ఐసీయూ వెంటిలేటర్లు తయారు చేసేందుకు హుండై సంస్థ ఎయిర్ లిక్విడ్ మెడికల్ సిస్టమ్స్ సంస్థతో జట్టుకట్టింది. మరోవైపు రాష్ట్రంలో ప్లాస్మా చికిత్స ప్రక్రియ అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,323 కేసులకుగాను 283 మంది కోలుకోగా, 15 మంది మరణించారు.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ముఖ్యమంత్రి ఇవాళ సీనియర్ మంత్రులతో సమావేశమై ఏప్రిల్ 20 తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇవాళ 12 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 371కి చేరింది. వీరిలో 92 మంది డిశ్చార్జి కాగా, 13 మంది మరణించారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 31 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 603కు చేరాయి. కృష్ణా జిల్లాలో మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 15కు చేరింది. కోలుకున్నవారి సంఖ్య 42 కాగా, రెడ్జోన్లలో ఇంటింటి సర్వేలో భాగంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్యరీత్యా కర్నూలు 129, గుంటూరు 126, కృష్ణా 70, నెల్లూరు 67 వంతున అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలోని నారాయణపేటలో ఎవరితోనూ సంబంధంలేని ఒక పోలీసుతోపాటు, శిశువుకు కోవిడ్-19 సోకింది. కాగా, ఆదివారం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో హాట్స్పాట్ జాబితాలోగల తెలంగాణలో దిగ్బంధం ఆంక్షలు సడలించే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 766 కాగా, మరణాలు 18గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇటానగర్ సమీపాన అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని బందేర్దేవా తనిఖీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడినుంచి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును సమీక్షించారు.
- అసోం: రాష్ట్రంలోని సిల్చార్ వైద్యకళాశాల ఆస్పత్రి నుంచి మరో కోవిడ్-19 రోగి డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 12కు చేరింది.
- మేఘాలయ: రాష్ట్రంలోని ప్రజలకు కోవిడ్-19పై సందేహాలు నివృత్తి చేసేందుకు ఎన్ఐసిలోని కృత్రిమ మేధో వనరుల విభాగం సహకారంతో ఎన్ఐసి-మేఘాలయ ‘వాణి-కోవిడ్-19’ పేరిట చాట్బాట్ను సృష్టించింది. ఇది ఆంగ్ల, ఖాసీ, గారో భాషల్లో ప్రశ్నలకు జవాబివ్వగలదు.
- మణిపూర్: రాష్ట్రంలోని పిల్లలు ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలుగా విద్యాశాఖ ఎలక్ట్రానిక్ రూపంలో కామిక్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. వీటిని manipureducation.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మిజోరం: కర్ణాటక రాజధాని బెంగళూరులో చిక్కుకుపోయిన మిజోరం రాష్ట్ర పౌరులకు సహాయం అందించడంపై మిజోరం ముఖ్యమంత్రి ఇవాళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ గోవింద ఎం.కజ్రోల్కు కృతజ్ఞతలు తెలిపారు.
- చండీగఢ్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో 68,525 అనాథలకు, నిరుపేదలకు ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. కాగా, వివిధ పరిశ్రమలకు చెందిన 20,000 మంది కార్మికులలో 17,000 మంది వేతనాలు అందుకున్నారు.
- పంజాబ్: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ఆహార-పౌర సరఫరాలు-వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం కింద స్మార్ట్కార్డ్గల లబ్ధిదారులందరికీ గోధుమలు, పప్పులు తదితరాలను పూర్తి ఉచితంగా అందజేస్తారు. కాగా, పండే ప్రతి ఆహారపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్రంలోని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు.
# కోవిడ్-19 లో వాస్తవ తనిఖీ
*******
(Release ID: 1615915)
Visitor Counter : 243
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Telugu
,
Kannada
,
Malayalam