PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 14 SEP 2020 6:19PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  •  కోలుకునేవారి స‌గ‌టు 78 శాతానికి చేరువ‌; చురుకైన‌ కేసులక‌న్నా న‌య‌మైనవి 28 లక్షలక‌న్నా అధికం.
  • మొత్తం క్రియాశీల కోవిడ్ కేసుల‌లో 60 శాతం 5 తీవ్ర ప్ర‌భావిత రాష్ట్రాల్లోనే;
  • ప‌్ర‌స్తుతం ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నరోగుల‌‌ సంఖ్య 9,86,598.
  • కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి నిర్వహణ విధానాల్లో ఆయుష్ పద్ధతులు చేర్పు
  • ఒకవైపు మహమ్మారి; మరోవైపు క‌ర్త‌వ్య నిబద్ధత.. ఎంపీలంతా బాధ్యతకే క‌ట్టుబ‌డ్డారు: ప‌్ర‌ధాన‌మంత్రి
  • ఆరోగ్య సంర‌క్ష‌ణ కేంద్రాల్లో ఆక్సిజ‌న్ అందుబాటులో ఉంచాల‌ని 7 పెద్ద రాష్ట్రాలకు కేంద్రం సూచ‌న‌.
  • దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ జాతీయ వైద్య చికిత్స విధివిధానాల‌ను, ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించాల‌ని నొక్కిచెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. 

దేశంలో వేగంగా పెరుగుతున్న కోలుకునే సగటు.. 78 శాతానికి చేరిక; చురుకైన‌ కేసులక‌న్నా వ్యాధిన‌య‌మైనవి 28 లక్షలక‌న్నా అధికం; క్రియాశీల కేసుల‌లో 5 తీవ్ర ప్ర‌భావిత రాష్ట్రాల్లోనే 60 శాతం

కోవిడ్ నుంచి కోలుకునే దిశగా భారత్ జైత్రయాత్ర  కొనసాగుతూ ఇవాళ కొత్త మైలురాయిని అధిగమించి వ్యాధి నయమైనవారి సగటు 78.00 శాతానికి చేరింది. ఇందులో భాగంగా రోజువారీ కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగి, గత 24 గంటల్లో

77,512గా నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 37,80,107కు చేరింది. కోలుకునేవారి సంఖ్య పెరుగుతూండటంతో చికిత్సలో ఉన్నవారికన్నా వ్యాధి నయమైనవారి సంఖ్య ఇవాళ దాదాపు 28 లక్షలు (27,93,509) దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య 9,86,598గా ఉంది. వీరిలో 60 శాతానికిపైగా కేవలం 5 రాష్ట్రాల్లోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులలోనే ఉండటం గమనార్హం. అదేవిధంగా కోలుకుంటున్నవారిలో కూడా 60 శాతం ఈ రాష్ట్రాలకు చెందినవారే కావటం విశేషం. ఇక దేశంలో గత 24 గంటల్లో 92,071 కొత్త కేసులు నమోదవగా ఒక్క మహారాష్ట్రలోనే 22,000కుపైగా ఉండగా 9,800 కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఇక దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్‌ కేసులలోనూ దాదాపు 60 శాతం వాటా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలదే. మరోవైపు గత 24 గంటలలో నమోదైన 1,136  మరణాలకుగాను 53 శాతం మూడు రాష్ట్రాలకు చెందినవి కాగా- మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉండగా తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్నటి మరణాలలో 36 శాతానికిపైగా మహారాష్ట్ర (416)కు చెందినవే కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653885

కోవిడ్ మహమ్మారి... ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో 2020 సెప్టెంబర్ 14న ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ స్వచ్ఛంద ప్రకటన పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653885

కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారికోసం ఆయుష్ విధివిధానాల అమలు

కోవిడ్-19 బారినుంచి కోలుకున్నవారికోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కొత్త  నిర్వహణ నియమావళిని జారీచేసింది. ఈ మేరకు వారు ఇళ్లవద్ద పాటించాల్సిన సమగ్ర, సంపూర్ణ పద్ధతిని ఈ నియమావళి నిర్దేశించింది. అయితే, ఇది వైరస్ నిరోధక విధానం కాదని, ఆ రూపంలో దీన్ని వినియోగించరాదని స్పష్టం చేసింది. వ్యాధి సోకి తీవ్ర లక్షణాలతో బాధపడినవారు, ఇదివరకేగల ఇతర వ్యాధులతో తీవ్రంగా బాధపడినవారు  కోలుకునే వ్యవధి ఎక్కువగా ఉంటుందని నియమావళి పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారు వేగంగా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవడానికి ఆయుష్ పరిధిలోని వివిధ రకాల ఆరోగ్య రక్షణ సదుపాయాలను, పద్ధతులను కూడా సూచించింది.

ఈ నియమావళి ప్రకారం కోలుకున్న తర్వాత కూడా మాస్కు సముచిత వినియోగం, చేతుల పరిశుభ్రత, శ్వాస సంబంధిత ఆరోగ్యకర పద్ధతులు, భౌతిక దూరం పాటింపు తదితరాలన్నీ కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. తదనుగుణంగా ఆయుష్ వైద్యుల సిఫారసు మేరకు వారు తగు మోతాదులో వేడినీరు తాగాలని, రోగనిరోధకతను పెంచే ఆయుష్ మందు వాడటం తప్పనిసరి అని నియమావళి చెబుతోంది. నిర్దేశించిన పరిమితిలో స్వల్పంగా లేదా ఒక మోస్తరుగా యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి నిత్యం సాధాన చేయాలని సూచిస్తోంది. అలాగే తమకు అసౌకర్యం కలగని రీతిలో శారీరకంగా సహించగలిగిన వేగంతో ఉదయం లేదా సాయంత్రం నడకకు కూడా వెళ్లాలని పేర్కొంటోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650830

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

“....పార్లమెంటు సమావేశాలు ఇవాళ ప్రత్యేక పరిస్థితుల మధ్య ప్రారంభమయ్యాయి. ఒక‌ వైపు క‌రోనా మ‌హమ్మారి.. మ‌రోవైపు మ‌న క‌ర్త‌వ్య నిబద్ధత; ఈ నేపథ్యంలో పార్ల‌మెంటు స‌భ్యులంతా బాధ్యతల నిర్వహణకే కట్టుబడ్డారు. వారు చూపిన ఈ చొర‌వ‌కు నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల్లో అనేక ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంసహా వివిధ అంశాల‌పై చర్చ సాగుతుంది. లోక్‌సభలో మ‌నం ఎంత ఎక్కువగా చ‌ర్చిస్తే అంత వైవిధ్యభ‌రిత‌, లోతైన సంభాషణలు చోటుచేసుకుంటాయి; తద్వారా చేప‌ట్టిన అంశాలను ప‌రిష్క‌రించ‌డమేగాక దేశానికీ మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు దక్కుతాయని మ‌న అనుభ‌వం చెబుతోంది. అదేవిధంగా ఈసారి కూడా ఘ‌న‌మైన సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తూ ఎంపీలంద‌రూ క‌లసిక‌ట్టుగా ముందుకొచ్చి ఈ సమావేశాలకు విలువనిస్తార‌ని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల నడుమ మ‌నమంతా నియ‌మాల‌ను అనుసరిస్తూ ఎన్నో ముందుజాగ్ర‌త్త‌లతో అడుగులు వేయాలి. ఈ వ్యాధికి ఔషధం సిద్ధమయ్యేదాకా ఈ ప్రవర్తనా శైలిలో ఎలాంటి తేడా రానీయరాదన్నది కూడా స్ప‌ష్ట‌ం. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ప్ర‌పంచంలోని ఏదో ఒక దేశంలో టీకా సిద్ధం కాగలదని మ‌న‌మంతా ఆశిస్తున్నాం.  సాధ్య‌మైనంత త్వ‌ర‌లో మ‌న శాస్త్రవేత్త‌లు ఈ దిశగా విజ‌యం సాధిస్తార‌ని, దీంతో ఈ సంక్షోభం నుంచి ప్ర‌తి ఒక్క‌రినీ బ‌య‌ట‌కు తేగలమని ఆశాభావంతో ఉన్నాం...”

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650442

ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్‌ ఉండాలని 7 పెద్ద రాష్ట్రాలను కోరిన ఆరోగ్య, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధశాఖల కార్యదర్శులు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఇవాళ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆరోగ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శులతో ఆన్‌లైన్‌ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధశాఖల కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడు రాష్ట్రాల్లో కోవిడ్‌ రోగుల కోసం అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్‌ లభ్యతకు భరోసా ఇచ్చేలా చూడటం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాలూ తమతమ పరిధిలోనేగాక, ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ రవాణాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653885

‘సండే సంవాద్‌’ కార్యక్రమంద్వారా సామాజిక మాధ్యమ సభ్యులతో ముచ్చటించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ నిన్న ‘సండే సంవాద్‌’ కార్యక్రమంలో భాగంగా సామాజిక మాధ్యమ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభం గురించి మాత్రమేగాక‌ దానిపై ప్రభుత్వ వైఖరిమీద, కోవిడ్ అనంతర ప్రపంచంలో ఎదురుకాబోయే పరిస్థితులు-ప్రభుత్వం తీసుకోబోయే చర్యలమీద కూడా ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న జ‌వాబిచ్చారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ 2021 తొలి త్రైమాసికంలో సిద్ధం కాగలదని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ వాక్సిన్ వాడకంపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ వి.కె.పాల్ ఆధ్వర్యంలో ఒక సమగ్ర వ్యూహం రూపొందుతోందని, అధిక జనాభాకు టీకా ఇవ్వటంపై కసరత్తు సాగుతోందని చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653861

కోవిడ్‌-19పై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి సమగ్ర సమీక్ష; వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కృషికి ప్రశంస

కోవిడ్‌-19 సన్నద్ధత, ప్రతిస్పందనలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా శనివారం ఒక ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలు, రాష్ట్రాల్లో కేసుల నిర్వహణపై అనుభవ ఆధారిత అభ్యాసంపై అధికారులు దృష్టి సారించారు. అలాగే టీకా అభివృద్ధి, పంపిణీ ప్రణాళికపైనా చర్చించారు. కోవిడ్‌ నిర్వహణకు నిర్దేశించిన అన్ని ప్రమాణాలనూ సాధించడంలో సాధికార బృందాలు చేసిన కృషిపై ఈ సందర్భంగా మిశ్రా సంతృప్తి వ్యక్తంచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653861

కోవిడ్‌ మహమ్మారి సంక్రమణ శృంఖల విచ్ఛేదం దిశగా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఈశాన్య భారత రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితులపై సమీక్ష నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శుక్రవారం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఒక సమావేశం నిర్వహించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కాగా, దేశంలో నమోదైన మొత్తం కోవిడ్‌ కేసులలో ఈ 8 రాష్ట్రాల వాటా 5 శాతంకన్నా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కఠిన నియంత్రణ చర్యలద్వారా కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాల్లో పరీక్షలను వేగవంతం చేయడం ద్వారా ముందస్తుగా గుర్తించాలని కోరింది. అలాగే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష సామర్థ్యాన్ని సముచితంగా, పూర్తిగా ఉపయోగించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653504

చమురు దిగుమతిపై కోవిడ్‌-19 ప్రభావం

కోవిడ్-19 మహమ్మారి వల్ల దిగ్బంధం విధించడంతో చమురు, ఇంధన వాయువులకు డిమాండ్‌ అనూహ్యంగా తగ్గిపోయిందని చమురు-గ్యాస్ రంగ ప్రభుత్వరంగ సంస్థలు సమాచారమిచ్చాయి. దేశం ప్రస్తుతం దిగ్బంధ విముక్తివైపు పయనిస్తున్న నేపథ్యంలో అన్ని పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగిందని వివరించాయి. కాగా, కోవిడ్-19 వ్యాప్తితోపాటు ప్రపంచవ్యాప్త దిగ్బంధం ఫలితంగా భారత చమురుశుద్ధి కర్మాగారాలు తక్కువ సామర్థ్యంతో పనిచేయాల్సి వచ్చిందని కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ లోక్‌సభల లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654037

కోవిడ్-19ను ఎదుర్కొనడం కోసం రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తాలివే!

కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)నుంచి 2020 ఏప్రిల్ 3న రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11,092 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ జవాబిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు రుణాలు తీసుకునే పరిమితిని 2 శాతం మేరకు పెంచుతూ అనుమతినిచ్చామని చెప్పారు. దీంతోపాటు ఇతరత్రా పద్దులకింద ఇచ్చిన నిధుల వివరాలను వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654288

 కోవిడ్‌-19ను ఎదుర్కొనడం కోసం దిగ్బంధం సమయంలో కంపెనీలు/ ఎల్‌ఎల్‌పీలకు సడలింపులు రాయితీలు

కోవిడ్-19 దిగ్బంధ కాలంలో కంపెనీలు/ఎల్‌ఎల్‌పిలపై భారం తగ్గించడం కోసం కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనేక ప్రోత్సాహకాలు/సడలింపులు/ రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ జవాబిచ్చారు. తదనుగుణంగా తీసుకున్న చర్యలన్నిటినీ కూలంకషంగా వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654303

బీహార్‌లో మూడు కీలక పెట్రోలియం రంగ ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం నాడు బీహార్‌లో మూడు కీలక పెట్రోలియం రంగ ప్రాజెక్టులను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్‌ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్‌ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, పెట్రో సంధానాలు జనజీవనంపై వారి జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని, అంతేగాక లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653785

జాతీయ వైద్య చికిత్స విధివిధానాలు, ఉత్తమ పద్ధతులకు కట్టుబడాలని ప్రైవేట్ ఆస్పత్రులతో వర్చువల్ సదస్సులో నొక్కిచెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ శ‌నివారం ఢిల్లీలోని ఫిక్కి, ఎయిమ్స్‌ల స‌హ‌కారంతో దేశంలోని వివిధ ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌తో ఆన్‌లైన్ మాధ్య‌మంద్వారా ఒక స‌మావేశం నిర్వ‌హించింది. నివారించదగిన మరణాలను తగ్గించే దిశగా వైద్య చికిత్స విధివిధానాలతోపాటు ఉత్తమ పద్ధతులపై చర్చించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ-ప్రైవేట్ రంగ ఆస్పత్రులు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు, సమర్థ చికిత్స విధానాలను పంచుకోవడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబడింది. ఇందులో భాగంగా కోవిడ్‌ కేసుల విషయంలో ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు తమ ముఖ్య సమస్యలు, సవాళ్లపై అనుభవాలను, ఉత్తమ మార్గాలను పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌ రోగులకు  పడకలు తిరస్కరించరాదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653648

కూరగాయలు, పండ్లకు సూక్ష్మజీవుల సంక్రమణ నివారణకు.. కాలుష్యం తొలగింపునకు కొత్త క్రిమిసంహారక మందునుఅభివృద్ధి చేసిన ఐపీఎఫ్‌టీ

కెమికల్స్-పెట్రోకెమికల్స్ విభాగంలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ (IPFT) శాఖ రెండు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసింది. ఇందులో ఒకటి “ఉపరితలంపై రోగకారక నిర్మూలన స్ప్రే” కాగా, రెండోది “కూరగాయలు-పండ్లకు సూక్ష్మజీవి సంక్రమణ నిరోధక స్ప్రే.” ఐపీఎఫ్‌టీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం- తలుపుల హ్యాండిళ్లు, కుర్చీల చేతులు, కంప్యూటర్ కీబోర్డ్-మౌస్ వంటి వివిధ ఉపరితలాలపై ప్రత్యక్ష/పరోక్ష సంపర్కం ద్వారా వ్యక్తులకు సూక్ష్మజీవులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వీటిని నివారించేందుకు ఐపీఎఫ్‌టీ సరికొత్త పరిజ్ఞానాలను రూపొందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653574

ఆన్‌లైన్‌లో వైరస్‌ల క్రమంపై అంచనా కోసం వెబ్ ఆధారిత కోవిడ్‌ ఉపకరణాన్ని సిద్ధం చేస్తున్న భార శాస్త్రవేత్తలు

మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సార్స్‌ వైరస్‌ (SARS-CoV-2) జన్యుసంబంధ క్రమంపై భారత శాస్త్రవేత్తల బృందం తనవంతు కృషి చేస్తోంది. ఈ మేరకు కోవిడ్‌-19 వైరస్‌కు ఉత్తమ పరిష్కార అన్వేషణ కోసం వైరస్తోపాటు మానవులలో జన్యు వైవిధ్యం, సంభావ్య పరమాణు లక్ష్యాలను గుర్తించడానికి వారు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రజిత్ సాహా, ఆయన బృందం మెషీన్‌ లెర్నింగ్‌ ప్రక్రియ ఆధారంగా ఆన్‌లైన్‌లో వైరస్‌ల జన్యుక్రమం అంచనా కోసం వెబ్-ఆధారిత కోవిడ్‌ అంచనా ఉపకరణాన్ని రూపొందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653923

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పరీక్షల సంఖ్యను పెంచడం కోసం అదనంగా 10,000 యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేయాలని పాలన యంత్రాంగాధిపతి అధికారులను ఆదేశించారు. అలాగే కోవిడ్ రోగులకోసం 200 అదనపు పడకలను ఏర్పాటు చేయడం కోసం ఇన్ఫోసిస్ సరాయ్‌ని పిజిఐఎంఇఆర్‌కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు.
  • హర్యానా: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ యోజన కింద సుమారు 1.44 లక్షల మంది ప్రజలకు చికిత్స కోసం ప్రభుత్వం రూ.169.4 కోట్లు ఖర్చు చేసిందని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆస్పత్రులలో రూ.5 లక్షలదాకా విలువైన ఉచిత చికిత్స సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ యోజన కింద కోవిడ్-19ను కూడా ప్రభుత్వం చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.
  • అరుణాచల్ ప్రదేశ్: ఇటానగర్‌లోని ఆర్‌.కె.మిషన్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ విధుల నిర్వహణలో ఉండగా ఆరోగ్య కార్యకర్త స్మితి సాల్మి సాంగ్డిగౌరియా (38) ప్రాణాలు కోల్పోవడంపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1292 కొత్త కేసులు నమోదవగా 2251 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు 1,41,736, డిశ్చార్జ్: 1,13,133, యాక్టివ్: 28,158, మరణాలు: 469గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 144 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం చురుకైన కేసులు 1638కి చేరాయి అలాగే మణిపూర్‌లో 78 శాతం సగటుతో 89 మంది కోలుకోగా, గత 24 గంటల వ్యవధిలో ఒకరు మరణించారు.
  • మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 1623 కాగా, ఇప్పటిదాకా 2075 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 14 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1428కి చేరాయి. ప్రస్తుత క్రియాశీల కేసులు 598గా ఉన్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ఆదివారం పరీక్షించిన 563 నమూనాలకుగాను 19 కొత్త కేసులు నమోదవగా, 61 మంది కోలుకున్నారు.
  • కేరళ: రాష్ట్రంలో దిగ్బంధం ఆంక్షల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వెసులుబాటును రద్దుచేయాలని కేరళ ప్రజా పరిపాలన విభాగం సిఫారసు చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 22 నుంచి శనివారాల్లో అన్ని కార్యాలయాలు పూర్తిగా పనిచేయాలని సూచించింది. దీనిపై ముఖ్యమంత్రి నిర్వహించబోయే కోవిడ్ సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. కేరళలో నిన్న 3,139 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 30,072 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,04,489 మంది పరిశీలనలో ఉండగా ఇవాళ మరో మరణంతో మృతుల సంఖ్య 440కి పెరిగింది.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 414 కొత్త కేసులతో మొత్తం కేసులు 20,226కు చేరాయి. ఇక సోమవారం చివరి 24 గంటల్లో 9 మరణాలు నమోదవగా క్రియాశీల కేసులు 4805గా ఉన్నాయి. ఇప్పటిదాకా 15027 మంది కోలుకోగా మృతుల సంఖ్య 394గా ఉంది. ఇక తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పారామెడికల్ విద్యార్థులందరినీ వెంటనే వెనక్కు రప్పించాలని రాష్ట్రంలోని డీన్స్, ప్రభుత్వ కళాశాలల అధిపతులకు వైద్య సంచాలక విభాగం లేఖ రాసింది. అలాగే వారంతా ఆస్పత్రులలో కోవిడ్ సంబంధిత విధుల్లో చేరేలా చూడాలని కూడా సూచించింది. కాగా, కోవిడ్ అవరోధాలున్నప్పటికీ లక్ష మందికిపైగా ఆశావహులైన విద్యార్థులు నీట్-2020 పరీక్ష రాశారు.
  • కర్ణాటక: రాష్ట్రంలోని మైసూరు జిల్లా జనాభాలో వృద్ధులు అధికంగా ఉండటంతోపాటు వారు ఎక్కువగా కోవిడ్‌బారిన పడుతున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు హున్సూర్ రోడ్‌లోగల బసప్ప మెమోరియల్ హాస్పిటల్ (బిఎంహెచ్)ను వారికోసం కోవిడ్‌ ప్రత్యేక ఆస్ప్రతిగా ప్రకటించింది. కాగా, అన్నిరకాల జాగ్రత్తలతో నిర్వహించిన నీట్‌-2020కి కర్ణాటకలో 1.2 లక్షల మంది హాజరయ్యారు. ఇక కర్ణాటకలో సెప్టెంబరు 2నాటి 9,860 కేసుల రికార్డు ఆదివారం నమోదైన 9,894 కొత్త కేసులతో బద్దలైంది.
  • ఆంధ్రప్రదేశ్: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది, ఈ మేరకు కేసు విచారణ బాధ్యత చేపట్టేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అయితే, డాక్టర్ రమేష్ బాబును అదుపులోకి తీసుకోకుండా విచారించవచ్చని పేర్కొంది. అదేవిధంగా దర్యాప్తులో సహకరించాల్సిందిగా డాక్టర్ రమేష్‌ను ఆదేశించింది. కాగా, రమేష్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న విజయవాడ కోవిడ్ సెంటర్‌- స్వర్ణ ప్యాలెస్‌లో ఆగస్టు 9న భారీ అగ్నిప్రమాదం సంభవించగా, 10 మంది కోవిడ్ రోగులు మరణించడంతోపాటు 20మంది గాయపడిన సంగతి తెలిసిందే. కాగా, కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులు అధిక రుసుము వసూలు చేస్తున్నాయంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వం సమయం కోరడంతో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1417 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా, 2479 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 264 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,58,513; క్రియాశీల కేసులు: 30,532; మరణాలు: 974; డిశ్చార్జి: 1,27,007గా ఉన్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ చురుకుగా ఉన్నందున కొత్త కేసులు నమోదవతున్నా కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తెలంగాణలో కోవిడ్‌ నియంత్రణకు సహకారంలో కేంద్రం పోషించిన పాత్రను తెలంగాణ అంగీకరించడం లేదని హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
  • మహారాష్ట్ర: ముంబైలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం పరీక్షల సంఖ్య పెరగడమేనని ‘ఎంసిజిఎం’ వివరించింది. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, 'మిషన్ బిగిన్ ఎగైన్' 4వ దశకింద ఆంక్షలు సడలించడంతోపాటు ఈ నెల ప్రారంభంలోనే 10 రోజుల గణేష్ పండుగ ముగిసిన నేపథ్యంలో కోవిడ్‌ వ్యాప్తి శాతం క్రమంగా పెరిగిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ముంబై జిల్లాలో కోలుకునే సగటు 77 శాతం కాగా, వారంనుంచి 1.24 శాతం మేర కేసుల పెరుగుదల నమోదైంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 30,316కాగా, నిత్యం 2వేలదాకా కొత్తగా నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో అత్యంత తీవ్ర ప్రభావిత నగరాల్లో ఒకటిగా ముంబై కొనసాగుతోంది.
  • గుజరాత్: రాష్ట్రంలో మాస్కుధారణ నిబంధన ఉల్లంఘించే వారిపై అహ్మదాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా కార్యక్రమం ప్రారంభించారు. కాగా, గత నెలలో ఉల్లంఘనపై జరిమానా మొత్తాన్ని రూ.500 నుంచి రూ.1000కి పెంచినప్పటికీ అహ్మదాబాద్‌లో చాలామంది మాస్కు తప్పనిసరి నిబంధనను పాటించడం లేదు. దీంతో వారం నుంచి ఇలాంటివారిపై పోలీసులు ప్రత్యేక దాడులు ప్రారంభించారు. గుజరాత్‌లో ప్రస్తుతం 16,439 యాక్టివ్ కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్ సోకేవారి సంఖ్య పెరగడంతోపాటు అధికశాతం రోగులకు ఆక్సిజన్‌ అవసరం అవుతుండటంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులకు అనుసంధానంగాగల ఆసుపత్రులలో 38 ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను రాజస్థాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లలో 17 నిత్యం 90 సిలిండర్లను నింపగల సామర్థ్యం కలిగి ఉంటాయి. మరో 14 యూనిట్లలో 35-40 సిలిండర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. మరో ఏడింటిలో 24 సిలిండర్ల ఉత్పత్తి సాధ్యమవుతుంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కేసుల పెరుగుదల మధ్య ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌కు రోజుకు 50 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కోవిడ్‌ వ్యాప్తి చెందుతున్న ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రానికి సహకరించినందుకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 20,487గా ఉంది.
  • గోవా: రాష్ట్రంలో కోవిడ్‌పై యుద్ధంలో ముందువరుసలోగల ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ.50 లక్షల బీమా రక్షణను విస్తరించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి గరీబ్‌ రోజ్‌గార్‌ కల్యాణ్‌ యోజన కింద ఈ రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

FACT CHECK

********



(Release ID: 1654304) Visitor Counter : 232