PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 18 JUN 2020 6:20PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య7,390; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,94,324కి చేరగా- కోలుకునేవారి శాతం 52.96కి పెరిగింది.
  • దేశంలో ప్రస్తుతం 1,60,384 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
  • సుదూర, మారుమూల, దుర్లభ ప్రాంతాల్లో కోవిడ్‌-19 పరీక్ష కోసం భారత తొలి మొబైల్‌ యాప్‌ ‘ఐ-ల్యాబ్‌’ను ఆవిష్కరించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌.
  • కోవిడ్‌-19 మహమ్మారిని దేశం అధిగమిస్తుందని, జాతి దీన్నొక అవకాశంగా మలచుకుంటుందని ప్రధాని ధీమా.
  • కోవిడ్‌-19పై 3వ దశ ఔషధ ప్రయోగాల కోసం సీఎస్‌ఐఆర్‌-సీడీఐఆర్‌ ప్రయోగాత్మక మందు ‘యుమిఫెనోవిర్‌’కు ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ ఆమోదం.
  • వలస కార్మికులకు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి, సాధికారత కల్పన కోసం ‘గరీబ్‌ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌’ కింద భారీ సంఖ్యలో గ్రామీణ పనులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునే వారి శాతం మెరుగుపడి 52.8కి చేరిక

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 7,390 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 1,94,324కు చేరి, కోలుకునేవారి శాతం 52.96కి పెరిగింది. ప్రస్తుతం 1,60,384 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ రంగంలో 699, ప్రైవేటు రంగంలో 254 (మొత్తం 953) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. తదనుగుణంగా గడచిన 24 గంటల్లో 1,65,412 నమూనాలను పరీక్షించగా- ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 62,49,668కి చేరింది.

   దేశంలోని చిట్టచివరి వ్యక్తికీ కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షను చేరువ చేసేందుకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ భారత తొలి మొబైల్‌ యాప్‌ ఐ-ల్యాబ్‌ (ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ డయాగ్నాస్టిక్‌ ల్యాబ్‌)ను ఆవిష్కరించారు. సీజీహెచ్‌ఎస్‌ ధరలకు రోజూ 25 కోవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు, 300 ఎలిసా పరీక్షలతోపాటు అదనంగా టీబీ, హెచ్‌ఐవి పరీక్షలను నిర్వహించగల దేశంలోని సుదూర, మారుమూల, దుర్లభ ప్రాంతాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632354

బొగ్గు తవ్వకం వాణిజ్యీకరణ కోసం బొగ్గు గనుల కేటాయింపుపై వేలం ప్రక్రియను ప్రారంభించిన ప్రధానమంత్రి

దేశంలో బొగ్గు తవ్వకం వాణిజ్యీకరణ దిశగా 41 బొగ్గు గనుల కేటాయింపుపై వేలం ప్రక్రియను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం స్వయం సమృద్ధ భారతం కింద చేసిన ప్రకటనల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు బొగ్గు గనుల కేటాయింపు నిమిత్తం రెండుదశల్లో ఎలక్ట్రానిక్‌ వేలం ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- కోవిడ్‌-19 మహమ్మారిని భారత్‌ అధిగమిస్తుందని, ఈ సంక్షోభాన్ని జాతి ఒక అవకాశంగా మలచుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం స్వయం సమృద్ధం... అంటే స్వావలంబన సాధించాలన్న పాఠాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి మనకు నేర్పిందని ఆయన పేర్కొన్నారు. స్వయం సమృద్ధ భారతమంటే- దిగుమతుల పరాధీనతను తగ్గించుకోవడం, దిగుమతులపై వెచ్చించే విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవడమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత దేశం దిగుమతులపై ఆధారపడే అవసరం లేకుండా దేశీయంగా వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632381

బొగ్గు తవ్వకం వాణిజ్యీకరణ కోసం బొగ్గు గనుల వేలం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632368

ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాల పెంపు నిమిత్తం ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’కు జూన్‌ 20న శ్రీకారం

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి, సాధికారత కల్పన కోసం గరీబ్‌ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌కింద భారీ సంఖ్యలో గ్రామీణ ప్రజా పనులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి 2020 జూన్‌ 20వ తేదీన ఉదయం 11:00 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా బీహార్‌ ముఖ్యమంత్రి, ఉప-ముఖ్యమంత్రి సమక్షంలో  దీనికి శ్రీకారం చుడతారు. ఇది బీహార్‌లోని ఖగారియా జిల్లా బెలాదౌర్‌ సమితి పరిధిలోగల తెలిహార్‌ గ్రామంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు పాలుపంచుకుంటారు. ఇది 125 రోజులపాటు ఉద్యమస్థాయిలో సాగే కార్యక్రమం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 25 రకాల పనులద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యంతో వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.50,000 కోట్ల మేర వనరులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఒడిసా రాష్ట్రాల్లోని 27 ప్రగతికాముక జిల్లాలు సహా ఎంపిక చేసిన 116 జిల్లాల పరిధిలో 25,000 మందికిపైగా వలస కార్మికులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632257

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూన్‌ 20న ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమ పరిచయ పత్రికా సమావేశం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూన్‌ 20న ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇవాళ న్యూఢిల్లీలో ఈ కార్యక్రమ పరిచయ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ- కోవిడ్‌ దిగ్బంధం తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోగల స్త్రీ-పురుష కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగివచ్చారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వీరు అధిక సంఖ్యలోగల రాష్ట్రాల్లోని సుమారు 116 జిల్లాలను అక్కడి ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆమె తెలిపారు. ఇవి బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఒడిసా రాష్ట్రాల్లో ఉన్నాయని, వలసకార్మికులు అత్యధిక సంఖ్యలో తిరిగివచ్చిన జిల్లాలుగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. వీరిలో వివిధ రకాల నైపుణ్యంగల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నమోదు చేశామని శ్రీమతి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆ మేరకు వారిలో చాలామంది ఏదో ఒకరకమైన నైపుణ్యం కలిగిఉన్నట్లు తేలిందని తెలిపారు. వారి నైపుణ్యం ప్రాతిపదికన రాబోయే 4 నెలలపాటు వారికే కాకుండా గ్రామీణ పౌరులకు ఉపశమనం కలిగించడంలో భాగంగా జీవనోపాధి అవకాశాలతోపాటు సాధికారత కల్పన దిశగా ‘గరీబ్ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ పేరిట భారీస్థాయిలో ప్రజా పనులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632468

దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అధ్యక్షతన వరుస సమీక్షల నేపథ్యంలో ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితి నిర్వహణపై పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితిని చక్కదిద్దడంపై దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అధ్యక్షతన జూన్‌ 14, 15 తేదీల్లో వరుస సమీక్ష సమావేశాలు జరిగాయి. ఆ వెంటనే నమూనాల పరీక్షలు రెట్టింపయ్యాయి. తదనుగుణంగా జూన్‌ 15, 16 తేదీల్లో మొత్తం 16,618 నమూనాలను సేకరించారు. అంతకుముందు జూన్‌ 14వరకూ కేవలం 4,000-4,500 మధ్య మాత్రమే నమూనాలను సేకరించేవారు. ప్రస్తుతం ఢిల్లీలోని 242 నియంత్రణ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇక ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల ధరలపై డాక్టర్‌ వి.కె.పాల్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖకు నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన అనంతరం ఆరోగ్యశాఖ తగు చర్యల నిమిత్తం అందులోని సిఫారసులను ఢిల్లీ ప్రభుత్వానికి పంపింది. ప్రైవేటు ప్రయోగశాలల్లో రోగ నిర్ధారణ పరీక్షకు కమిటీ రూ.2,400 ధర నిర్ణయించగా, ఢిల్లీలో ప్రస్తుతం నమూనాల సేకరణ, పరీక్షల కోసం 169 కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632182

కోవిడ్‌-19పై 3వ దశ ఔషధ ప్రయోగాల కోసం సీఎస్‌ఐఆర్‌-సీడీఐఆర్‌ ప్రయోగాత్మక మందు యుమిఫెనోవిర్‌కు ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ ఆమోదం

సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని లక్నో నగరంలోగల సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఐఆర్‌) రూపొందించిన ప్రయోగాత్మక వైరస్‌ నిరోధక ఔషధం ‘యుమిఫెనోవిర్‌’పై మూడోదశ ప్రయోగాల కోసం ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సదరు ఔషధ యాదృచ్ఛిక, ద్వంద్వ గోప్య, పదార్థరహిత నియంత్రణ ప్రయోగ సామర్థ్యం, సహనీయత, భద్రతలను మూడోదశలో పరీక్షిస్తారు. కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, లక్నో ఈఆర్‌ఏ వైద్యకళాశాల-ఆస్పత్రి ఈ ప్రయోగాలు నిర్వహిస్తాయి. ఈ ఔషధానికి భద్రత లక్షణాలు చక్కగా ఉన్నాయని, మానవ శరీర కణాల్లోకి వైరస్‌ ప్రవేశాన్ని అడ్డుకునేలా ఇది పనిచేస్తుందని, దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని ఇప్పటిదాకా సాగిన ప్రయోగాల్లో తేలింది. కాగా, యుమిఫెనోవిర్‌ మందును ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి నయం చేసేందుకు వాడుతారు. ఇది చైనా, రష్యాలలో లభ్యమవుతుండగా, కోవిడ్‌-19 రోగులకు వాడినపుడు ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలడంతో దీనికి ప్రాముఖ్యం పెరిగింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632400

బ్యాగుల ఆటోమాటిక్‌ శానిటైజర్‌ను రూపొందించిన ఈఆర్‌ అసన్‌సోల్‌ డివిజన్‌

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి తనవంతు చేయూతగా తూర్పు రైల్వే (ఈఆర్‌) అసన్‌సోల్‌ డివిజన్‌ ఆటోమాటిక్‌ బ్యాగ్‌ శానిటైజర్‌ను రూపొందించింది. ఈ ఆటోమాటిక్‌ బ్యాగ్‌ శానిటైజర్‌లో ఎయిర్‌ బ్లోయర్‌ పంపు, చల్లుడు మందు, నాజిల్‌ ఉంటాయి. వీటిసాయంతో ధూమజనకంగా పరిశుభ్రత ద్రవాన్ని బ్యాగులపై చల్లుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632190

ఐదేళ్లలో విద్యుత్‌ వాహనాల తయారీ కూడలిగా భారత్‌; కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

రానున్న ఐదేళ్లలో భారతదేశం విద్యుత్‌ వాహనాల తయారీ కూడలిగా రూపొందుతుందని కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారులు-ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రంగానికి సాధ్యమైన మేరకు రాయితీలతో ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా విద్యుత్‌తో నడిచే వాహనాలపై వస్తుసేవల పన్నును ఇప్పటికే 12 శాతానికి తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. “కోవిడ్‌-19 అనంతరం భారత విద్యుత్‌ వాహన మార్గ ప్రణాళిక” అంశంపై ఇవాళ నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. విద్యుత్‌ వాహనాల రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అయితే, విక్రయాల పరిమాణం పెరిగితే అవన్నీ సమసిపోగలవని పేర్కొన్నారు. కాగా, చైనాతో వాణిజ్యంపై ప్రపంచం సుముఖంగా లేదని, ఇది భారత పారిశ్రామిక రంగానికి చక్కని అవకాశమని, దీన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632383

భారత నావికాదళం అభివృద్ధి చేసిన ‘నవ్‌రక్షక్‌’ పీపీఈ సూట్‌ తయారీ విధానంపై ఐదు ఎంఎస్‌ఎంఈలకు లైసెన్స్‌ ఇచ్చిన ఎన్‌ఆర్‌డీసీ

దేశంలో నాణ్యమైన వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత నావికాదళం రూపొందించిన ‘నవ్‌రక్షక్‌’ పీపీఈ సూట్‌ తయారీ కోసం  కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని డీఎస్‌ఐఆర్‌ అనుబంధ నేషనల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఆర్‌డీసీ) ఐదు ఎంఎస్‌ఎంఈలకు లైసెన్స్‌ ఇచ్చింది. తదనుగుణంగా ఏటా కోటి పీపీఈ కిట్లను తయారుచేయాలని సదరు ఐదు సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. కాగా, ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వని హాస్పిటల్‌ (ముంబై) పరిధిలోని ఆవిష్కరణల విభాగం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేవల్‌ మెడిసిన్‌ ఈ ‘నవ్‌రక్షక్‌’ పీపీఈ కిట్‌ తయారీ విధానాన్ని ఆవిష్కరించింది. దీనిపై తగిన పరీక్షలు, ప్రయోగాత్మక పరిశీలన అనంతరం ఇన్‌మాస్‌, డీఆర్‌డీవో ఆమోదముద్ర వేశాయి. ఈ కిట్లు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశిత అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లు కేంద్ర జౌళిశాఖ ఆమోదంగల ఎన్‌ఏబీఎల్‌ గుర్తించిన ప్రయోగశాలలు ధ్రువీకరించాయి. దీని తయారీలో వాడిన సింథటిక్‌ వస్త్రం, సూట్‌, దానికి వేసిన కుట్లు రక్తరసి చొరబాటును నిరోధిస్తాయని తేల్చింది. ఇక ఈ పీపీఈ కిట్‌ చౌకధరలో తయారవుతుంది గనుక పెట్టుబడి భారం పెద్దగా ఉండదు. సాధారణ గౌన్ల తయారీదారులు కూడా మామూలు కుట్టుపని నైపుణ్యంతో వీటి ఉత్పత్తిని చేపట్టగలరు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632462

అంతర్జాతీయ సివిల్‌ సర్వెంట్ల కోసం ‘ప్రపంచ మహమ్మారి సమయంలో సుపరిపాలన’పై అంతర్జాతీయ వర్క్‌ షాపును ప్రారంభించిన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌-19పై పోరాటానికి ‘అవగాహనే తప్ప ఆందోళన కాదు’ అన్నది ప్రధాన సూత్రమని, అలాగే ఇందుకు అంతర్జాతీయ సహకారం కూడా అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు వెబినార్‌ద్వారా ఒక అంతర్జాతీయ వర్క్‌ షాపును ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. విదేశాంగ శాఖ పరిధిలోని భారత సాంకేతిక-ఆర్థిక సహకార విభాగం, జాతీయ సుపరిపాలన కేంద్రం, పరిపాలన సంస్కరణలు-ప్రజా ఫిర్యాదుల విభాగం ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కోవిడ్‌-19 మహమ్మారిపై ప్రపంచ పోరాటంలో విజయానికి అవసరమైన మార్గ ప్రణాళికలో ఆర్థిక పునరుద్ధరణ, సహకార సమాఖ్య తత్వ బలోపేతమే ప్రధాన ఆయుధాలని డాక్టర్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఆ మేరకు బలమైన సంస్థలు, బలమైన ఈ-ప్రభుత్వ నమూనాలు, డిజిటల్‌ సాధికారతగల పౌరులు, మెరుగైన ఆరోగ్య సంరక్షణలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632462

మెదడులోని శ్వాసకోశ కేంద్రం కుప్ప‌కూల‌డ‌మే కోవిడ్‌-19 రోగులు కోలుకోలేక‌పోవ‌డానికి కారణం: ఎస్ఈఆర్‌బీ మద్దతుగ‌ల అధ్యయనం వెల్లడి

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) పరిశోధకుల బృందం కరోనా వైరస్‌ (SARS-CoV-2) న్యూరో-ఇన్వేసివ్‌ సామర్థ్యాన్ని కనుగొంది. ఆ మేరకు వైరస్ మెదడులోని శ్వాసకోశ కేంద్రంపై దాడిచేస్తుందని సూచించింది, అందువల్ల కోవిడ్‌-19వల్ల మరణం సంభవించే కారణాల అన్వేషణలో భాగంగా కేంద్ర నాడీ వ్యవస్థలోని శ్వాశకోసం కేంద్రంపై దృష్టి సారించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632464

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: చండీగఢ్‌ సాంఘిక సంక్షేమశాఖ సాంఘిక వివిధ పౌష్టికాహార రూపాల్లో ఇంటింటికీ పంపిణీ చేసింది. ఈ మేరకు సుమారు 22,586మంది లబ్ధిదారులు- 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలతోపాటు గర్భిణులు, కోలుకుంటున్న తల్లులు, కౌమార బాలికలు ఈ పదార్థాలను అందుకున్నారు. దీంతోపాటు 53 అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు గుడ్లు, అరటిపండ్లు, పాలు కూడా పంపిణీ చేశారు. నగరంలోని వివిధ ప్రదేశాల్లోగల మురికివాడ ప్రాంతాలు, నిర్మాణ స్థలాలవద్ద కూడా  సుమారు 350 మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయబడింది.
  • పంజాబ్: రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిని మరింతగా అరికట్టే ప్రయత్నంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ వివిధ శాఖలు, డిప్యూటీ కమిషనర్లకు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ కమిషనర్లకు కేటాయించిన రూ.100 కోట్లకుగాను రూ.98కోట్ల మేర వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపడానికి రేషన్‌ సరకుల పంపిణీకి, నిర్బంధవైద్య సదుపాయాలకు వినియోగించారు.
  • హిమాచల్ ప్రదేశ్; కరోనా మహమ్మారిపై రాష్ట్రం సమర్థంగా పోరాడుతున్నందున పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌-19 రోగుల సంఖ్య వేగంగా పెరగడానికి కారణం దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తిరిగివచ్చిన సుమారు 2 లక్షల మందిలో అధికశాతానికి వ్యాధి నిర్ధారణ కావడమే కారణమన్నారు. వీరందర్నీ నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద 5.90 లక్షల మంది అర్హులైన మహిళలకు నెలకు రూ.500 వంతున ఏప్రిల్, మే, జూన్‌ నెలలకుగాను వారి ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. దీంతోపాటు 1.37 లక్షల మంది కార్మికులకు ఆర్థిక సహాయం కింద నెలకు తలా రూ. 2000 వంతున రెండు నెలలకు అందజేశామన్నారు. అంతేకాకుండా తాజాగా మరో రూ.2,000 వంతున హెచ్‌.పి.బిల్డింగ్స్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో నమోదైన కార్మికుల ఖాతాలలో జమచేస్తామని వెల్లడించారు.
  • మహారాష్ట్ర; రాష్ట్రంలో 3307 కొత్త కేసులతో మొత్తం రోగుల సంఖ్య 1,16,752కు చేరింది. వీరిలో 51,921 యాక్టివ్‌ కేసులుకాగా, 114 మరణాలు కూడా నమోదయ్యాయి, దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 5651కి పెరిగింది. ఇక తాజా సమాచారం ప్రకారం... రాష్ట్రంలో ఇప్పటిదాకా 59,166 మందికి వ్యాధి నయమైంది.
  • గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 520 కొత్త కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం రోగుల సంఖ్య 25,148 కాగా వీరిలో 17,438 మందికి వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లారు. ఇక గుజరాత్‌లో మొత్తం మరణాల సంఖ్య 1561కి చేరింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయందాకా 84 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 13,626కు పెరిగింది. అలాగే బుధవారం రాత్రి వరకు 326 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 10,582కాగా, ఇది దేశంలోనే అత్యుత్తమ రికవరీ శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. కాగా, నేటి కొత్త కేసుల్లో అధికశాతం భరత్‌పూర్ జిల్లాలో నమోదవగా, జైపూర్ జిల్లా తర్వాతి స్థానంలో ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో బుధవారం 161 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 11,244కు చేరాయి. కొత్త కేసుల్లో అధికశాతం భోపాల్ (49)లో నమోదవగా, హాట్‌స్పాట్ ఇండోర్ (44) రెండోస్థానంలో ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో నిన్న 71 కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1864కు చేరింది.  వీటిలో 756 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • గోవా: రాష్ట్రంలో బుధవారం 27 కొత్త కేసులు నమోదవగా 11 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 656కాగా, వీటిలో యాక్టివ్‌ కేసులు 560గా ఉన్నాయి. కాగా, సరిహద్దు ప్రాంతాలుసహా అన్ని నియంత్రణ జోన్లలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అధికసంఖ్యలో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. అయితే, కేవలం 8 నుంచి 10 మందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్పారు. కాగా, కోవిడ్ ప్ర్యతేక ఆస్పత్రులు లేదా సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సిన రోగులను వారికిగల వ్యాధి లక్షణాల ఆధారంగా ప్రభుత్వం వర్గీకరించింది.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ మరొకరు మరణించడంతో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 21కి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మృతుడు కన్నూర్‌లోని వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, ఇతడు ఎక్సైజ్ విభాగంలో పనిచేసే 28 ఏళ్ల డ్రైవర్ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో అతని సంక్రమణ మూలాలను కనుగొనటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా కోచ్చిలో  ఒక పోలీస్ అధికారికి వ్యాధి నిర్ధారణ అయింది; ఈయన గృహ నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉన్నవారిపై నిఘా విధుల్లో ఉన్నారు. వందేభారత్‌ కింద రాష్ట్రానికి వచ్చే విదేశీయులు కోవిడ్‌ నెగటివ్‌ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడంవల్ల వారు ప్రవాస భారతీయులు మరిన్ని ఇబ్పందుల్లో పడతారని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా అన్నారు. మరోవైపు రాష్ట్రం వెలుపల మరో ఇద్దరు కేరళీయులు కోవిడ్‌-19కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్న 90మంది కోలుకోగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి.  వివిధ ఆసుపత్రులలో ప్రస్తుతం 1,351 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా తమిళనాడు నుంచి దొంగచాటుగా ప్రవేశిస్తున్న వారిని అడ్డుకునేందుకు పాతన యంత్రాంగం కరైకల్ సరిహద్దువద్ద నిఘా ముమ్మరం చేసింది. ఇక తమిళనాడులో మార్చి 25 నుంచి మే 7 మధ్య సిబ్బంది ఉద్యోగ విధుల గైర్హాజరీని సెలవుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రేపటినుంచి చెన్నైసహా పొరుగు జిల్లాల్లో 12 రోజులపాటు కఠిన దిగ్బంధం అమలవుతుంది. రాష్ట్రంలో నిన్న 2174 కొత్త కేసులు నమోదవగా, 842మంది కోలుకున్నారు; 48 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో చెన్నై నుంచి 1276 నమోదవగా, ప్రస్తుతం మొత్తం కేసులు: 50193, యాక్టివ్ కేసులు: 21990, మరణాలు: 576, డిశ్చార్జ్: 27624, చెన్నైలో యాక్టివ్ కేసులు: 16067గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19పై చైతన్యం పెంపు దిశగా ఇవాళ 'మాస్క్ డే' నిర్వహించారు. కాగా, ఇప్పటిదాకా 267 శ్రామిక్ రైళ్లద్వారా 3,79,195 మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కర్ణాటకలో నిన్న 204 కొత్త కేసులు నమోదవగా, 348 మంది డిశ్చార్జి అయ్యారు; 8 మంది మరణించారు. మొత్తం కేసులు: 7734, యాక్టివ్‌ కేసులు: 2824, మరణాలు: 102, డిశ్చార్జి అయినవారు: 4804 మంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 13,923 నమూనాలను పరీక్షించగా- 299 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. మరో 77మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం మొత్తం కేసులు: 5854గా ఉన్నాయి. వీటిలో యాక్టివ్: 2779, కోలుకున్నవి: 2983, మరణాలు: 92గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1353 కేసులు నిర్ధారణ కాగా, వాటిలో 611 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడచిన 24 గంటల్లో 51 మంది డిశ్చార్జ్ కాగా, విదేశాల నుండి వచ్చినవారిలో 289 మంది వ్యాధి నిర్ధారణ అయింది. వీటిలో 242 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • తెలంగాణ: కోవిడ్‌-19 రోగుల నుంచి వసూలు చేయాల్సిన సొమ్ముకు గరిష్ఠ పరిమితి విధించడంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. గాంధీ ఆస్పత్రి శవాగారం వద్ద గందరగోళం తీవ్రం కావడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి ఆసుపత్రి యంత్రాంగం ఇబ్బందులు పడుతోంది. కాగా, గురువారం శవాగారం సిబ్బంది ఒకరి శవం బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన నేపథ్యంలో ఈ గందరగోళం రేగింది. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5675; యాక్టివ్ కేసులు: 2,412 కాగా; 3071మంది కోలుకున్నారు.
  • అసోం: రాష్ట్రంలో 82 కొత్త కేసుల నమోదుతో  మొత్తం కేసుల సంఖ్య 4777కు చేరగా వీటిలో 2111 యాక్టివ్‌ కేసులున్నాయి. కోలుకున్నవారు 2658 మంది కాగా, 9 మరణాలు నమోదయ్యాయి.
  • మణిపూర్: రాష్ట్రం మరో  ఐదు ఆర్టీ-పీసీఆర్‌ యంత్రాలు, 3 ట్రూనాట్‌ యంత్రాలు ఏర్పాటు చేయడంతో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగింది. మణిపూర్‌లో ఇప్పటిదాకా 29,865 నమూనాలను పరీక్షించారు.
  • మిజోరం: మిజోరంలోని కోలాసిబ్ జిల్లాలో 9 కోవిడ్‌-19 రోగులకు రెండుసార్లు పరీక్షల్లో వ్యాధి సోకలేదని తేలింది. వీరిని రేపు జోరం వైద్య కళాశాల ఆస్పతినుంచి ఇళ్లకు పంపే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.
  • నాగాలాండ్: నాగాలాండ్‌లోని దిమాపూర్-కొహిమా టాక్సీ సేవలు సరి-బేసి సంఖ్య విధానంలో తిరిగి మొదలయ్యాయి. అలాగే చిన్న కార్లలో ముగ్గురు, పెద్ద కార్లలో ఐదుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక దిమాపూర్‌లోని బిఎస్‌ఎల్-2 ప్రయోగశాలలోని సాంకేతిక బృందానికి శిక్షణ ఇవ్వడం కోసం అసోంలోని జోర్హాట్ జిల్లానుంచి శాస్త్రవేత్తలు వచ్చారు. ఇక లాంగ్లెంగ్, హు్యన్సాంగ్‌ వద్ద ట్రూనాట్ యంత్రాలను ఏర్పాటు చేశారు.

 

****



(Release ID: 1632473) Visitor Counter : 242