గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణ భారత్ అంతటా 2026 జులై 1 నుంచి అమలు కానున్న ‘వికసిత్ భారత్ - జీ రామ్ జీ’ చట్టం
125 రోజుల చట్టబద్ధమైన పని దినాలకు హామీతో గ్రామీణ జీవనోపాధి బలోపేతం
ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంజీఎన్ఆర్ఈజీఏ నుంచి వికసిత్ భారత్ జీ రామ్ జీకు మారేందుకు భరోసా
ఉపాధిని, జీవనోపాధిని, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ. 95,692 కోట్ల చరిత్రాత్మక కేటాయింపులు
ప్రస్తుతమున్న జాబ్ కార్డులు చెల్లుబాటవుతాయి, చేపడుతున్న పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 12:09PM by PIB Hyderabad
భారత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యమైన కార్యక్రమైన ‘వికసిత్ భారత్ - రోజ్గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్)(వీబీ- జీ రామ్ జీ) చట్టం - 2025’ను దేశవ్యాప్తంగా 2026 జులై 1 నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2026 మే 11 న నోటిఫై చేసింది.
వీబీ- జీ రామ్ జీ చట్టం అమలులోకి వచ్చిన రోజునే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ)-2005 రద్దవుతుంది. భారత గ్రామీణాభివృద్ధి విధానంలో చరిత్రాత్మక మార్పుగా ఇది నిలుస్తుంది. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా సమీకృతమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన, ఉత్పాదక ఆధారిత గ్రామీణాభివృద్ధి అనే నూతన యుగానికి నాంది పలుకుతుంది.
కొత్త విధానం ప్రకారం, నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమను చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 పని దినాలకు చట్టబద్ధమైన హామీ లభిస్తుంది. జీవనోపాధి భద్రతను బలోపేతం చేయడం, గ్రామీణ ఆదాయాలను మెరుగుపరచడం, గ్రామస్థాయిలో సుస్థిరాభివృద్ధికి మద్దతు అందించడమే మెరుగుపరిచిన ఈ హామీ లక్ష్యం.
వీబీ - జీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ఇక్కడ చూడండి
కార్మికుల డిమాండు ఆధారంగా నిర్ణీత గడువులో ఉపాధి లభిస్తుంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిరుద్యోగ భృతికి అర్హులవుతారు.
సకాలంలో, పారదర్శకంగా వేతనాల చెల్లింపులకు ఈ చట్టం ప్రాధాన్యమిచ్చింది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానం ద్వారా కార్మికుల బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాలకు నేరుగా వేతనాలు జమవుతాయి. వారానికోసారి లేదా మస్టర్ రోల్ ముగిసిన పదిహేను రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి. అలా చేయని పక్షంలో చట్టంలోని నిబంధనల ప్రకారం ఆలస్యానికి నష్టపరిహారం పొందేందుకు కార్మికులు అర్హులవుతారు.
వికసిత్ భారత్ - జీ రామ్ జీ చట్టం - 2025ను సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ఆర్థిక కేటాయింపులు చేసింది. ఆర్థిక సంవత్సరం 2026–27లో రూ. 95,692.31 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. గ్రామీణ ఉపాధి కార్యక్రమం కోసం బడ్జెట్ అంచనా దశలో ఇప్పటి వరకు చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం.
రాష్ట్రాల నుంచి అందే వాటాను కూడా జోడిస్తే.. ఈ కార్యక్రమానికి కేటాయించిన అంచనా వ్యయం రూ.1.51 లక్షల కోట్లను అధిగమిస్తుంది. ఈ కేటాయింపులు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆదాయం పెరుగుదలకు తోడ్పాటు అందిస్తుందని భావిస్తున్నారు.
సులభమైన, ఎలాంటి ఆటంకాలు లేని, కార్మికులకు అనుకూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు కొత్త చట్టం అమల్లోకి వచ్చే తేదీ వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిధిలో కేటాయించిన పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. జూన్ 30 వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిధిలో కొనసాగుతున్న పనులను వికసిత్ భారత్ జీ రామ్ జీ నిబంధనల ప్రకారం ఎలాంటి అంతరాయం లేకుండా నూతన విధానం కిందకు తీసుకువస్తారు. గ్రామీణ ప్రాంత శ్రామికులకు సకాలంలో పనులను కల్పించడం, వేతనాలు చెల్లించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది.
డిమాండ్ సరళికి, క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరిపడినంత కార్మిక బడ్జెట్ కేటాయింపులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీని వల్ల వీబీ-జీ రామ్ జీ చట్టం అమలుకు ముందు కాలంలో అర్హత కలిగిన ఏ గ్రామీణ కుటుంబమూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటుంది.
గ్రామీణ్ రోజ్గార్ హామీ కార్డులు జారీ చేసేంత వరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఈ-కేవైసీ, ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులే వీబీ - జీ రామ్ జీ పరిధిలోనూ చెల్లుబాటవుతాయి. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీ స్థాయిలో నమోదు చేసుకోవచ్చు. ఈ-కేవైసీ పెండింగులో ఉందన్న కారణంతో ఏ కార్మికునికీ ఉపాధిని నిరాకరించకూడదు. క్షేత్ర స్థాయిలో ఈ-కేవైసీని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించిన అనంతరం వీబీ- జీ రామ్ జీ చట్టం - 2025 పరిధిలో వివిధ ముసాయిదా నియమాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.
-
నిర్దేశిత కేటాంయిపుల కోసం లక్ష్య ప్రమాణాల నిబంధనలు
-
మార్పులకు సంబంధించిన నిబంధనలు
-
జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ నిబంధనలు
-
కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ మండలి నిబంధనలు
-
పరిపాలనా వ్యయ నిబంధనలు
-
ఫిర్యాదు పరిష్కార నిబంధనలు
-
వేతనాలు, నిరుద్యోగ భృతి చెల్లింపుల విధాన నిబంధనలు
-
అధిక వ్యయాన్ని భరించే విధానం, పద్ధతులకు సంబంధించిన నిబంధనలు
-
శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంలో ఈ పథకం ఖర్చులను భరించడానికి సంబంధించిన నిబంధనలు
మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ నుంచి వీబీ-జీ రామ్ జీకు మార్పు సజావుగా మారేందుకు, మార్పులకు సంబంధించిన నియమాల్లో తగిన నిబంధనలను చేరుస్తున్నారు. ఇవి త్వరలోనే ప్రచురితమవుతాయి. పైన పేర్కొన్న ఇతర నియమాలు సైతం సిద్ధమయ్యాయి. ప్రజల నుంచి సూచనలను స్వీకరించేందుకు త్వరలోనే వాటిని కూడా ప్రచురిస్తారు.
ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వావలంబనకు వికసిత్ భారత్ - జీ రామ్ జీ చట్టం - 2025 కొత్త వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిలో గ్రామ పంచాయతీలనే కేంద్రంగా ఉంచడం ద్వారా బలమైన, సుభిక్షమైన, అభివృద్ధి చెందిన గ్రామీణ భారత్ నిర్మాణంలో కీలమైన ఘట్టాన్ని ఈ చట్టం సూచిస్తుంది.
ఎఫ్ఏక్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివరణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(రిలీజ్ ఐడి: 2259836)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Nepali
,
Bengali-TR
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Kannada