ప్రధాన మంత్రి కార్యాలయం
15వ భారత్- జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన: మన తర్వాతి తరానికి భద్రత, ఆర్థికాభివృద్ధి కోసం భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
29 AUG 2025 7:06PM by PIB Hyderabad
జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు, రేపు జపాన్లో అధికారిక పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఈ సాయంత్రం జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా ప్రధానమంత్రి కార్యాలయం (కాంఠై) వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడ శ్రీ మోదీకి సైనిక గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఇద్దరు ప్రధానమంత్రులు ప్రతినిధి వర్గ స్థాయి చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య నాగరిక సంబంధాలు, భాగస్వామ్య విలువలు, పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి వ్యూహాత్మక దృక్పథం, పరస్పర గౌరవం వంటి అంశాలతో ముడిపడిన చిరకాల స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గడిచిన పదేళ్లలో రెండు దేశాల భాగస్వామ్యం సాధించిన ముఖ్యమైన పురోగతిపై ఇద్దరు ప్రధానమంత్రులూ సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే దశాబ్దాల్లో పరస్పర భద్రత, అభివృద్ధి సాధించడానికి వ్యూహాత్మక, భవిష్యత్ ఆధారిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై నిర్మాణాత్మకంగా చర్చించారు.
ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రగాఢ సంబంధాలను ప్రతిబింబించేలా కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశాలను, మంత్రుల స్థాయిలోనూ, పార్లమెంటరీ స్థాయిలోనూ జరుగుతున్న కార్యకలాపాలను ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. గత దశాబ్దంలో ఈ భాగస్వామ్యం భద్రత, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్, టెక్నాలజీ, నైపుణ్యాలు, చలనశీలత, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత రంగాలకు గణనీయంగా విస్తరించింది. భారత్, జపాన్ మధ్య 70కి పైగా చర్చా వేదికలు, అధ్యయన బృందాలు వివిధ రంగాల్లో పని చేస్తుండడం వల్ల వాటి ద్వారా అనేక మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాల మధ్య నిరంతరం పరస్పర కార్యాచరణ, సహకారం కొనసాగుతున్నాయని ఇద్దరు ప్రధానమంత్రులూ అంగీకరించారు.
భారత్, జపాన్ భాగస్వామ్యం ఒక కీలక దశలో ఉందనే విషయంపై ఇద్దరు ప్రధాన మంత్రులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు సాధించిన విజయాల ఆధారంగా భవిష్యత్ తరాల భద్రత, ఆర్థికాభివృద్ధి కోసం రెండు దేశాల పరస్పర బలాలను, అద్భుతమైన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు, ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పరస్పరం కలసి మరింత సన్నిహితంగా పనిచేయాలని సంకల్పించారు. ఈ దిశగా, రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను మరింత పెంచడం అనే మూడు ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తూ, ఇద్దరు ప్రధానమంత్రులు ప్రకటనలు చేశారు. స్వచ్ఛ ఇంధనం, కీలకమైన ఖనిజాలు, డిజిటల్ భాగస్వామ్యం, అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, సాంస్కృతిక మార్పిడి, దౌత్యపరమైన శిక్షణ వంటి ప్రధాన రంగాలలో ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. ఇరువురు నేతలు ఈ కింద అంశాలను ఆమోదించారు:
(i) తదుపరి దశాబ్దం కోసం సంయుక్త దార్శనిక పత్రాన్ని ఆమోదించారు. ఇందులో ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక భద్రత, చలనశీలత, పర్యావరణం, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలు, రెండు దేశాల మధ్య రాష్ట్రాల స్థాయి సహకారం వంటి ఎనిమిది అంశాలపై భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే మొత్తం దేశం కృషికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.
(ii) భద్రతా సహకారంపై ఒక సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఇది ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలు, ప్రాంతీయ భద్రతా నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుని, రెండు దేశాల రక్షణ, భద్రతా సంబంధాలను తదుపరి స్థాయికి పెంచుతుంది.
(iii) భారత్, జపాన్ మధ్య మానవ వనరుల మార్పిడి, సహకారం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఈ ప్రణాళిక ద్వారా వచ్చే అయిదు సంవత్సరాల్లో అయిదు లక్షలమందికి పైగా మానవ వనరుల మార్పిడి ద్వారా ప్రతిభావంతుల చలనాన్ని సులభతరం చేస్తారు. ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి కృషి చేస్తారు. దీనిలో భారత్ నుంచి జపాన్ కు వెళ్ళే 50 వేలమంది వృత్తి నిపుణులు, ప్రతిభావంతులు ఉంటారు.
భారత్, జపాన్ దేశాల ఆర్థిక భద్రతా కార్యక్రమాన్ని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు ప్రకటించారు. ఇది కీలకమైన వస్తువులు, అనేక రంగాల్లో సరఫరా వ్యవస్థలకు భద్రపరచడం, బలోపేతం చేయడం, అలాగే టెలికమ్యూనికేషన్లు, ఫార్మా, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో సహకారాన్ని వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారానికి ఊతమిస్తుంది. వ్యూహాత్మక వాణిజ్యం, సాంకేతికతతో సహా ఆర్థిక భద్రతపై 2024 నవంబర్ లో చర్చలు ప్రారంభం కావడాన్ని వారు స్వాగతించారు. ఆర్థిక భద్రతపై విధానపరమైన మార్పిడిని వేగవంతం చేసే బాధ్యతను ఇద్దరు ప్రధానమంత్రులు ఇరుదేశాల విదేశాంగ మంత్రిత్వశాఖలకు అప్పగించారు. పరిశ్రమ, విద్యా రంగాల సమన్వయంతో, వ్యూహాత్మక రంగాలలో నిర్దిష్టమైన ఫలితాలను, ప్రాజెక్టులను గుర్తించడం దీని లక్ష్యం. ఈ సందర్భంలో, ఎగుమతి నియంత్రణ సవాళ్ళను సులభతరం చేసుకుంటూ ఉన్నతస్థాయీ సాంకేతికపరిజ్ఞాన వాణిజ్యానికి మరింత రక్షణ కల్పించే దిశగా పని చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. అలాగే, కొన్ని వ్యూహాత్మక రంగాల్లో రెండు దేశాల మధ్య ఆర్థిక భద్రతపై కొనసాగుతున్న సహకారాన్ని వివరించే వాస్తవ పత్రాన్ని కూడా విడుదల చేశారు. సరఫరా మార్గాల వైవిధ్యీకరణ, పటిష్టత కోసం భారతీయ, జపాన్ కంపెనీలను ప్రోత్సహించడానికి ఆర్థిక భద్రతా రంగంలో వాణిజ్య సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రధానమంత్రులు ఇద్దరూ స్వాగతించారు. ఖనిజ వనరుల రంగంలో వ్యాపార అవకాశాలను విస్తరించే ఉద్దేశంతో కీలకమైన ఖనిజాల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగిన సహకార ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
డిజిటల్ టాలెంట్ ఎక్స్ఛేంజ్, పరిశోధన - అభివృద్ధి, అంకుర సంస్థలు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఉమ్మడి సహకారాన్ని ప్రోత్సహించే ఇండియా-జపాన్ డిజిటల్ భాగస్వామ్యం కింద జరిగిన పురోగతి పట్ల ఇద్దరు ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ విప్లవంలో సహకారాన్ని తర్వాతి దశకు విస్తరించే భారత్, జపాన్ డిజిటల్ భాగస్వామ్యం 2.0ను వారు స్వాగతించారు. రెండు దేశాల మధ్య కృత్రిమ మేధ సహకార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా ఇద్దరు ప్రధానమంత్రులు ప్రకటించారు. భారీ స్థాయి భాషా నమూనాలు (లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్-ఎల్ఎల్ఎం) సహా కృత్రిమ మేధపై ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వినిమయం కోసం వేదికలను ఏర్పాటు చేయడం, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం, భారతదేశంలో డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణకు తోడ్పడటం దీని ఉద్దేశం. 2026 ఫిబ్రవరి 19, 20 తేదీలలో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబాను ప్రధాని శ్రీ మోదీ ఆహ్వానించారు. అంకుర సంస్థలకు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించిన ఇరువురు ప్రధానమంత్రులు జపాన్-ఇండియా స్టార్టప్ సపోర్ట్ ఇనిషియేటివ్ (జేఐఎస్ఎస్ఐ) తో సహా భారతదేశంలో ఇరు దేశాల అంకుర సంస్థల కార్యకలాపాలను ప్రోత్సహించడానికి అంగీకరించారు.
రక్షణ, సముద్ర భద్రతలో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారం పట్ల ఇద్దరు ప్రధాన మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. 2024 ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన మూడో 2+2 విదేశీ, రక్షణ మంత్రుల సమావేశాన్ని వారు స్వాగతించారు. నాలుగో సమావేశాన్ని టోక్యోలో వీలైనంత త్వరగా నిర్వహించాలని మంత్రులకు సూచించారు. 2022 మార్చిలో జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత నుంచి ఇరు దేశాల రక్షణ దళాల మధ్య పరస్పరం జరిగిన కార్యకలాపాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఆధ్వర్యంలో జరిగిన బహుపాక్షిక మిలాన్ విన్యాసాల్లో జపాన్ సముద్ర రక్షణ దళం (జేఎంఎస్డీఎఫ్) పాల్గొన్నందుకు, అలాగే భారత వాయుసేన ఆధ్వర్యంలో జరిగిన మొదటి బహుపాక్షిక విన్యాసం తరంగ్ శక్తి లో జపాన్ జట్టు పాల్గొన్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఏఎస్డీఎఫ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మధ్య తొలిసారిగా జరిగిన ద్వైపాక్షిక యుద్ధ విమానాల విన్యాసం 'వీర్ గార్డియన్ 2023' ను వారు స్వాగతించారు. అదే సంవత్సరం (2023) తొలిసారిగా త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలను నిర్వహించడాన్ని కూడా వారు స్వాగతించారు. రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం రంగాల్లో కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ, తద్వారా వీలైనంత త్వరగా నిర్దిష్ట ఫలితాలను రాబట్టాలని, భవిష్యత్తులో రెండు పక్షాల నిర్వహణా విధానాలకు సమర్థవంతంగా మద్దతు ఇచ్చే ప్రత్యేక రంగాలను గుర్తించాలని రెండు దేశాల సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలో ఒక ముఖ్య స్తంభంగా ఆర్థిక సహకార ప్రాముఖ్యతను గుర్తిస్తూ, 2022 నుంచి అయిదేళ్లలో జపాన్ నుంచి భారత్ కు అయిదు ట్రిలియన్ యెన్ల ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు, ఆర్థిక సహాయ లక్ష్యాలను చేరుకోవడంలో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలూ స్వాగతించారు. భారతదేశంలో జపాన్ పెట్టుబడిదారులకు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి, వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి భారతదేశం తీసుకున్న చర్యలను గుర్తించిన ఇరు దేశాల ప్రధాన మంత్రులు, జపాన్ నుంచి భారత్ కు 10 ట్రిలియన్ యెన్ల ప్రైవేటు పెట్టుబడుల కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. జపాన్ సంస్థలు భారతదేశంలో తమ సరఫరా వ్యవస్థలను మరింతగా పెంచుకోవడానికి అపారమైన సామర్థ్యం ఉందని గుర్తించినట్టు ప్రధానమంత్రి శ్రీ ఇషిబా తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నియంత్రణలను, ఇంకా ఇతర సంస్కరణలను కొనసాగించాలని ఆయన భారత్ ను కోరారు. భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో వృద్ధి, ఆవిష్కరణలను పెంపొందించడంలో జపాన్ కంపెనీలు, సంస్థల సహకారాన్ని గుర్తించినట్టు ప్రధానమంత్రి మోదీ తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులను సులభతరం చేయడానికి అదనపు నియంత్రణ, ఇతర సంస్కరణలు చేపట్టాలన్న ఉద్దేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మరిన్ని జపాన్ వ్యాపార సంస్థలను ఆహ్వానించారు. భారత్, జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం (ఐజేఐసీపీ) కింద జపాన్ పారిశ్రామిక పట్టణాలకు (జేఐటిలు) మద్దతు ఇవ్వడానికి, రవాణా, వస్త్రాలు, ఆహార శుద్ధి, వ్యవసాయం, ఆటోమోటివ్స్, పారిశ్రామిక యంత్ర పరికరాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈలు) లలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక ప్రయత్నాలను వారు ఆమోదించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) అమలుపై తదుపరి సమీక్షను మరింత వేగవంతం చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించవలసిన అవసరాన్ని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు.
దశాబ్దాలుగా భారతదేశానికి జపాన్ అందిస్తున్న మద్దతుపై ఇరు దేశాల ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, అలాగే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు గణనీయంగా దోహదపడిందని అభిప్రాయపడ్డారు.
భారతదేశ ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి తమ నిరంతర నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఇది ఆ ప్రాంతం ఆర్థిక సౌభాగ్యానికి ఉపకరించింది. కఠినమైన, సులభమైన, విధానాల ద్వారా ప్రజల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, తద్వారా ప్రాంతీయ భాగస్వాముల సన్నిహిత సహకారంతో యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ (ఏఈఎఫ్) ద్వారా ఈ ప్రాంతం గొప్ప సామర్థ్యాన్ని వెలికితీసే ఉద్దేశాన్ని పునరుద్ఘాటించారు.
భారతదేశం, జపాన్ దేశాల మధ్య ఒక అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రధానమంత్రులు గుర్తించారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించడానికి, భారతదేశంలో సరికొత్త జపాన్ షింకన్సెన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి సహకరించుకోవాలని నిర్ణయించారు. జపాన్ సిగ్నలింగ్ వ్యవస్థపై నడిచే ఇ10 సిరీస్ షింకన్సెన్ను 2030 ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి జపాన్ చేసిన ప్రతిపాదనను భారత్ ప్రశంసించింది. ఇందుకోసం జపాన్ వ్యవస్థతో సహా సిగ్నలింగ్ను త్వరగా ఏర్పాటు చేయడానికి, జనరల్ ఇన్స్పెక్షన్ ట్రైన్ (జీఐటీ), ఒక ఇ5 సిరీస్ షింకన్సెన్ రోలింగ్ స్టాక్ను ప్రవేశపెట్టడానికి అవసరమైన పనులను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇంధన భద్రతను ఏకకాలంలో నిర్ధారించడం, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను పరిష్కరించడం మొదలైన వాటి ప్రాముఖ్యతను అంగీకరిస్తూ, ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. 2022లో ప్రారంభించిన క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం ఆధారంగా, ద్వైపాక్షిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, నికర సున్నా ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఒకే మార్గం కాకుండా, ప్రతి దేశ జాతీయ పరిస్థితులను ప్రతిబింబించే వివిధ మార్గాలు ఉన్నాయని రెండు దేశాలు గుర్తించినట్టు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంలో, సంయుక్త క్రెడిటింగ్ మెకానిజం (జేసీఎం) ఒప్పందంపైనా, స్వచ్ఛ హైడ్రోజన్, అమ్మోనియాలపై సంయుక్త అంగీకార ప్రకటనపైనా సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు.
ప్రజల మధ్య సంబంధాల రంగంలో, తమ మానవ వనరుల లభ్యతను ఆర్థికంగా ప్రయోజనకరమైన అదనపు అంశాలుగా ఉపయోగించుకుని ప్రజల మధ్య సంబంధాల మార్పును కొత్త తరహాలో కొనసాగించాలన్న సంకల్పాన్ని వారు పునరుద్ఘాటించారు. జపాన్లోని క్యుషూ ప్రాంతానికి భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఫుక్యోకాలో భారత కాన్సులేటును ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు. నిహోంగో భాగస్వాముల కార్యక్రమం, 360 గంటల ఉపాధ్యాయుల శిక్షణ కోర్సు ద్వారా భారతదేశంలో జపాన్ భాషా విద్యలో సాధించిన పురోగతిని వారు ప్రశంసించారు. 2016లో ప్రారంభం నాటి నుంచి జపాన్ తయారీ, నిర్వహణ నైపుణ్యాలలో నిష్ణాతులైన 30,000 మంది ప్రతిభావంతులను సృష్టించిన జపాన్-ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఫర్ మాన్యుఫాక్చరింగ్, జపనీస్ ఎండోడ్ కోర్సుల విజయాల ఆధారంగా ముందుకు వెళ్లడానికి ఇరు దేశాల ప్రధానమంత్రులు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఒకరి దేశం గురించి, సంస్కృతిని గురించి మరొకరు తెలుసుకోవడానికి ఇరు దేశాల ప్రజల్లో పరస్పరం పెరుగుతున్న ఆసక్తి పట్ల ఇరు దేశాల ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పర్యాటకుల రాకపోకలు ఇందుకు నిదర్శనం. "హిమాలయాలను మౌంట్ ఫుజితో అనుసంధానించడం" అనే ఇతివృత్తంతో ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు జరిగిన భారత్- జపాన్ పర్యాటక వినిమయ సంవత్సరపు విజయవంతమైన వేడుకలు నిర్వహించడాన్ని అభినందించారు. రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరిక సంబంధాలను ఆధారంగా చేసుకుని, ఈ రంగంలో పర్యాటక మార్పిడిని ప్రోత్సహించాలని నాయకులు నిర్ణయించారు. 2025 సంవత్సరాన్ని భారత్ - జపాన్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మార్పిడి సంవత్సరంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఇరు దేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య సైన్స్, టెక్నాలజీపై కుదిరిన మొదటి అవగాహన ఒప్పందానికి 40వ వార్షికోత్సవం. రెండు దేశాల విద్యా సంస్థల మధ్య ఉమ్మడి పరిశోధనా భాగస్వామ్యాలు, రెండు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకుల పరస్పర పర్యటనలు, అలాగే లోటస్ కార్యక్రమం, సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ సహకారంతో జపాన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం ద్వారా కొత్తగా ప్రారంభమైన పరిశ్రమ, విద్యాసంస్థల సహకారాలను వారు స్వాగతించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీల మధ్య జరుగుతున్న లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ (ఎల్యూపిఈఎక్స్) మిషన్లో సాధించిన పురోగతి పట్ల ఇరు దేశాల ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. కె.ఇ.కె, సుకుబాలోని ఇండియన్ బీమ్లైన్పై అవగాహన ఒప్పందాన్ని మరో ఆరు సంవత్సరాలకు పొడిగించడాన్ని కూడా వారు స్వాగతించారు. క్వాంటమ్ టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్, బయోటెక్నాలజీ, జియోస్పేషియల్ టెక్నాలజీస్ వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో 2025 జూన్ 5న జరిగిన 11వ సంయుక్త కమిటీ సమావేశంలో సాధించిన పురోగతిని ఇరువురు ప్రధానులు ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రాంతీయ అనుసంధానాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గుర్తించిన ప్రధానమంత్రులు, ఇటీవల ఆంధ్రప్రదేశ్, టొయామా మధ్య, తమిళనాడు, ఎహిమే మధ్య, ఉత్తర ప్రదేశ్, యమనాషి మధ్య, గుజరాత్, షిజుయోకా మధ్య ఏర్పడిన ప్రాంతాల స్థాయి భాగస్వామ్యాలను, అలాగే భారతదేశంతో వ్యాపార మార్పిడిని ప్రోత్సహించే కన్సాయ్ ప్రాంతీయ భాగస్వామ్యమైన కన్సాయ్ కోఆర్డినేషన్ సమావేశాన్ని వారు స్వాగతించారు. జపాన్ లోని ఒసాకా, కన్సాయి లో జరుగుతున్న ఎక్స్పో 2025 సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి ఇషిబాకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. ఇందులో భారతదేశం చురుకుగా పాల్గొనడానికి జపాన్ ఇచ్చిన మద్దతును ప్రశంసించారు. ఇది ఇటీవలి నెలల్లో రెండు దేశాల్లోని రాష్ట్రాల స్థాయి భాగస్వామ్యాలకు కూడా విశేషమైన ఉత్సాహాన్ని అందించిందని గుర్తించారు. యోకోహామాలో జరగనున్న గ్రీన్ ఎక్స్ ఎక్స్పో 2027లో భారతదేశం పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ ఇషిబా స్వాగతించారు.
ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఇరు దేశాల ప్రధానమంత్రులు చట్టం ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను నిలబెట్టాలని సంకల్పించారు. ప్రశాంతంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉండే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్కు తమ తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆచరణాత్మక ప్రాజెక్టుల ద్వారా, స్పష్టమైన ప్రయోజనాలను అందించడం ద్వారా ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి, శ్రేయస్సుకు తమ బలమైన మద్దతును మరోసారి ప్రకటించారు. శాంతి, సుస్థిరత, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, అమెరికా మధ్య క్వాడ్ వంటి బహుపాక్షిక వ్యవస్థల ద్వారా ఏకాభిప్రాయం గల దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంలో క్వాడ్ ఒక ప్రధానమైన, శాశ్వత ప్రాంతీయ కూటమిగా అభివృద్ధి చెందడాన్ని వారు స్వాగతించారు. ఈ ఏడాది చివరలో భారతదేశం నిర్వహించనున్న తదుపరి క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.
తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల ప్రధానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నౌకాయానానికి, విమానాల రాకపోకల స్వేచ్ఛకు, భద్రతకు ప్రమాదం కలిగించే, బలవంతంగా లేదా నిర్బంధంతో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతాల సైనికీకరణపై ఇరు దేశాల ప్రధానులు తమ తీవ్ర ఆందోళనను పంచుకున్నారు. సముద్ర వివాదాలను అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, ముఖ్యంగా సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం (యూఎన్సీఎల్ఓఎస్) ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు పునరుద్ఘాటించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన పలు తీర్మానాలను (యూఎన్ఎస్సీఆర్ఎస్) ఉల్లంఘించి, ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను ఉపయోగించి చేపట్టిన అస్థిర క్షిపణి ప్రయోగాలను, దాని అణు ఆయుధాల కొనసాగింపును ఇరు దేశాల ప్రధానులు ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం, ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వస్త్ర రహితం చేయడానికి ఇరు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం, తన బాధ్యతలన్నింటినీ పాటించాలని ఉత్తర కొరియాను కోరాయి. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలకు తిరిగి రావాలని వారు ఉత్తర కొరియాను కోరారు. ప్రాంతంలోనే కాకుండా దాని వెలుపల కూడా ఉత్తర కొరియా నుంచి, ఉత్తర కొరియాలోకి అణు, క్షిపణి సాంకేతికతల వ్యాప్తిపై కొనసాగుతున్న ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం, ఉత్తర కొరియాకు అన్ని ఆయుధాలు, సంబంధిత సామాగ్రిని బదిలీ చేయడం లేదా ఉత్తర కొరియా నుంచి సేకరించడంపై నిషేధంతో సహా ఆంక్షలను అమలు చేయడానికి తమ అంతర్జాతీయ బాధ్యతలకు కట్టుబడి ఉండాలని వారు ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్య దేశాలను కోరారు. అపహరణల సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు.
సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ఇద్దరు ప్రధానమంత్రులు తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్ర పదజాలంతో ఖండించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) గురించి ప్రస్తావించిన జూలై 29 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిఘా బృందం నివేదికను వారు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని ప్రధానమంత్రి మోదీ వివరించారు. దీనిపై జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని, దీనిని నిర్వహించిన వారిని, ఆర్థికంగా సహాయం చేసిన వారిని ఆలస్యం చేయకుండా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు. అల్ ఖైదా, ఐసిస్/డాయిష్, లష్కరే తొయిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం), ఇంకా వాటి తరఫున పని చేసే సంస్థలు సహా ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న అన్ని ఉగ్రవాద గ్రూపులు, సంస్థలపై సమన్వయ చర్యలు తీసుకోవాలని కూడా వారు పిలుపునిచ్చారు. అలాగే, ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి, ఉగ్రవాద నిధుల మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వాటికున్న సంబంధాలను తొలగించడానికి, ఉగ్రవాదుల సరిహద్దు కదలికలను అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ (ఎఫ్ ఓఐపి), ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) మధ్య ఉన్న సన్నిహిత సహకారాన్ని ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. ఆసియాన్ ఐక్యత, ప్రాముఖ్యతకు, అలాగే "ఆసియాన్ ఔట్లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్ (ఏఓఐపీ)” కి తమ నిరంతర మద్దతును పునరుద్ఘాటించారు.
మయన్మార్లో మరింత తీవ్రతరమవుతున్న సంక్షోభం, ప్రాంతీయ భద్రత, ప్రజల మనుగడ, అంతర్జాతీయ నేరాల పెరుగుదలపై దాని ప్రభావం పట్ల ఇద్దరు ప్రధానమంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు తక్షణమే హింసాత్మక చర్యలను నిలిపివేయాలని వారు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేత, ఎన్నికల నిర్వహణ ప్రణాళికలపై ఇటీవల వచ్చిన ప్రకటనను వారు ప్రస్తావించారు. అన్ని వర్గాల మధ్య సమగ్ర చర్చలకు, స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన ఎన్నికలకు వీలు కల్పించే ప్రజాస్వామ్య మార్గంలోకి తిరిగి రావాలని వారు కోరారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని కోరారు. ఈ సంక్షోభానికి సమగ్రమైన, శాశ్వతమైన, శాంతియుత పరిష్కారం కోసం ఐదు అంశాల ఏకాభిప్రాయాన్ని పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆసియాన్ ప్రయత్నాలకు తమ బలమైన మద్దతును పునరుద్ఘాటించారు.
భారత్, జపాన్ మధ్య ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా ఆఫ్రికాలో, సంయుక్త ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఇద్దరు ప్రధానమంత్రులు పునరుద్ధరించారు. ఆఫ్రికాతో వాణిజ్యం, పెట్టుబడులకు పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయడానికి, భారతదేశంలో పారిశ్రామిక సమీకరణాన్ని ప్రోత్సహించడానికి లక్ష్యంగా చేసుకున్న జపాన్–ఇండియా కోఆపరేషన్ ఇనిషియేటివ్ ఫర్ సస్టెయినబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆఫ్రికా ప్రారంభాన్ని వారు స్వాగతించారు. ఆఫ్రికా అభివృద్ధిపై తొమ్మిదవ టోక్యో అంతర్జాతీయ సదస్సు (టీఐసీఏడీ9) ను విజయవంతంగా నిర్వహించడాన్ని కూడా వారు స్వాగతించారు. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఆఫ్రికాలో అనుసంధానం ఇంకా విలువ శ్రేణులను బలోపేతం చేయడానికి ఉన్న గణనీయమైన సామర్థ్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. టీఐసీఏడీ 9లో ప్రధానమంత్రి ఇషిబా ప్రకటించిన హిందూ మహాసముద్రం-ఆఫ్రికా ఆర్థిక ప్రాంత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. జపాన్, భారతదేశం, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య సహకారం భాగస్వాములందరి అభివృద్ధికి దోహదం చేయగలదని వారు అంగీకరించారు.
ఐక్యరాజ్యసమితి చార్టర్తో సహా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉక్రెయిన్లో న్యాయమైన, శాశ్వతమైన శాంతికి ఇద్దరు ప్రధానులు తమ మద్దతును వ్యక్తం చేశారు. న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించడానికి వివిధ దేశాలు చేస్తున్న దౌత్య ప్రయత్నాలను కూడా వారు స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత్వానికి తమ నిబద్ధతను ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. సంబంధిత వర్గాలన్నీ సంయమనం పాటించాలని, పౌరులను రక్షించాలని, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలని, పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చి ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణను వారు స్వాగతించారు. కాల్పుల విరమణను కొనసాగించాల్సిన అవసరాన్ని, అలాగే చర్చల ద్వారా ఇరాన్ అణు సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గాజాలో మానవతా సంక్షోభంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో క్షీణిస్తున్న మానవతా పరిస్థితిని పరిష్కరించడంతో పాటు, బందీలందరినీ విడుదల చేయడానికి, తక్షణ, శాశ్వత కాల్పుల విరమణకు సంబంధించి ఆయా పక్షాలు ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో, ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలని కోరుకునే వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను వారు స్వాగతించారు.
ప్రస్తుత భౌగోళిక-రాజకీయ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా శాశ్వత, శాశ్వతేతర వర్గాలను విస్తరించడంతో సహా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ సంస్కరణల కోసం కలిసి సన్నిహితంగా పని చేయడాన్ని కొనసాగించాలని ఇద్దరు ప్రధానమంత్రులు సంకల్పించారు. యూఎన్ఎస్సీ సంస్కరణలను వేగవంతం చేయాలనే తమ నిబద్ధతను వారు వ్యక్తం చేశారు. దీనికోసం ‘ఇంటర్-గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఫ్రేమ్వర్క్‘ కింద నిర్దిష్ట కాలపరిమితిలో, నిర్దిష్ట ఫలితాలను సాధించే లక్ష్యంతో టెక్స్ట్- బేస్డ్ చర్చలను ప్రారంభించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు చేసిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఒకరి అభ్యర్థిత్వానికి మరొకరు పరస్పర మద్దతును వ్యక్తం చేశారు. మారుతున్న ప్రపంచంలో అనుగుణమైన పాలనకు దోహదపడే ఐక్యరాజ్యసమితి సామర్థ్యం, ప్రభావం పెంచడానికి కూడా ఐక్యరాజ్యసమితి సంస్కరణలు అవసరమని వారు స్పష్టం చేశారు.
వివిధ రంగాలలో రెండు దేశాల సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రాముఖ్యతను ఇద్దరు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశం 2014 నుంచి భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడానికి, తదుపరి తరాలకు, ఆ తర్వాత కూడా ప్రయోజనం చేకూర్చే నిరంతర సహకారానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సృష్టించడానికి సహాయపడింది. 2027లో జరగబోయే భారత్ - జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం దిశగా రెండు దేశాలూ ముందుకు సాగుతున్నాయని, దీనిని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటామని ప్రధానమంత్రులు పేర్కొన్నారు. వ్యాపారం, మేధో, విజ్ఞాన, సాంస్కృతిక రంగాలతో పాటు వివిధ రంగాలలో రెండు దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా అభిప్రాయాలను, విలువైన ఆలోచనలను, విధాన సిఫార్సులను పంచుకున్నందుకు, పరస్పర క్రియాశీల భాగస్వామ్యాలను పెంపొందించుకోవడాన్ని ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. ఈ పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి గాను జపాన్ ప్రధానమంత్రి ఇషిబాకు శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరిలో భారతదేశం నిర్వహించనున్న క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ ఇషిబాను శ్రీ మోదీ ఆహ్వానించారు. జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా ఈ ఆహ్వానాన్ని స్వాగతించారు. ప్రధాని శ్రీ మోదీ పర్యటన భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రగాఢమైన నాగరిక సంబంధాలు, ప్రజల మధ్య గల శక్తిమంతమైన బంధాలూ, సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహానికి పునాది అయిన ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2254261)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
हिन्दी
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Urdu
,
Odia