పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర-మంత్రిత్వ విలేకరుల సమావేశం
దారి మళ్లింపు నిరోధం దిశగా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత సరఫరా వల్ల దాదాపు 96 శాతానికి పెరిగిన సిలిండర్ల పంపిణీ
గడచిన 4 రోజులలో సుమారు 1.78 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్కుగాను దాదాపు 1.80 కోట్ల మేర సరఫరా అయ్యాయి
ఈ ఏడాది మే నెల 28వ తేదీ నాటికి సుమారు 60,400 మంది పీఎన్జీ వినియోగదారులు ‘MYPNGD.in’ వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను త్యజించారు
మార్షల్ దీవుల పతాకంగల ‘నిస్సోస్ కెరోస్’ పేరుగల ముడి చమురు నౌక భారత్కు సుమారు 2,70,000 టన్నుల చమురుతో వస్తూ హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన నేపథ్యంలో జూన్ 3న విశాఖపట్నం చేరుతుందని అంచనా
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ నుంచి 2,557 మంది భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది
प्रविष्टि तिथि:
29 MAY 2026 7:22PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, కీలక రంగాల్లో స్థిరత్వం దిశగా చేపడుతున్న చర్యలపై తాజా సమాచారం వెల్లడించారు.
విద్యుత్ సరఫరా... ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
ప్రభుత్వ సూచనలు... పౌరులకు అవగాహన
· పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ లభ్యతకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పౌరులు భయాందోళనలకు లోనై, వీటి కొనుగోలు కోసం ఆదుర్దా పడవద్దని సూచించింది.
· వదంతులను విశ్వసించవద్దని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక సమాచార మార్గాలను అనుసరించాలని సలహా ఇచ్చింది.
· ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలి తప్ప నేరుగా సరఫరాదారులను ఆశ్రయించవద్దని సూచించింది.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
· విస్తృత వినియోగం గల, పారిశ్రామిక వినియోగదారులు అధీకృత కొనుగోలు మార్గాల్లోనే డీజిల్ కొనుగోళ్లు చేపట్టాలని సూచించింది.
· ప్రస్తుత పరిస్థితులలో పౌరులంతా తమ రోజువారీ ఇంధన వినియోగంలో పొదుపు పాటించేందుకు తగినవిధంగా కృషి చేయాలని అభ్యర్థించింది.
ప్రభుత్వ సంసిద్ధత... సరఫరా నిర్వహణ
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ఎల్పీజీ, గృహ వినియోగ పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరా (రవాణా)కు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
· వాణిజ్య ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఔషద, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ తదితర రంగాలకూ ప్రాముఖ్యం లభిస్తోంది. దీనికితోడు 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా ప్రాతిపదికన వలస కార్మికులకు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
· శుద్ధి కర్మాగారల్లో ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం సహా అటు సరఫరా... ఇటు డిమాండ్ వైపు ఆయా రంగాలకు ప్రాధాన్యత వంటి పలు హేతుబద్ధ చర్యలను ప్రభుత్వం అమలు
రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ కృషి
· నిత్యవసరాల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాపై పర్యవేక్షణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాలపై చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
· పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా స్థితిగతుల పర్యవేక్షణ, నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకు పలుమార్లు లేఖ రాయడంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ మార్గంలోనూ ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది.
· పౌరులకు ఇంధన భద్రతపై భరోసా ఇచ్చే విధంగా చురుకైన ప్రభుత్వ సమాచార ప్రదానం ఆవశ్యకతపై కేంద్ర ప్రభుత్వం అనేక లేఖలు రాయడంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
· జిల్లాల వారీగా హెచ్ఎస్డీ/ఎంఎస్ కొనుగోలు సరళిని పర్యవేక్షించడంతోపాటు నిరంతరం సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం 26.05.2026 తేదీన ఒక లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు చిల్లర విక్రయ కేంద్రాల ద్వారా ‘హెచ్ఎస్డీ’ని అనధికారికంగా కొనుగోలు చేయడాన్ని నివారించాలని సూచించింది. అంతేకాకుండా దుర్బల ప్రాంతాల్లో, ప్రధాన రవాణా-పారిశ్రామిక కారిడార్ల వెంబడి తనిఖీ, ప్రణాళిక అమలును ముమ్మరం చేయాలని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరింది.
అమలు... పర్యవేక్షణ చర్యలు
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వల నిర్వహణ సహా అక్రమ విక్రయాలను అరికట్టేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చట్టాల అమలు పటిష్ఠంగా కొనసాగుతోంది.
· ఎల్పీజీ సంబంధిత చర్యలు: దేశవ్యాప్తంగా గడచిన 4 రోజులలో 6500కు పైగా దాడులు నిర్వహించి, 380కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకోగా, 5 కేసుల నమోదు సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశార.
· పెట్రోలు, డీజిల్ సంబంధిత తనిఖీ: దేశవ్యాప్తంగా గడచిన రెండు రోజుల్లో సుమారు 900 దాడులు నిర్వహించగా, 417 లీటర్ల పెట్రోల్, 75,715 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకోవడంతోపాటు 12 కేసులు నమోదు చేయగా 15 మందిని అరెస్టు చేశారు.
· దీంతోపాటు ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థల అధికారులు కూడా ఆకస్మిక తనిఖీ కొనసాగిస్తున్నారు.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు: దేశమంతటా గత 4 రోజులలో 800కు పైగా ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను తనిఖీ చేసిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన 45 కేంద్రాలకు జరిమానా విధించారు.
· చిల్లర విక్రయ కేంద్రాలు: గడచిన 4 రోజులలో 4,660కి పైగా చిల్లర విక్రయ కేంద్రాలను తనిఖీ చేయగా, 73 కేంద్రాల్లో అవకతవకలపై జరిమానా విధించి, 562 కేంద్రాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఎల్పీజీ సరఫరా
గృహోపయోగ వంటగ్యాస్ తాజా స్థితి:
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం లభిస్తోంది.
· దేశంలో ఎక్కడా ఎల్పీజీ సరఫరా కేంద్రాల వద్ద పంపిణీ ఆగిన సమాచారమేదీ లేదు.
· పరిశ్రమల ప్రాతిపదికన నిన్న ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ 99 శాతంగా నమోదైంది.
· దారి మళ్లింపు నిరోధం, సరఫరా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత సరఫరా దాదాపు 96 శాతానికి పెరిగింది. ప్రతి వినియోగదారు నమోదిత మొబైల్ నంబరుకు డీఏసీ వెళ్తుంది.
· దేశంలోని ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు గడచిన 4 రోజులలో సుమారు 1.78 కోట్ల బుకింగ్లపై 1.80 కోట్ల దాకా సిలిండర్లను సరఫరా చేశాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు
· సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.
· గడచిన 4 రోజులలో సుమారు 2.42 లక్షల మేర 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
· నిన్న ఒక్క రోజునే 176 శిబిరాల నిర్వహణ ద్వారా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు దాదాపు 2,537 దాకా అమ్ముడయ్యాయి.
· దేశంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 11,870కి పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి, సుమారు 2.10 లక్షల దాకా సిలిండర్లను విక్రయించాయి.
· గడచిన 4 రోజులలో మొత్తం 29,814 టన్నుల వాణిజ్య ఎల్పీజీ విక్రయించారు.
· గడచిన 4 రోజులలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (PSU OMCs) సుమారు 954 టన్నుల ఆటో ఎల్పీజీ విక్రయించాయి.
సహజవాయువు సరఫరా – పీఎన్జీ విస్తరణ చర్యలు
· డి-పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· ప్రస్తుతం పనిచేస్తున్న యూరియా ప్లాంట్లకు గత 6 నెలల సగటు వినియోగంలో దాదాపు 99 శాతం సరఫరా అవుతోంది.
· సీజీడీ నెట్వర్క్ ద్వారా సరఫరా సహా ఇతర పారిశ్రామిక-వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా 80 శాతం దాకా పెరిగింది.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై సమస్యల పరిష్కారం దిశగా సీజీడీ సంస్థలు తమ జీఏలన్నిటి పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడంపై ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించింది.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన ఆమోద ప్రక్రియను వేగిరపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పిడి దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దోహదం చేస్తే, వాటికి 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంతో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· దేశవ్యాప్తంగా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం-నిర్వహణ-విస్తరణ ద్వారా) కోసం పైప్లైన్లు వేయడంతోపాటు, విస్తరణ దిశగా క్రమబద్ధ, వ్యవధి నిర్దేశిత చట్రాన్ని సూచిస్తూ నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ఉత్తర్వు ద్వారా ప్రకటన చేసింది. ఈ పనులకు అనుమతులు, భూ సేకరణలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే పీఎన్జీ నెట్వర్క్ వృద్ధి వేగవంతమై, చివరి అంచెదాకా సంధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కాలుష్య రహిత ఇంధనం వైపు మార్పిడికి మద్దతిస్తూ ఇంధన భద్రతను బలోపేతం చేసి, భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని అంచనా.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగిరపరచాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణలో వేగం కొనసాగేలా జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించింది.
· పరిశుభ్ర, సురక్షిత, స్వయం సమృద్ధ ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ‘సీబీజీ’ విధానాన్ని రూపొందించింది. దీనికింద రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారు హిత, అమలు అనుగుణం వ్యవస్థను సృష్టించుకోవచ్చు. ఆ మేరకు ఒక సమగ్ర, సరళ, మార్గదర్శక చట్రంగా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సుముఖంగా గల రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ 25.05.2026 ప్రకారం- పీఎన్జీ కనెక్షన్లున్న ఎల్పీజీ వినియోగదారులకు ఈ క్రింది వెసులుబాట్లు ఉంటాయి:
· పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోగా ఎల్పీజీ కనెక్షన్ రద్దుకు దరఖాస్తు చేసుకోవచ్చు; లేదా
· పీఎన్జీయేతర రంగంలో ఎల్పీజీ కనెక్షన్ భవిష్యత్ పునరుద్ధరణ కోసం బదిలీ వోచర్ పొందవచ్చు.
· ఈ ఏడాది మార్చి నుంచి సుమారు 8.3 లక్షల పీఎన్జీ కనెక్షన్లు గ్యాసిఫై చేశారు. దీనికి అదనంగా 2.91 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 11.21 లక్షలకు చేరింది. మరో 8.53 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· ఈ నెల 28 నాటికి సుమారు 60,400 మంది పీఎన్జీ వినియోగదారులు ‘MYPNGD.in’ వెబ్సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.
గృహాల వినియోగానికి మద్దతుగా, రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు సుమారు 52 టీఎమ్టీలకు పెంచారు పెంచారు.
దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడం కోసం అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3, సీ4 స్ట్రీమ్ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలను భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.
ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో రసాయనాల శాఖ (డీసీపీసీ), పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ)ల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మా, రసాయన, పెయింట్ రంగ సంస్థల కోసం ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1120 ఎమ్టీల C3-C4 మాలిక్యుల్స్ కేటాయించారు.
2026 మే 1వ తేదీ నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 13870 ఎమ్టీలకు పైగా సీ3-సీ4 మాలిక్యుల్స్ (ప్రొపైలీన్, బ్యూటైలీన్లతో కూడినవి), 5380 ఎమ్టీలకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
కొన్ని ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్ల వద్ద అసాధార అమ్మకాలు, భారీ రద్దీ కనిపిస్తోంది. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
150కి పైగా జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగాయి.
ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అమ్మకాలు (-38 శాతం), ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల బల్క్ అమ్మకాలు (-29 శాతం) తగ్గాయి. ఈ అమ్మకాల పరిమాణం పీఎస్యూ ఓఎమ్సీల రిటైల్ అవుట్లెట్లకు బదిలీ అయింది.
ఈసీ చట్టంలోని సంబంధిత నిబంధనలు, దాని కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం... రిటైల్ వినియోగదారుల కోసం ఉద్దేశించిన సరఫరాలను పెద్దమొత్తంలో అక్రమంగా వినియోగించడం, నిల్వచేయడం, బ్లాక్ మార్కెటింగ్, అనధికారికంగా నిల్వ చేయడం, పెట్రోలియం ఉత్పత్తుల దారి మళ్లింపు వంటి దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
అధీకృత సేకరణ మార్గాల ద్వారానే డీజిల్ కొనుగోలు చేసేలా తమ సభ్యులకు సూచనలు చేయాలని పారిశ్రామిక సంఘాలనూ కోరారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:
నౌకా సమాచారం: మార్షల్ దీవుల జెండా కలిగిన 'నిస్సోస్ కెరోస్' పేరు గల ముడి చమురు ట్యాంకర్, హెచ్పీసీఎల్ సంస్థ చార్టర్ కింద భారత్కు సుమారు 2,70,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళుతూ, 25 మంది విదేశీ సిబ్బందితో (భారతీయ నావికులు ఎవరూ లేకుండా) 2026 మే 25/26 తేదీల్లో హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. 2026 జూన్ 3న ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుందని అంచనా.
నావికుల సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
గత 96 గంటల్లో భారతీయ నౌకలకు, భారతీయ నావికులు ఉన్న విదేశీ నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం ఉన్న భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 10,841 కాల్లు, 24,098కు పైగా ఈమెయిళ్లనూ నిర్వహించింది. గత 96 గంటల్లో... నావికులు, వారి కుటుంబాలు, నౌకా వాణిజ్య సంబంధిత వర్గాల నుంచి మొత్తం 509 కాల్లు, 1332 ఈమెయిళ్లూ అందాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 96 గంటల్లో స్వదేశానికి వచ్చిన 47 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 3422 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.
దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:
సమాచారాన్ని పంచుకోవడానికి, ప్రయత్నాలను మెరుగ్గా సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు సకాలంలో సహాయం అందించడానికి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి. మన పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారం సహా తాజా సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌరులతో చురుగ్గా మమేకమవుతున్నాయి. వారి సమస్యలను పరిష్కరించడం కోసం భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. భారతీయ మిషన్లు స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సహాయం అందించడం, స్వదేశానికి తిరిగి వచ్చే వారి అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.
యూఏఈ గగనతలం తెరుచుకుంది. భారతీయ, యూఏఈ విమానయాన సంస్థలు యూఏఈ నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్వేస్ సంస్థలు భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.
కువైట్ గగనతలం తెరుచుకుంది. జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్కు విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాయి. భారతీయ విమానయాన సంస్థలూ త్వరలోనే కువైట్ నుంచి భారత్కు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించే అవకాశం ఉంది.
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలూ బహ్రెయిన్ నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.
ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలతో ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. దీనిని భారత్కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్కు ప్రయాణించకుండా ఉండాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి భూ సరిహద్దు మార్గాల ద్వారా స్వదేశానికి తిరిగి రావాలని కోరడమైనది. ఇప్పటివరకు, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,557 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.
ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారత్కు తిరిగి రావడం కోసం ఉపయోగించుకోవచ్చు.
****
(रिलीज़ आईडी: 2267153)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam