PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
16 MAY 2020 7:09PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- మొత్తం కోవిడ్-19 కేసులు 85,940; కోలుకున్నవారు 30,150 మంది (35.09 శాతం).
- దేశవ్యాప్తంగా నిన్నటినుంచి నమోదైన కేసుల సంఖ్య 3,970.
- రక్షణ, బొగ్గు, గనులు, అంతరిక్షం, అణుశక్తిసహా 8 రంగాల్లో విధాన సంస్కరణలు ప్రధానంగా చేపట్టే 4వ విడత చర్యలపై ఆర్థికశాఖ మంత్రి ప్రకటన.
- దేశంలో మౌలిక వసతులు, రవాణా, సామర్థ్య వికాసం, పరిపాలన- వ్యవసాయంపై పాలన సంస్కరణల బలోపేతం లక్ష్యంగా మూడోవిడత చర్యలపై నిన్న ఆర్థికశాఖ మంత్రి ప్రకటన.
- భారత్లో కోవిడ్-19 నుంచి నిరుపేదల రక్షణకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు నుంచి 1 బిలియన్ డాలర్ల సాయం.
- కార్మికులు స్వస్థలాలకు కాలినడకనగాక బస్సులు, శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వెళ్లేలా చూడాలని రాష్ట్రాలకు సూచన.
- 6.28 కోట్లమందికిపైగా పీఎంయూవై లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు; వారి ఖాతాల్లోకి రూ.8432 కోట్లు బదిలీ
- దిగ్బంధం వల్ల చిక్కుకుపోయిన 14 లక్షలమందికిపైగా ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లద్వారా స్వస్థలాలకు చేరిక
అధిక కోవిడ్-19 కేసులున్న 30 పురపాలికలతో ఆరోగ్యశాఖ కార్యదర్శి భేటీ; వ్యాధి నియంత్రణ-నిర్వహణ చర్యలపై సమీక్ష; కోలుకునేవారి శాతం 35.09కి పెరుగుదల
ఈ 30 పురపాలికలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిసా తదితర కేంద్ర/రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయా పురపాలికలలో కోవిడ్-19 కేసుల నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష సాగింది. దేశంలో ఇప్పటిదాకా 30,150 మందికి వ్యాధి నయంకాగా, వీరిలో గడచిన 24గంటల వ్యవధిలో కోలుకున్నవారి సంఖ్య 2,233 (35.09 శాతం)గా నమోదైంది. ఇక దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 85,940కి చేరగా, నిన్నటి నుంచి 3,970 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624133
కోవిడ్-19పై పోరులో ఆర్థికవ్యవస్థకు మద్దతుగా స్వయంసమృద్ధ భారతం కార్యక్రమం కింద 4వ విడత చర్యలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటన
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624475
వ్యవసాయ మౌలికరవాణా వసతులు, సామర్థ్యం వికాసం; వ్యవసాయ, మత్స్య, ఆహారతయారీ రంగాల్లో పాలన-పరిపాలన సంస్కరణలను బలోపేతం చేసే చర్యలపై ఆర్థిక మంత్రి ప్రకటన
దేశంలో మౌలిక వసతులు, రవాణా, సామర్థ్య వికాసంసహా వ్యవసాయ, మత్స్య, ఆహారతయారీ రంగాల కోసం పరిపాలన-పాలన సంస్కరణల బలోపేతం లక్ష్యంగా మూడోవిడత చర్యలను నిన్న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. ఈ మేరకు- రైతుల కోసం పొలాలనుంచి-అమ్మకాలదాకా మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1 లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి; సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ కోసం రూ.10 ,000 కోట్లతో పథకం; ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల కోసం రూ.20,000 కోట్లు; జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం; రూ.15,000 కోట్లతో పశుగణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి; మూలిక ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సాహం కోసం రూ.4,000 కోట్లు; తేనేటీగల పెంపకం కార్యకలాపాలకు రూ.500 కోట్లు; వ్యవసాయ రంగం కోసం పరిపాలన-పాలన సంస్కరణలు; రైతులకు గిట్టుబాటు ధర లభ్యతకు వీలుగా నిత్యావసర సరకుల చట్టానికి సవరణలు; రైతులకు విపణి ఎంపిక సౌలభ్యం కోసం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు; వ్యవసాయ ఉత్పత్తుల ధర, నాణ్యతకు హామీ తదితరాలు ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.
భారత్లో కోవిడ్-19 నుంచి నిరుపేదల రక్షణకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు నుంచి 1 బిలియన్ డాలర్ల సాయం.
కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన నిరుపేద, బలహీనవర్గాలకు సామాజిక సాయం దిశగా భారత్ చేస్తున్న కృషికి మద్దతుగా ‘భారత కోవిడ్-19 సామాజిక రక్షణ ప్రతిస్పందన’ కార్యక్రమాన్ని వేగిరపరచడం కోసం ప్రతిపాదిత బిలియన్ డాలర్ల సాయంలో భాగంగా 750 మిలియన్ డాలర్ల విడుదలకు సంబంధించిన ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం-ప్రపంచ బ్యాంక్ ఇవాళ సంతకం చేశాయి. దీంతో దేశంలో కోవిడ్-19పై అత్యవసర స్పందనకు ప్రపంచబ్యాంకు ప్రకటించిన సాయం మొత్తం 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. కాగా, భారత ఆరోగ్య రంగానికి గతనెలలోనే బ్యాంకు బిలియన్ డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624252
స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద రూ.90,000 కోట్ల ప్యాకేజీపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వశాఖ
కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన ఈ లేఖలో- “ఉదయ్” పథకంకింద నిర్దేశిత నిర్వహణ మూలధన పరిమితికి లోబడి మరింత రుణం పొందడానికి అవకాశంగల విద్యుత్ సరఫరా సంస్థలకు గ్రామీణ విద్యుత్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు రుణ సదుపాయాన్ని విస్తరిస్తాయని పేర్కొంది.
‘రైతుల సంక్షేమమే భారతదేశ సంక్షేమం’- ఇది మోదీ ప్రభుత్వ విశ్వాసం; రైతుకు సాధికారత కల్పించినప్పుడు దేశం స్వయం సమృద్ధం అవుతుంది: శ్రీ అమిత్ షా
“భారతదేశ సంక్షేమం.. రైతుల సంక్షేమంతోనే ముడిపడి ఉందన్నది మోదీ ప్రభుత్వ విశ్వాసం. తదనుగుణంగా అన్నదాతకు అందిస్తున్న అసాధారణ సహాయాన్నిబట్టి రైతులకు సాధికారత కల్పనతో దేశాన్ని స్వయం సమృద్ధం చేయగలమన్న ప్రధానమంత్రి దార్శనికత ప్రస్ఫుటం అవుతోంది” అని శ్రీ అమిత్ షా అన్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల నడుమన కూడా రైతులపై ప్రధాని సౌహార్దత ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయమని శ్రీ షా అభిప్రాయపడ్డారు.
కోవిడ్-19 భారత్ పోరుకు మద్దతుగా స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద ప్రకటించిన పలు చర్యలపై శ్రీ మన్సుఖ్ మాండవీయ హర్షం
కోవిడ్ -19 మహమ్మారిపై ధైర్యంగా పోరాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను, అందులో భాగమైన పౌరుల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఆర్థిక మంత్రి ఇప్పటిదాకా మూడు విడతలలో ప్రకటించిన చర్యలు సుదీర్ఘకాలం ఫలితాలిస్తాయని శ్రీ మాండవీయ చెప్పారు.
కార్మికులు స్వస్థలాలకు కాలినడకనగాక బస్సులు, ప్రభుత్వం వారికోసమే నడుపుతున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వెళ్లేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ సూచన.
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వలస కార్మికులు స్వస్థలాలకు కాలినడకన వెళ్లకుండా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భరోసా ఇవ్వాలని దేశీయాంగ శాఖ మరోసారి లేఖ రాసింది. రైల్వేశాఖ వారికోసం రోజుకు 100 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడుపుతున్నదని, అవసరమైతే అదనంగా నడిపేందుకు సిద్ధమని పేర్కొంది. ఈ ఏర్పాటు గురించి రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు వారికి అవగాహన కల్పించి, నడిచివెళ్లే అవసరం లేదని వారికి స్పష్టం చేయాలని కోరింది. వారి ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుస్తుండటాన్ని వలస కార్మికులకు వివరించాలని సూచించింది.
పీఎంయూవై లబ్ధిదారులకు ఇప్పటిదాకా పీఎంజీకేవై కింద 6.28 కోట్లకుపైగా ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ; అలాగే వారి ఖాతాల్లోకి రూ.8,432కోట్ల నగదు బదిలీ
కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ వెబినార్ ద్వారా పీఎంయూవై లబ్ధిదారులు, గ్యాస్ పంపిణీదారులు, చమురు విక్రయ కంపెనీల అధికారులతో సంభాషించారు. పీఎంయూవై పయనంలో ఇటీవలే నాలుగేళ్లు విజయవంతంగా పూర్తయినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుత సంక్షోభం తొలినాళ్లలోనే మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను ప్రకటించిందని, ఇందులో భాగంగా పీఎంయూవై లబ్ధిదారులకు మూడు నెలలపాటు ఉచితంగా వంటగ్యాస్ సరఫరా చేస్తామని హామీ కూడా ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా రూ.8432 కోట్లను ముందుగానే వారి ఖాతాలకు బదిలీ చేసిందని చెప్పారు. ఇప్పటిదాకా 6.28 కోట్లమందికిపైగా పీఎంయూవై లబ్ధిదారులు ఉచిత సిలిండర్లు అందుకున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుత అసాధారణ పరిస్థితి నడుమ తమ సంక్షేమంపై ప్రభుత్వం చూపిన శ్రద్ధకు పీఎంయూవై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
దిగ్బంధం వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో మే 15వ తేదీ అర్ధరాత్రిదాకా (15 రోజుల్లో) 14 లక్షల మందికిపైగా పలు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తరలింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 2020 మే 15 అర్ధరాత్రి వేళకు 1,074 “శ్రామిక్ స్పెషల్” రైళ్లు నడిచాయి. అంటే- వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిలో 14 లక్షల మందికిపైగా గడచిన 15 రోజుల్లో తమ స్వస్థలాలకు చేర్చబడ్డారు. వీరిలో కేవలం గడచిన 3 రోజుల్లోనే 2 లక్షల మందికిపైగా ప్రయాణించారన్నది గమనార్హం. కాగా, రానున్న కాలంలో రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చే అవకాశం ఉంది.
స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద 8 కోట్లమంది వలస కార్మికులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారధాన్యాలు
ప్రస్తుత ప్రమాదకర కోవిడ్-19 పరిస్థితుల్లో వలసదారులకు దురవస్థనుంచి ఉపశమనం కలిగించే దిశగా వారికి, వారి కుటుంబాలకు ఆహార ధాన్యాల లభ్యతకు భరోసా ఇస్తూ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 8 లక్షల టన్నుల ఆహారధాన్యాలు కేటాయించినట్లు వినియోగదారు వ్యవహారాలు, ఆహార-ప్రజాపంపిణీశాఖ మంత్రి శ్రీ రామ్విలాస్ పాశ్వాన్ తెలిపారు. రాష్ట్రాల్లో ఈ ఆహారధాన్యాల రవాణా, డీలర్లకు లాభశాతం, పంపిణీసహా మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ మేరకు 2020 ఆగస్టుకల్లా 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ “ఒకే దేశం-ఒకే కార్డు” పథకంలో భాగమవుతాయని తెలిపారు.
స్థిరాస్తిరంగ నియంత్రణ చట్టం సమర్థ అమలుతో కొనుగోలుదారులు-విక్రేతల మధ్య విశ్వాస పునరుద్ధరణ సాధ్యం: హర్దీప్ పూరి
ఇళ్ల విక్రేతలు-కొనుగోలుదారుల మధ్య విశ్వాసం పాదుకొల్పడం స్థిరాస్తిరంగ నియంత్రణ చట్టం ప్రధానోద్దేశాలలో ఒకటని కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ పూరి చెప్పారు. ఆ మేరకు సదరు చట్టాన్ని సమర్థంగా అమలుచేస్తే నమ్మకం పునరుద్ధరణ సాధ్యమేనని స్పష్టం చేశారు. స్థిరాస్తి రంగంపై ప్రస్తుత కోవిడ్-19 ప్రభావం గురించి మంత్రి మాట్లాడుతూ- ఈ మహమ్మారివల్ల స్థిరాస్తి రంగం బలహీనపడిందని, ఫలితంగా ప్రాజెక్టులు పూర్తికావడంలో జాప్యం తప్పలేదని పేర్కొన్నారు. దిగ్బంధం మొదలైన తొలినాళ్లలో నిర్మాణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని సమీక్షించాక 2020 ఏప్రిల్ 20నుంచి నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
‘ఆపరేషన్ సముద్ర సేతు -2’ కింద మాలే నుంచి భారతీయులతో బయల్దేరిన ‘ఐఎన్ఎస్ జలాశ్వ’ నౌక
“ఆపరేషన్ సముద్ర సేతు” రెండో దశలో భాగంగా మాల్దీవ్స్లోని మాలే ఓడరేవులో మే 15న భారత నావికాదళ నౌక ‘ఐఎన్ఎస్ జలాశ్వ’ 588 మంది భారతీయులను ఎక్కించుకున్న తర్వాత ఇవాళ ఉదయం అక్కడినుంచి కేరళలోని కోచ్చికి బయల్దేరింది. విదేశీ తీరాల్లో చిక్కుకుపోయిన మన పౌరులను వెనక్కు తీసుకొచ్చే భారత ప్రభుత్వ ప్రయత్నాలకు భారత నావికాదళం ‘ఆపరేషన్ సముద్ర సేతు’ద్వారా తనవంతు చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం స్వదేశానికి తరలిస్తున్న 588మంది భారతీయులలో ఆరుగురు గర్భిణులు, 21 మంది పిల్లలు ఉన్నారు.
“మహమ్మారి, దిగ్బంధంతో మానసిక-సామాజిక ప్రభావం; అధిగమన మార్గాలు”పై ఏడు పుస్తకాలను ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించిన హెచ్ఆర్డీ మంత్రి
కరోనాపై అధ్యయన పరంపరలో భాగంగా ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ (NBT) ప్రచురించిన ఏడు పుస్తకాల సెట్ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఎలక్ట్రానిక్ మాధ్యమంద్వారా ఆవిష్కరించారు. “మహమ్మారి, దిగ్బంధంతో మానసిక-సామాజిక ప్రభావం; అధిగమన మార్గాలు”పై ముద్రిత ప్రతులతోపాటు ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఏడు పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ- “నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న విధిబలీయ పరిస్థితులను అధిగమించే దిశగా ఎన్బీటీ ఇలాంటి విశిష్ట, అపూర్వమైన పుస్తకాలను మన ముందుకు తెచ్చింది. ఈ పుస్తకాలు మొత్తంమీద ప్రజల మానసిక శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేయగలవని నేను ఆశిస్తున్నాను” అన్నారు.
కోవిడ్-19పై పోరు దిశగా సంచార ఇండోర్ క్రిమిసంహారక స్ప్రేయర్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
అన్ని మూలలకూ చేరుకుని, శుభ్రం చేయగలిగేలా ఈ స్ప్రేయర్లకు మాపింగ్ సదుపాయాలున్నాయి. దీంతోపాటు అవసరమైతే యంత్ర హస్తాల పొడవు పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభం తర్వాత కూడా ఈ సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరికర వినియోగం కొనసాగే అవకాశం ఉంది.
కోవిడ్-19పై పోరుకోసం రోగ నిర్ధారణ పరిష్కారాలు; ముప్పు-వర్గీకరణ వ్యూహాల అభివృద్ధికి ‘ఇంటెల్ ఇండియా’, ‘ఐఐటీ-హైదరాబాద్’లతో జట్టుకట్టిన సీఎస్ఐఆర్
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అసోం: గువహటిలోని ఆలూ గోదాం కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 91కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి మణిపూర్లోని రిమ్స్, జేనిమ్స్ ఆస్పత్రులలో ట్రూనాట్ యంత్రాలను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రంలో నమోదైన రెండు యాక్టివ్ కేసులలో రోగుల పరిస్థితి స్థిరంగా ఉంది. కాగా, ఈ ఇద్దరి మధ్య సామీప్యం ఉన్నట్లు పరిశీలనలో తేలింది.
- మిజోరం: రాష్ట్రంలోని చర్చి హాళ్లను నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలుగా ఉపయోగించడంతోపాటు సొంత నిధుల నుంచి ఇక్కడ ఆశ్రయం పొందేవారికి ఆహారం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను చర్చిలు ఆమోదించాయి.
- నాగాలాండ్: రాష్ట్రానికి చెందిన బాలిక బెంగళూరులోని ఆస్ప్రతిలో చేర్చిన అనంతరం కన్నుమూసింది. కాగా, ఆ బాలిక నమూనాల పరీక్ష ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, గుట్కా-పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ దిమాపూర్ కమిషనర్ ఆదేశించారు.
- సిక్కిం: స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్రంలోని దుకాణాల్లో ఆహార పదార్థాలపై అధిక ధరలు వసూలు చేయడంపై ఆహార-పౌరసరఫరాలు, వినియోగదారు వ్యవహారాల విభాగం పర్యవేక్షిస్తోంది.
- కేరళ: మూడో దశ కోవిడ్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని, అజాగ్రత్తతో చేసే చిన్న పొరపాటువల్ల కూడా కోవిడ్ -19 రోగుల సంఖ్య గణనీయంగా పెరిగే ముప్పుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య విస్తరిస్తున్నందున, జన్యు పరివర్తనకు గురైన కొత్త రకం కరోనా వైరస్ దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారీ వర్షాలవల్ల ఉష్ణోగ్రత తగ్గడం కూడా వైరస్ వ్యాప్తికి దోహదం కావచ్చు. చెన్నై నుంచి వచ్చిన ఒకేఒక్క రోగి నుంచే ఈ వ్యాధి 15 మందికి వ్యాపించింది. కాగా, రాష్ట్రంలో నిన్న మరో 16 కేసులు నమోదవగా, వయనాడ్ అత్యధికంగా 19 కేసులతో ఆందోళన చెందుతోంది. జిల్లాలో ఒక పంచాయతీని పూర్తిగా దిగ్బంధం చేశారు. మరోవైపు వందే భారత్ రెండోదశ కింద గల్ఫ్ నుంచి మరో 3 విమానాలు ఇవాళ రాత్రి రాష్ట్రానికి రానున్నాయి. ఢిల్లీ నుంచి కేరళీయులను సొంత రాష్ట్రానికి పంపేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చిన కేరళ ప్రభుత్వం.
- తమిళనాడు: రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలకు ఏర్పాటు చేసిన 12,000 కేంద్రాల్లో వ్యక్తిగత దూరం ఉండేవిధంగా ప్రతి గదిలో 10 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని విద్యాశాఖ మంత్రి చెప్పారు. దిగ్బంధం సమయంలో మద్యం విక్రయించే టాస్మాక్ దుకాణాల మూసివేతకు హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు నిలిపివేత ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరుతోపాటు నియంత్రణ జోన్లు మినహా రాష్ట్రమంతటా షాపులు తిరిగి తెరిచారు. రాష్ట్రంలో శుక్రవారం 434 మంది వ్యాధి నిర్ధారణ కావడంతో కోవిడ్ కేసుల సంఖ్య 10,000 స్థాయిని దాటింది. యాక్టివ్ కేసులు: 7435, మరణాలు: 71, డిశ్చార్జ్: 2240; చెన్నైలో యాక్టివ్ కేసులు 5637గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు దిగ్బంధం సమయానికిగాను పూర్తివేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. మరోవైపు కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి పారిశ్రామికవేత్తలను కోరారు. కాగా, ఈ మధ్యాహ్నం 12 గంటలదాకా 23 కొత్త కేసులు నమోదయ్యాయి; వీటిలో బెంగళూరు 14, మాండ్యా, బాగల్కోట్, ఉడిపి, దావణగేరె, ధార్వాడ్, బళ్లారిలలో ఒక్కొక్కటి, హసన్లో 3 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1079కి చేరుకోగా, యాక్టివ్ కేసులు: 548, కోలుకున్నవారు: 494, మరణాలు: 36గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ-రవాణా, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతించకపోవడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపే నిర్ణయాన్ని ఏపీఎస్ఆర్టీసీ వాయిదా వేసింది. రాష్ట్రంలోని రెడ్జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు నిత్యావసరాలు, అవసరమైన ఇతర వస్తువులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9628 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 101 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారిలో 150 మందికి (ఒడిశా: 10, మహారాష్ట్ర: 101, గుజరాత్: 26, కర్ణాటక: 1, పశ్చిమ బెంగాల్: 1, రాజస్థాన్: 11) వ్యాధి నిర్ధారణ అయింది. ప్రస్తుతం మొత్తం కేసులు: 2205. యాక్టివ్: 803, కోలుకున్నవారు: 1353 మంది కాగా, మరణాలు: 49గా ఉన్నాయి. కేసులరీత్యా కర్నూలు (608), గుంటూరు (413), కృష్ణా (367) జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: వందే భారత్ మిషన్ కింద విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశం పంపే కసరత్తులో భాగంగా నెవార్క్ (అమెరికా) నుంచి ఢిల్లీమీదుగా ఎయిరిండియా విమానం 121 మందితో శనివారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. కాగా, మే 15 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 1454 కాగా, కోలుకున్నవారు 959మంది, యాక్టివ్: 461, మరణాలు 34గా ఉన్నాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కొత్తగా 1576 కోవిడ్ -19 కేసులు నమోదవడంతో మొత్తం రోగుల సంఖ్య 29,100కు చేరాయి. తాజా సమాచారం ప్రకారం... ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య: 21,467. కరోనా వైరస్ సంక్రమణ, చికిత్సకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో సమన్వయం కోసం- ప్రధాన కార్యదర్శి, కలెక్టర్ల నాయకత్వంలో రాష్ట్ర-జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల సామాజిక భద్రతను కూడా వారు పర్యవేక్షించనున్నారు.
- గుజరాత్: రాష్ట్రంలో 340 కొత్త కేసులలో మొత్తం కేసుల సంఖ్య 9931కి చేరింది. నిర్ధారిత కేసులలో 261 అహ్మదాబాద్ నుంచి నమోదవడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక సూరత్లో 2000కుపైగా పవర్ లూమ్ యూనిట్లు కార్యకలాపాలు పునఃప్రారంభించాయి. కాగా, నాలుగోసారి దిగ్బంధం సందర్భంగా మార్కెట్ తిరిగి తెరవడం సాధ్యం కాగలదని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2 గంటలదాకా 177 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 122 జైపూర్లో, 21 దుంగార్పూర్లో ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,924గా నమోదైంది. కోలుకున్నవారి సంఖ్య 2,785 కాగా, నేటివరకూ 2480 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- మధ్యప్రదేశ్: తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఇవాళ 169 కొత్త కేసులు నమోదవగా మొత్తం రోగుల సంఖ్య 4,595కు చేరింది. కొత్త కేసులలో ఇండోర్ హాట్స్పాట్ నుంచి 69 నమోదయ్యాయి. నిన్న 112 మంది కోలుకోగా, తాజా సమాచారం ప్రకారం 2073 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల నుంచి 3.12 లక్షల మంది వలస కార్మికులు తిరిగి వచ్చారు. వీరిలో 86 వేల మంది 72 రైళ్లలోగా రాగా, మిగిలిన 2.26 లక్షల మంది బస్సులు, ఇతర రవాణా మార్గాల్లో చేరుకున్నారు.
- గోవా: రాష్ట్రానికి తిరిగి వచ్చిన 154 మంది నావికులను వాస్కో-డ-గామాలోని 4 హోటళ్లలో నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు మార్గోవాలోని ఇఎస్ఐ ఆసుపత్రిలో చేరిన 8 మంది కోవిడ్ -19 రోగులు చికిత్సకు బాగా స్పందిస్తున్నట్లు ఆరోగ్యాధికారి తెలిపారు.
PIB FACTCHECK



*******
(Release ID: 1624568)
|