PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
03 MAY 2020 6:24PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో 10,632 మందికి కోవిడ్-19 నయంకాగా- కోలుకున్నవారి శాతం 26.59కి పెరిగింది.
- నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా 2,644 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరింది.
- ఎంఎస్ఎంఈలు, రైతులకు మద్దతిచ్చే వ్యూహాలు, చర్యలతోపాటు ద్రవ్యలభ్యత, రుణపరపతి బలోపేతంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, అధికారులతో సమావేశంలో ప్రధానమంత్రి చర్చ.
- రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించే, తీసుకొచ్చే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టీకరణ
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం
దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19 బారినపడి నయమైనవారి సంఖ్య 10,632కు చేరగా, వీరిలో గడచిన 24 గంటల్లో కోలుకున్నవారు 682మంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 26.59కి పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 39,980 కాగా, నిన్నటినుంచి 2,644 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, దిగ్బంధం మూడోదఫాలోనూ (2020 మే 17దాకా )నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందిగా దేశవాసులకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో ఇదొక కీలకచర్యగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 రోగులకు చికిత్సచేసే డాక్టర్లను అంటరానివారిలా చూడరాదని, కోలుకున్నవారిని కళంకితుల్లా భావించరాదని ప్రజలకు సూచించారు.
మరిన్ని వివరాలకు... hhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620671
దేశంలో వృద్ధికి ఉత్తేజమిచ్చే విధంగా ఆర్థికరంగంలో చేపట్టాల్సిన నిర్మాణాత్మక సంస్కరణలు, సంక్షేమచర్యలపై చర్చకు విస్తృత సమావేశం నిర్వహించిన ప్రధాని
ప్రస్తుత పరిస్థితుల నడుమ దేశంలో వృద్ధికి ఉత్తేజమిచ్చే దిశగా ఆర్థిక రంగంలో చేపట్టాల్సిన నిర్మాణాత్మక సంస్కరణలు, సంక్షేమ చర్యలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి ఒక విస్తృత సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశంలోని సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంతోపాటు రైతులకు సంబంధించి ద్రవ్యలభ్యత పెంపు, రుణపరపతి బలోపేతం తదితర చర్యలపై వారితో చర్చించారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆర్థిక సుస్థిరతకు భరోసా ఇవ్వగల తక్షణ మార్గాలుసహా ఈ మహమ్మారి ప్రభావం నుంచి వ్యాపారాలు త్వరగా కోలుకునే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. అలాగే కార్మికులు, సామాన్యుల సంక్షేమం అంశాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కోవిడ్-19 సృష్టించిన అంతరాయాలను అధిగమించి లాభదాయక ఉపాధి అవకాశాలు సృష్టించగలిగేలా వ్యాపార రంగానికి చేయూతనివ్వడంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.
లేడీ హార్డింజ్ వైద్యకళాశాల ఆస్పత్రిలో కోవిడ్-19 నియంత్రణ పరిస్థితిని స్వయంగా సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్
దేశంలో కోవిడ్-19 రోగులకు వైద్యసేవలు అందించడంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తలు తదితర ముందువరుస పోరాట యోధుల దీక్ష, కఠోరశ్రమ, అంకితభావం ప్రశంసనీయమని డాక్టర్ హర్షవర్ధన్ కొనియాడారు. “కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం స్థిరంగా పెరుగుతోంది. దీన్నిబట్టి పెద్దసంఖ్యలో రోగులు వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్తున్నారని స్పష్టమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం 10,000 మందికిపైగా రోగులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఇంకా ఆస్పత్రుల్లో ఉన్నవారిలో అధికశాతం వేగంగా కోలుకుంటున్నారు. ముందువరుసలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఎంతో నాణ్యమైన చికిత్స అందిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ ఘన విజయం సాధించినందుకు వారిని అభినందిస్తున్నాను” అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించే, తరలించే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని రైల్వేశాఖ స్పష్టీకరణ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులను తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిమేరకు మాత్రమే కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాలు వెసులుబాటు కల్పించే, తరలించే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని వివరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్ల రద్దు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది.
కరోనా యోధులకు భారతదేశం శిరసాభివందనం
కోవిడ్ యోధుల సహకారంతో ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్పై భారత్ పోరాటం విజయవంతంగా సాగుతోంది. ఆ మేరకు కరోనా నియంత్రణలో జాతి చేస్తున్న కృషికి చేయూతగా భారత వాయుసేన-ఐఏఎఫ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో నిపుణులను, అవసరమైన సామగ్రిని తరలిస్తూ తనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 600 టన్నుల వైద్య సరఫరాలతోపాటు పెద్దసంఖ్యలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, కోవిడ్ నిర్ధారణ ప్రయోగశాలల ఏర్పాటుకు కావాల్సిన సామగ్రి తదితరాలను చేరవేసింది. అంతేకాదు... కరోనాపై పోరాటానికి ఐఏఎఫ్ సిబ్బంది సహకారం ఇకమీదట కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తన సోదర సంస్థలతో కలసి, తమదైన శైలిలో దేశవ్యాప్తంగాగల కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించింది. తదనుగుణంగా వాయుసేన యుద్ధవిమానాలు గగనతలంలో ఎగురుతూ- ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్పై ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నడుమ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్న కోవిడ్ యోధులకు కృతజ్ఞతాభివందనం చేశాయి.
కోవిడ్-19పై పోరాటంలో అసమాన కృషి, త్యాగనిరతి ప్రదర్శిస్తున్న కరోనా యోధులకు దేశీయాంగ శాఖ మంత్రి అభివందనం
“కరోనా యోధులకు భారతదేశం శిరసాభివందనం చేస్తోంది. మోదీ ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవడంద్వారా కరోనా నుంచి మనం దేశాన్ని విముక్తం చేసుకోవాలి. ఆ మేరకు బలమైన, ఆరోగ్యకర, సౌభాగ్య భారతాన్ని సృష్టించడంద్వారా ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలవాలి. జైహింద్!” అని శ్రీ అమిత్ షా ఒక ట్వీట్ద్వారా సందేశమిచ్చారు.
9, 10 తరగతులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ను ఆవిష్కరించిన హెచ్ఆర్డి మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- అందుబాటులోగల వివిధ సాంకేతిక, సామాజిక మాధ్యమ ఉపకరణాల సాయంతో విద్యార్థులకు వినోదాత్మకంగా, ఆసక్తికరంగా విద్యనందించే పద్ధతులపై మార్గదర్శకాలను ఈ కేలండర్ వివరిస్తుందని చెప్పారు. ఆ మేరకు ఇంటివద్దనే పాఠ్య ప్రణాళికను పూర్తిచేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులేగాక ఉపాధ్యాయులకూ అవగాహన లభిస్తుందన్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు మొబైల్ ఫోన్, రేడియో, టెలివిజన్, ఎస్ఎంఎస్, వివిధ సామాజిక మాధ్యమాలవంటి ఉపకరణాల అందుబాటు స్థాయులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
కోవిడ్-19తో పోరాడుతూ లోక్పాల్ ఆఫ్ ఇండియా న్యాయవిభాగ సభ్యుడు జస్టిస్ అజయ్కుమార్ త్రిపాఠీ మృతి
లోక్పాల్ ఆఫ్ ఇండియా న్యాయవిభాగ సభ్యుడు అజయ్కుమార్ త్రిపాఠీ కోవిడ్-19తో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం, 2020 మే 2న రాత్రి సుమారు 8:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో శ్వాస కష్టంకాగా, 2020 ఏప్రిల్ 2న ఎయిమ్స్లో చేరారు.
కోవిడ్-19 దిగ్బంధం సందర్భంగా 2020 ఏప్రిల్లో రికార్డుస్థాయిన రూ.52 కోట్ల స్థూల విక్రయాలు నమోదు చేసిన జనౌషధి కేంద్రాలు
కోవిడ్-19 దిగ్బంధం కారణంగా మందుల కొనుగోళ్లు రవాణాలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు 2020 ఏప్రిల్లో రూ.52 కోట్ల విక్రయాలతో 2020 మార్చిలో సాధించిన రూ.42 కోట్ల స్థాయిని అధిగమించి రికార్డు సృష్టించాయి. కాగా, 2019 మార్చిలో అమ్మకాలు కేవలం రూ.17 కోట్లు కావడం ఈ సందర్భంగా గమనార్హం.
సంక్షభాన్ని అధిగమించేందుకు భాగస్వాములందరూ ఏకీకృత విధానాలను అనుసరించాలి: శ్రీ నితిన్ గడ్కరీ
కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన ముందుజాగ్రత్త చర్యలన్నిటినీ తప్పకుండా అమలు చేసేలా పరిశ్రమల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ సామగ్రి (మాస్కులు, శానిటైజర్ వగైరాల) వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యాపార కార్యకలాపాల్లో సామాజిక దూరం నిబంధనను తూచా తప్పకుండా అనుసరించాలని సూచించారు. దేశం నుంచి ఎగుమతుల పెంపుతోపాటు దేశీయ ఉత్పాదనద్వారా దిగుమతులకు ప్రత్యామ్నాయాలు చూపడంపై దృష్టి నిలపాలని కేంద్ర మంత్రి అన్నారు.
వస్తుసామగ్రితో/ఖాళీగా వెళ్లే వాహనాలకు ఇబ్బందులపై డ్రైవర్లు/రవాణాదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం దిశగా దేశీయాంగ శాఖ కంట్రోల్ రూమ్ సేవలు
దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తుసామగ్రితో/ఖాళీగా వెళ్లే వాహనాలకు ఎదురయ్యే ఇబ్బందులపై డ్రైవర్లు/రవాణాదారుల సమస్యలు, ఫిర్యాదులకు సత్వర పరిష్కారం కోసం దేశీయాంగశాఖ నిర్వహిస్తున్న కంట్రోల్రూమ్ సేవలను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సదరు కంట్రోల్ రూమ్లో కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ అధికారులను కూడా నియమించనున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కంట్రోల్ రూమ్లోగల 1930, 1033 నంబర్లకు సహాయం కోసం ఫోన్ చేయవచ్చు.
‘లైఫ్లైన్ ఉడాన్’ కింద 430 విమానాల సేవలు
‘లైఫ్లైన్ ఉడాన్’ కింద ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 430 విమానాలను నడిపాయి. వీటిలో ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్ సంస్థలు నడిపిన 252 విమానాలద్వారా 795.86 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. లైఫ్లైన్ ఉడాన్ విమానాలు ఇప్పటిదాకా 4,21,790 కిలోమీటర్ల మేర నడిచాయి. ఇక జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్హన్స్ లిమిటెడ్ సంస్థసహా పలు హెలికాప్టర్ సర్వీసులు వైద్య సామగ్రితోపాటు రోగులను కూడా తీసుకెళ్లాయి. పవన్హన్స్ సంస్థ 2020 మే 2దాకా 7,729 కిలోమీటర్లు ప్రయాణించి 2.27 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.
కోవిడ్ అనంతర కాలంలో వెదురు వనరుల మద్దతుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజమిచ్చే అవకాశం: డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్ అనంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమివ్వడంలో వెదురు వనరులు కీలకం కాగలవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన దేశం ప్రపంచంలో ప్రధాన ఆర్థికశక్తిగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో గిరిజనులకు మద్దతు దిశగా సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ళు వేగిరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన
కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం నుంచి గిరిజనులకు మద్దతిచ్చే దిశగా సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ళు వేగిరపరచాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సూక్ష్మ అటవీ ఉత్పత్తుల సేకరణకు ఇది సరైన సమయం కావడంవల్ల ఈ తరుణంలో గిరిజనులకు మద్దతుగా నిలవాలని పేర్కొంది.
‘పీఎం కేర్స్’ నిధికి రూ.2.5 కోట్ల విరాళమిచ్చిన ఈపీఎఫ్వో ఉద్యోగులు
‘భవిష్యత్ నదీ నిర్వహణ’పై ఎన్ఎంసీజీ-ఎన్ఐయూఏ ‘ఐడియా’థాన్
భవిష్యత్ నదీనిర్వహణ వ్యూహాలను కోవిడ్-19 సంక్షోభం ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపై ‘భవిష్యత నదీ నిర్వహణ’ పేరిట జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని ‘పరిశుభ్ర గంగానది కోసం జాతీయ కార్యక్రమం’ (ఎన్ఎంసిజి), జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్ఐయూఏ) సంయుక్తంగా ‘ఐడియా’థాన్ నిర్వహించాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏదో ఒక రూపంలో దిగ్బంధం కొనసాగిన నేపథ్యంలో కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ ఒక సవాలుగా పరిణమించింది. ఈ సంక్షోభం పర్యవసానాలపై ఆందోళన, ఆదుర్దా సర్వసాధారణమే అయినా, ఇది కొన్ని సానుకూల పరిణామాలకూ దారితీస్తోంది.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలోని తిరువనంతపురం, కోచ్చి నగరాల్లో సాయుధ దళాలు ఇవాళ కోవిడ్-19 యోధులకు వందనం-కృతజ్ఞతలు తెలియజేశాయి. వలస కార్మికుల తరలింపు నిమిత్తం రైల్వేశాఖ ఇవాళ నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు త్రిస్సూర్, కన్నూర్, ఎర్నాకుళం నుండి బయల్దేరాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లోగల కేరళీయులలో మరో ఐదుగురు కోవిడ్-19కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్నటి వరకు మొత్తం కేసులు: 499, యాక్టివ్ కేసులు: 96, డిశ్చార్జ్ అయినవారు: 400 మంది, మరణాలు: 4.
- తమిళనాడు: చెన్నైలోని కోవిడ్ ఆస్పత్రులపై సాయుధ దళాలు ఇవాళ పుష్పవర్షం కురిపించాయి. కాగా, రేపటినుంచి అన్ని జోన్లలోనూగల నియంత్రణేతర ప్రాంతాలలో దిగ్బంధం సడలించేందుకు నిర్ణయించడంతో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, విల్లుపురంలో ఇద్దరు పిల్లలుసహా 25 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. పుదుచ్చేరిలోని జిప్మెర్లో కేన్సర్ రోగికి కోవిడ్-19 నిర్ధారణ అయిన నేపథ్యంలో 44 మంది ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధ వైద్య పరిశీలనకు తరలించారు. తమిళనాడులో నిన్నటిదాకా మొత్తం కేసులు: 2,757, వీటిలో యాక్టివ్ కేసులు: 1,384, మరణాలు: 29, డిశ్చార్జ్ అయినవారు: 1341 మంది. కాగా, చెన్నై అత్యధిక కేసులతో (1257) అగ్రస్థానంలో ఉంది.
- కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 5 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 606కు చేరింది. కొత్త కేసులలో కల్బుర్గి 3, బాగల్కోట్ 2వంతున ఉన్నాయి. ఇప్పటివరకు 25 మంది మరణించగా, 282 మంది నయమై డిశ్చార్జ్ అయ్యారు. తమ తరలింపులో అధిక చార్జీలు వసూలు చేయడంపై వలస కార్మికుల నిరసనతో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రెడ్జోన్లలోగల ప్రతి ఇంటిలో ఒకరికి కోవిడ్-19 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గుంటూరు వైద్య కళాశాల నైతిక నియమాల కమిటీ ప్లాస్మా చికిత్స విధానానికి ఆమోదం తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన తమ నివేదికను ఐసీఎంఆర్ స్పందన కోసం ఈ కమిటీ నివేదించనుంది. గడచిన 24 గంటల్లో 58 కేసులు నమోదు కాగా, వీరిలో ఒక్క కర్నూలు జిల్లావాసులే 30 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 1583కాగా, యాక్టివ్ కేసులు: 1,062, డిశ్చార్జ్ అయినవారు: 488 మంది, మృతులు: 33 మంది. ఇప్పటిదాకా 1,14,937 పరీక్షలు నిర్వహించి నేపథ్యంలో కర్నూలు (466), గుంటూరు (319), కృష్ణా (266) జిల్లాలు కేసుల సంఖ్యరీత్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్ 'యోధులకు' కృతజ్ఞతలు తెలుపుతూ, భారత వైమానిక దళం హెలికాప్టర్ గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురిపించింది. దిగ్బంధం ప్రకటించిన నాటినుంచి హైదరాబాద్ నగరంలో వాయు, జల నాణ్యత గణనీయంగా మెరుగుపడటాన్ని పర్యావరణ నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితిని కాపాడుకోవడంపై శ్రద్ధ చూపకపోతే మళ్లీ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వలస కార్మికులు ఆహారం, నిత్యావసరాల కోసం మైళ్లకొద్దీ దూరం నడవాల్సి వస్తోంది. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన కేసులు 1,061, యాక్టివ్ కేసులు 533, కోలుకున్నవారు 499, మొత్తం మరణాలు 29.
- అరుణాచల్ ప్రదేశ్: కరోనా వైరస్పై పోరాటంలో ముందువరుసనగల ఆరోగ్య సంరక్షకులకు భారత వైమానిక దళ విమానాలు వందనం చేస్తూ గగనతలంలో విహరించాయి.
- అసోం: కరోనా వైరస్ వ్యాప్తి నడుమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటానికి అసోం ప్రభుత్వం 8 మంది సభ్యులతో కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
- మణిపూర్: భారత ఆహార సంస్థ పంజాబ్, హర్యానాల నుంచి మణిపూర్కు 29000 టన్నుల ఆహార ధాన్యాలను తరలించింది.
- మిజోరం: దిగ్బంధం నేపథ్యంలో రాష్ట్రంలోని మామిట్ జిల్లా పరిధిలోగల గ్రామాల్లో 324 కుటుంబాలకు ఐవోసీ సరఫరాల విభాగం వంటగ్యాస్ సిలిండర్లను అందించింది.
- నాగాలాండ్: కోవిడ్ -19పై జిల్లా కార్యాచరణ బృందం ప్రారంభించిన 'అందరికీ మాస్క్లు' కార్యక్రమం కింద నాగాలాండ్లోని మోకోక్చుంగ్ వాసులు సమష్టిగా 2 లక్షల ఫేస్ మాస్క్లు తయారుచేయనున్నారు.
- త్రిపుర: కోవిడ్-19పై పోరులో భాగంగా అంకితభావంతో సేవలందిస్తున్న కరోనా యోధులకు కృతజ్ఞతగా పూలవర్షం కురిపిస్తూ భారత వాయుసేన గగనతలంలో చేసిన విన్యాసం అద్భుతమని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
- చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మరో రెండు వారాలపాటు- 2020 మే 17 వరకు దిగ్బంధం పొడిగించబడింది. అయితే, నగరంలో మే 3 అర్ధరాత్రి నుంచి కర్ఫ్యూ తొలగిస్తారు. నగరంలో ఇప్పటికే ప్రకటించిన, అధికార యంత్రాంగం గుర్తించిన ప్రాంతాలను మాత్రమే నియంత్రణ జోన్లుగా పరిగణిస్తారు. సంబంధిత జోన్లలో అన్ని కేసుల విషయంలోనూ ముమ్మర పరిశీలన, పరీక్షల నిర్వహణను యంత్రాంగం తప్పనిసరి చేసింది.
- పంజాబ్: రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ మాత్రమే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక రెడ్, నియంత్రణ జోన్లలో సడలింపులు ఉండవు. ఇక కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ వస్తురవాణా చేస్తున్న వాహనాలతోపాటు వాటిని నడిపే డ్రైవర్లు/కార్మికుల వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని పంజాబ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజా సలహాపత్రంలో ఆదేశించింది.
- హర్యానా: రాష్ట్రంలో చిక్కుకున్న వ్యక్తులు, వలస కార్మికులను అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతించే దిశగా (రాష్ట్రంలోకి-వెలుపలకు) ఆన్లైన్ నమోదు కోసం https://edisha.gov.in/eForms/MigrantService అనే వెబ్ పేజీని ప్రభుత్వం ప్రారంభించింది. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో పరస్పర మార్పిడి ద్వారా పుస్తకాల పంపిణీపై సమాచారం అందించాలని హర్యానా ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాధికారులు, ప్రాథమిక విద్యాధికారులు, ప్రాజెక్టు సమన్వయకర్తలు, సమితి విద్యాధికారులు, ప్రాథమిక విద్యాధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి విద్యాధికారి, పాఠశాల ప్రధానాధిపతి/ఇన్చార్జిలతోపాటు ఎస్ఎంసిల అధ్యక్షులు, సభ్యులకు కూడా మార్గదర్శకాలు జారీచేసింది.
- హిమాచల్ ప్రదేశ్: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే, 2020 మే 4 నుంచి కర్ఫ్యూ సమయం సడలింపును 4 గంటల నుంచి 5 గంటలకు పెంచనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ కోసం కొత్తగా ప్రకటించిన *ముఖ్యమంత్రి షహరీ రోజ్గార్ యోజన* కింద పట్టణాల్లోని ప్రజలకు 120 రోజుల ఉపాధికి హామీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా అవసరమైతే, నైపుణ్యాభివృద్ధికి తగిన శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపింది.
- మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఇవాళ ఒకేరోజు 790 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 12,296కు దూసుకెళ్లింది. అలాగే 521 మరణాలతో మృతుల సంఖ్యరీత్యా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇక రాజధాని ముంబైకి సంబంధించి కేసులు 8,359 కాగా, మరణాలు 322గా ఉన్నాయి. రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో మరో 27 మందికి వ్యాధి నిర్ధారాణ కావడంతో కేసుల సంఖ్య 360కి పెరిగినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కాగా, ఈ కేసులలో ఒక్క మాలెగావ్లోనే 324 నమోదవడం గమనార్హం. కాగా, వేలాదిమంది ‘కోవిడ్ -19 యోధుల’ గౌరవార్థం ముంబైలో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు నిర్వహించిన అద్భుత విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. కరోనావైరస్ మహమ్మారితో పోరాటంలో ముందున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపేందుకు దేశవ్యాప్తంగా చేసిన కసరత్తులో ఒక భాగంగా ఈ ప్రదర్శన సాగింది.
- గుజరాత్: రాష్ట్రంలో 333 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 5,054కు చేరింది. కాగా, ఇప్పటివరకూ 26 మరణాలు నమోదయ్యాయి. ఇక ఒకేరోజు గరిష్ఠ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇవాళ్టి 333 కేసులలో అత్యధికంగా అహ్మదాబాద్ 250, వడోదర, సూరత్లో 17 కేసుల వంతున నమోదయ్యాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ 127 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,846కు చేరింది. ఇప్పటిదాకా వ్యాధి సోకిన వారిలో 624 మంది కోలుకోగా 151 మంది మరణించారు.
- రాజస్థాన్: రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రాజస్థాన్లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,770కి చేరింది. కాగా, ఇవాళ్టివరకూ నిర్ధారిత రోగులలో 1,121 మంది కోలుకోగా 65 మంది మరణించారు.
- ఛత్తీస్గఢ్: ఆరోగ్య కార్యకర్తల తరహాలో ప్రధానమంత్రి సంక్షేమ ప్యాకేజీ కింద రాష్ట్రంలోని పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు, జిల్లా పాలన యంత్రాంగం సిబ్బందిని చేర్చాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లేఖ రాశారు.
***
(Release ID: 1620789)
|