PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 04 JUL 2020 6:27PM by PIB Hyderabad

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: 1.6 లక్షలకు చేరువగా కోలుకున్న‌-యాక్టివ్ కేసుల వ్యత్యాసం; కోలుకున్న‌వారి శాతం 60.81గా న‌మోదు; మొత్తం 95 లక్షలకుపైగా నమూనాల పరీక్ష

దేశంలో కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ఇవాళ్టికి వ్యాధి నయమైనవారి సంఖ్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య కన్నా 1,58,793 మేర అధికంగా నమోదైంది. దీంతో కోలుకున్నవారి శాతం 60.81కి చేరగా గడచిన 24 గంటల్లో 14,335 మందికి వ్యాధి నయం కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,94,226కి చేరింది. ప్రస్తుతం 2,35,433 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కోవిడ్‌ ప్రత్యేక రోగ నిర్ధారణ ప్రయోగశాలలు దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ్టికి 1087కు చేరగా- 780 ప్రభుత్వ రంగంలో, 307 ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్నాయి. దీంతో గత 24 గంటల్లో 2,42,383 కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 95,40,132కు పెరిగింది. మరిన్ని వివరాలకు 

ప్రపంచ మానవాళి ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థలు మహమ్మారి బారినపడిన నేపథ్యంలో బుద్ధుని సందేశమే వెలుగురేఖ: రాష్ట్రపతి

ప్రపంచవ్యాప్తంగా మానవాళి ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి సంక్షోభంలో పడేసిన నేపథ్యంలో బుద్ధుని సందేశమే వెలుగురేఖగా నిలవగలదని భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జీవితంలో ఆనందాన్ని చవిచూడాలంటే దురాశ, ద్వేషం, హింస, అసూయ తదితర దుర్గుణాలను త్యజించాలని బుద్ధ భగవానుడు ఉద్బోధించాడని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇలాంటి పరితాపంతో నిమిత్తంలేని మానవజాతి తద్విరుద్ధంగా తన పాత పంథాలోనే హింస, ప్రకృతి వినాశం వైపు పయనిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించిన తర్వాత వాతావరణ మార్పుల సంబంధిత తీవ్ర సవాళ్లను మనం ఎదుర్కొనాల్సి ఉంటుందన్నది వాస్తవమని పేర్కొన్నారు. ఇవాళ ధర్మచక్ర దినం సందర్భంగా అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన వాస్తవిక సాదృశ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ మేరకు ప్రసంగించారు. మరిన్ని వివరాలకు 

ధర్మ చక్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రపంచంలోని అనేక దేశాలు, సమాజాల శ్రేయస్సుకు బుద్ధ భగవానుని బోధనలు, ఆయన ప్రబోధించిన అష్టాంగ పథం చేయగల మేలు గురించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రజానీకం, మహిళలు, పేదలను గౌరవించడం గురించి, శాంతి-అహింసా మార్గాల అనుసరణ గురించి బౌద్ధమతం బోధిస్తుందని, సుస్థిర ప్రపంచ గమనానికి మార్గాలు ఇవేనని ఆయన చెప్పారు. బుద్ధ భగవానుడు ఆశ-ఆకాంక్షల గురించి బోధించడంతోపాటు వాటిమధ్యగల బలమైన బంధాన్ని కూడా ప్రత్యక్షంగా చూశారని ప్రధానమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దంపై తానెంత ఆశాభావంతో ఉన్నదీ వివరిస్తూ దీనికి మూలం యువతరమేనని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం అన్వేషించగల ప్రతిభావంతులైన యువతరంతో కూడిన అంకుర సంస్థల అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలలో భారత్‌ కూడా ఒకటని ఆయన విశదీకరించారు. నేడు ప్రపంచం అసాధారణ సవాళ్లతో తలపడుతున్న తరుణంలో బుద్ధుని బోధనలతోనే శాశ్వత పరిష్కారాలు లభించగలవని ప్రధానమంత్రి చెప్పారు.  మరిన్ని వివరాలకు 

ధర్మచక్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

 మరిన్ని వివరాలకు

ధన్వంతరీ రథం: అహ్మదాబాద్‌లో ప్రజల ముంగిటకే కోవిడేతర ఆరోగ్య సేవలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పురపాలక సంస్థ (AMC) వినూత్న రీతిలో “ధన్వంతరి రథం” పేరిట సంచార వైద్యశాలలద్వారా కోవిడేతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను నగర ప్రజల ముంగిటకు చేర్చింది. నగరంలోని అనేక పెద్ద ఆస్పత్రులు కోవిడ్ రోగులకు ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా మారిన నేపథ్యంలో కోవిడేతర ప్రధాన వైద్య సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆస్పత్రిలో సాధారణ రోగులను చూసే వీలులేనందున ఆస్పత్రులకు వెళ్లలేని మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటి ఇతర అనారోగ్య బాధితులు అత్యవసరాలను తీర్చటానికి ఈ సంచార వైద్యశాలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రతి సంచార వైద్య శాలలో ఒక ఆయుష్ డాక్టర్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, పట్టణ ఆరోగ్య కేంద్రంలోని స్థానిక డాక్టర్ ఉంటారు. తదనుగుణంగా ఈ రథాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి కోవిడేతర వ్యాధి పీడితులకు చికిత్స అందిస్తుంది. ఈ పద్ధతిలో క్షేత్రస్థాయిన అక్కడికక్కడ వైద్య సలహాలు ఇవ్వటం ద్వారా అహ్మదాబాద్ నగరంలో ప్రజలందరికీ వైద్య సేవల కొరత లేకుండా ఏఎంసీ జాగ్రత్త వహిస్తోంది. ఈ సంచార వాహనాలలో ఆయుర్వేద, హోమియో మందులు, విటమిన్ మాత్రలుసహా అత్యవసర మందులు, పల్స్ ఆక్సీమీటర్ తదితర ప్రాథమిక పరీక్ష ఉపకరణాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆరోగ్య సంరక్షణ సేవలతోపాటు వివిధ కారణాలవల్ల ఆస్పత్రులకు వెళ్లలేనివారికి కూడా ధన్వంతరి రథంలోనే పరీక్షలు వైద్య నిర్వహించి, అవసరమైతే అదనపు చికిత్స చేయటంసహా అత్యవసర సందర్భాల్లో వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా ప్రస్తుతం 120 ధన్వంతరి రథాలు నిత్యం ఇళ్లవద్దకు వెళుతూ ఇప్పటిదాకా 4.27 లక్షలమందికి వైద్యసేవలు అందించాయి.  మరిన్ని వివరాలకు 

మేఘాలయలో కోవిడ్‌ కేసుల నిఘా, అవగాహన కార్యక్రమాల్లో 6700 మంది ఆశా కార్యకర్తల బలమైన భాగస్వామ్యం

మేఘాలయలో తొలి కోవిడ్‌ కేసు నమోదైన వెంటనే ఆశా (ASHA) కార్యకర్తలు, కేంద్రాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ నియంత్రణ జోన్లలో నియమించిన యాక్టివ్‌ కేసుల అన్వేషణ బృందాల్లో సమగ్ర భాగమయ్యేలా వీరికి శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి బలం చేకూరుస్తూ మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో ముందువరుసలోని సిబ్బంది కీలకపాత్ర పోషించారు. ఇందులో భాగంగా సామాజికంగా వ్యాధి నియంత్రణలో ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి దన్నుగా నిలిచారు. ఇలా అన్ని స్థాయులలోనూ 6700 మంది కార్యకర్తలు కోవిడ్‌-19పై గ్రామాల్లో అవగాహన కల్పించే, నియంత్రణ జోన్లలో యాక్టివ్‌ కేసుల జాడ పసిగట్టే బృందాలుగా ఏర్పాటు చేయబడ్డారు. అటుపైన సామాజిక సంక్రమణ లక్షణాలను గుర్తించడంలో ఆశా కార్యకర్తలు చురుగ్గా భాగం పంచుకున్నారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో సామాజిక అవగాహన కల్పించడంతోపాటు వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా హస్త పరిశుభ్రత, మాస్కులు/ముఖ కవచాల ధారణ, భౌతికదూరం పాటించడం వంటి నియమాలను ప్రజలకు విశదపరిచారు. అలాగే యాక్టివ్‌ కేసుల జాడ పసిగట్టి, సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు, చికిత్స అందించడానికి తోడ్పడ్డారు. మరిన్ని వివరాలకు  

స్వయం సమృద్ధ భారతం ఆవిష్కరణల పోటీని ప్రారంభించిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్వయం సమృద్ధ భారతం ఆవిష్కరణల పోటీకి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇప్పటికే వాడుకలోగల, పౌరులు అత్యధికంగా వినియోగించే, తమతమ విభాగాల్లో ప్రపంచస్థాయికి విస్తరించగల సామర్థ్యం ఉన్న అత్యుత్తమ భారతీయ అనువర్తనాలను గుర్తించడం ఈ పోటీ లక్ష్యం. ఈ మేరకు “అంతర్జాతీయ స్థాయిగల ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ యాప్‌లను సృష్టించడానికి సాంకేతిక-అంకుర సంస్థల సమూహాలు నేడు అత్యంత ఉత్సాహం చూపుతున్నాయి. ఈ దిశగా వారి ఆలోచనలు-ఉత్పత్తులకు ఊతమివ్వడం కోసం స్వయం సమృద్ధ భారతం ఆవిష్కరణల పోటీని ప్రభుత్వం (@GoI_MeitY and @AIMtoInnovate) ప్రారంభించింది. ఈ సవాలు మీకోసమే మీవద్ద అలాంటి ఉత్పత్తులు ఇప్పటికే ఉంటే లేదా అలాంటి ఉత్పత్తుల సృష్టికి తగిన దార్శనికత, నైపుణ్యం మీకున్నాయని భావిస్తూంటే- ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా సాంకేతిక సమాజాంలోని నా యువ మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాను" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 

స్వ‌యం స‌మృద్ధ భార‌తం ఆవిష్క‌ర‌ణ‌ల పోటీలో పాల్గొనాల్సిందిగా సాంకేతిక స‌మాజానికి ప్ర‌ధాని పిలుపు

‘స్వ‌యం స‌మృద్ధ భార‌తం’ అనువ‌ర్త‌న ఆవిష్క‌ర‌ణ పోటీలో పాల్గొనాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ సాంకేతిక స‌మాజానికి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మం లింక్‌డ్ఇన్‌లో ప్రచురించిన ఒక సందేశంలో ఈ మేర‌కు ఆహ్వానం ప‌లికారు. మ‌న‌ దేశం ఒక శక్తిమంత‌మైన, అంకుర సంస్థ‌ల పర్యావరణ వ్యవస్థగా ఉంద‌ని పేర్కొన్నారు. ఆ మేర‌కు వివిధ రంగాల్లో సాంకేతిక పరిష్కారాలను రూపొందించ‌డంలో యువత ఎంత స‌మ‌ర్థంగా పనిచేసిందీ ప్ర‌ధాని అందులో వివ‌రించారు. త‌ద‌నుగుణంగా దేశీయ అనువ‌ర్త‌నాల ఆవిష్క‌ర‌ణ‌, రూప‌క‌ల్ప‌న, వ్యాప్తి దిశ‌గా అంకుర సంస్థ‌ల‌, సాంకేతిక ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌లో అంతులేని త‌ప‌న క‌నిపిస్తున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌న జాతి స్వ‌యం స‌మృద్ధ భార‌త సృష్టికి కృషి చేస్తున్న త‌రుణంలో ఆ ప్ర‌య‌త్నాల‌కు వేగం, దిశ నిర్దేశించ‌డానికి ఇదొక స‌రైన అవ‌కాశ‌మ‌ని సూచించారు. ఆ మేర‌కు మన మార్కెట్‌లో సంతృప్తిని ఆవిష్య‌రించ‌డంతోపాటు ప్రపంచంలో పోటీప‌డేలా దేశీయ అనువ‌ర్త‌నాల‌కు రూప‌మివ్వాల‌ని ఆయన కోరారు.  మరిన్ని వివరాలకు 

ప్ర‌ధాన‌మంత్రి స్వ‌ప్నమైన స్వ‌యం స‌మృద్ధ భార‌తం సాకారం దిశ‌గా డిజిటల్ ఇండియా యాప్ ఆవిష్క‌ర‌ణ పోటీని ప్రారంభించిన మీటీ-నీతి ఆయోగ్

భార‌తీయ అనువ‌ర్త‌నాల రూప‌క‌ల్ప‌న‌లో భార‌త సాంకేతిక కంపెనీల వ్య‌వ‌స్థాప‌కుల‌కు, అంకుర సంస్థ‌ల‌కు బ‌ల‌మైన ప‌ర్యావ‌ర‌ణ సృష్టి, గ‌ట్టి మ‌ద్ద‌తునివ్వ‌డం ల‌క్ష్యంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్- నీతి ఆయోగ్‌ల‌ భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఈ ‘డిజిట‌ల్ ఇండియా-స్వ‌యం స‌మృద్ధ భార‌తం’ యాప్ ఆవిష్క‌ర‌ణ పోటీకి శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌బోధిత డిజిట‌ల్ ఇండియాతోపాటు స్వ‌యం స‌మృద్ధ భార‌తం దార్శ‌నితను సాకారం చేయ‌డంలో డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞానాల వినియోగం ల‌క్ష్యంగా ఈ పోటీని ప్రారంభించారు. ఇది రెండు ద‌శ‌లుగా సాగుతుంది మొద‌టిది ప్ర‌స్తుత అనువ‌ర్త‌నాల‌కు ప్రోత్సాహం కాగా, రెండోది కొత్త అనువ‌ర్త‌నాల‌ను రూపొందించ‌డంగా ఉంటుంది. మరిన్ని వివరాలకు

నీట్‌, జేఈఈ మెయిన్స్‌-అడ్వాన్స్‌ డ్‌ పరీక్షల నిర్వహణకు తాజా తేదీలను ప్రకటించిన హెచ్‌ఆర్‌డి మంత్రి

దేశంలో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నీట్ (NEET), జేఈఈ (JEE) మెయిన్స్-అడ్వాన్స్ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు తాజా తేదీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచ‌న‌ మేరకు నాణ్యమైన విద్యకు భ‌రోసా ఇస్తూ జాతీయ పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ సంస్థ (NTA) జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాకు నిర్ణ‌యించింద‌ని మంత్రి తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాజాగా 2020 సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌, 2020 సెప్టెంబర్ 27న  జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. ఇక నీట్‌ను 2020 సెప్టెంబర్ 13వ తేదీన నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. మరిన్ని వివరాలకు 

భార‌త ఎగుమతుల శ‌ర‌వేగ వృద్ధి నేప‌థ్యంలో ఎగుమతిదారుల కృషికి శ్రీ పీయూష్ గోయల్ ప్రశంస‌

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో కోవిడ్-19 అంతరాయాల తర్వాత దిగ్బంధ విముక్తి ప్రక్రియ మొద‌లై  ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్న నేప‌థ్యంలో ఎగుమతులు శ‌ర‌వేగంగా వృద్ధి చెందుతున్నాయని నిన్న ఈపీసీని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ శ్రీ గోయ‌ల్ చెప్పారు. నిరుడు జూన్‌నాటి ఎగుమ‌తుల‌తో పోలిస్తే 2020 జూన్‌లో వస్తు ఎగుమతుల  గణాంకాలు 88 శాతానికి చేరువ కావ‌డమే వృద్ధికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత‌టి భారీ విజయం సాధించారంటూ ఎగుమతిదారులను మంత్రి అభినందించారు. వారి క‌ఠోర ప‌రిశ్ర‌మ‌, ఆత్మ‌విశ్వాసం, దీక్ష ఈ మేర‌కు స‌త్ఫలితాలిచ్చాయ‌ని పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాలు నేటికీ నియంత్ర‌ణ జోన్ల ప‌రిధిలో ఉన్న నేప‌థ్యంలో ఈ విజ‌యం మరింత ప్రశంసనీయమ‌ని పేర్కొన్నారు. ఇటువంటి పునఃపురోగ‌మ‌నం విదేశీ మార్కెట్లలో ఇంకా సాధ్యం కాలేద‌ని ఆయన అన్నారు. ఇక ప్ర‌స్తుత దిగ్బంధ విముక్తి రెండో ద‌శ‌లో మ‌రిన్ని అనుమ‌తులు ఉన్నందున భ‌విష్య‌త్తులో ప‌రిస్థితులు మ‌రింత మెరుగ్గా ఉంటాయ‌ని శ్రీ పీయూష్ గోయ‌ల్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో రైతులు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పిస్తూ పలు చర్యలు తీసుకున్న వ్యవసాయ-సహకార, రైతు సంక్షేమ శాఖ

కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పిస్తూ వ్యవసాయ-సహకార, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఖరీఫ్‌ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం ఇందుకు నిదర్శనం. తదనుగుణంగా వేసవి వరిసాగు విస్తీర్ణం 68.08 లక్షల హెక్టార్లుగా నమోదైతే... నిరుడు ఇదే కాలంలో 49.23 హెక్టార్లు మాత్రమే కావడం ఈ సందర్భంగా గమనార్హం. మరిన్ని వివరాలకు 

కోవిడ్‌ అనంతర కాలంలో దేశ ఆర్థిక చోదకశక్తిగా ముందుండి నడిపించేది ఈశాన్య భారత ప్రాంతమే: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్ తర్వాతి పరిస్థితుల్లో భార‌త‌దేశం బ‌ల‌మైన ఆర్థిక శక్తిగా అవతరించడంలో ఈశాన్యభార‌త‌ ప్రాంతం తన భారీ సహజ-మానవ వనరుల సాయంతో ముందుండి నడిపిస్తుందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌ చెప్పారు. కరోనా మ‌హ‌మ్మారిని విజయవంతంగా నిలువ‌రించిన ఈశాన్య ప్రాంత మహిళలు ఆ స్ఫూర్తితో అన్ని ఆర్థిక కార్యకలాపాల్లోనూ ముందడుగు వేస్తున్నారని ఆయ‌న చెప్పారు. మ‌హ‌మ్మారిపై పోరులో మహిళలు అస‌మాన శ‌క్తిసామ‌ర్థ్యాలు ప్ర‌ద‌ర్శించార‌ని, కరోనా నిర్వహణలో ఈశాన్య భారతాన్ని వారు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిపార‌ని కొనియాడారు. “ఈశాన్య భార‌త సామాజిక వ‌న‌రులు-నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మం”తో ముడిప‌డిన వివిధ స్వ‌యం స‌హాయ బృందాల స‌భ్యుల‌తో వెబినార్‌ ద్వారా కేంద్ర మంత్రి మాట్లాడారు. మరిన్ని వివరాలకు 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర

దేశంలో కోవిడ్-19 కేసులు తొలిసారిగా ఇవాళ ఒక్కరోజే 20,000కు పైగా నమోదవగా మహారాష్ట్రలో 6,364 కొత్త కేసులతో మొత్తం కేసుల 1,92,990కి చేరింది. ఇక 1.04 లక్షలకుపైగా రోగులు కోలుకోగా ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 79,911గా ఉంది. ముంబై నగరంలో 1,392 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా వైరస్ కేసులు ఒక కొలిక్కి వస్తున్నప్పటికీ, ముంబై మహానగర ప్రాంత శివారు నగరాలు థానె, కల్యాణ్‌-డోంబివిలి, మీరా-భయందర్ పట్టణాలు కొత్త కోవిడ్ నిలయాలుగా మారాయి.

  • గుజరాత్

రాష్ట్రంలో గత 24 గంటల్లో 687 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 34,686కు చేరాయి. అలాగే, 18మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,906కు పెరిగింది. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కొత్త కేసుల నమోదుతో నగరంలోని 26 కొత్త ప్రాంతాలను సూక్ష్మ నియంత్రణ జోన్లుగా ప్రకటించింది. ఈ మేరకు పురపాలక ఆరోగ్య విభాగం ఈ ప్రాంతాల్లో ఇంటింటి నిఘా, సామూహిక తనిఖీ ప్రారంభించింది.

  • రాజస్థాన్

రాష్ట్రంలో ఈ ఉదయం వరకూ 204 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం రోగుల సంఖ్య 19,256కు పెరిగింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 3,461 యాక్టివ్‌ కేసులుండగా మరణాల సంఖ్య 443గా ఉంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 8.70 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు.

  • మధ్యప్రదేశ్

రాష్ట్రంలో  191 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 14,297కు పెరిగింది. ప్రస్తుతం 2655 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటిదాకా 11049 మంది కోలుకున్నారు.

  • ఛత్తీస్‌గఢ్‌

రాష్ట్రంలో 40 కొత్త కేసులతో మొత్తం కేసులు 3,065కు పెరిగాయి. వీటిలో 637 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • గోవా

గోవాలో శుక్రవారం 95 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,482కు పెరిగింది. వీటిలో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 734గా ఉంది.

  • చండీగఢ్‌

కోవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా ఈ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పాలన యంత్రాంగం ఊరట చర్యలు చేపట్టింది. ఈ మేరకు చండీగఢ్‌ విద్యాశాఖ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9, 10 తరగతి విద్యార్థుల వార్షిక, నెలవారీ ఫీజులను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరం తొలి ఆరునెలలపాటు... అంటే- ఏప్రిల్-2020 నుంచి సెప్టెంబర్-2020 వరకు ఒకసారి ఈ రాయితీని వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో నగర పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9, 10 తరగతులు చదివే 24500 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

  • పంజాబ్

రాష్ట్రంలో వచ్చేవారం నుంచి కోవిడ్-19 నిర్ధారణకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ముఖ్యమంత్రి అనుమతించారు. మొత్తం 1000 నమూనాలను పరీక్షించే ఈ ప్రయోగాత్మక దశ విజయవంతం అయ్యాక కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తారు. తదనుగుణంగా పంజాబ్‌లో పరిశ్రమలు తెరుస్తున్న కారణంగానూ, వరిపొలాల్లో పనుల కోసం తిరిగివచ్చే వలసకార్మికులకు ఈ విధానంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

  • హర్యానా

దేశవ్యాప్త రెండోదశ దిగ్బంధ విముక్తి సందర్భంగా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుతున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దీంతోపాటు రోడ్ల బలోపేతం, మెట్రో విస్తరణ, ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ వ్యవస్థ అభివృద్ధి ప్రణాళికలు దశలవారీగా వేగంగా ముందుకు సాగుతాయని తెలిపారు.

  • హిమాచల్ ప్రదేశ్

శాస్త్ర-పారిశ్రామిక మండలి (సీఎస్‌ఐఆర్‌) పరిధిలోగల పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయో-రిసోర్స్‌ టెక్నాలజీ 38వ వ్యవస్థాపక వారోత్సవం సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని టండా, చంబా, హమీర్‌పూర్ వైద్య కళాశాలలకు అన్నివిధాలా మద్దతునిచ్చిందని ప్రశంసించారు. అలాగే వినియోగదారుల కోసం ఆల్కహాల్‌ రహిత హస్త పరిశుభ్రక ద్రవం, మూలికా సబ్బు తయారీలో ఈ సంస్థ విజయవంతమైందని ఆయన చెప్పారు.

  • కేరళ

రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా ప్రభుత్వం రాజధాని తిరువనంతపురంలోని మరిన్ని ప్రాంతాలను నియంత్రణ జోన్లుగా ప్రకటించింది. ప్రభుత్వ సచివాలయం వెలుపల విధుల్లో ఉన్న సాయుధ రిజర్వు సిబ్బందిలో ఒకరికి రోగ నిర్ధారణ కావడంతో ఆ శిబిరంలోని మొత్తం 22 మంది పోలీసులనూ నిర్బంధవైద్య పరిశీలనకు తరలించారు. కొచ్చిలోని ఇందిరాగాంధీ సహకార ఆసుపత్రిలో రెండు రోజుల కిందట వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తికి చికిత్స తర్వాత అతడికి కోవిడ్‌ సోకినట్లు తేలడంతో అక్కడి 15 మంది సిబ్బందినీ నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక న్యూఢిల్లీలో మరొక మలయాళీ మృతితో దేశ రాజధానిలో కేరళీయుల మరణాలు ఇవాళ 13కి చేరాయి. రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 211 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం 2,098 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,77,001 మంది పరిశీలన పరిధిలో ఉన్నారు.

  • తమిళనాడు

కేంద్రపాలిత పుదుచ్చేరిలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకించాయి. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఇవాళ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీతోపాటు ముఖ్యమంత్రి వి.నారాయణసామి సహాయం కోరారు. ఇక పుదుచ్చేరిలో ఒక మరణంతోపాటు 80 తాజా కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 904కు చేరగా, మరణాలు 14కు పెరిగాయి. మరోవైపు జిప్మెర్ ప్రాంగణంలో ఆరోగ్య అధికారులుసహా 20 మందికి రోగ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. కాగా, దేశంలోనే  అత్యధిక ప్రభావిత రెండో రాష్ట్రంగా తమిళనాడు రికార్డులకెక్కింది. ఈ మేరకు మొత్తం కేసుల సంఖ్య నిన్న 1,02,721కి చేరింది. కాగా, 4329 కొత్త కేసులు, 2357 రికవరీలతోపాటు 64 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు: 42955, మరణాలు: 1385, డిశ్చార్జెస్: 58378, చెన్నైలో యాక్టివ్ కేసులు: 23581గా ఉన్నాయి.

  • కర్ణాటక

రాష్ట్రంలో వ్యాధి లక్షణాలు లేనివారి ఏకాంత గృహవాసం, కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. ఇక కోవిడ్‌ నిర్వహణలో ప్రాథమికస్థాయి క్రియాశీల యూనిట్‌గా బూత్ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఆసుపత్రులలో పడకల కేటాయింపు కోసం కేంద్రీకృత వ్యవస్థను రూపొందించడంతోపాటు దీని పర్యవేక్షణకు నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించింది. నగరంలో 400 అంబులెన్స్‌ వాహనాలను నడపనుండగా, వీటిని ప్రతి వార్డుకు 2 చొప్పున కేటాయిస్తారు. ఏకాంత గృహవాసం, అంత్యక్రియల మార్గదర్శకాలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కాగా, కర్ణాటకలో ఇవాళ పూర్తి దిగ్బంధం విధించి, అత్యవసర సేవలను మాత్రమే అనుమతించారు. నిన్న 1694 కొత్త కేసులు, 471 డిశ్చార్జెస్, 21 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరు నగరంలో 994 కేసులుండగా మొత్తం  కేసులు: 19710, క్రియాశీల కేసులు: 10,608, మరణాలు: 293గా ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్

కోవిడ్-19 ఒక వ్యక్తి మరణించిన 4 నుంచి 6 గంటల తర్వాత మృతదేహం నుంచి కరోనా వైరస్‌ వ్యాపించదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన (ఆరోగ్యశాఖ) కార్యదర్శి  కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మృతుల అంత్యక్రియలకు ఆటంకాలు కలిగించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం కోవిడ్ మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్రీకాకుళంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు అధికారులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కోవిడ్ మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడంలో తమిళనాడులోని ముస్లిం స్వచ్ఛంద సంస్థ చూపిన చొరవను ఆదర్శంగా తీసుకుని, శ్రీకాకుళంలోనూ అదేవిధంగా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, గత 24 గంటల్లో 24,962 నమూనాలను పరీక్షించగా రాష్ట్రంలో 765 కొత్త కేసులు, 311 డిశ్చార్జ్, 12 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 32 అంతర్రాష్ట్ర వాసులకు సంబంధించినవి కాగా, 6 విదేశాలనుంచి వచ్చినవారికి చెందినవి ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 17,699, యాక్టివ్ కేసులు: 9473, మరణాలు: 218, డిశ్చార్జెస్: 8008గా ఉన్నాయి.

  • తెలంగాణ

రాష్ట్రంలో ఏకాంత గృహవాసం వ్యూహం సమర్థంగా అమలవుతోంది. ఈ మేరకు ఇప్పటిదాకా తెలంగాణలో సుమారు 12,000 మంది ఏకాంత గృహవాస చికిత్సను ఎంచుకోగా, వారిలో దాదాపు 50 శాతం కోలుకున్నారు. నిన్నటివరకూ మొత్తం కేసుల సంఖ్య: 20462, యాక్టివ్ కేసులు: 9984 మరణాలు: 283, డిశ్చార్జ్: 10195గా ఉన్నాయి.

  • అరుణాచల్ ప్రదేశ్

రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జూలై 6 సోమవారం (ఉదయం 5) నుంచి జూలై 12 సాయంత్రం 5 గంటల వరకు రాజధాని ప్రాంతంలో దిగ్బంధం ప్రకటించింది. దీనిపై ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలు త్వరలో జారీ కానున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ ఇవాళ విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో గురువారం ఒకేరోజు అత్యధికంగా 37 కొత్త కేసులు నమోదవగా నిన్న 20 కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 252కు చేరగా, వాటిలో 176 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా  75 మంది కోలుకోగా, కేవలం ఒక్కరు మాత్రమే మరణించారు.

  • మిజోరం

రాష్ట్రంలో మరో ముగ్గురు కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32కాగా, ఇప్పటిదాకా 130 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

 

ఫ్యాక్ట్ చెక్

 

********



(Release ID: 1636583) Visitor Counter : 228