PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
29 MAY 2020 6:31PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 71,106 కాగా... కోలుకున్నవారి శాతం 42.89.
- యాక్టివ్ కేసుల సంఖ్య 89,987; నిర్ధారిత కేసులు 1,65,799కి పెరుగుదల.
- గర్భిణులు, ఇతర వ్యాధులుగలవారు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటినవారు రైలు ప్రయాణం మానుకోవాలని రైల్వేశాఖ సూచన.
- దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 50 లక్షల మందిని చేరవేసిన శ్రామిక్ స్పెషల్ రైళ్లు.
- కనీస మద్దతు ధర జాబితాలో అదనంగా 23 సూక్ష్మ అటవీ ఉత్పత్తులను చేర్చిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ

కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం
దేశంలో కోవిడ్-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి కేంద్ర ప్రభుత్వం చురుకైన విధానాలతో క్రమబద్ధంగా, ముందుచూపుతో అనేక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఈ చర్యల అమలుపై అత్యున్నత స్థాయిలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోగల కోవిడ్-19 కేసుల సంఖ్య 89,987 కాగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 71,105గా ఉంది. గడచిన 24 గంటల్లో 3,414 మందికి వ్యాధి నయంకావడంతో కోలుకున్నవారి శాతం మెరుగుపడి 42.89కు చేరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627682
ప్రయాణికులకు రైల్వేశాఖ వినతి
వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లడంకోసం రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రోజువారీ ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడుపుతోంది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించేవారిలో కొందరు అప్పటికే అనారోగ్యంతో ఉంటున్నారని, ఈ కారణంగా వారికి కోవిడ్-19 సోకే ముప్పు అధికమని రైల్వేశాఖ గుర్తించింది. ఇలా వ్యాధులతో బాధపడుతున్న వారిలో కొందరు ప్రయాణంలో ఉన్నపుడు దురదృష్టవశాత్తూ మరణించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో దుర్బలులైన వ్యక్తులను కోవిడ్-19 నుంచి రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఇతర వ్యాధి పీడితులైనవారు (ఉదా॥ అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్, అల్ప రోగనిరోధకత పరిస్థితి), గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65ఏళ్లు పైబడిన వృద్ధులు అత్యవసరమైతే తప్ప రైలు ప్రయాణం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627662
శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ప్రయాణించే వలసదారులకు 85 లక్షల భోజనాలు, 1.25 కోట్ల నీళ్లసీసాలు ఉచితంగా అందజేసిన భారత రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 2020 మే 1 నుంచి నడుపుతున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ప్రయాణించే వలసదారులకు ఇప్పటిదాకా 85 లక్షల భోజనాలు, 1.25 కోట్ల నీళ్లసీసాలను ఉచితంగా అందజేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ నడుపుతున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ఆహారం, నీళ్ల సీసాలను వలస కార్మికులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఐఆర్సీటీసీ ద్వారా పూరీ-ఊరగాయ, రోటీ-ఊరగాయ, అరటిపండ్లు, బిస్కెట్లు, కేక్, ఉప్పు బిస్కెట్లు, వెజిటబుల్ పులావ్, పావ్భాజీ, పులిహోర-ఊరగాయ, ఉప్మా, పోహా-ఊరగాయ వగైరా ఆహారపదార్థాలను, రైల్నీర్ మంచినీళ్ల సీసాలను సరఫరా చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు 2020 మే 28వరకూ 3,736 శ్రామిక్ స్పెషల్ రైళ్లను వివిధ రాష్ట్రాలకు నడపగా, మరో 67 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు 27.05.2020న 172 శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడిచాయి. ఈ రైళ్లద్వారా గడచిన 27 రోజులలో సుమారు 50 లక్షల మంది వలసదారులు తమ గమ్యాలకు ప్రయాణించారు. కాగా, ఇవాళ నడుస్తున్న రైళ్లు ఎక్కడా, ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627570
దేశవ్యాప్తంగా 30 రాజధానితరహా ప్రత్యేక రైళ్లు, 200 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించిన ఆదేశాల్లో మార్పులు చేసిన రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 12.05.2020 నుంచి నడుపుతున్న 30 రాజధాని తరహా ప్రత్యేక రైళ్లుసహా జూన్ 01.06.2020 నుంచి నడపనున్న 200 మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైళ్ల (మొత్తం 230రైళ్లు)కు సంబంధించిన ఆదేశాల్లో మార్పుచేర్పులు చేసింది. ఇందులో భాగంగా అన్ని ప్రత్యేక రైళ్లకూ ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 30 నుంచి 120 రోజులకు పెంచాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అలాగే ఈ రైళ్లలో పార్శిల్, లగేజీ బుకింగ్కూ అనుమతించింది. ఈ మార్పులు 2020 మే 31వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి అమలులోకి వస్తాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627613
వర్తక-వాణిజ్య సంఘాల ప్రతినిధులతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశం
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్తక-వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దిగ్బంధం సమయంలో కోవిడ్-19పై పోరాటానికి జాతి సన్నద్ధమైందని, తదనుగుణంగా సామర్థ్యాలను మెరుగుపరచుకున్నదని ఆయన చెప్పారు. ఆ మేరకు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి బాటలుపడటాన్ని అనేక సూచీలు చూపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్-19పై పోరు దిశగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించిన స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీవల్ల ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్ష రుణహామీ లభించిందని, ఇది వ్యాపారులకూ వర్తిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక చర్యలు తీసుకున్నదని, భారత్ మరింత బలమైన దేశంగా రూపొందడానికి ఇవన్నీ దోహదపడతాయని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627624
కనీస మద్దతు ధర జాబితాలో మరో 23 సూక్ష్మ అటవీ ఉత్పత్తులను అదనంగా చేర్చిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మరో 23 సూక్ష్మ అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధర జాబితాలో చేర్చింది. కనీస మద్దతు ధరతోపాటు ఈ ఉత్పత్తుల విలువ శృంఖలాన్ని అభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత “మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్” పథకం కింద కనీస మద్దతు ధరను నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత జాబితాలోని 50 ఉత్పత్తుల సంఖ్యను ఇప్పుడు 73కు పెంచింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న అనూహ్య, సంక్లిష్ట పరిస్థితులతోపాటు సూక్ష్మ అటవీ ఉత్పత్తుల సేకరణదారులకు మంత్రిత్వశాఖ అవసరమైన మద్దతు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627772
వార్షిక జాతీయాదాయం-2019-20పై తాత్కాలిక; 2019-20 చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తిపై అంచనాలు
దేశంలో 2019-20 సంవత్సరపు వాస్తవ జీడీపీ లేదా స్థూల దేశీయోత్పత్తి (2011-12) స్థిరాంకం వద్ద రూ.145.66 లక్షల కోట్ల స్థాయిని చేరగలదని ప్రస్తుత అంచనాలు పేర్కొంటున్నాయి. కాగా, 2018-19 సంవత్సరానికిగాను 2020 జనవరి 31న విడుదల చేసిన తొలి సవరించిన అంచనా ప్రకారం జీడీపీని రూ.139.81 లక్షల కోట్లుగా పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ మేరకు 2018-19నాటి 6.1 శాతం వృద్ధితో పోలిస్తే 2019-20లో జీడీపీ వృద్ధి 4.2 శాతంగా అంచనా వేయబడింది. ఇక ప్రస్తుత ధరల ప్రాతిపదికన 2019-20 సంవత్సరంలో జీడీపీ రూ.203.40 లక్షల కోట్ల స్థాయిని చేరుతుందని అంచనా. అయితే, 2018-19లో తొలి సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.189.71 లక్షల కోట్లు కాగా, ఇది 11.0 శాతంతో వృద్ధిని చూపుతుండగా దీనితో పోలిస్తే ప్రస్తుత వృద్ధి 7.2 శాతంగా ఉంది. ఇక (2011-12) స్థిరాంకం వద్ద 2019-20 చివరి త్రైమాసికంలో రూ.38.04 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, 2018-19 చివరి త్రైమాసికంలో అంచనా రూ.36.90 లక్షల కోట్లతో పోలిస్తే 3.1 శాతం వృద్ధిని చూపుతోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627671
ఏప్రిల్ 2020కిగాను దేశంలోని 8 కీలక పరిశ్రమల సూచీ (ప్రాతిపదిక: 2011-12)
దేశంలోని 8 కీలక పరిశ్రమల వృద్ధి సూచీ 2020 మార్చి నెలలో (తాత్కాలికంగా) 9 శాతం పడిపోగా, దీనితో పోలిస్తే 2020 ఏప్రిల్ మాసంలో (తాత్కాలికంగా) 38.1 శాతం పతనమైంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ నెలలో దిగ్బంధం కొనసాగిన దృష్ట్యా- బొగ్గు, సిమెంటు, స్టీల్, సహజవాయువు, చమురుశుద్ధి, ముడిచమురు వగైరా కీలక రంగాల్లో ఉత్పత్తిని గణనీయంగా నష్టపోవాల్సి వచ్చింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627656
జాతీయ ఉపాధి సేవల (NCS) పథకం కింద ఉచిత ఆన్లైన్ ఉపాధి నైపుణ్య శిక్షణ
కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ తన పరిధిలోని జాతీయ ఉపాధి సేవల పథకం (NCS) కింద టీసీఎస్ ఐవోఎన్ (TCS ION) భాగస్వామ్యంతో నమోదిత ఉద్యోగార్థులకు ఉచిత ఆన్లైన్ ‘ఉపాధి నైపుణ్య శిక్షణ’ ఇవ్వనుంది. వివిధ పరిశ్రమల నేటి అవసరాలకు తగినట్లు సాఫ్ట్ స్కిల్స్ ప్రధానంగా ఈ శిక్షణ సాగుతుంది. దీనిద్వారా శిక్షణార్థులు వ్యక్తిత్వ వికాసంతోపాటు కార్పొరేట్ నైతికత, అంతర-వ్యక్తిత్వ నైపుణ్యాభివృద్ధి, ప్రభావవంతమైన ప్రదర్శన సామర్థ్యం తదితర నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఈ కోర్సు NCS పోర్టల్లో హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627767
దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 56 సీఎన్జీ స్టేషన్లను జాతికి అంకితం చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
దేశంలో పర్యావరణహిత సంపీడన సహజవాయువు (CNG) లభ్యత విస్తరణ దిశగా కేంద్ర పెట్రోలియం-సహజవాయువు-ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా 48 సీఎన్జీ స్టేషన్లను జాతికి అంకితం చేయడంతోపాటు మరో 8 కొత్త స్టేషన్లను ప్రారంభించారు. ఈ 56 స్టేషన్లు 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం దేశవ్యాప్త దిగ్బంధం విధించడంతో ఈ స్టేషన్ల నిర్మాణ పనులపై ప్రభావం పడింది. అయితే, గతనెలలో ఆంక్షల సడలింపు అనంతరం అన్నిరకాల జాగ్రత్తలతోపాటు సామాజిక దూరం నిబంధనలను తూచా తప్పకుండా అనుసరిస్తూ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. అందుకే ఈ స్టేషన్లు ప్రారంభించడం ఆలస్యమైనా అది కనీస స్థాయికి పరిమితమైంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627768
ఏడాది కాలంలో తమ మంత్రిత్వశాఖ విజయాలపై శ్రీ రామ్విలాస్ పాశ్వాన్ విలేకరుల సమావేశం
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ప్రజాపంపిణీ, ప్రజాపంపిణీయేతర కార్డుదారులతోపాటు వలస కార్మికులు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకిందకు రానివారికీ ఆహారధాన్యాలు, పప్పుదినుసులు అందించడంపైనే తమ మంత్రిత్వశాఖ ప్రధానంగా దృష్టి సారించిందని శ్రీ రామ్విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఈ కృషిలో భాగంగా ఆహారధాన్యాలను తీసుకెళ్లడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆహారశాఖ మంత్రులు, కార్యదర్శులందరితోనూ తమ శాఖ సమన్వయం చేసుకుంటూ వచ్చిందని ఆయన వివరించారు. దేశంలో ఇప్పటికీ తగిన పరిమాణంలో ఆహారధాన్యాల నిల్వలున్నట్లు మంత్రి వెల్లడించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627769
మడగాస్కర్లోని అంట్సిరాననా రేవులో ఐఎన్ఎస్ కేసరి
‘మిషన్ సాగర్’లో భాగంగా భారత నావికాదళ నౌక ‘ఐఎన్ఎస్ కేసరి’ 2020 మే 7వ తేదీన మడగాస్కర్లోని ‘అంట్ సిరాననా’ రేవుకు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరు నేపథ్యంలో పొరుగునున్న మిత్రదేశాలను కష్టకాలంలో ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ఉదార సాయం అందిస్తోంది. ఆ మేరకు మడగాస్కర్ ప్రజలకు కోవిడ్ సంబంధిత అత్యవసర ఔషధాలను, ఇతర సామగ్రిని ఐఎన్ఎస్ కేసరి అక్కడికి చేర్చింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627698
సైనిక కమాండర్ల సదస్సు: 2020 మే 27-29
సైనిక కమాండర్ల స్థాయిలో రెండేళ్లకు ఒకసారి జరిగే అత్యున్నత సదస్సును 2020 ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. భావనల స్థాయి చర్చలకు ఈ సదస్సు వేదిక కాగా, తద్వారానే కీలక విధాన నిర్ణయాలకు బాటలు పడతాయి. ఈ ద్వైవార్షిక సదస్సును రెండు విడతలకింద నిర్వహిస్తుండగా 2020 మే 27- 29 తేదీల మధ్య తొలివిడత సమావేశం న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో నేడు ముగిసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627709
వెబినార్ద్వారా 45,000 ఉన్నత విద్యాసంస్థల అధిపతులతో హెచ్ఆర్డి మంత్రి సమావేశం
దేశంలోని 45,000 ఉన్నత విద్యాసంస్థల (HEI) అధిపతులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ ఇవాళ వెబినార్ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైస్-చాన్సలర్లు/రిజిస్ట్రార్లు/ప్రొఫెసర్లు/ఐక్యూఏసీ అధిపతులు/ప్రిన్సిపాళ్లు/ విభాగాధిపతులు వంటి దేశవ్యాప్తంగాగల విద్యారంగ నిపుణులు పెద్ద సంఖ్యలో ఈ చర్చల్లో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలోగల పరిమితులను అధిగమించడానికి ప్రస్తుత పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకోవాలని శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా ఉన్నత విద్యాసంస్థల అధిపతులకు సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ విధానానికి మారాల్సిందిగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఆ మేరకు విద్యార్థుల, ఉన్నత విద్యాసంస్థల విలువైన విద్యాకాలం నష్టపోకుండా చూసుకోవాలని సూచించారు. దేశంలో ఆన్లైన్ విద్యా పర్యావరణాన్ని మెరుగుపరచడం, అభివృద్ధి చేయడం తక్షణావసరాలని, ఈ దిశగానేగాక దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకూ ఆన్లైన్ విద్య చేరేవిధంగా విద్యావేత్తలు తమవంతు కృషి చేయాలని కోరారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627573
పశ్చిమ నావికాదళ స్థావరంలో అతినీలలోహిత రోగకారక నిర్మూలన సౌకర్యాల అభివృద్ధి
నావికాదళ రేవు (ముంబై) ప్రాంగణంలో అతినీలలోహిత రోగకారక నిర్మూలన అఖాతాన్ని పశ్చిమ నావికాదళ స్థావరం నిపుణులు సిద్ధం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ఇక్కడ నావికులు ఉపయోగించే పరికరాలు, వారి దుస్తులు, ఇతరత్రా వస్తువులను అతినీత లోహిత రోగకారక నిర్మూలన ప్రక్రియతో శుభ్రం చేస్తారు. ఇందుకోసం ఓ పెద్ద ఉమ్మడి గదిని అఖాతంగా మార్చే బృహత్ ప్రక్రియను సవాలుగా తీసుకుని అల్యూమినియం షీట్లు, విద్యుత్ ఏర్పాట్లు, యూవీ-సి లైట్ల ఏర్పాటు తదితరాలను విజయవంతం చేశారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627563
ప్రయోగశాలలో నవ్య కరోనా వైరస్ను వృద్ధిచేసిన పరిశోధకులు; ఔషధ పరీక్షలు, టీకా అభివృద్ధికి దోహదం
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు కరోనా వైరస్ (SARS-CoV-2) సోకిన రోగుల నుంచి సేకరించిన నమూనాలను ఉపయోగించి వైరస్ను స్థిర సంవర్ధనం (ప్రయోగశాలలో అభివృద్ధి) చేశారు. ఇందుకోసం వ్యాధిని వ్యాప్తిచేసే వైరస్లను పలు నమూనాల నుంచి విజయవంతంగా వేరుపరచారు. ప్రయోగశాలలో సంవర్ధన సామర్థ్యం సాధించిన నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి నిరోధానికి టీకా అభివృద్ధి, రోగులకు చికిత్స కోసం సమర్థ ఔషధాల రూపకల్పన దిశగా కృషి చేసేందుకు సీసీఎంబీకి అవకాశం లభించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627563
కోవిడ్-19 నిర్వహణ, నియంత్రణపై సూరత్ స్మార్ట్ సిటీ వినూత్న ఐటీ చర్యలు
కోవిడ్-19పై సూరత్ పురపాలిక పోరులో భాగంగా ‘ఎస్ఎంసీ కోవిడ్-19’ పేరిట ఒక అనుసరణ వ్యవస్థను రూపొందించింది. ఒక వెబ్ పోర్టల్తోపాటు ‘ఎస్ఎంసీ కోవిడ్-19 ట్రాకర్’ పేరిట మొబైల్ యాప్ ఇందులో భాగంగా ఉంటుంది. కోవిడ్-19 సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారితోపాటు విదేశీ, అంతర్రాష్ట్ర ప్రయాణ చరిత్రగలవారి కదలికలను ఈ యాప్ద్వారా అనుసరిస్తారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627720
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలోకి వచ్చేపోయే రైళ్లలో ప్రయాణించే వారికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వం ఇవాళ అదనపు మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు ప్రయాణికులందరూ మాస్కు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి. అలాగే అనవసర రద్దీ నివారణలో భాగంగా నిర్ధారిత టికెట్గల ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తారు (సహాయకులకు అనుమతి లేదు). అంతేకాకుండా ప్రయాణ సమయానికి 45 నిమిషాల ముందు స్టేషన్కు చేరుకుని, ప్లాట్ఫామ్ మీదకు వెళ్లేముందే థర్మల్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
- హర్యానా: కోవిడ్-19 వ్యాప్తి నిరోధం రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని హర్యానా హోంశాఖ మంత్రి చెప్పారు. ఆ మేరకు కేంద్ర దేశీయాంగ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యాధి వ్యాప్తి నిరోధంకోసం బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఉమ్మివేయడంపైనా నిషేధం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కదానికీ రూ.500 వంతున నగదు రూపేణా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కోర్టుతో నిమిత్తం లేదని తెలిపారు.
- హిమాచల్ ప్రదేశ్: దేశీయ విమానాలు, రైళ్లద్వారా హిమాచల్ ప్రదేశ్కు ప్రయాణికుల రాకపోకలపై ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ఆండ్రాయిడ్/ఐవోఎస్ మొబైల్ ఫోన్లుగల ప్రతి ఒక్కరూ విమానం/రైలులో ఎక్కే సమయానికి ‘ఆరోగ్య సేతు’ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. అదేవిధంగా విమానం/రైలు ఎక్కే/దిగే వారందరూ కేంద్ర దేశీయాంగ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు జారీచేసిన సామాజిక దూరం తదితర మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,598 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 59,546కు చేరింది. వ్యాధి పీడితులలో 85మంది మరణించగా, వారిలో 38 మంది ముంబైవాసులు. దీంతో మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,982కు పెరిగింది. మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు రాష్ట్రవాసులు అనేకమంది సొంత పట్టణాలకు తిరిగి రావడం ప్రారంభించారు. అహ్మద్నగర్, సింధుదుర్గ్, నాందేడ్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్: రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 367 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 15,572కు పెరిగాయి. అలాగే కరోనావైరస్ నుంచి బయటపడిన రోగుల సంఖ్య గురువారం 8000 స్థాయిని దాటింది. అహ్మదాబాద్లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం 381మంది డిశ్చార్జ్ అయ్యారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో తాజాగా 91 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 8,158కి పెరిగింది. కాగా, కొత్త కేసులకుగాను 42 ఝలావర్ జిల్లాలో నమోదైనవే కావడం గమనార్హం. ఇక ఇప్పటిదాకా 4,855 మంది కోలుకోగా, మొత్తం 3.65 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 192 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7,453కు చేరింది. కొత్త కేసులకుగాను హాట్స్పాట్ ఇండోర్ నగరంలో గరిష్ఠంగా 78 నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,050 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,082 యాక్టివ్ కేసులున్నాయి.
- ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో ఇవాళ 5 కొత్త కేసుల నమోదుతో యాక్టివ్ కేసుల సంఖ్య 321కి చేరింది. వీరిలో ఇద్దరు బిలాస్పూర్ వాసులు కాగా; దుర్గ్, మహాసముంద్, జగదల్పూర్వాసులు ఒక్కొక్కరున్నారు. కాగా, ముంగేలి జిల్లా నుంచి గురువారం రాత్రి ఒక కేసు నమోదైంది.
- కేరళ: రాష్ట్రంలోని కోట్టయం వైద్య కళాశాల ఆస్పత్రిలో 68 ఏళ్ల మధుమేహ-ఊబకాయ బాధిత వ్యక్తి కోవిడ్-19సోకి మరణించడంతో కేరళలో మరణాల సంఖ్య 8కి పెరిగింది. అయితే, రాష్ట్రంలో కోవిడ్-19 సామాజిక సంక్రమణ లేదని ఆరోగ్యశాఖ మంత్రి పునరుద్ఘాటించారు. నిరంతర అవాంతరాలు, కార్యాచరణలో ఎగుడుదిగుళ్లు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలకు ‘బెవ్క్యూ’ యాప్ అమలును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది; ఈ మేరకు సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు జెడ్డాలో కోవిడ్-19తో మరో ఇద్దరు కేరళవాసులు మరణించారు. రాష్ట్రంలో నిన్న 84 కేసుల నమోదుతో యాక్టివ్ కేసుల సంఖ్య 526కు చేరింది.
- తమిళనాడు: రాష్ట్రంలోని కోయంబత్తూర్ విమానాశ్రయంలో 9 మంది ప్రయాణికులకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. వీరిలో తిరుచ్చి నుంచి ఐదుగురు, నమక్కళ్ నుంచి, ఇద్దరు; కోయంబత్తూర్, ఈరోడ్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. చెన్నైలోని దక్షిణరైల్వే ప్రధాన కార్యాలయంతోపాటు రెండు ఐసిఎఫ్ కార్యాలయాల్లో అధికారులకు వ్యాధి నిర్ధారణ కావడంతో వాటిని మూసివేశారు. నొయ్యాల్ నవీకరణ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు; రూ.230 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 7,000 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుంది. కాగా, రాష్ట్రంలో నిన్న 827 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు: 19,372కు చేరాయి. వీటిలో యాక్టివ్: 8,676, మరణాలు: 145, డిశ్చార్జ్: 10,548. చెన్నైలో యాక్టివ్ కేసులు 6351గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 178 కొత్త కేసులు నమోదవగా 35మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. నేటి కొత్త కేసులలో రాయచూర్ 62, యాదగిరి 60, ఉడుపి 15, కల్బుర్గి 15, బెంగళూరు నగరం 10, దావణగేరె 4; మాండ్య, మైసూర్లలో రెండేసి; బెంగళూరు గ్రామీణ, షిమోగా, చిత్రదుర్గ, ధార్వాడ్లలో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2711కు పెరగ్గా వీటిలో యాక్టివ్: 1763, కోలుకున్నవి: 869, మరణాలు: 47గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) పదవీకాలం తగ్గింపుసహా అర్హతలు-నియామక పద్ధతిపై పంచాయతీ రాజ్ చట్టం-1994ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు తోసిపుచ్చింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్త దిగ్బంధం విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేశారంటూ పదవినుంచి తొలగించిన ఎన్.రమేష్ కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రాష్ట్రంలో ఇవాళ కోవిడ్-19 కొత్త కేసులు 33 నమోదవగా గత 24 గంటలలో 79మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు: 2874. యాక్టివ్: 777, రికవరీ: 2037, మరణాలు: 60. ఇతర రాష్ట్రాలనుంచి మొత్తం నిర్ధారిత కేసులు 345, వీటిలో 156 యాక్టివ్ కాగా, విదేశాల నుంచి వచ్చినవారి మొత్తం కేసులు 111గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో దుకాణాలు తెరవడానికి అనుమతించిన రీతిలో మాల్స్ సహా షాపింగ్ కేంద్రాలు తెరిచేందుకు అనుమతులివ్వాలని ‘షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కాగా, హైదరాబాద్ నివాసి ఒకరు సౌదీ అరేబియాలో కోవిడ్-19తో మరణించగా అంత్యక్రియలు అక్కడే చేయటానికి తాము సమ్మతి తెలిపినప్పటికీ ఇంకా నిర్వహించలేదని అతని కుటుంబం తెలిపింది. కాగా, కోవిడ్-19 వ్యాప్తి ధోరణిని పర్యవేక్షించేందుకు, వ్యాధిలక్షణరహిత, స్వల్ప సంక్రమణ లక్షణాలున్నవారి పాత్రపై ఆధారాల సృష్టికి ఉద్దేశించిన నమూనా పరీక్షలకు ఎంపిక చేసిన 14 హాట్స్పాట్ మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇక మే 29 నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,256 కాగా, రాష్ట్రానికి వచ్చిన వలసదారులలో 175 మంది, విదేశాల నుంచి వచ్చిన 173 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో అన్ని హోటళ్లు, ఇతర నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయబడుతున్నారని ఇటానగర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా విధివిధానాలను కఠినంగా పాటిస్తున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్కు ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా కేటాయించిన 491 టన్నుల పప్పుదినుసులను నాఫెడ్ ఇప్పటికే నిర్దేశిత గోదాములకు చేర్చింది.
- అసోం: రాష్ట్రంలోని జీఎంసీహెచ్ నుంచి ఆరుగురు రోగులు ఇవాళ డిశ్చార్జి అయ్యారు. వీరికి రెండుసార్లు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాక వ్యాధి లేదని తేలడంతో వారిని ఇళ్లకు పంపారు.
- మణిపూర్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన మణిపూర్ విశ్వవిద్యాలయ కోవిడ్-19 కార్యాచరణ బృందం సమావేశమై, రాష్ట్రంలో విద్యా కేలండర్ అమలుచేసే మార్గాలపై చర్చించింది.
- మిజోరం: మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలనుంచి మిజోవాసులతో వచ్చిన ఒక ప్రత్యేక రైలు ఈ మధ్యాహ్నం మిజోరంలోని కోలాసిబ్ జిల్లాలోగల బైరాబి స్టేషన్కు చేరింది. అంతకుముందు కర్ణాటక నుంచి మరో ప్రత్యేక రైలు కూడా ఈ ఉదయం బైరాబికి వచ్చింది. ఈ రైలులో అనారోగ్యంతో వచ్చిన ఒక వ్యక్తిసహా అతనితో ప్రయాణించిన 77 మందిని నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రానికి తరలించారు. వీరందరికీ ఆర్టీ-పీసీఆర్, రాట్ విధానాల్లో పరీక్షలు నిర్వహిస్తామని కోలాసిబ్ సీఎంవో తెలిపారు.
- నాగాలాండ్: అసోంలో కోవిడ్-19 కేంద్రంగా మారిన మెరపాణి ప్రాంత సరిహద్దులోగల వోఖా జిల్లా భండారీ చెక్పోస్టుసహా ఆ రాష్ట్రంతో సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దిమాపూర్లోని గణేష్నగర్లో ఏర్పాటుచేసిన నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రం 1070 మందికి ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ కేంద్రం ఏర్పాటులో పోలీసులు అందించిన సహకారాన్ని ముఖ్యమంత్రి నీఫూ రియో ప్రశంసించారు.
- త్రిపుర: కోల్కతా నుంచి రాష్ట్రానికి ఇవాళ 170 మందితో వచ్చిన తొలి ప్రయాణికుల విమానం ఎంబిబి విమానాశ్రయంలో దిగింది. అనంతరం రాష్ట్రం నుంచి 170 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్లింది.
PIB FACT CHECK


******
(Release ID: 1627775)
Visitor Counter : 415
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam