PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
08 SEP 2020 6:30PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ తనిఖీ చేసి నివేదించిన వాస్తవాంశాలు ఇందులో లభ్యమవుతాయి)
• దేశంలో 33 లక్షలు దాటిన కోవిడ్ వ్యాధి నయమైనవారి సంఖ్య; మొత్తం కేసులలో కోలుకున్నవారి సగటు 77 శాతం
• దేశవ్యాప్తంగా 5 కోట్ల కోవిడ్ పరీక్షలతో సరికొత్త శిఖరం చేరిన భారత్;
• ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు స్థిరంగా పెరుగుతూ నేడు 36,073కి చేరిక.
• మొత్తం నమోదైన కేసులలో మరణాలు ప్రపంచ సగటుకన్నా అత్యల్పంగా 1.70 శాతానికి పరిమితం
దేశంలో 33 లక్షలు దాటిన కోవిడ్ వ్యాధి నయమైనవారి సంఖ్య; మొత్తం కేసులలో కోలుకున్నవారి సగటు 77 శాతం
దేశంలో కోవిడ్-19బారిన పడినవారిలో ఇప్పటిదాకా 77 శాతానికిపైగా కోలుకున్నారు. దీంతో వ్యాధి నయమైనవారి సంఖ్య 33 లక్షలు (3,323,950) దాటింది. ఒకేరోజులో కోలుకునేవారి సంఖ్య గరిష్ఠ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో గత 24 గంటల్లో 73,521 మంది డిశ్చార్జి అయ్యారు. ఆ మేరకు కోలుకున్న రోగుల సంఖ్య చురుకైన (8,83,697) కేసులకన్నా 24 లక్షలకు మించి అంటే 3.7 రెట్లు అధికంగా నమోదైంది. అలాగే నమోదిత కేసులలో మరణాలు కూడా ప్రపంచ సగటుకన్నా తక్కువగా ఇవాళ 1.70శాతానికి పరిమితమైంది.
దేశంలో 5 కోట్ల కోవిడ్ పరీక్షలతో సరికొత్త శిఖరం చేరిన భారత్; ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు స్థిరంగా పెరుగుతూ నేడు 36,073కి చేరిక
కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా మొత్తం 5 కోట్లకుపైగా నమూనాల పరీక్షతో భారత్ సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఈ ఏడాది జనవరిలో పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాలలో రోజుకు కేవలం ఒకేఒక పరీక్ష నిర్వహించే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా 5,06,50,128 పరీక్షలు పూర్తిచేసే స్థాయి దూసుకెళ్లింది. ఈ విస్తృత పరీక్షల నిర్వహణ సామర్థ్యానికి అనుగుణంగా గత 24 గంటల్లో 10,98,621 పరీక్షలు నిర్వహించారు. నేటి కొత్త రికార్డుతో ప్రతి 10 లక్షల జనాభాకు వారంవారీ దైనందిన పరీక్షల సగటు వేగంగా విస్తరిస్తూ జూలై మూడో వారం (3,26,971) నుంచి సెప్టెంబర్ తొలి వారం నాటికి (10,46,470) 3.2 రెట్లు పెరిగింది. దేశంలో జూలై 1న 6396గా ఉన్న రోజువారీ పరీక్షల సగటు ఇవాళ 36,703 స్థాయికి దూసుకెళ్లింది. దేశవ్యాప్తంగా ప్రయోగశాలల నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తూ నేడు ప్రభుత్వ రంగంలో 1035, ప్రైవేటు రంగంలో 633 వంతున మొత్తం 1668 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652324
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఇ-సంజీవని’ దూరవాణి వైద్య సేవద్వారా 3 లక్షల సంప్రదింపులు; గత 20 రోజుల్లోనే లక్ష నమోదు
దేశవ్యాప్తంగా దూరవాణి-సంప్రదింపులద్వారా వైద్య సేవలందించే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వేదిక ‘ఇ-సంజీవని’ ఇప్పటిదాకా 3 లక్షల సంప్రదింపులు పూర్తిచేసింది. కాగా, గతనెల 9వ తేదీన 1.5 లక్షల సంప్రదింపులు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన అభినందన సమావేశానికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. అప్పటి నుంచి కేవలం నెల వ్యవధిలో సంప్రదింపుల సంఖ్య రెట్టింపుగా పెరిగింది. ఇందులో ఏకంగా లక్షదాకా కేవలం 20 రోజుల్లోనే నమోదవడం విశేషం. ఇక ఈ వేదికద్వారా తొలి 1,00,000 సంప్రదింపులు 2020 జూలై 23న పూర్తికాగా, రెండో లక్ష 2020 ఆగస్టు 18న 26 రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి. భౌతిక దూరం పాటించడానికి భరోసా ఇస్తూ ఈ దూరవాణి వైద్య సంప్రదింపుల విధానం రోగులను-డాక్టర్లను అనుసంధానిస్తుంది. కోవిడ్ తీవ్ర అంటువ్యాధి కావడంవల్ల ప్రత్యక్ష సంప్రదింపులతో ఈ మహమ్మారి విస్తరించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో దూరవాణి వైద్య సంప్రదింపులు విధానం అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలందించింది. కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 13న ‘eSanjeevaniOPD’ని ప్రారంభించింది. దీన్ని ఇప్పటిదాకా 23 రాష్ట్రాలు అమలు చేయగా, మిగిలిన రాష్ట్రాలు అదే బాటలో నడవనున్నాయి. కాగా, దేశం మొత్తంమీద తమిళనాడు ఒక్కటే 97,204 సంప్రదింపులు నిర్వహించింది. అటుపైన 65,173 సంప్రదింపులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652412
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన- ఇప్పటిదాకా పీఎంజీకేపీ కింద 42 కోట్లమందికిపైగా పేదలకు రూ.68,820 కోట్ల మేరకు ఆర్థిక సహాయం
కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ' (PMGKP)లో భాగంగా మహిళలు, పేద వృద్ధపౌరులు, రైతులకు ఉచిత ఆహార ధాన్యాలతోపాటు నగదు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేయడంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పీఎంజీకేపీ కింద సుమారు 42 కోట్ల మంది పేదలకు రూ.68,820 కోట్ల మేర ఆర్థిక సహాయం లభించింది. తదనుగుణంగా పీఎం-కిసాన్ కింద తొలివిడత 8.94 కోట్ల మంది లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన రూ.17,891 కోట్లు విడుదల చేసింది. అలాగే 20.65 కోట్ల (100%) మంది మహిళా జన్ధన్ ఖాతాదారులకు తొలివిడతగా రూ.10,325 కోట్ల దాకా జమయ్యాయి. దీంతోపాటు రెండో విడతగా 20.63 కోట్లమంది లబ్ధిదారులకు రూ.10,315 కోట్లు (100%) జమయ్యాయి. ఇక మూడోవిడత కింద 20.62 కోట్ల (100%) మందికి రూ.10,312 కోట్లు జమ అయ్యాయి. ఇక 2.81 కోట్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు విడతలుగా రూ.2,814.5 కోట్లు పంపిణీ అయ్యాయి. కాగా, 1.82 కోట్ల మంది భవన-నిర్మాణ కార్మికులకు రూ.4,987.18 కోట్ల ఆర్థిక సహాయం లభించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652412
నోయిడాలోని ఈఎస్ఐసీ ఆస్పత్రి-డిస్పెన్సరీలలో సేవాలోపం వార్తలపై వివరణ ఇచ్చిన ఈఎస్ఐసీ
ఈఎస్ఐ ఆస్పత్రిలోని రోగులు, పథకం లబ్ధిదారులకు నోయిడాలోని ఈఎస్ఐసీ ఆస్పత్రి, డిస్పెన్సరీలలో వైద్యసేవలు సరిగా అందడంలేదంటూ వచ్చిన వార్తలపై ఈఎస్ఐసీ వివరణ ఇచ్చింది. ఈ మేరకు తమ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలతోపాటు ప్రత్యేక వైద్య సేవలు కూడా సవ్యంగా అందిస్తున్నట్లు పేర్కొంది. తమ ఆస్పత్రి గణాంకాలే ఈ వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=16512239
గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద 2020 సెప్టెంబర్ 4దాకా 8,09,000కు పైగా పనిదినాలు సృష్టించిన భారత రైల్వేశాఖ
దేశంలోని 6 రాష్ట్రాలలో గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద 2020 సెప్టెంబర్ 4 వరకు భారత రైల్వేశాఖ 8,09,046 పనిదినాలను సృష్టించింది. ఈ మేరకు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిసా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో ఈ కార్యక్రమం కింద సాధించిన ప్రగతిని రైల్వే, వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నిశితంగా సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధి కల్పనను పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో సుమారు 164 రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులు అమలవుతుండగా 2020 సెప్టెంబర్ 4 వరకు 12,276 మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ పనులకు సంబంధించి రైల్వేశాఖ కాంట్రాక్టర్లకు రూ.1,631.80 కోట్లు చెల్లించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652410
కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థలో భారత వ్యాపార సమాఖ్య పాత్ర కీలకం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దేశంలో కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ ముందంజతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న స్వయం సమృద్ధ భారతాన్ని సాకారం చేయడంలో భారత వ్యాపార సమాఖ్య (IMC) పాత్ర కీలకమైనదని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. నిన్న సమాఖ్య 114వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఐఎంసీకి అద్భుతమైన గతంతోపాటు గొప్ప వారసత్వం ఉందని, ఆ మేరకు భవిష్యత్పై అంచనాలు కూడా ఉన్నతంగా ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్ అనంతర పరిస్థితులలో ప్రపంచం మొత్తం కోలుకునే ప్రయత్నం చేస్తున్నపుడు భారత్కు మాత్రం మహమ్మారి సవాళ్లే అవకాశాలయ్యయని గుర్తుచేశారు. ఆ మేరకు స్థానికంగా అందుబాటులోగల వాటి వినియోగంతోపాటు లేనివాటి సృష్టి లేదా ఉత్పాదనపై ఆకాంక్షలకు ప్రతిరూపమే “స్థానికత కోసం స్వగళం" (లోకల్ ఫర్ వోకల్) సారాంశమని డాక్టర్ సింగ్ వివరించారు. ఆ మేరకు శాంతియుతంగా, ప్రగతిశీల, సుసంపన్న రీతిలో స్వావలంబన భారతాన్ని నిర్మించడం దీని లక్ష్యమని మంత్రి అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652475
మహమ్మారి సమయంలో ఏప్రిల్ 1 నుంచి 94.41 లక్షల అభ్యర్థనలను పరిష్కరించిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఆంక్షలున్నప్పటికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మొత్తం 94.41 లక్షల అభ్యర్థనలను పరిష్కరించింది. తద్వారా 2020 ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య చందాదారులకు దాదాపు రూ.35,445 కోట్లు పంపిణీ చేసింది. నిరుడు ఇదే వ్యవధి ((ఏప్రిల్-ఆగస్టు 2019)తో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా అభ్యర్థనలను పరిష్కరించింది. అంతేకాకుండా పంపిణీ చేసిన మొత్తం కూడా 13 శాతం అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా 2020 ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య పరిష్కరించిన 55 శాతం ముందస్తు అభ్యర్థనలు ఇటీవల ప్రవేశపెట్టిన కోవిడ్-19 అడ్వాన్స్కు సంబంధించినవి కాగా, మరో 31 శాతం అనారోగ్య కారణాలతో దాఖలైనవి కావడం గమనార్హం.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652456
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో దిగ్బంధం నిబంధనలను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరికొంత సడలించారు. ఇందులో భాగంగా అత్యవసరం కాని దుకాణాలను శనివారం తెరవడానికి అనుమతించారు. ఈ మేరకుసోమవారం నుంచి శనివారందాకా రాత్రి 9 గంటలదాకా తెరిచేందుకు అనుమతిస్తూ సడలింపు ప్రకటించారు. అయితే, రాత్రి 9.30 నుంచి అన్ని నగరాలు/పట్టణాల్లో తెల్లవారుజామున 5 గంటలదాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
- హర్యానా: రాష్ట్రంలో కోవిడ్-19 సంక్షోభాన్ని అవకాశంగా మారుస్తూ హర్యానాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ప్రవేశ వేదికను హర్యానా ముఖ్యమంత్రి వాస్తవిక సాదృశ్ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఈ వేదికద్వారా ఇప్పుడు విద్యార్థులు ఇంట్లోనుంచే ప్రవేశ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అంతేగాక విద్యార్థుల ప్రవేశ సంబంధిత సమస్యల పరిష్కారానికి తొట్టతొలి విద్యా వాట్సాప్ చాట్బాట్ ‘అప్కా మిత్ర’ను ప్రారంభించారు. ప్రవేశాలు, స్కాలర్షిప్కు సంబంధించి ఏదైనా సమాచారం కోసం విద్యార్థులు వాట్సాప్ చాట్బాట్ నంబర్ 74194 44449కు సందేశం పంపాలి.
- హిమాచల్ ప్రదేశ్: జాతీయ విద్యా విధానం అమలులో హిమాచల్ ప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, విశ్వవిద్యాలయాల కులపతులతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ నిర్వహించిన దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో దత్తాత్రేయ ఈ మేరకు వివరించారు. కరోనా మహమ్మారివల్ల ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ఈ దిశగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 180 కొత్త కోవిడ్ కేసులు నమోదవగా, 124 మంది కోలుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో కోలుకునే సగటు 69 శాతంకాగా, ప్రస్తుతం 1576 క్రియాశీల కేసులున్నాయి.
- అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2250 మంది కోలుకోగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1,28,244గా ఉంది. వీరిలో ఇప్పటిదాకా మొత్తం 99073 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, ప్రస్తుతం28,798 క్రియాశీల కేసులున్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలో 84 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కోలుకునే సగటు 75 శాతంకాగా, 194 మందికి వ్యాధి నయమైంది. మణిపూర్లో ప్రస్తుతం 1710 క్రియాశీల కేసులుండగా రాష్ట్ర ప్రభుత్వం నంబర్- 18003453818తో నిరంతర కోవిడ్ సహాయ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.
- మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 1457గా ఉంది. ఈ రోగులలో 314 మంది బీఎస్ఎస్, సాయుధ దళాలకు చెందినవారు. కాగా, ఇప్పటివరకూ 1560 కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 9 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1123కు చేరాయి. వీటిలో ప్రస్తుతం 391 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలోని కోహిమాలో బస్సు ప్రయాణం కోసం సీట్లను ఎగుడు-దిగుడు వరుసలలో ఏర్పాటు చేశారు. ఏ బస్సులోనైనా ప్రయాణికులు నిలుచునేందుకు అనుమతి ఉండదు. దీంతోపాటు బస్సులను అధికారులు నిత్యం తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 19 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 538గా ఉంది. ఇప్పటిదాకా 1,403 మంది రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
- కేరళ: దిగ్బంధ విముక్తి-4లో భాగంగా దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న తరహాలోనే కేరళలోనూ బార్లను తెరవాలని ఎక్సైజ్ విభాగం సిఫారసు చేసింది. కాగా, ప్రముఖ మలయాళ నాటక రచయిత కె.ఎ.ఉమ్మర్కుట్టిసహా ఇవాళ నలుగురు కోవిడ్ పీడితులు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 363కు చేరింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయ చర్యలు అనుసరించిన కారణంగానే వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని భారత వైద్యనిపుణుల సంఘం (IMA) కేరళ శాఖ ఆరోపించింది. కాగా, కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ఉప ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నిన్న 1,648 కొత్త కేసులు నమోదవగా 22,066 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 2,00,651 మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం ఉదయం 10 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 440 కొత్త కేసులతోపాటు 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సగటు 1.9 శాతానికి పెరిగింది. ఇక పుదుచ్చేరిలో మొత్తం కేసుల సంఖ్య 17,749 కాగా, వీరిలో 12,581 మంది కోలుకోగా, 337 మంది మరణించారు. ప్రస్తుతం 4831 క్రియాశీల కేసులున్నాయి. కాగా, తమిళనాడు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశం సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు చెన్నైలోని కలైవానర్ అరంగంలో జరుగుతుంది. వీటికి హాజరయ్యేవారంతా 72 గంటలు ముందుగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇక బుధవారం నుంచి కొడైకెనాల్ సందర్శించేవారికి ప్రభుత్వం అనుమతిస్తుంది.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులవల్ల ఈసారి మైసూరు దసరా వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, దసరా వేడుకల్లో భాగంగా తొలుత చాముండేశ్వరీ దేవికి పూజల సందర్భంగా వైద్యులు, నర్సులు, పౌర-ఆశా కార్యకర్తలు, పోలీసులు సహా కోవిడ్ యోధులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే వారంనుంచి కోర్టులు పనిచేయడం ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటి 5,06,493కు చేరింది. సోమవారం నాటికి మరణాల సంఖ్య కూడా 4,487కు పెరిగింది. కాగా, కర్ణాటకలో నిర్ధారిత కేసుల సగటు 12.16 శాతానికి పెరిగినప్పటికీ కోలుకునేవారి సగటు కూడా 79.78 శాతానికి పెరిగింది. మరోవైపు మరణాల సగటు 0.89 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2020 మార్చి 12న తొలి కేసు నమోదవగా, 180 రోజులలో ఈ సంఖ్య 5 లక్షలకు చేరింది. కాగా, ఇందులో చివరి 2 లక్షల కేసులు కేవలం 20 రోజులలోనే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా వ్యతిరేక చర్యలను ముఖ్యమంత్రి ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించిన సందర్భంగా- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2392 కొత్త కేసులు,11 మరణాలు నమోదవగా 2346 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 304 జీహెచ్ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,45,163; క్రియాశీల కేసులు: 31,670; మరణాలు: 906; డిశ్చార్జి: 1,12,587గా ఉన్నాయి. కాగా, తెలంగాణలో కోవిడ్-19 రోగుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బోధన, ఇతర ఆస్పత్రులలో 17,734 పడకలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ రోజువారీ సమాచార పత్రం పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలలో కోవిడ్ వ్యాప్తికి సంబంధించి జాతీయ స్థాయిన రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వారికి నాసిరకం పీపీఈ కిట్లు సరఫరా చేయడమే ఇందుకు కారణమని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనల సడలింపు తర్వాత పరీక్ష కిట్ల ఉత్పత్తి పెరిగి, వ్యయం తగ్గడంతో ప్రైవేటు ప్రయోగశాలలు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ కోవిడ్-19 పరీక్షల రుసుమును మహారాష్ట్ర ప్రభుత్వం మరింత తగ్గించింది. ఈ మేరకు గత నెలలో నిర్ణయించిన రూ.1,900 ధరను రూ.1,200కు తగ్గించింది. అలాగే కియోస్క్లు, కోవిడ్-19 సంరక్షణ ప్రాంగణాల్లోని సేకరణ కేంద్రాలు, ఆస్పత్రులు, క్లినిక్లు, ప్రయోగశాలల దిగ్బంధ కేంద్రాలలో ఇంతకుముందు రూ.2,200 వసూలు చేస్తుండగా ఇప్పుడు రూ.1,600గా నిర్ణయించింది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో అక్టోబర్ 31 నాటికి కరోనావైరస్ చికిత్స కోసం 3,600 ఆక్సిజన్ పడకలు, 564 ఐసీయూ పడకలను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనావైరస్ పరిస్థితిపై సమీక్షకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం పూర్తయిన అనంతరం వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఈ మేరకు వెల్లడించారు. ఇక కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు తొలినాళ్లలో వసూలు చేసిన రుసుములకు 40 శాతం మాత్రమే ఇప్పుడు అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.
- ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో 2,017 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 47,280కి పెరిగింది. మరోవైపు 15 తాజా మరణాలతో మృతుల సంఖ్య కూడా 395కు చేరింది. మొత్తం 28 జిల్లాల్లో నమోదైన 2,017 తాజా కేసులకుగాను రాయ్పూర్ (654)లో గరిష్ఠంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 16,866 కేసులతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా 207మంది మరణించారు.
FACTCHECK
***
(Release ID: 1652476)
Visitor Counter : 237