వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎగుమతుల్లో దేశం వేగంగా కోలుకొనేందుకు గాను ఎగుమతిదారులు చేసిన ప్ర‌యత్నాలను ప్ర‌శంసించిన శ్రీ పీయూష్ గోయల్


ఎగుమతిదారుల సమస్యలపై చర్చించడానికి మరియు పరిష్కరించేందుకు సమావేశాన్ని నిర్వహించిన మంత్రి

Posted On: 03 JUL 2020 8:15PM by PIB Hyderabad

కోవిడ్ -19 నేప‌థ్యంలో ఎగుమతిదారుల సమస్యలపై చర్చించేందుకు మరియు వాటిని పరిష్కరించేందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్' (ఈపీసీ) ఆఫీసు -బేరర్లతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19 కారణంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి రెండు నెలల కాలంలో ఎదురుదెబ్బలు త‌గిలిన‌ప్ప‌టికీ.. ఆ తరువాత ఎగుమతులు వేగంగా కోలుకుంటున్నాయని ఈపీసీ స‌భ్యుల‌ను ఉద్దేశించి మంత్రి శ్రీ గోయల్ వివ‌రించారు. కోవిడ్ అన్‌లాక్ ప్రక్రి‌య వేగ‌వంతం అవు‌తున్న కొద్ధి.. మ‌న దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునరుజ్జీవనం పొందుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు.  జూన్ నెల‌ స‌మాచారం ఈ విష‌యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు. గతేడాది ఇదే కాలపు వాణిజ్య ఎగుమతుల‌ గణాంకాలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఎగుమ‌తులు.. దాదాపు 88 శాతాన్ని తాకినట్లుగా ఆయన వివ‌రించారు. చాలా తక్కువ సమయంలో ఇంత‌‌టి ఘనత సాధించ‌డంతో ఎగుమతిదారుల పాత్రను ఆయన ప్రశంసించారు. ఈ ఘ‌న‌త‌ను సాధించ‌డంలో వారు చేసిన‌ కృషి, చూపిన ఆత్మ విశ్వాసం, సంకల్పం నిజ‌మైన‌ ఫలితమిచ్చాయని మంత్రి తెలిపారు.

మిగ‌తా వారికంటే వేగంగా కోలుకున్నాం కోవిడ్-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో దేశంలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ కోవిడ్ కంట‌యిన్‌మెంట్ జోన్‌లో ఉన్నాయన్నారు. కోవిడ్ ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న నేప‌థ్యంలోనూ ఈ ఘనతను సాధించ‌డం ఎంత‌గానో ప్రశంసనీయ‌మ‌ని ఆయన అన్నారు. విదేశాల్లో చాలా మార్కెట్లు మ‌నంత వేగంగా, గొప్పగా కోలుకొని తిరిగి పుంజుకోలేక‌పోయాయ‌ని తెలిపారు. దేశంలో దిగుమతుల సమస్యపై మంత్రి మాట్లాడుతూ.. అవి ఇంకా చాలా వెనుకబడే ఉన్నాయన్నారు. ఇది మంచి విషయమ‌ని తెలిపారు. దేశంలో అన్‌లాక్ 2.0 ప్రక్రి‌య అమ‌ల్లోకి వ‌చ్చినందున భవిష్యత్తులో ఆయా విషయాలు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నట్లుగా శ్రీ పియూష్ గోయల్ చెప్పారు.

పేదవాడికి గౌరవప్ర‌ద‌మైన జీవితం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ గురించి మంత్రి మాట్లాడుతూ.. ఇది ప్ర‌పంచంతో భార‌త దేశ అనుసంధానాన్ని తెలియజేస్తుంద‌ని వివ‌రించారు. దీని వ‌ల్ల స్వావలంబన మరియు బలమైన భారతదేశం, నమ్మకంగా మరియు శక్తివంతమైన దేశం, ప్రతి ఒక్కరి నమ్మకంతో కూడిన ధైర్య‌మైన దేశం‌గా భార‌త దేశం ఎదుగుతుంద‌ని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి తగిన మేటి అవకాశాలను పొంద‌గ‌లుగుతార‌‌ని అన్నారు. ఫ‌లితంగా ఇక్కడ ప్ర‌తి పేదవాడు కూడా గౌరవప్ర‌ద‌మైన‌ జీవితాన్ని గడుపగ‌లుగుతాడ‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గాలి వివిధ వ‌స్తువుల కోసం కొన్ని త‌ర‌హా దిగుమతులు మరియు కొన్ని దేశాలపై అధికంగా ఆధారపడ‌టాన్ని త‌గ్గించుకోవాల‌ని ఆయన ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారికి పిలుపునిచ్చారు. ఇలా చేయ‌కుంటే ఇది దీర్ఘకాలంలో భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంద‌ని అన్నారు. దేశీయ వనరుల్ని, నైపుణ్యం కలిగిన మానవ శక్తిని ఉపయోగించుకొని మేక్ఇన్ ఇండియాలో భాగంగా.. నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని వాటిని స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందించేందుకు ఆర్థిక వ్యవస్థల్ని త‌గు విధంగా వినియోగించుకోవాల‌ని ఆయ‌న ప్రోత్స‌హించారు. ఎగుమతిదారులను మరింత పోటీత‌త్వంతో త‌మ అనుకూల‌త‌ల‌పై దృష్టి సారిస్తూ ముందుకు సాగాల‌ని మంత్రి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారిని ప్రోత్స‌హించారు. త‌గిన భాగస్వామ్యం మరియు సహకార‌పు స్ఫూర్తి గురించి మాట్లాడిన మంత్రి ఎగుమతిదారులకు మరియు పరిశ్రమల‌కు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్) విష‌య‌మై బాబా కళ్యాణీ కమిటీ చేసిన సిఫారసులపై త‌గిన చర్యల‌ను తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పూర్తి హృదయపూర్వక మద్దతు ఇచ్చినందుకు గాను మంత్రి పీయూష్ గోయ‌ల్ మరియు అధికారులకు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాధ్యమైనంత తక్కువ సమయంలో తిరిగి కోలుకునేందుకు గాను ఎంత‌గానో సహాయపడింద‌ని అన్నారు.

అయితే, వారిలో కొంత‌ మంది త‌మ‌కు ఇంకా కొన్ని ర‌కాల సమస్యలున్నాయని, వాటి ప‌రిష్కారానికి గాను ప్రభుత్వ జోక్యం మరియు త‌గిన మద్దతు అవసరమని తెలిపారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌కు వారు త‌మ పూర్తి స్థాయి మ‌ద్ధతును తెలిపారు. ఈ సమావేశానికి ఎఫ్ఐఈవో, ఏపీఈసీ, ఎస్ఆర్‌టీఈపీసీ, జీజేఈపీసీ, సీఎల్ఈ, సీఈపీజీ, షెఫిక్సిల్‌, ఫార్మెక్సిల్‌, ఈసీఎస్ఈపీసీ, ఐఎస్ఈపీసీ, ఎస్ఈపీసీ, ఈఈపీసీ, ఈపీసీహెచ్‌, పీఈపీసీ, టెక్స్‌ప్రోసిల్‌, టెలికాం ఈపీసీ, జీడిపప్పు ఈపీసీ, కెమెక్సిల్‌, సీఈపీసీఎక్స్‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

 

***



(Release ID: 1636577) Visitor Counter : 224