PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
11 JUN 2020 7:15PM by PIB Hyderabad
(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 1,41,028కి పెరిగి, కోలుకునే శాతం 49.21కి చేరింది.
- ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనం మేరకు నమూనా జనాభాలో 0.73 శాతం ఇంతకుముందే సార్స్-సీవోవీ-2కు గురైనట్లు తేలింది.
- దేశంలో ఏర్పడే ప్రతి సంక్షోభం స్వయం సమృద్ధ భారత నిర్మాణానికి దాన్నొక మేలిమలుపుగా మలచుకునే అవకాశం ఇస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
- పెన్షనర్లు డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పించడం కోసం సీఎస్సీలో ఈపీఎఫ్వో భాగస్వామ్యం.
- దేశంలోని వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగానికి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు సమకూర్చేందుకు సిద్ధమవుతున్న భారత రైల్వేశాఖ
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; నమూనా జనాభాలో కేవలం 0.73 శాతం కోవిడ్-19కు గురైనట్లు తేల్చిన ఐసీఎంఆర్ రక్తరసి- పరిశీలన అధ్యయనం
దేశంలో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నిర్వహించిన రక్తరసి-పరిశీలన (సీరో సర్వైలెన్స్) అధ్యయనం మేరకు నమూనా జనాభాలో 0.73 శాతం ఇంతకుముందే సార్స్-సీవోవీ-2 (SARS-CoV-2) (కోవిడ్-19)కు గురైనట్లు తేలింది. మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ మేరకు ఇవాళ ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే దిగ్బంధం సమయంలో తీసుకున్న చర్యలు కోవిడ్-19 వ్యాధి సంక్రమణ వేగం, వ్యాప్తి నియంత్రణలో విజయవంతమైనట్లు అధ్యయనం తేల్చింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే వ్యాధి వ్యాప్తి ముప్పు పట్టణాల్లో 1.09 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధికంగా ఉందని ఐసీఎంఆర్ లెక్కగట్టింది. అయితే, మొత్తంమీద వ్యాధివల్ల మరణాల శాతం అత్యల్పంగా 0.08కే పరిమితమైందని పేర్కొంది. దీన్నిబట్టి దేశ జనాభాలో అధికశాతం ప్రజలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే కోవిడ్ సముచిత ప్రవర్తన నియమావళిని అనుసరించాలని స్పష్టమవుతున్నట్లు వివరించింది.
గడచిన 24 గంటల్లో 5,823 మందికి కోవిడ్-19 వ్యాధి నయమైంది. దీంతో కోలుకున్నవారి సంఖ్య 1,41,028కు చేరగా, కోలుకునేవారి శాతం మెరుగుపడి 49.21గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,448 కాగా, ఇవన్నీ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. మొత్తంమీద దేశంలో కోలుకున్నవారి సంఖ్య ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్యను అధిగమించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631020
మహారాష్ట్రలో కోవిడ్-19 నిర్వహణ సన్నద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా మహారాష్ట్రలో కోవిడ్-19 నిర్వహణ సన్నద్ధతను సమీక్షించారు. ఈ మేరకు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ రాజేష్ తోపే, వైద్యవిద్యాశాఖ మంత్రి శ్రీ అమిత్ దేశ్ముఖ్లతోపాటు కోవిడ్-19 ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోగులతో సంబంధాలున్నవారి జాడతీయడం కోసం మానవ వనరులను పెంచాల్సిన అవసరాన్ని డాక్టర్ హర్షవర్ధన్ నొక్కిచెప్పారు. అలాగే ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్రత్యామ్నాయ సరఫరాగల పడకలు, ఆరోగ్య సిబ్బందికి రవాణా సౌకర్యం తదితర సదుపాయాలన్నీ పెంచాల్సి ఉందని స్పష్టం చేశారు. వీటన్నిటితోపాటు సామాజిక నిరోధం, అధికముప్పుగల సంబంధాలు తదితరాల దిశగా ప్రవర్తన మార్పు సమాచారప్రదాన బలోపేతంద్వారా అవగాహన పెంచాలని సూచించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631019
భారత వాణిజ్య సమాఖ్య (ICC) వార్షిక మహాసభ-2020లో ప్రధానమంత్రి ప్రసంగం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా భారత వాణిజ్య సమాఖ్య (ICC) 95వ వార్షిక మహాసభలో ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్-19పై పోరాటాన్ని ప్రస్తావిస్తూ- మహమ్మారితో యుద్ధంలో భారత్ మిగిలిన ప్రపంచంతో కలసి సాహసోపేతంగా ముందడుగు వేసిందని పేర్కొన్నారు. దీనికితోడు మిడతల దండు దాడి, వడగండ్ల వానలు, చమురు రిగ్గులలో మంటలు, స్వల్పస్థాయి భూకంపాలు, రెండు తుఫానులు వంటి ఇతర విపత్తులను ఎదుర్కొనాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ భారత జాతి ఈ సమస్యలను ఐకమత్యంతో దీటుగా ఎదుర్కొంటున్నదని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి విపత్తులు సవాళ్లు విసిరినప్పడు భారత సంకల్పబలం మరింత ఇనుమడిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దృఢ దీక్ష, మనో నిబ్బరం, ఐకమత్యం మన బలమని, దేశం ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనగల శక్తినిస్తున్నది ఇవేనని పేర్కొన్నారు. కాబట్టే ప్రతి సంక్షోభం స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం కోసం ఒక మేలిమలుపుగా మలచుకునే అవకాశాన్ని మనకిస్తున్నదని చెప్పారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630925
భారత వాణిజ్య సమాఖ్య (ICC) వార్షిక మహాసభ-2020లో ప్రధాని ప్రసంగ పాఠం
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630839
భారత, ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయ బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో టీకాలు, చికిత్స, వ్యాధి నిర్ధారణ రంగాలలో పరిశోధన-అభివృద్ధి కృషిసహా రెండు దేశాల మధ్య సహకార విస్తరణకుగల అవకాశమున్న రంగాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే రెండు దేశాల నడుమ నిపుణుల బృందాల ఆదానప్రదానాలు కొనసాగించేందుకు వారు అంగీకరించారు. సదరు సహకార ఫలితాలు/లబ్ధిని మానవాళి విస్తృత ప్రయోజనం కోసం అందుబాటులో ఉంచాలని కూడా వారు అంగీకారానికి వచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630804
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ-కంబోడియా ప్రధాని గౌరవనీయ హున్ సేన్ మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ కంబోడియా ప్రధాని గౌరవనీయ సందేక్ అక్కామోహ సేనాపదెయ్ తెకో హున్ సేన్తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 మహమ్మారి అంశంపై వారిద్దరూ చర్చించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో రెండు దేశాల్లో చిక్కుకుపోయిన భారత, కంబోడియా పౌరుల సంక్షేమంపై శ్రద్ధ వహించడంతోపాటు వారిని స్వదేశం పంపడంపై ప్రస్తుత సహకారపూరిత చర్యల కొనసాగింపునకు వారు పరస్పర అంగీకారం తెలిపారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630801
దేశంలోని వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగానికి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు సమకూర్చేందుకు సిద్ధమవుతున్న భారత రైల్వేశాఖ
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు దేశంలోని కొన్ని రాష్ట్రాలు భారత రైల్వేశాఖకు అభ్యర్థనలు పంపాయి. తదనుగుణంగా రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రైలుబోగీలను కేటాయించింది. ఈ మేరకు ఒక్కొక్క పెట్టెలో 16 మంది కోవిడ్ రోగులకు చికిత్స సదుపాయాలుగల 10 బోగీలతో కూడిన రైళ్లను సిద్ధం చేసింది. ఈ విధంగా మొత్తం 5,231 బోగీలను కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ 24 స్టేషన్లకు ఈ సంచార కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పంపాలని కోరింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం సికిందరాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో వీటిని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఢిల్లీలోని ఇప్పటికే షకూర్బస్తీ ప్రాంతంలో 10 బోగీలుగల ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా, కోవిడ్పై కేంద్ర ప్రభుత్వ పోరుకు భారత రైల్వేశాఖ 100 శాతం మద్దతిస్తోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630953
ఆరోగ్య సేతు యాప్ను విరివిగా వాడండి: జిల్లా కలెక్టర్లకు కేంద్ర సహాయ మంత్రి ధోత్రే సూచన
కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వశాఖ ఉన్నతాధికార బృందం ఇవాళ మహారాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్ఐసీలోని డీఐవోలతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‘ఆరోగ్య సేతు’ యాప్ వినియోగంపై చర్చించింది. ఎలక్ట్రానిక్స్-ఐటీ, హెచ్ఆర్డీ, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సేతు యాప్కు సంబంధించిన విభిన్న ఉపయోగాలపై క్షేత్రస్థాయి అధికారులలో అవగాహన పెంచడం, వారినుంచి అక్కడి సమాచారం సేకరించడం లక్ష్యంగా ఈ చర్చా సమావేశం ఏర్పాటైంది. ఆరోగ్య సేతు యాప్ వేదికద్వారా లభ్యమయ్యే గణాంక విశ్లేషణ రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి చంక్రమణంపై స్థూల, సూక్ష్మ అవగాహనకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ చర్చ సందర్భంగా వెల్లడైంది. సమర్థంగా, సకాలంలో ఈ గణాంకాలను విశ్లేషించడంద్వారా రాష్ట్రంలో తీవ్ర వ్యాప్తి ముప్పున్న ప్రాంతాల విస్తరణపై ముందస్తు సమాచారం లభ్యమవుతోంది. దీంతో నిర్దిష్ట లక్ష్యానుగుణ ఆరోగ్య మౌలిక వసతులను పెంచడానికి వీలు కలుగుతోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630799
కోవిడ్-19 నేపథ్యంలో ‘ఇంటినుంచే పని’ మార్గదర్శకాల అమలును వేగిరపరచాలని డీఏఆర్పీజీకి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచన
కేంద్ర సిబ్బంది-శిక్షణ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్- పరిపాలన సంస్కరణలు-ప్రజా సమస్యల పరిష్కార శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ‘ఇంటినుంచే పని’ విధాన మార్గదర్శకాల అమలును వెంటనే వేగిరపరచాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఆ మేరకు సంబంధిత మంత్రిత్వశాఖలు/విభాగాలతో అవసరమైన సంప్రదింపులు చేపట్టి ప్రాధాన్యం ప్రాతిపదికన అన్నీ పూర్తిచేయాలని సూచించారు. ఇంటినుంచే పని మార్గదర్శకాలను సకాలంలో జారీచేస్తే కేంద్ర సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి సూచించిన సామాజిక దూరం సూత్రానికి తగినట్లు ‘రెండు గజాల దూరం’ పాటించేందుకు వారు ఏర్పాట్లు చేసుకోగలరని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630763
పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్ నిర్వహణకు సీఎస్సీ నెట్వర్కును సద్వినియోగం చేసుకుంటున్న ఈపీఎఫ్వో
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఉద్యోగుల పెన్షన్ పథకం పరిధిలోని పెన్షనర్లకు సేవా ప్రదానాన్ని చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఆ మేరకు చొరవ చూపింది. తదనుగుణంగా సామూహిక సేవా కేంద్రాల (CSC)తో భాగస్వామ్యం ఏర్పరచుకుని వాటిద్వారా వారు సులభంగా డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పించే ఏర్పాటు చేసింది. ఇలా 3.65 లక్షలకుపైగాగల సీఎస్సీ కేంద్రాల తోడ్పాటుతో చిట్టచివరి పెన్షనర్ వరకూ ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. ఈపీఎఫ్వో చందాదారులైన 65 లక్షల మంది పెన్షన్దారులు ఇకపై ప్రతి సంవత్సరం తమ నివాసాలకు సమీపంలోని సీఎస్సీలలో జీవన్ ప్రమాణ్ను సమర్పించవచ్చు. కాగా, ఉద్యోగుల పెన్షన్ పథకం పరిధిలోని పెన్షనర్లు నిరంతర పెన్షన్ మంజూరు కోసం ఏటా జీవన్ ప్రమాణ్/సజీవ ధ్రువీకరణ పత్రాలన్ని సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630931
‘నైపర్’ల డైరెక్టర్లతో కేంద్ర రసాయనాలు-ఎరువులశాఖ సహాయమంత్రి శ్రీ మాండవీయ సమీక్ష సమావేశం
కేంద్ర రసాయనాలు-ఎరువులశాఖ సహాయమంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPERs) సంస్థల డైరెక్టర్లతో సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. మొహాలీ, రాయ్బరేలీ, హాజీపూర్, గువహటిలలోని ‘నైపర్’ సంస్థల డైరైక్టర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి సంబంధితమైనవిసహా ఆయా సంస్థలలో సాగుతున్న పరిశోధన-ఆవిష్కరణ కార్యకలాపాలను సమీక్షించారు. ఆదాయార్జన వనరు నిమిత్తం అన్ని ‘నైపర్’లలో జాతీయ స్థాయి ఔషధ నాణ్యత పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రయత్నించాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. తదనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఔషధ రంగ కంపెనీలు, సంస్థలు ఈ ప్రయోగశాలలను వాణిజ్యపరంగా వాడుకునేందుకు ‘నైపర్’లను సంప్రదిస్తాయని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630929
ఉన్నత విద్యా సంస్థల కోసం “ఇండియా ర్యాంకింగ్స్ 2020”ని వర్చువల్ మార్గంలో విడుదల చేసిన కేంద్ర హెచ్ఆర్డి మంత్రి
దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ఐదు విస్తృత వర్గీకృత పరామితులపరంగా పనితీరు ప్రాతిపదికన 10 విభాగాలలో “ఇండియా ర్యాంకింగ్స్ 2020”ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఇవాళ వర్చువల్ మార్గంలో విడుదల చేశారు. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సృష్టి దిశగా తమ శాఖ ముఖ్యమైన చర్య చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. తదనుగుణంగా దీన్ని గడచిన ఐదేళ్లుగా ఉన్నత విద్యాసంస్థలలో విజ్ఞాన సంబంధిత పలు వర్గీకరణల కింద ర్యాంకుల నిర్ణయం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 కష్టకాలంలో జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆన్లైన్ అభ్యాసం కోసం జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ ఇటీవల ‘నేషనల్ టెస్ట్ అభ్యాస్’ పేరిట యాప్ను ప్రారంభించిందని శ్రీ నిశాంక్ గుర్తుచేశారు. దీన్ని ఇప్పటికే 65 లక్షల మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని అభ్యాసం కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630915
రోగకారక సూక్ష్మజీవులను నిర్మూలించే బహుళపొరల ‘సూక్ష్మజీవి నిర్మూలన’ ఫేస్ మాస్కుకు రూపకల్పన
నవ్య కరోనా వైరస్ను నిర్మూలించగల టీకా లేదా ఔషధం ఇప్పటివరకూ కొనుగొనబడలేదు. అందుకే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి మాత్రమే ప్రాణరక్షణకు ఉపయోగిస్తున్న పద్ధతులు. అలాగే కరోనా వైరస్ నిరోధక సామర్థ్యంగల మాస్కుల వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. అయితే, వీటిని ఎక్కువసేపు ధరించడంవల్ల ఊపిరి సవ్యంగా ఆడకపోవడమేగాక, సదరు మాస్కు నిర్వహణ కూడా ఇబ్బందితో కూడినదే అవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్కూల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం (IIT-BHU) ఐదు పొరలుగల సూక్ష్మజీవి నిరోధక ఫేస్ మాస్కును రూపొందించింది. దీన్ని ధరిస్తే వెలుపలి భాగంలో చేరే రోగకారక సూక్ష్మజీవులను ఈ మాస్కు నిర్మూలిస్తుందని, తద్వారా ద్వితీయ సంక్రమణ చక్రాన్ని నిరోధించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630806
ఐడీవై 2020 కోసం ‘దూరదర్శన్ భారతి’లో సాధారణ యోగా విధాన కార్యక్రమాలు
కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ-ప్రసార భారతి సంయుక్తంగా రోజువారీ సాధారణ యోగా విధాన కార్యక్రమాన్ని 2020 జూన్ 11 నుంచి దూరదర్శన్ భారతి చానెల్లో ప్రసారం చేస్తున్నాయి. ఇది రోజూ ఉదయం 08:00 నుంచి 08:30 గంటల వరకూ ప్రసారమవుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఆయుష్ సామాజికమాధ్యమ శాఖల్లో కూడా లభ్యమవుతుంది. మొత్తం 30 నిమిషాలపాటు సాగే ఈ కార్యక్రమంలో సాధారణ యోగా విధానాలకు సంబంధించిన కీలకాంశాలను తెలియజేస్తారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సామాన్య ప్రజానీకానికి సాధారణ యోగా విధానాన్ని పరిచయం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం-(IDY)2020లో చురుగ్గా పాల్గొనేలా ఈ కార్యక్రమం ప్రజలను సన్నద్ధం చేస్తుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630766
కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భాగంగా 1,15,081 ఫేస్ మాస్కులు, 9,001 లీటర్ల హస్త పరిశుభ్రత ద్రవాలను తయారుచేసిన ఎస్ఈఆర్
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఆగ్నేయ రైల్వే (SER) పునరుపయోగ ఫేస్ మాస్కులుసహా హస్త పరిశుభ్రత ద్రవాల తయారీ చేపట్టింది. ఇందులో భాగంగా తన పరిధిలోని ఖరగ్పూర్, ఆద్రా, రాంచీ, చక్రధర్పూర్ డివిజన్లలోనూ, ఖరగ్పూర్లోని వర్క్ షాప్లోనూ వీటిని తయారు చేస్తోంది. కాగా, కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కోసం ఖరగ్పూర్లోని వర్క్ షాప్తోపాటు ఎస్ఈఆర్ ఖరగ్పూర్ డివిజన్ యూనిట్లో వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) కిట్లను తయారుచేసి అందిస్తోంది. ఆ మేరకు సకాలంలో పీపీఈ కిట్లను, పరిశుభ్రత ద్రవాల సరఫరాద్వారా కోవిడ్ చికిత్స వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తోంది.
మరిన్ని వివరాలకు... http://https//pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630692
ఇక చౌకధరలో నవ్య కరోనావైరస్ నిర్ధారణ పరీక్ష
భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నవ్య కరోనా వైరస్ నిర్ధారణ కోసం ‘రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్’ (RT-qPCR) పరీక్షను మాత్రమే సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు SARS-CoV-2 పరీక్ష కోసం తక్కువ-ధర; సాంకేతికతతో సరికొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. దీన్ని ‘రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ నెస్టెడ్ పీసీఆర్’ (RT-nPCR) పరీక్ష అంటారు. ఈ పరీక్షకు ‘రియల్ టైమ్ క్వాంటిటేటివ్ (RT-qPCR) అవసరం లేదు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630955
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: రాష్ట్ర సరిహద్దులు తెరవడంతోపాటు రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వ్యక్తుల రాకపోకలతో కోవిడ్ వ్యాప్తి గణనీయంగా పెరిగే ముప్పుందని చండీగఢ్ పాలనాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆయన ఆదేశించారు, తద్వారా బయటినుంచి వచ్చేవారికి త్రిముఖ నగరం బయటనే ఆరోగ్య తనిఖీ చేసేందుకు ఒక సార్వత్రిక ప్రణాళికను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.
- పంజాబ్: కోవిడ్-19 గురించి నిర్మాణాత్మక రీతిలో సమాచార వ్యాప్తి దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు ప్రొఫెసర్ కె.కె.తల్వార్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రూపొందించింది. యుద్ధతంత్రం వంటి ఈ వ్యూహం రూపకల్పనలో భాగంగా దిగ్బంధం సమయంలో మార్చి 27నుంచి జూన్ 4వ తేదీదాకా ప్రభుత్వం 19 ఆన్లైన్ సెషన్లను నిర్వహించింది. కోవిడ్ సంరక్షణ విధుల్లోగల 1914మంది వైద్య నిపుణులు ఇందులో భాగస్వాములయ్యారు. స్వల్ప లక్షణాలున్న రోగులను పర్యవేక్షించే వైద్య నిపుణులతోపాటు అనెస్థటిస్టులు, తీవ్ర లక్షణాలున్న రోగుల సంరక్షణ చూసే వైద్య కళాశాల బోధకులు, ఇతర కీలక ఆరోగ్య నిపుణులు కూడా ఈ సెషన్లలో పాల్గొన్నారు.
- హర్యానా: రాష్ట్ర ప్రజలు ప్రతి విపత్తునూ సాహసంతో ఎదుర్కొంటున్న కారణంగానే ప్రస్తుత సమయంలోనేగాక గతంలోనూ ఎన్నడూ హర్యానాలో ప్రగతి స్తంభించలేదని క్రీడలు-యువజన వ్యవహారాలశాఖ మంత్రి అన్నారు. అలాగే భవిష్యత్తులో పురోగమనం మందగించే ప్రసక్తి ఉండదని ధీమా వ్యక్తం చేశారు. కాగా, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితం దృష్ట్యా వివిధ నిర్ణయాలు తీసుకోగా, నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.1200కోట్లతో ‘హర్యానా కరోనా సహాయ నిధి’ని కూడా ఏర్పాటు చేసింది.
- కేరళ: రాష్ట్రంలోని శబరిమల ఆలయంలో నెలవారీ పూజలకు భక్తులను అనుమతించరు; మరోవైపు సోమవారంనుంచి ప్రారంభం కావాల్సిన వార్షిక వేడుకలు కూడా రద్దయ్యాయి. తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రిలోని ఏకాంత చికిత్స వార్డులలో ఇద్దరు కోవిడ్-19 రోగులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ఆస్పత్రి అధికారులను మందలించారు. దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. కోవిడ్ రోగులకు చికిత్సలో పూర్తి సహకారం అందిస్తామని ఆరోగ్య మంత్రితో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. కాగా, ఇవాళ గల్ఫ్ దేశాల్లో ముగ్గురు, ముంబైలో ఇద్దరు కేరళీయులు కోవిడ్-19కు బలయ్యారు.
- తమిళనాడు: పుదుచ్చేరిలో మరో కోవిడ్-19 మరణం నమోదు కాగా, 12 తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 157కి పెరిగింది. తమిళనాడులోని ప్రభుత్వ బాలల శరణాలయంలోని 35మంది పిల్లలకు కోవిడ్-19 నిర్ధారణ కావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ప్రస్తుత స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, కోవిడ్ మరణాల సంఖ్యను దాచడంద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, వివరాల వెల్లడిలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రోగకారక నిర్మూలన ప్రక్రియ నిర్వహించడం కోసం ప్రతి రెండో శనివారాన్ని సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న 1927 కొత్త కేసులు నమోదుకాగా 1008 మంది కోలుకున్నారు; 19 మరణాలు సంభవించాయి. చెన్నైలో 1390 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 36841కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 17179, మరణాలు: 326, చెన్నైలో యాక్టివ్ కేసులు: 13085గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో 5వ తరగతి విద్యార్థుల వరకు ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీలకు లైవ్ వర్చువల్ తరగతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది; నిమ్హాన్స్ వైద్యుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటోరిక్షాలు, క్యాబ్ డ్రైవర్లకు కోవిడ్-19 ఉపశమనం కింద సహాయం కోసం ప్రభుత్వం రవాణా శాఖకు రూ.40కోట్లు విడుదల చేసింది. ఇక హోంశాఖ అనుమతితో రాష్ట్రంలోని తమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవాలని సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో నిన్న 120 కొత్త కేసులు నమోదవగా 257 మంది డిశ్చార్జి అయ్యారు; మూడు మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య: 6041, యాక్టివ్ కేసులు: 3108, మరణాలు: 69, కోలుకున్నవి: 2862గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కువైట్లో చిక్కుకున్న 114 మంది తెలుగు ప్రజలు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఇప్పటికీ విదేశాల్లో చిక్కుకున్నందున వారి తరలింపు నిమిత్తం మరిన్ని విమానాలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. మూడు రోజుల ప్రయోగాత్మక దర్శనాల ప్రక్రియ అనంతరం తిరుమల ఆలయంలో భక్తులకు దర్శన అనుమతి ఇస్తారు. ఇందులో భాగంగా టీటీడీ ఆన్లైన్లో 3,000 టికెట్లను, ఉదయం 8 గంటలకు మొదలయ్యే స్లాట్ల కోసం 3,000 కంటే కాస్త ఎక్కువగా ఆఫ్లైన్ టికెట్లను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,602 నమూనాలను పరీక్షించిన తర్వాత 135 కొత్త కేసులు నమోదవగా, 65 మంది డిశ్చార్జ్ అయ్యారు; ఇద్దరు మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 4261. యాక్టివ్: 1641, రికవరీ: 2540, మరణాలు: 80. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారిలో 971 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 564 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో గత 24 గంటల్లో 31 మంది డిశ్చార్జి కాగా, విదేశాలలోనుంచి వచ్చినవారిలో 197 కేసులకుగాను 176 చురుగ్గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలోని గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఆస్ప్రతి ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడంసహా వార్డులలోని అన్ని కోవిడ్ రోగుల సంబంధిత పడకల వద్ద ప్రత్యేక, సాధారణ విధులను బహిష్కరించారు. కాగా, ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని పరిశ్రమలు-ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఇక రాష్ట్రంలో జూన్ 11నాటికి మొత్తం కేసుల సంఖ్య 4111 కాగా, వీరిలో వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవారు 448 మంది ఉన్నారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో బుధవారం 3254 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 94,041కి చేరాయి. ప్రస్తుతం 46,074 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటిదాకా 44,517 మంది కోలుకున్నారు. మరోవైపు బుధవారం 149 మంది మృతితో ఒకేరోజు అత్యధికంగా మరణాలు సంభవించినట్లయింది. హాట్స్పాట్ ముంబైలో 1567 కొత్త కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య ఊర్ధ్వముఖంగా ఉన్నప్పటికీ కోలుకునే వారి శాతం కూడా పెరుగతోంది. అలాగే మరణాల శాతం కూడా జాతీయ సగటుతో సమానంగా ఉంది. రాష్ట్రంలో కోలుకునేవారి శాతం పెరగడం; ముంబైలోని ధారవి, మాహిమ్, దాదర్ వంటి హాట్ స్పాట్లలో పరిస్థితి మెరుగు కావడంతో ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగించింది.
- గుజరాత్: రాష్ట్రంలోని 21 జిల్లాలనుంచి బుధవారం 510 కొత్త కేసులు నమోదవగా మొత్తం రోగుల సంఖ్య 21,554కు పెరిగింది. అలాగే 370 మంది రోగులు కోలుకోవడంతో ఇప్పటిదాకా ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 14,743కు చేరింది. ప్రస్తుతం 5,464 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ తెల్లవారుజాముదాకా 51 కొత్త కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 11,368కి చేరింది. అలాగే ఇప్పటిదాకా 8502మంది కోలుకున్నట్లు నమోదైంది. గడచిన 8 రోజుల్లో కేసుల పెరుగుదల వేగం ఎక్కువగా ఉందని, ఈ మేరకు రోజూ సగటున 268 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ తెలిపారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో బుధవారం ౨00 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 10,049కి చేరింది. ఇప్పటివరకు 427మంది మరణించారు. కొత్త కేసులలో అధికశాతం హాట్స్పాట్స్ ఇండోర్, భోపాల్ నగరాల నుంచి నమోదవగా- రత్లాం జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 6892 మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,730గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 2.28 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు. మధ్యప్రదేశ్లో కోలుకుంటున్నవారి శాతం 68.6కు పెరిగింది. దీంతో దేశంలో రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
- ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో బుధవారం 114 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,359కి పెరిగింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 958కాగా, ఇప్పటివరకు 402మంది కోలుకున్నారు; మరో ఆరుగురు మరణించారు.
- గోవా: రాష్ట్రంలో బుధవారం 28 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 387కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 320గా ఉంది.
FACT CHECK
****
(Release ID: 1631023)
Visitor Counter : 312
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam