ఆయుష్

2020 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం దూరదర్శన్ భారతిలో కామన్ యోగా ప్రోటోకాల్.

Posted On: 10 JUN 2020 6:53PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రసార భారతి సహకారంతో, 2020 జూన్ 11వ తేదీ నుండి దూరదర్శన్ భారతిలో కామన్ యోగా ప్రోటోకాల్ (సి.వై.పి) ను ప్రతి రోజూ ప్రసారం చేయనుంది.   సి.వై.పి. కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 8 గంటల 30 నిముషముల వరకు ప్రసారమవుతుంది.  ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అదే సమయంలో ప్రసారమవుతుంది.  అరగంట సేపు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో  కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క అన్ని ప్రధాన అంశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. 

దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా కామన్ యోగా ప్రోటోకాల్ ను ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని రూపొందించి, ప్రసారం చేయడం జరుగుతోంది.  కామన్ యోగా ప్రోటోకాల్ ‌తో ముందుగా అవగాహన కలిగి ఉంటే, 2020-అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పూర్తిగా సిద్ధమై, చురుకుగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 

యోగా యొక్క విభిన్న అంశాలను నేర్చుకోవటానికీ మరియు రోజువారీ యోగాభ్యాసాల ద్వారా ప్రయోజనం పొందటానికీ, టెలివిజన్ ‌లో ప్రతీ రోజూ ప్రసారమయ్యే సి.వై.పి. కార్యక్రమాన్ని, ఒక మంచి అవకాశంగా ప్రజలు ఉపయోగించుకోవచ్చు. 

ప్రతి సంవత్సరం, జూన్ 21వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ.డి.వై) గా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, ఐ.డి.వై. ని  ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న సమయంలో జరుపుకుంటున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా నేర్చుకోవడం ఎంతో సందర్భోచితంగా ఉంటుంది. ఎందుకంటే, యోగాభ్యాసం శారీరక మరియు మానసిక క్షేమానికి దారితీస్తుంది.  

ప్రస్తుత క్లిష్ట సమయంలో యోగాభ్యాసం ద్వారా  ప్రజలు ఈ క్రింద పేర్కొన్న ప్రయోజనాలను  పొందవచ్చు:

i)     సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తి పెంపు పై సానుకూల ప్రభావం,

ii)     ఇది ఒత్తిడిని తగ్గించే ప్రక్రియగా  ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడినది. 

గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం, భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం యొక్క వేడుకగా భావించబడింది. ఈ సంవత్సరం,  ప్రత్యేక పరిస్థితులలో, ఇది మంచి ఆరోగ్యం మరియు మనశ్శాంతి కోసం అన్వేషణగా ఉంది. అందువల్ల ఈ సంవత్సరం దృష్టి యోగ దినోత్సవం, అంటే 2020 జూన్ 21వ తేదీన ఇంట్లోనే యోగా చేయడంపై దృష్టి సారించడం జరిగింది. ఎలక్ట్రానిక్, డిజిటల్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా యోగా నేర్చుకోడానికి వీలుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ వనరులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది.  యోగా పోర్టల్ మరియు దాని సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే అనేక ఆన్‌లైన్ వనరులను మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మునుపటి సంవత్సరాలలో మాదిరిగా, 2020-అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, 21-06-2020 తేదీన సామరస్యపూర్వకమైన సామూహిక అభ్యాసం ఉదయం 07:00 గంటలకు జరుగుతుంది, ఆయితే, ఈ ఏడాది, ప్రజలు తమ తమ ఇళ్ల వద్దనే ఈ అభ్యాసంలో పాల్గొంటారు.  యోగా యొక్క అనుచరులు, అభ్యాసకులు, ఔత్సాహికులు కూడా అదే సమయంలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ వేదికల ద్వారా (మునుపటి సంవత్సరాల్లో మాదిరిగానే కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా)  తమ యోగా ప్రదర్శనతో  భాగస్వాములౌతారని భావిస్తున్నారు. 

 

 

కామన్ యోగా ప్రోటోకాల్ (సి.వై.పి) మొదటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది.  ప్రముఖ యోగా గురువులు మరియు నిపుణులు సి.వై.పి. ని రూపొందించారు. ప్రజల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సురక్షితమైన పద్ధతులు ఇందులో ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన యోగా కార్యక్రమాలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తారు.  ఇది వయస్సు, స్త్రీ, పురుష బేధం లేకుండా ప్రజలందరూ సులభంగా ఆచరించే విధంగా రూపొందించబడింది.  సాధారణ శిక్షణా కార్యక్రమాలు, ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని సులభంగా నేర్చుకోవచ్చు.  (ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు వైద్యుడిని సంప్రదించవలసిందిగా సూచించడం జరిగింది). 

***



(Release ID: 1630766) Visitor Counter : 286