ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సోషల్ మీడియా ఫాలోవర్స్ తో డాక్టర్ హర్ష వర్ధన్ మాటామంతీ


జనానికి నమ్మకం కుదరకపోతే కోవిడ్ వాక్సిన్ ముందుగా నేనే తీసుకుంటా

కోవిడ్ వాక్సిన్ అత్యవసర ఎమెర్జెన్సీ ఆథరైజేషన్ మీద త్వరలో ఏకాభిప్రాయం

వైద్య సిబ్బంది, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులున్నవారికి కోవిడ్ వాక్సిన్ లో ప్రాధాన్యం

Posted On: 13 SEP 2020 4:23PM by PIB Hyderabad

సండే సంవాద్ వేదికగా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు సోషల్ మీడియా ఫాలోవర్స్ మాటామంతీలో పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు.  ఈ ప్రశ్నలు కేవలం ప్రస్తుత కోవిడ్ సంక్షోభం మీద మాత్రమే కాకుండా దానిపట్ల ప్రభుత్వ వైఖరి మీద, కోవిడ్ అనంతర ప్రపంచంలో ఎదురవుతాయనుకుంటున్న పరిస్థితులు, అప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలమీద కూడా ఉన్నాయి.

వాక్సిన్ ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్దిష్టమైన తేదీ ఏదీ నిర్ణయించకపోయినప్పటికీ, 2021 మొదటి త్రైమాసికంలో సిద్ధంగా ఉంటుందని మంత్రి చెప్పారు. వాక్సిన్ ను మనుషుల మీద పరీక్షించటానికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని డాక్టర్ హర్ష వర్ధన్ చ్దెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ వాక్సిన్ వాడకం మీద ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ వికె పాల్ ఆధ్వర్యంలో ఒక సమగ్ర వ్యూహం రూపొందుతోందని, అధిక జనాభాకు వాక్సిన్ ఇవ్వటం మీద కసరత్తు జరుగుతోందని చెప్పారు. "వాక్సిన్ భద్రత, ధర్మబద్ధత, తయారీకి పట్టే సమయం లాంటివి కూడా తీవ్రంగా చర్చిస్తున్నాం." అన్నారు. డబ్బు చెల్లించగలిగే గలిగే స్తోమతతో సంబంధం లేకుండా వాక్సిన్ బాగా అవసరమున్నవారికి ముందుగా అందజేస్తామని చెప్పారు.

వృద్ధులు, ఎక్కువ రిస్క్ మధ్య పనిచేసే వైద్య సిబ్బంది తదితరులకు అత్యవసర ప్రాతిపదికన వాక్సిన్ ఇచ్చే అధికారం కట్టబెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని కూడా మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కూడగట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. వాక్సిన్ భద్రత మీద భయాలు పోగొట్టటానికి, నమ్మకం పెంచటానికి తాను సంతోషంగా మొదటి డోస్ వాక్సిన్ తీసుకోవటానికి వెనుకాడబోనని మంత్రి ధీమాగా చెప్పారు.

భారతదేశంలో వాక్సిన్ తయారీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. బయో టెక్నాలజీ డిపార్ట్ మెంట్ తో బాటు భారత వైద్య పరిశోధనామండలి ( ఐసిఎంఆర్) వాక్సిన్ తయారీకి సంబంధించి పూర్తి సహకారం అందేలా చూడటానికి క్రియాశీలంగా పనిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కునే సంసిద్ధత మీద ఏర్పాటైన సంస్థలో భారత్ చురుకైన భాగస్వామ్యం పోషిస్తోందన్నారు. భారత్ లోని వేరు వేరు ప్రభుత్వ, పైవేట్ ఆస్పత్రులలో రకరలాల వాక్సిన్ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.

సహజసిద్ధమైన ఇన్ఫెక్షన్ తో పోల్చినప్పుడు వాక్సిన్ వల్ల కోవిడ్-19 కు చాలా వేగంగా సమర్థవంతమైన రోగనిరోధక శక్తి ఏర్పడుతుందన్నారు. వచ్చే కొద్ది నెలల్లోనే సామూహిక రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

భారత తయారీ రంగాన్ని ఈ కోవిడ్ సంక్షోభం ఎలా మలుపు తిప్పిందీ డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తగిన ప్రమాణాలతో స్వదేశీ తయారీ పిపిఇ కిట్స్ ఏవీ అందుబాటులో లేని పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపు 110 స్వదేశీ తయారీ సంస్థలు ప్రమాణాలతో కూడిన కిట్స్ తయారుచేయగలిగే స్థితికి వచ్చాయని గుర్తు చేశారు. కేవలం స్వదేశీ అవసరాలకు తగినట్టుగా తయారు చేయగలగటమే కాకుండా ఇప్పుడు సాటి దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతున్నామన్నారు. అదే విధమైన మేకిన్ ఇండియా చొరవ వల్ల స్వదేశీ సంస్థలు వ్యాధి నిర్థారణ కిట్స్, వెంటికేటర్లు, రెమిడిసివిర్ లాంటి ఔషధాలు తయారు చేయగలిగే సామర్థ్యం పెంచుకున్నాయని, విదేశాలమీద ఆధారపడటం తగ్గించాయని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో సంపూర్ణ ప్రభుత్వ వైఖరి వల్లనే ఇది సాధ్యమైందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.స్వదేశీ తయారీ దారులను ప్రోత్సహించటం, మార్కెట్ అందుబాటుకు హామీ ఇవ్వట తో బాటు వివిధ మంత్రిత్వశాఖల  మధ్య సమన్వయం సాధించటం లాంటి  బహుముఖ వ్యూహాలు అనుసరించటం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. విదేశాలమీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు.

వైద్యాని అయ్యే ఖర్చు సామాన్యుడికి సైతం అందుబాటులో, కనీస స్థాయిలో ఉంచేందుకు ప్రైవేట్ ఆస్పత్రులలో సైతం కోవిడ్ చికిత్సకు కనీస స్థాయిలో ధర నిర్ణయించటంతోబాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆయుష్మాన్ భారత్ కింద అర్హులయ్యేవారందరికోసం పిఎంజె ఎవై ప్రకటించి రూ.  లక్షల వరకూ కోవిడ్ చికిత్స ఉచితంగా అందేటట్టు చూడాలని కోరింది. ప్రైవేట్ రంగంలో వైద్య సేవలందించేవారిని కూడా ఉపయోగించుకుంటూ ఆస్పత్రులను ఉమ్మడిగా వాడుకునేట్టు చూడాలని, ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలని కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీనివలన కోవిడ్ బాధితులకు సకాలంలో నాణ్యమైన, అర్థవంతమైన ఆరోగ్య సేవలు అందుతాయని చెప్పింది. కోవిడ్ బాధితులనుంచి అధికంగా బిల్లులు వసూలు చేసే విధానానికి దూరంగా ఉందాలని మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు,

ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అన్ని మందులూ ప్రజలందరికీ అందుబాటు ధరల్లో దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని మంత్రి గుర్తు చేశారు. రెమిడిసివిర్ లాంటి కొన్ని మందులను బ్లాక్ మార్కెట్ కి తరలించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణామండలిని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తగిన విధంగా వ్యవహరించాలని కోరిందన్నారు.

వ్యాధి సోకిన వారిలో ఇన్ఫెక్షన్ వలన వస్తున్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కూడా మంత్రి చెప్పారు. కోవిడ్ వలన దీర్ఘ కాల ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధన జరపాల్సిందిగా ఎయిమ్స్ తదితర సంస్థలను కోరామన్నారు. కోవిడ్ మీద ప్రత్యేక అధ్యయనానికి భారత వైద్య పరిశోధనామండలి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దాని విస్తృతిని, బాధితులమీద దాని ప్రభావాన్ని , ఫలితాన్ని పరొశోధన జరపాల్సిందిగా కోరినట్టు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా శ్వాస, మూత్రపిండాల, గుండె సంబంధ, ప్రేగులకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశమున్నదో కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని వెల్లడించారు.

డిజిటల్ ఆరోగ్యం విషయంలో భారత్ ప్రపంచానికే నాయకత్వం వహించేలా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ ఎంతో ముందుకు దూసుకుపోతోందని మంత్రి వివరించారు. అయితే, కొన్ని స్వార్థ శక్తులు భారత్ కు వ్యతిరేకంగా జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థ కిందికి వచ్చి వైద్య సేవలు అందించని వారు సైతం ఎప్పటిలాగే వైద్య సేవలు అందించవచ్చునని చెబుతూ అనవసర భయాలు తగవన్నారు. డిజిటల్ హెల్త్ వ్యవస్థలో చేరటమన్నది పూర్తిగా ఐచ్ఛికమని, ఎలాంటి వత్తిడీ లేదని మంత్రి వివరణ ఇచ్చారు.

సండే సంవాద్ మొదటి ఎపిసోడ్ చూడాలంటే ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి:

 

Twitter: https://twitter.com/drharshvardhan/status/1305067117172072449?s=19

Facebook: https://www.facebook.com/drharshvardhanofficial/videos/345933476608657/

Youtube: https://youtu.be/wkms035Hlb0

DHV App: http://app.drharshvardhan.com/news/14022/sunday-samvaad-|-episode-1?articleId=14022

*****

 



(Release ID: 1653861) Visitor Counter : 206