సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'ను ప్రారంభించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
వేవ్స్ సదస్సులో 51 మీడియా టెక్ అంకుర సంస్థలు, వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలతో మంత్రి భేటీ
సృజనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి ఐఐసీటీ చేపట్టిన ఏఐ వినియోగ కార్యక్రమాన్ని కొనియాడిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 11:06AM by PIB Hyderabad
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రెండో రోజున వేవ్స్ క్రియేటర్స్ కార్నర్ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పనిచేసే ప్రయోగాత్మక ఆవిష్కరణ వేదికగా రూపొందించిన ఈ పెవిలియన్, ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, విస్తృత వాస్తవికత) రంగంలో కృత్రిమ మేథ వల్ల కలిగే విప్లవాత్మక మార్పులను ప్రదర్శించేలా తీర్చిదిద్దారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ చేపట్టిన కీలక కార్యక్రమాలైన వేవ్ఎక్స్, వేవ్స్ బజార్, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్లకు వ్యూహాత్మక విస్తరణ ‘వేవ్స్ క్రియేటర్స్ కార్నర్’ అని స్పష్టం చేశారు. పెవిలియన్ను పరిశీలించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్ వేవ్ ఎక్స్ స్టార్టప్ కోహోర్ట్ యువ పారిశ్రామికవేత్తలతో, అడోబీ, నెట్ఫ్లిక్స్, సోనీ, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో ముచ్చటించారు.
51 అంకుర సంస్థలకు దక్కిన గుర్తింపు
మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి భారీ ఊతమిస్తూ, వేవ్ఎక్స్ మద్దతుతో 51 వర్ధమాన ఏవీజీసీ-ఎక్స్ఆర్, మీడియా టెక్ స్టార్టప్లు, ఏఐ ఆధారిత పరిష్కారాలను, దృశ్య అనుభూతిని కలిగించే సాంకేతికతలను పెవిలియన్లో ప్రదర్శించాయి. భాషా సేతు, కళా సేతు విజేతలతో పాటు వ్యవస్థాపకులతో కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సంభాషించారు.
శ్రద్ధా శర్మతో ఆత్మీయ సంభాషణ
మీడియా లాంజ్లో యువర్స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మతో ఉన్నత స్థాయి ముఖాముఖి సంభాషణలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సమాజంపై ఏఐ ప్రభావం గురించి ఆయన దృక్పథాన్ని ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా, గ్రామీణ భారతంలోని ప్రతిభావంతులు ప్రపంచ స్థాయి అంకుర సంస్థలను నెలకొల్పేందుకు సాంకేతికత వారధిలా నిలుస్తూ, అడ్డంకులను తొలగిస్తుందని ఆయన తెలిపారు.
వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లోని కీలక సాంకేతిక విశేషాలు
అత్యాధునిక ఏఐ అనుభూతులను ఈ పెవిలియన్ ప్రదర్శించింది. రియల్ టైమ్ గేమ్ డెవలప్మెంట్, ప్రాంప్ట్-టు-సినిమా లైవ్ స్టూడియోల నుంచి ఏడబ్ల్యూఎస్, భారత్-జెన్ సంయుక్తంగా రూపొందించిన ఏజెంటిక్ ఏఐ ఆధారిత వార్తా విభాగం వరకు ఇందులో ఉన్నాయి. ఇది వార్తా సంపాదకీయాలను ఆటోమేటిక్గా నిర్వహిస్తుంది. ఇతర ఆవిష్కరణల్లో సర్వం రియల్ టైమ్ వాయిస్ క్లోనింగ్, బహుభాషా సంభాషణలకు ఇండస్ చాట్ యాప్, ఎన్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన 270-డిగ్రీల ఏఐ చలనచిత్ర స్క్రీనింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ముఖం, గొంతు వయసును మార్చే సోనీ రీసెర్చ్ ఇండియా సాంకేతికతను, విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్కు సంబంధించి, కేవలం ఒక డీఎస్ఎల్ఆర్ లేదా ఐఫోన్ ద్వారా పనిచేసే మార్కర్ లెస్ మోషన్ క్యాప్చర్ను కూడా ప్రదర్శించారు.
సామర్థ్య పెంపుదల, భవిష్యత్తు సన్నద్ధత:
అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, సృజనాత్మక విద్యలో ఏఐని అనుసంధానం చేస్తున్నందుకు ఐఐసీటీని మంత్రి ప్రశంసించారు.
వేవ్స్ క్రియేటర్స్ కార్నర్:
నిపుణుల చర్చలకు, సినీరూపకర్తల మాస్టర్ తరగతులకు, అంతర్జాతీయ దిగ్గజాల సాంకేతిక సెషన్లకు వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2229578)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada