ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక సమ్మిళిత్వం దిశగా పెనుమార్పులు తెచ్చిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకానికి 11 ఏళ్లు
• గత పదకొండేళ్లలో కొత్తగా 56 కోట్ల కన్నా ఎక్కువ జన్ ధన్ ఖాతాలు..
రూ.2.68 లక్షల కోట్ల డిపాజిట్లు: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
• గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 67 శాతం కొత్త ఖాతాలు...
మహిళల పేరిట 56 శాతం ఖాతాలు...అణగారిన వర్గాల వారికీ అందుబాటులో ఆర్థిక సేవలు: శ్రీమతి నిర్మలా సీతారామన్
• ఆత్మగౌరవానికి, సాధికారతకు, అవకాశాలకు మారుపేరు ‘జన్ ధన్ యోజన’...
ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచమంతటా అత్యంత ఫలప్రద ఆర్థిక సార్వజనీన కార్యక్రమాల్లో ఒకటి పీఎంజేడీవై: ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి
• జన్ ధన్ ఆధార్ మొబైల్ (జేఏఎం)కు పీఎంజేడీవైనే కీలకం.. ప్రభుత్వం అందించే సబ్సిడీ పక్కదారి పట్టకుండా పక్కా వ్యవస్థ... 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద
బ్యాంకు ఖాతాల్లో... రూ.6.9 లక్షల కోట్లు
Posted On:
28 AUG 2025 9:33AM by PIB Hyderabad
మన దేశ ఆర్థిక ముఖచిత్రంలో ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ (పీఎంజేడీవై) పెనుమార్పును తీసుకువచ్చింది. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజుతో, ఈ పథకానికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. బ్యాంకింగ్ రంగానికి ఆమడదూరంలో నిలిచిపోయిన లక్షలాది పౌరులకు బ్యాంకుల సేవలను పీఎంజేడీవై అందుబాటులోకి తీసుకువచ్చి ఒక కొత్త నిర్వచనాన్ని చెప్పింది.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఒక సందేశాన్నిచ్చారు... ‘‘ఆర్థిక సార్వజనీనత దేశ ఆర్థిక వృద్ధికీ, అభివృద్ధికీ ఒక కీలక ఇంజిన్. దేశంలో పౌరులందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటే ముఖ్యంగా పేదలు, ఆదరణకు నోచుకోకుండా మిగిలిన వర్గాల వారు కూడా ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో పాలుపంచుకొని, వివిధ అవకాశాలను అందుకోగలుగుతారు’’ అని మంత్రి తన సందేశంలో వ్యాఖ్యానించారు.
‘‘ప్రయోజనాలను నేరుగా బదిలీ చేసే (డీబీటీ) సదుపాయాన్ని వినియోగించుకొంటూ వివిధ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లక్షిత లబ్ధిదారులకు చేర్చడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న స్కీముల్లో పీఎంజేడీవై ఒకటి. రుణ సౌకర్యంతో పాటు సామాజిక భద్రత కూడా దీంతో లభిస్తోంది. పొదుపు మొత్తాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
‘‘గత పదకొండు సంవత్సరాల్లో, 56 కోట్ల కన్నా ఎక్కువ స్థాయిలో జన్ ధన్ ఖాతాలను తెరిచారు. వీటిలో మొత్తం రూ.2.68 లక్షల కోట్లు జమ అయ్యాయి. 38 కోట్ల కన్నా ఎక్కువ రూపే కార్డులను ఎలాంటి రుసుమునూ తీసుకోకుండానే జారీ చేశారు. దీంతో డిజిటల్ మాధ్యమంలో లావాదేవీలు పూర్తి అవుతున్నాయి’’ అని శ్రీమతి సీతారామన్ వివరించారు.
‘‘పీఎంజేడీవైలో భాగంగా తెరిచిన ప్రతి వంద ఖాతాల్లో 67 ఖాతాలను తెరిచింది గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల వారే. మళ్లీ ఈ ఖాతాల్లో 56 శాతం ఖాతాలు మహిళలు తెరిచిన ఖాతాలే. దీనిని బట్టి చూస్తే... దేశంలో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రభుత్వ సేవలలో చాలా వరకు సేవలను అందుకోలేకపోతున్న వ్యక్తుల్ని ఆర్థిక రంగం పరిధిలోకి చేర్చినట్లు స్పష్టం అవుతోంది’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఒక సందేశాన్నిస్తూ... ‘‘దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఆర్థిక సార్వజనీనతా ప్రధాన కార్యక్రమాల్లో పీఎంజేడీవై ఒకటి. ఆత్మగౌరవానికీ, సాధికారతకూ, అవకాశానికీ మారుపేరుగా జన్ ధన్ యోజన నిలిచింది’’ అని అన్నారు.
ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతాతో పాటు వయోజనుల్లో ప్రతి ఒక్కరికీ బీమా, పింఛనుల రక్షణ లభించాలని ప్రధానమంత్రి 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ దిశగా దేశం నలు మూలల వివిధ కార్యక్రమాలను అమలుచేయడానికి ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. బ్యాంకు ఖాతాల విషయంలో దాదాపుగా అందరికీ ఆ ఖాతాలను సమకూర్చాం. దేశవ్యాప్తంగా బీమా, పింఛను రక్షణ పరిధి కూడా నిరంతరంగా పెరుగుతోంది’’ అని శ్రీ పంకజ్ చౌదరి వివరించారు.
‘‘దేశంలో 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లోని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కనీసం ఒక శిబిరాన్నయినా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకొని, ఒక ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అర్హులైన వారంతా ఈ శిబిరంలో పీఎంజేడీవై ఖాతాలను తెరిచి, జన్ సురక్ష పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. వారు మరోసారి తమ కేవైసీని పూర్తిచేసి, బ్యాంకు ఖాతాల్లో నామినేషన్లను తాజాగా పేర్కొనవచ్చును. ఆర్థిక రంగ సేవల్ని సామాన్యుల ముంగిటికే తీసుకుపపోవాలన్నది మా ప్రయత్నం. ఈ నూటికి నూరుశాతం ప్రచార కార్యక్రమం సెప్టెంబరు 30న ముగియనుంది. ఇప్పటివరకు అందిన నివేదికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం పూర్తి ప్రయోజనాలను అందుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు.
‘‘బ్యాంకులు, బీమా కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసక్తిదారులు అందరి మద్దతుతోను, మేం మరింత విస్తృత ఆర్థిక సార్వజనీన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. దేశంలో ఆర్థిక సార్వజనీనత అంశంలో పెనుమార్పును తీసుకువచ్చిన పథకంగా పీఎంజేడీవైని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మిషన్ మోడ్లో పరిపాలనను అందించడానికి ఒక ముఖ్య ఉదాహరణగా ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ నిలుస్తుంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏమేం సాధించగలుగుతుందనే దానిని కూడా ఈ పథకం చాటిచెబుతుంది’’ అని శ్రీ పంకజ్ చౌదరి అన్నారు.
ఆర్థిక సార్వజనీనత పరిధి విస్తరణ:
సమాజంలోని ఆదరణకు దూరంగా ఉండిపోయిన, ఆర్థికంగా బలహీనులైన వర్గాల వారికి సహాయపడడానికి పటిష్ఠ ఆర్థిక సార్వజనీనత వ్యూహాలను అమలుచేసేందుకు ఆర్థిక శాఖ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్ రంగానికి బయట ఉండిపోయిన ప్రజలకు ఒక మౌలిక బ్యాంకు ఖాతా సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో పీఎంజేడీవైని ప్రారంభించారు. ఈ ఖాతాలో కనీసం ఇంత డబ్బును నిల్వ ఉంచాలనే, అకౌంటు నిర్వహణ రుసుములు చెల్లించాలనే నిబంధనలు ఏవీ లేవు.
ప్రతి ఖాతాదారుకు ఒక ఉచిత రూపే డెబిట్ కార్డును ఇస్తారు. దీంతో పాటు, రూ.2 లక్షల విలువైన ప్రమాద బీమా రక్షణను కల్పిస్తారు. ఇది డిజిటల్ లావాదేవీల సౌలభ్యంతో పాటు ఆర్థిక భద్రతను అందిస్తుంది. రూ.10,000 వరకు అదనపు సొమ్ము తీసుకోవడానికీ ఖాతాదారులు అర్హులు. ఇది వారికి అత్యవసర స్థితుల్లో ఉపయోగపడుతుంది.
పిఎంజెడివై ఖాతాల ముఖ్య లక్షణాలు:
కేవైసీ నియమాలను తూచా తప్పక పాటించిన ఖాతాల్లో కనీసంగా ఇంత మొత్తం డబ్బును నిల్వ ఉంచాలన్న ఆంక్షగాని, కనీసం ఇన్ని లావాదేవీలు చేయాలన్న పరిమితి గాని లేదు. ఇది ఒక బీఎస్బీడీ ఖాతా. ఈ కింది సదుపాయాలను ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే పీఎంజేడీవై ఖాతాదారులకు సమకూరుస్తారు:
బ్యాంకు శాఖతో పాటు ఏటీఎంలు, సీడీఎంలలో నగదును డిపాజిట్ చేయొచ్చు.
ఏదైనా డిజిటల్ మార్గం ద్వారాగానీ లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, విభాగాలు జారీ చేసిన చెక్కులను డిపాజిట్ చేయవచ్చు లేదా ఆ చెక్కుల్లో పేర్కొన్న నగదును స్వీకరించవచ్చు.
ఒక నెల రోజుల్లో నగదును ఎన్ని సార్లు జమ చేయాలనిగానీ లేదా ఎంత డబ్బును జమ చేయాలనిగానీ ఎలాంటి పరిమితీ లేదు.
మెట్రో ఏటీఎంలు సహా ఏ ఏటీఎంల నుంచి అయినా కానీ నెల రోజుల్లో కనీసంగా 4 సార్లు నగదును ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేకుండా తీసుకోవచ్చు. 4 విత్డ్రాయల్స్ కు మించితే, తదుపరి లావాదేవీలకు రుసుం వసూలు చేసుకొనేందుకు బ్యాంకులకు అవకాశం ఉంది.
రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ సదుపాయంతో కూడిన రూపే డెబిట్ కార్డును ఉచితంగా పొందవచ్చు.
పదేళ్లకు పైబడ్డ కాలంలో చోటుచేసుకొన్న మార్పు:
గత 11 సంవత్సరాలుగా, పీఎంజేడీవై పరివర్తనతో పాటు దిశాత్మక మార్పునకు దారితీసింది. సమాజంలో నిరుపేదలు, శివారు ప్రాంతాల పౌరులకు కూడా సేవ చేయడానికి వీలుగా బ్యాంకింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థను ఈ పథకం పటిష్ఠపరిచింది. ప్రయోజనాలను నేరుగా బదిలీ చేసేందుకు (డీబీటీ) ఈ పథకం కీలకంగా మారింది. దీంతో ప్రభుత్వ సబ్సిడీలతో పాటు చెల్లింపులు పారదర్శకంగా, సమర్థంగా, అవినీతికి తావు లేకుండా సాగాయి.
అవ్యవస్థీకృత రంగంలో లక్షల మంది శ్రామికులకు జీవిత బీమాను, ప్రమాద బీమాను అందించడంలో పీఎంజేడీవై ఖాతాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఈ ప్రక్రియలో భాగంగా ప్రధాన్ మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రీ సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలు తోడ్పడ్డాయి.
జేఏఎంతో పెద్ద మార్పు
జన్-ధన్-ఆధార్ మొబైల్ (జేఏఎం).. ఈ మూడు అంశాల్లోను పీఎంజేడీవై కీలకంగా మారిపోయింది. సబ్సిడీలను.. అవి చేరవలసిన వర్గాలకు కాకుండా.. ఇతర అనర్హులకు చేర్చడానికి అనుసరిస్తున్న పద్ధతులను ఈ విధానంలో అరికడుతున్నారు. జేఏఎంల భాగంగా, ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను అణగారిన వర్గాల వారికి చెందిన బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయగలిగింది. దీంతో మధ్యవర్తుల ప్రమేయాన్ని, జాప్యాన్ని అడ్డుకోవడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల్లో భాగంగా రూ.6.9 లక్షల కోట్ల డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఆర్థిక సార్వజనీనత పథకాలను జనాభాలో అందరి చెంతకు చేర్చేందుకు ఉద్దేశించిన ప్రచార ఉద్యమం (01.07.2025 - 30.09.2025 మధ్య కాలంలో దీనిని అమలు చేస్తున్నారు): కేవైసీ వివరాలలో అవసరమైన మార్పుచేర్పులు చేసేందుకు, కొత్త ఖాతాలు తెరిచేందుకు, మైక్రో-ఇన్సూరెన్సు, పింఛను పథకాలను విస్తరించేందుకు బ్యాంకులు ఈ ఏడాది జులై 1 మొదలు సెప్టెంబరు 30 మధ్య కాలంలో శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవడానికీ, ఖాతాలను ఉపయోగించుకోకుండా ఉండటాన్ని నివారించడానికీ ఖాతాదారులకు అవగాహన కలిగించేందుకు ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఖాతాదారులను సంప్రదిస్తూ పీఎంజేడీవై పరిధిలోని ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు నమోదు చేయకుండా వాటిన నిద్రాణ స్థితిలోనే ఉంచకుండా కూడా బ్యాంకులు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి. ఈ శాచ్యురేషన్ ప్రచార ఉద్యమాన్ని ఈసంవత్సరం జులై 1 నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి వివిధ జిల్లాల్లో 1,77,102 శిబిరాల్ని నిర్వహించారు. ఈ శిబిరాల ద్వారా ముఖ్య పథకాల్లోకి లబ్ధిదారులను చేర్చుకొంటూ, వారికి ఆర్థిక లావాదేవీలను ఎలా చేయాలో చెబుతున్నారు.
చరిత్రాత్మక మలుపులు, విజయాలు:
1. పీఎంజేడీవై ఖాతాలు: 56.16 కోట్లు (ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి)
ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి మొత్తం పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 56.16 కోట్లకు చేరుకొంది... 55.7 శాతం (31.31 కోట్ల) జన్-ధన్ ఖాతాదారులు మహిళలు. 66.7 శాతం (37.48 కోట్ల) జన్ ధన్ ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందినవి.

2. పీఎంజేడీవై ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు - 2.68 లక్షల కోట్లు (ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి)
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)లో మొత్తం డిపాజిట్ నిల్వలు రూ.2,67,756 కోట్లకు చేరుకొన్నాయి. ఖాతాల సంఖ్య మూడింతలు పెరగగా, మొత్తం డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. (2015 ఆగస్టు, 2025 ఆగస్టు మధ్య కాలంలో)

3. పీఎంజేడీవై ఖాతా ప్రకారం సగటు డిపాజిటు - రూ. 4768 (ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి)
ప్రతి ఒక్క ఖాతాకు సగటు డిపాజిటు 2025 ఆగస్టు 13 నాటికి రూ.4,768గా ఉంది. ఒక్కొక్క ఖాతాకు సగటు డిపాజిటు 2015 ఆగస్టుతో పోలిస్తే 3.7 రెట్లు పెరిగింది. సగటు డిపాజిట్లో వృద్ధి ఖాతాల ఉపయోగం పెరిగిందని, ఖాతాదారులు పొదుపు చేయడానికి అలవాటు పడుతున్నారని తెలియజేస్తోంది.

4. రూపే కార్డులు జారీ అయిన పీఎంజేడీవై ఖాతాదారుల సంఖ్య: 38.68 కోట్లు (ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి)
పీఎంజేడీవై ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులను జారీ చేశారు. రూపే కార్డుల సంఖ్యతో పాటు వాటి వినియోగం కాల క్రమేణా వృద్ధి చెందింది.

పీఎంజేడీవైలో భాగంగా 38.68 కోట్ల రూపే డెబిట్ కార్డులను జారీ చేయడం, 1.11 కోట్ల పీఓఎస్, ఎంపీఓఎస్ యంత్రాలను ఏర్పాటు చేయడంతోను, యూపీఐ వంటి మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థల్ని ప్రవేశపెట్టడంతోను డిజిటల్ లావాదేవీల మొత్తం సంఖ్య 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,338 కోట్లకు పెరగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ విధమైన లావాదేవీలు 535 కోట్ల స్థాయిలో నమోదయ్యాయి. ఇదే విధంగా, పీఓఎస్, ఈ-కామర్స్ లలో రూపే కార్డు లావాదేవీలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 67 కోట్ల స్థాయిలో ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 93.85 కోట్లకు ఎగబాకాయి.
పీఎంజేడీవై ఫలప్రదం అయిందంటే అందుకు దీనికి సంతరించిన మిషన్-మోడ్ దృష్టికోణం, నియంత్రణ పరంగా అందిస్తున్న మద్దతు, ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాలతో పాటు బయోమెట్రిక్ ధ్రువీకరణకు గాను ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దీనిని సంధానించడం.. ఇవన్నీ దోహదం చేశాయి.
ఇంతకు మందు ఆర్థిక వ్యవస్థలో భాగం పంచుకోని వారికి ఇది పొదుపు, రుణ సౌకర్యాలను కల్పించింది. పొదుపు మొత్తాలు ఏ స్థాయిలో ఉన్నదీ స్పష్టం అవుతున్న కారణంగా, ఖాతాదారులు ముద్రా రుణాలు సహా ఇతర రుణాలను పొందే వీలుంది. దీంతో, వ్యక్తులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు... ఆర్థిక ఇబ్బందులెదురైతే వాటితో సతమతం కాకుండానూ ఉండవచ్చు.
పీఎంజేడీవై 12వ ఏట అడుగుపెడుతున్న క్రమంలో, వృద్ధి ఫలాలను అందరికీ అందించడంలోను, డిజిటల్ నవకల్పనలోను, ఆర్థిక సాధికారత పరంగాను ఈ పథకం ఒక దారిదీపంగా వెలుగులీనుతూనే ఉంటుంది. ఈ పథకం వరుసగా అనేక విజయాల్ని సాధిస్తుండడం ఆర్థిక స్వాతంత్ర్య సాధన దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఏ ఒక్కరినీవదలిపెట్టకూడదన్న భారత్ నిబద్ధతకు అద్దం పడుతోంది.
***
(Release ID: 2161535)
Visitor Counter : 18
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam