PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
25 APR 2020 6:48PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 నిర్ధారిత కేసులు 24,506; నయమైన వారు 5,062 మంది; నిన్నటినుంచి నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,429
- కొన్ని వర్గీకరించిన దుకాణాలు తెరిచేందుకు దేశీయాంగ శాఖ అనుమతి; మాల్స్ మీద నిషేధం కొనసాగింపు
- ఇంటింటా యాక్టివ్ కేసుల అన్వేషణ, నిఘా, సత్వర గుర్తింపు, సముచిత వైద్య నిర్వహణపై రాష్ట్రాలు దృష్టి సారించాలి: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- పరికరం చొప్పించకుండా కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష పద్ధతిని రూపొందించిన ఐఐటీ-ఢిల్లీ
- ఆరోగ్య సేతు యాప్ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న పౌరుల సంఖ్య 7.5 కోట్లు
- తమ వాహన సముదాయంతో దూర ప్రాంతాలకు నిత్యావసరాలు రవాణా చేయనున్న తపాలాశాఖ
కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితి, చర్యలు నిర్వహణపై మంత్రుల బృందం సమీక్ష
దేశంలో కోవిడ్-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణల దిశగా కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమగ్రంగా చర్చించింది. కోవిడ్-19పై పోరాటంలో తాత్కాలిక ప్రణాళికలను మరింత బలోపేతం చేయాలని అన్ని జిల్లాలకూ సమాచారం పంపినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రుల వివరాలను, ఏకాంత చికిత్స పడకలు/వార్డులు, వ్యక్తిగత రక్షణసామగ్రి, ఎన్85 మాస్కులు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వగైరాల గురించి ఉపసంఘానికి అధికారులు వివరించారు. కాగా, దేశంలో కోవిడ్ వ్యాధి బారినపడి కోలుకున్నవారి సంఖ్య 20.66శాతం.. అంటే 5,062కి పెరిగిందని ఉపసంఘానికి తెలిపారు. అలాగే నిన్నటినుంచి 1,429 కొత్త కేసులు నమోదవగా నిర్ధారిత కేసుల సంఖ్య 24,506కు చేరిందని నివేదించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617995
మల్టీబ్రాండ్-సింగిల్ బ్రాండ్ మాల్స్ మినహా కొన్ని వర్గీకృత దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చిన దేశీయాంగ శాఖ
దేశంలోని కొన్ని వర్గీకృత వాణిజ్య, ప్రైవేటు సంస్థలు, దుకాణాలు తెరిచేందుకు దేశీయాంగ మంత్రిత్వశాఖ అనుమతించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న దుకాణాలు-వ్యాపార సంస్థల చట్టాలకింద నమోదైన దుకాణాలు, సంస్థలు తెరిచేందుకు అనుమతించడంపై దేశీయాంగ శాఖ ఆదేశాలిచ్చింది. దీనికి అనుగుణంగా నివాస సముదాయాల్లోని షాపులు, స్వతంత్ర దుకాణాలు, ఇరుగుపొరుగు వీధుల్లోని దుకాణాలు వంటివి తెరిచేందుకు వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అయితే, పుర-నగర పాలిలకల సముదాయాల్లోనివి తప్ప మార్కెట్లు, మార్కెట్ సముదాయాల్లోని దుకాణాలను తెరవడంపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్ కూడా తెరవరాదని పేర్కొంది.
దుకాణాలు తెరిచేందుకు దేశీయాంగ శాఖ అనుమతి ఉత్తర్వుపై వివరణ
దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వుల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోనివి మినహా అన్ని దుకాణాలు తెరవవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అన్ని స్వతంత్ర, ఇరుగుపొరుగు, నివాస సముదాయాల్లోని దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంది. అయితే, మార్కెట్లు/మార్కెట్ సముదాయాలు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలు విక్రయించేందుకు మాత్రమే అనుమతి ఉంది.
కోవిడ్-19పై చర్యలకు సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులతో డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం
కోవిడ్-19పై ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యకలాపాలకు వాటి సన్నద్ధతపై ఆరోగ్యశాఖ మంత్రులు-కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో సమీక్షించారు. ఇప్పటిదాకా రాష్ట్రాలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ అత్యధిక కేసులు నమోదయ్యే లేదా రెట్టింపయ్యే శాతం అధికంగాగల. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న జిల్లాలపై దృష్టి సారించాల్సిందిగా వారిని కోరారు. అలాగే ఇంటింటా యాక్టివ్ కేసుల అన్వేషణ, నిఘా, రోగుల సత్వర గుర్తింపు, రోగులకు సకాలంలో చికిత్స లభించేలా, మరణాలను తగ్గించే విధంగా సముచిత వైద్యనిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కోరారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618085
కోవిడ్-19 నిర్ధారణకు పరికర రహిత వినూత్న పరీక్ష పద్ధతిని రూపొందించిన ఐఐటీ-ఢిల్లీ
కోవిడ్ -19 నిర్ధారణకు రోగి నోటిలో లేదా ముక్కులో పరికరం చొప్పించే అవసరంలేని వినూత్న పరీక్ష పద్ధతి రూపకల్పనలో పాలుపంచుకున్న ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తల బృందాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ సత్కరించారు. ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాతలకు ఈ పరీక్ష కిట్ సాధికారత కల్పిస్తుందని, కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన ఈ తరహా మొట్టమొదటి పరీక్ష పద్ధతి ఇదేనని, అంతేగాక వివాదానికి తావులేనంత నిర్దిష్ట ఫలితమిచ్చే చౌకైన పరీక్ష విధానమని పేర్కొన్నారు. ప్రకాశక పరికరం అవసరం లేనందువల్ల ఈ పద్ధతి వినియోగాన్ని అధికంగా, సులువుగా నిర్వహించే వీలుంటుందన్నారు. కాగా, తగిన పారిశ్రామిక భాగస్వాములతో సంయుక్తంగా అందుబాటు ధరతో పెద్ద సంఖ్యలో ఈ పరీక్ష కిట్ల తయారీపై దృష్టిపెట్టామని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
ఎంఎస్ఎంఈలకు చెల్లింపుల్లో జాప్యం నివారణకు ప్రత్యేక పథకం దిశగా ప్రభుత్వ యోచన: శ్రీ నితిన్ గడ్కరీ
ఎంఎస్ఎంఈలకు చెల్లింపుల్లో జాప్యం నివారణకు ప్రత్యేక పథకం దిశగా ప్రభుత్వం యోచిస్తున్నదని శ్రీ నితిన్గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సత్వర చెల్లింపులు చేసేలా అన్ని ప్రభుత్వ విభాగాలకూ సముచిత ఆదేశాలిచ్చిందని ఆయన తెలిపారు.
రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G), ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం (PMGSY), జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (NRLM) తదితరాల కింద చేపట్టే పనులను వేగిరపరచడంపై రాష్ట్రాల మంత్రులతో సవివరంగా చర్చించారు. గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం దిశగా కోవిడ్-19 సవాళ్లను ఒక అవకాశంగా మార్చుకోవాలని, గ్రామీణ జీవనోపాధిని వైవిధ్యీకరించాలని సూచించారు.
ప్రారంభించిన వారంలోపే భారీగా విజయవంతమైన ‘కిసాన్ రథ్’ మొబైల్ యాప్
కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి 17.04.2020న ‘కిసాన్ రథ్’ మొబైల్ యాప్ను ప్రారంభించారు. దేశంలోని రైతులు, వ్యాపారులు ఆహారధాన్యాలు (తృణ, ముతక తృణ, పప్పుదినుసులువగైరా), పండ్లు-కూరగాయలు, నూనెగింజలు, సుగంధ ద్రవ్యాలు, నార పంటలు, పూలు, వెదురు, కలప, సూక్ష్మ అటవీ ఉత్పత్తులు, కొబ్బరికాయలు వగైరా అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల తరలింపునకు తగిన రవాణా సదుపాయం అన్వేషణ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ మేరకు గత వారం రోజుల్లో 80,474 మంది రైతులు, 70,581 మంది వ్యాపారులు ఈ యాప్ద్వారా నమోదయ్యారు.
సలహామండలితో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం
కోవిడ్ ప్రపంచ మహమ్మారి, జాతీయ దిగ్బంధం ప్రభావాన్ని దేశీయ కార్యకలాపాల మందగమనం ఆధారంగా అంచనా వేయవచ్చునని సలహామండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 2020 మార్చి నెలకుముందు రూపొందించిన జీడీపీ వాస్తవ వృద్ధి అంచనాలను పూర్తిస్థాయిలో పునఃపరిశీలించి గణనీయంగా దిగువస్థాయికి సవరించాల్సి ఉందని వారు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. దిగ్బంధం ముగిశాక ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛ లభించి క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, కార్మికశక్తి ఎంత త్వరగా తిరిగి కార్యరంగంలోకి దిగుతుందనే అంశంతోపాటు మధ్యస్థ సంస్థలనుంచి సరఫరాల పునరుద్ధరణ, నగదు ప్రవాహంసహా ఉత్పత్తికి తగిన గిరాకీ ఏర్పడటంపైనా ఇది ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో 500 కిలోమీటర్లకుపైగా పొడవున్న 22 మార్గాలతో కూడిన జాతీయ రహదారి రవాణా నెట్వర్క్ ద్వారా నిత్యావసరాల పంపిణీ చేయనున్న తపాలాశాఖ
ప్రస్తుతం నగరాల మధ్య సేవప్రదానానికి వినియోగించే తమ వాహనాల సముదాయంతో ఒక రవాణా నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని తపాలాశాఖ యోచించింది. ఈ మేరకు 34 అంతర్రాష్ట్ర-రాష్ట్రాంతర షెడ్యూళ్లతో 75కుపైగా నగరాలను తాకుతూ సాగే 500 కిలోమీటర్లకుపైగా పొడవున్న 22 మార్గాలతో జాతీయ రహదారి రవాణా నెట్వర్క్కు రూపకల్పన చేసింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యావసరాల పార్శిళ్ల నిరంతర రవాణా, సరఫరా చేయగల సామర్థ్యాన్ని తపాలాశాఖ సంతరించుకుంది.
దేశంలో సమాచార సాంకేతిక సేవల పరిస్థితిపై శ్రీ సంజయ్ ధోత్రే సమీక్ష
దేశవ్యాప్తంగా 7.5 కోట్లమంది పౌరులు తమ మొబైల్ఫోన్లలో ‘ఆరోగ్యసేతు’ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కోవిడ్-19పై పోరాటంలో ఇదొక ముఖ్యమైన ఉపకరణమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ మహమ్మారి సంక్షోభ సమయంలో సామాన్యులకు ఇదొక జీవనరేఖగా మారిందని చెప్పారు. ఈ యాప్ను మరింతగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
పప్పుదినుసుల పంపిణీ కోసం భారీ కార్యక్రమం
దేశంలోని 20 కోట్ల కుటుంబాలకు ప్రతినెలా కిలో వంతున మూడు నెలలపాటు పప్పుదినుసుల సరఫరా కోసం ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పప్పుధాన్యాల రవాణా, మిల్లుల్లో ఆడించడం తదితరాలు కొనసాగుతున్నాయి. కాగా, పీఎంజీకేవై కింద జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలోగల 20 కోట్ల కుటుంబాలకు రేషన్ దుకాణాలద్వారా మూడు నెలలపాటు నాఫెడ్ 5.88 లక్షల టన్నుల పప్పుదినుసులను పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల ట్రక్కులు 4 వారాలపాటు లోడింగ్/అన్లోడింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటాయి.
కోవిడ్-19 అనంతర వ్యాపార కొనసాగింపు ప్రణాళిక-కోలుకునే మార్గాలపై భారత సముద్ర వర్తక రంగ ప్రతినిధులతో శ్రీ మన్సుఖ్ మాండవీయ చర్చ
దేశంలోని రేవులు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాయని శ్రీ మన్సుఖ్ మాండవీయ సముద్రవర్తక రంగ ప్రతినిధులు, భాగస్వాములకు హామీ ఇచ్చారు. అయితే, కోవిడ్-19 సంబంధిత సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సి ఉందని, ఈ దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు.
రైలుపెట్టెల తయారీని తిరిగి ప్రారంభించిన భారత రైల్వలు
జాతీయ దిగ్బంధంవల్ల 28 రోజులు మూతపడిన భారత రైల్వేశాఖకు చెందిన కపుర్తలలోని రైలుపెట్టెల కర్మాగారం (RCF) 23.04.2020 నుంచి తిరిగి ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించింది. కోవిడ్-19పై నిరంతర యుద్ధం కొనసాగిస్తూనే దేశీయాంగ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ, ముందస్తు జాగ్రత్తలతోపాటు స్థానిక యంత్రాంగాల ఆదేశాలకు అనుగుణంగా తిరిగి పని ప్రారంభించింది.
కోవిడ్-19 నుంచి ఉపశమనం దిశగా పరిశోధన-అభివృద్ధి ఆధారిత సాంకేతిక పరిష్కారాలు, ఉత్పత్తులతోపాటు పరిశుభ్రత ద్రవాలు, సబ్బులు, క్రిమిసంహారకాలు పంపిణీ చేస్తూ తక్షణ ఊరటనిస్తున్న సీఎస్ఐఆర్
దేశవ్యాప్తంగా వస్తురవాణా పెరుగుతున్న నేపథ్యంలో ట్రక్కులు/లారీ డ్రైవర్లు చేయాల్సిన/చేయకూడని పనులపై అనిమేషన్ వీడియోను రూపొందించిన రోడ్డురవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ
పీఐబీ సమన్వయంతో ఢిల్లీ హెరిటేజ్కు చెందిన రోటరీ క్లబ్ద్వారా 50,000 పునరుపయోగ మాస్కుల పంపిణీ; దిగ్బంధ సమయంలో ఇంటినుంచి పనిద్వారా ఫేస్మాస్కులు తయారుచేసిన మహిళా టైలర్లు; మాస్కులు పంపిణీ చేసిన పీఐబీ డైరెక్టర్ జనరల్
ఆదే
దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్టీపీసీ
కేంద్ర పర్యాటకశాఖ ‘దేఖో అప్నాదేశ్’ 8వ వెబినార్ను నిర్వహించింది. ‘ఈశాన్య భారతం-విశిష్ట గ్రామాల సందర్శనానుభవం’పై ప్రసారమైన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలనుంచి ఆసక్తికర స్పందన లభించింది.
దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా తొలి విచారణ నిర్వహించిన ఆదాయపు పన్నుశాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్
సమర్థ నిర్ణయాత్మకత దిశగా డేటా ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పింప్రి చించివాడ్ కోవిడ్-19 పోరాట కేంద్రం
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618001
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కరోనా వైరస్ నుంచి కోలుకునేవారు జాతీయ స్థాయిలో 20 శాతం కాగా, చండీగఢ్లో ఇది 56 శాతం కావడం గమనార్హం. కోలుకున్న రోగుల అత్యధిక శాతం నమోదైన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ 3వ స్థానంలో ఉంది. అలాగే రోగుల సంఖ్య రెట్టింపు శాతం నమోదయ్యే వ్యవధి జాతీయ స్థాయిలో 8.6 రోజులు కాగా, చండీగఢ్లో 30.26 రోజులుగా ఉంది; కాగా, జైలు ప్రాంగణంలో కోవిడ్-19 వ్యాపి నిరోధం దిశగా ఖైదీలకు పరీక్షలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
- పంజాబ్: రాష్ట్రంలో పునఃప్రారంభ అర్హతగల అన్ని పారిశ్రామిక యూనిట్లకు దరఖాస్తు చేసిన 12 గంటల్లోగా అవసరమైన కర్ఫ్యూ పాస్ల మంజూరుసహా అనుమతులు ఇవ్వాలని పరిశ్రమల శాఖతోపాటు కలెక్టర్ల పరిధిలోని జిల్లా పరిశ్రమల కేంద్రాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంజాబ్లోని అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా సర్పంచ్ పల్లవి ఠాకూర్తో కాసేపు ముచ్చటించారు. దేశంలోని రైతులు ముఖ్యంగా పంజాబ్ కర్షకులు దేశంలోని గాదెల్లో ఆహార ధాన్యాలు నింపడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
- హర్యానా: ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ప్రజలకు ప్రశంసనీయ సేవలందిస్తోంది. ఈ మేరకు ప్రజల నుంచి తమకు అందిన ఫోన్ కాల్స్పై సత్వరం స్పందించి సమస్యల పరిష్కారానికి దోహదపడుతోంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్ ఫీజు మాత్రమ వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
- హిమాచల్ ప్రదేశ్: కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల అభ్యాసం దెబ్బతినకుండా చూడటం కోసం ప్రభుత్వం ‘గృహ బోధన’ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు ‘ఇంటింటా పాఠశాల’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద విద్యార్థులకు గరిష్ఠ స్థాయిలో సేవలందించేందుకు అనేక బోధన కార్యక్రమాలను అందుబాటులో ఉంచింది. తదనుగుణంగా దూరదర్శన్ సిమ్లా చానల్ద్వారా రోజుకు మూడు గంటలపాటు 10, 12 తరగతులకు బోధనపై దృష్టి సారించింది. అంతేకాకుండా పలువురు ఉపాధ్యాయులు కూడా వాట్సాప్, కేంద్రీకృత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
- అరుణాచల్ ప్రదేశ్: ఆహారోత్పత్తి, కుటీర పరిశ్రమలపై దిగ్బంధం ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
- మణిపూర్: రాష్ట్రంలో రంజాన్ సందర్భంగా సామాజిక దూరం నిబంధన పాటించేలా అధికారుల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- మిజోరం: కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా అసోం- మిజోరం సరిహద్దు తనిఖీ కేంద్రం పరిధిలోని వైరెంగ్టీవద్ద నిత్యావసరాల ట్రక్కులపై క్రిమి సంహారకాలు చల్లడంద్వారా రోగకారకాల నిర్మూలన.
- నాగాలాండ్: రంజాన్ సమయంలో సామాజిక దూరం ప్రాముఖ్యాన్ని అవగతం చేసుకోవాల్సిందిగా దిమాపూర్ ముస్లిం కౌన్సిల్ ముస్లింలకు విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు ఇళ్ల పైకప్పులు, పార్కింగ్ స్థలాలు, అపార్ట్మెంట్లలో సామూహిక నమాజ్ నిర్వహించరాదని సూచించింది. కాగా, కోవిడ్-19 కారణంగా నష్టపోయిన తరగతుల కాలాన్ని భర్తీ చేయడానికి వీలుగా పాఠశాలలు శనివారాన్ని పనిదినంగా పరిగణించాలని నాగాలాండ్ ప్రభుత్వం ఆదేశించింది.
- సిక్కిం: కోవిడ్-19పై పోరులో భాగంగా రంగ్పోలో ఆర్టీ-పీసీఆర్ కోసం సంచార పరీక్ష బూత్ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ M.K.శర్మ ప్రారంభించారు.
- కేరళ: రాష్ట్రంలోని రెడ్ జోన్లలో ఉన్నవి మినహా గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలను ఇవాళ్టినుంచి తెరిచేందుకు అనుమతించారు. కాగా, రాష్ట్రంలో 7 కొత్త ప్రదేశాలను హాట్స్పాట్లుగా ప్రకటించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తెచ్చేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై రాష్ట్రం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు విదేశాల నుంచి తీసుకొచ్చేవారి కోసం నిర్బంధ వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా ఒక్క ఎర్నాకుళంలోనే 6000 ఇళ్లు/ఫ్లాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నిన్నటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 450 కాగా కోలుకున్న వారు: 331 మంది, యాక్టివ్ కేసులు: 116.
- తమిళనాడు: చెన్నైసహా రాష్ట్రంలోని 5 నగరాల్లో ఆదివారం నుంచి సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనకు గురైన చెన్నైవాసులు భారీగా కొనుగోళ్లు చేపట్టారు. కాగా, పుదుచ్చేరిలో ఓ కోవిడ్ రోగి 18 ఏళ్ల కుమారుడికి వ్యాధి నిర్ధారణ అయింది; దీనితో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో నమోదైన మొత్తం నిర్ధారిత కేసులు 9కి, యాక్టివ్ కేసులు 4కు పెరిగాయి. మరోవైపు మర్కజ్ కార్యక్రమానికి హాజరయ్యాక ఢిల్లీలోని నిర్బంధ చికిత్స కేంద్రాల్లోగల తమిళనాడుకు చెందిన 559 మంది ముస్లింలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. నిన్నటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు: 1,755, మరణాలు: 22, డిశ్చార్జ్ అయినవారు: 866 మంది; కాగా, రాష్ట్రంలోని మొత్తం కేసులకుగాను ఒక్క చెన్నైలోనే ఇప్పటిదాకా 452 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 15 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 489కి చేరింది. కొత్త కేసులలో బెంగళూరు 6, బెళగావి 6, చిక్కబళ్లాపూర్ 1, మాండ్యా 1, దక్షిణ కన్నడ జిల్లాలో 1 వంతున నమోదయ్యాయి. బెంగళూరు అర్బన్లో ఒక జర్నలిస్టు కూడా కోవిడ్-19 బారినపడ్డారు. ఇప్పటివరకు 18 మంది చనిపోగా, 153 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 61 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కర్నూలు, కష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటిదాకా ఒక్క కేసుకూడా లేని శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,016, యాక్టివ్ కేసులు: 814, కోలుకున్నవారు: 171 మంది, మరణాలు: 31, పరీక్షించిన నమూనాలు: 61,266. కాగా, మొత్తం కేసులలో 66 శాతం ఒక్క కర్నూలు (275) జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. గుంటూరు 209, కృష్ణా 127, చిత్తూరు 73 జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉండటం విశేషం.
- తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితి అంచనాతోపాటు మహమ్మారి నిర్వహణ దిశగా రాష్ట్ర అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేసేందుకు కేంద్ర అంతర మంత్రిత్వశాఖల బృందం హైదరాబాద్ చేరుకుంది. కాగా, కోలుకున్నవారిలో సుమారు 15 మంది అవసరమైనప్పుడు తమ రక్త జీవద్రవ్యం అందజేయడానికి అంగీకరించారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 30 శాతం జిల్లాలను ప్రభుత్వం కోవిడ్ -19 రహితమని ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 983 కాగా, యాక్టివ్ కేసులు 663గా ఉన్నాయి.
- జమ్ముకశ్మీర్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,071 నమూనాలను పరీక్షించారు. ఇవాళ 40 కొత్త కేసులు నమోదవగా ఇవన్నీ కశ్మీర్ ప్రాంతానికి చెందినవే కావడం గమనార్హం. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 494కాగా, మరణాలు 6గా ఉన్నాయి. మొత్తం కేసులలో జమ్మూ డివిజన్ -57, కశ్మీర్ డివిజన్లో 437 కేసులున్నాయి.
PIB FACTCHECK
*******
(Release ID: 1618309)
|