ప్రధాన మంత్రి కార్యాలయం
‘మానవ హక్కులకు భరోసా - అందరికీ ప్రభుత్వ సేవలు, గౌరవం’పై జాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా
· మానవ హక్కుల దినోత్సవం ఓ చారిత్రక ప్రకటనను స్మరించుకునే రోజు మాత్రమే కాదు.. మానవ జీవనంలో గౌరవాన్ని పొందేందుకు నాంది
· సాంకేతికత, పర్యావరణం, డిజిటల్ సమ్మిళితత్వాల దిశగా మానవ హక్కుల పరిణామం
· ఇంట్లో గౌరవం, సామాజిక రక్షణ, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బలహీన సమాజాలకు న్యాయం... ఈ నాలుగు అంశాలు ప్రాతిపదికలుగా భారత్లో మానవ హక్కులకు భరోసా
· బాధ్యాతాయుతంగా సాంకేతికత వినియోగం, సంస్థాగత దార్శనికతను బలోపేతం చేయడం, ప్రతి ప్రభుత్వ సేవలోనూ గౌరవమే నిర్దేశక సూత్రంగా భరోసానిచ్చేలా... ప్రజా కేంద్రీకృత పాలనను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న డాక్టర్ పి.కె. మిశ్రా
నాడు పోస్టు చేయడమైనది:
10 DEC 2025 3:32PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘నిత్యావసరాలపై భరోసా.. అందరికీ ప్రజాసేవలు, గౌరవం’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా ప్రసంగించారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో మానవ హక్కుల దినోత్సవం ప్రాధాన్యాన్ని తన కీలకోపన్యాసంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడ రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజాస్వామిక సంస్థలు, సామాజిక విలువలు కలిసి మానవ గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహిస్తాయని వివరించారు. ఆహారం, దుస్తులు, ఆవాసం, వైద్య సంరక్షణ, సామాజిక సేవలు, దుర్బల సమయాల్లో భద్రత సహా తగిన జీవన ప్రమాణాల హక్కుకు భరోసా ఇస్తున్న.. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (1948)లోని అధికరణ 25(1)ను ఆయన గుర్తుచేశారు. మానవ హక్కుల దినోత్సవం కేవలం ఓ సంస్మరణ దినం మాత్రమే కాదని, దైనందిన జీవితంలో మానవ గౌరవానికి అది నాంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఇతివృత్తం “మానవ హక్కులు, మన దైనందిన ఆవశ్యకత”.. ప్రభుత్వంతో ప్రజలను మరింత మమేకం చేయడంలో ప్రభుత్వ సేవలు, ప్రజాస్వామిక సంస్థల పాత్రను వివరించేదిగా ఉంది.
సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపకల్పనలో భారత్ పోషించిన చారిత్రక పాత్రను, ముఖ్యంగా డాక్టర్ హన్సా మెహతా సేవలను డాక్టర్ మిశ్రా గుర్తు చేశారు. ‘‘మానవులంతా స్వేచ్ఛగా, సమానులుగా జన్మించారు’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసేలా ఆయన కృషిచేశారు. లింగ సమానత్వం కోసం ఇదొక నిశ్చయాత్మక ముందడుగు. ఆహారం, నీరు, ఆశ్రయం, విద్య, న్యాయాన్ని పొందడం ద్వారా హక్కులను సాధించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మానవ హక్కుల చింతన పౌర, రాజకీయ హక్కుల నుంచి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల వరకు అన్నింటినీ సమ్మిళితం చేసుకుని పరిణామం చెందిందనీ.. అదిప్పుడు సాంకేతికత, డిజిటల్ వ్యవస్థలు, పర్యావరణ విషయాలు వంటి కొత్త అంశాలకూ విస్తరించిందనీ ఆయన అన్నారు. కేవలం స్వేచ్ఛలు మాత్రమే కాకుండా.. గోప్యత, ప్రయాణం, పరిశుభ్రమైన వాతావరణం, డిజిటల్ సమ్మిళితత్వాలు నేడు గౌరవాన్ని రూపుదిద్దుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
భారతీయ నాగరికత.. గౌరవ భావం, కర్తవ్య నిష్టలను ప్రజా జీవితానికి కేంద్రంగా నిలిపిందన్నారు. ధర్మం, న్యాయ, కరుణ, సేవ వంటి భావనలు ధర్మబద్ధమైన ప్రవర్తనను, సంక్షేమాన్ని ప్రవచిస్తూనే.. అహింసను, సంక్షేమాన్ని ప్రోత్సహించాయి. వసుధైక కుటుంబం వంటి భావన విస్తృత మానవ సమాజం మధ్య ఆత్మీయతను ప్రోత్సహించింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, అలాగే ప్రాథమిక హక్కులతోపాటు విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే ఆదేశిక సూత్రాల వరకు... రాజ్యాంగ రూపకల్పనను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయన్నారు.
2014కు ముందటి దశాబ్దాన్ని ప్రస్తావిస్తూ.. విద్యా హక్కు చట్టం, ఎంజీఎన్ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలతో అభివృద్ధి కోసం హక్కుల ఆధారిత విధానాన్ని భారత్ అనుసరించిందని డాక్టర్ మిశ్రా అన్నారు. అయితే హక్కులను అందించి వాటిని సమర్థంగా అమలు చేయకపోవడం విశ్వసనీయతను దెబ్బతీసింది. 2014 నుంచి ప్రభుత్వం సంపూర్ణతా విధానాన్ని అనుసరిస్తోంది. అర్హులైన లబ్ధిదారులెవరూ ప్రయోజనాలను కోల్పోకుండా చూస్తోంది. ‘పత్రాలకే పరిమితమైన హక్కుల’ నుంచి ‘అమలైన హక్కుల’ దిశగా మార్పును ఇది సూచిస్తోంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు, వికసిత భారత్ సంకల్ప యాత్ర వంటి ప్రజావగాహన కార్యక్రమాల ద్వారా ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ధ్రువీకరించిందని ఆయన తెలిపారు. మానవ హక్కుల క్రియాశీలతలో పేదరిక నిర్మూలన అన్నది అత్యంత ప్రభావవంతమైన అంశమన్నారు.
దైనందిన హక్కులకు రక్షణనిచ్చే నాలుగు ప్రాతిపదికలను డాక్టర్ మిశ్రా వివరించారు. మొదటిది ఇంట్లో గౌరవం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, సౌభాగ్య, ఉజ్వల యోజన పథకాల కింద గృహ నిర్మాణం, నీరు, పారిశుద్ధ్యం, శుద్ధ ఇంధనం వంటి అంశాలు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయి. రెండోది సామాజిక రక్షణ. కోవిడ్ కాలంలో 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ఆహారాన్ని అందించడంతోపాటు 42 కోట్ల మంది పౌరులకు ఆయుష్మాన్ భారత్ - పీఎంజేఏవై ద్వారా ఆహార భద్రతను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం అందించింది. బీమా, పింఛన్లు, కొత్త కార్మిక చట్టాల ద్వారా అనధికారిక, గిగ్ కార్మికులకు కూడా ప్రయోజనాల విస్తరణ సాధ్యమైంది. అలాగే మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం వంటి సంస్కరణలు బలహీన వర్గాలకు గౌరవాన్ని అందించాయి. మూడో అంశం సమ్మిళిత ఆర్థిక వృద్ధి. ఆర్థిక సమ్మిళితత్వం, సాధికారత ద్వారా ఇది పురోగమించింది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీల్లో జేఏఎం త్రయం విప్లవాత్మక మార్పులను తెచ్చింది. 56 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాల ద్వారా.. బ్యాంకు ఖాతా లేని వారు అధికారిక బ్యాకింగ్ పరిధిలోకి వచ్చారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి పథకాలు పారిశ్రామిక అవకాశాల కల్పనకు దోహదపడ్డాయి. స్వయం సహాయక సంఘాలు, ‘లాఖ్పతి దీదీలు’, బేటీ బచావో బేటీ పడావో, చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ల వంటి చరిత్రాత్మక నిర్ణయం ద్వారా మహిళా సాధికారత పురోగమించింది. నాలుగో అంశం బలహీన వర్గాలకు న్యాయం, రక్షణ. కొత్త న్యాయ చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోక్సో చట్టం, దివ్యాంగుల హక్కుల చట్టం, గిరిజన వర్గాల కోసం ప్రధానమంత్రి జన్మాన్ ద్వారా ఇది బలోపేతమైంది. వ్యాక్సిన్ మైత్రి వంటి మానవీయ సాయం.. సార్వత్రిక మానవ హక్కుల పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ప్రధానమంత్రి జన్ భాగీదారీ పిలుపుతో ప్రభుత్వ సేవల పంపిణీలో గణనీయమైన మార్పులొచ్చాయి. సూచనల నుంచి స్పందనల దిశగా, పథకాలను అందించే స్థితి నుంచి గౌరవాన్ని అందించే దిశగా, ప్రజలను లబ్ధిదారులుగా చూడడం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మార్చే దిశగా ఈ మార్పులను స్పష్టంగా గమనించవచ్చు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నికవడం.. ప్రజాస్వామిక సంస్థలు, సమ్మిళిత అభివృద్ధిపై అంతర్జాతీయ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
వికసిత భారత్ 2047 దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో.. సరికొత్త సవాళ్లకు అనుగుణంగా వ్యవస్థాగత ఏర్పాట్లు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ను శ్రీ మిశ్రా కోరారు. వాతావరణ మార్పు, పర్యావరణ న్యాయం, డేటా రక్షణ, అల్గారిథంపరంగా చట్టబద్ధత, బాధ్యతాయుత ఏఐ, గిగ్ కార్మికుల కష్టాలు, డిజిటల్ నిఘా వంటివి ముఖ్యమైన సమస్యలుగా వివరించారు.
సుపరిపాలన ఒక ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన డాక్టర్ మిశ్రా.. సమర్థత, పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారం, సకాలంలో సేవలందించడం దాన్ని నిర్దేశిస్తాయని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రజా కేంద్రీకృత పాలన, బాధ్యతాయుతంగా సాంకేతికత వినియోగం, ప్రజలకు గౌరవాన్ని అందించే దిశగా సమష్టి కార్యాచరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... జీవనానుకూల నగరాలు, శక్తిమంతమైన గ్రామాలతో కూడిన ఆధునిక, సమ్మిళిత భారత్ మనకు కావాలన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254331)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam