ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజులే మిగిలిన నేపథ్యంలో ‘యోగా మహోత్సవ్’ నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 10:27AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఓ భాగమైన మురార్జీ దేశాయి జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై) 2026 మార్చి నెల 13న విజ్ఞాన్ భవన్లో యోగా మహోత్సవ్-2026ను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమం ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026’కు మరో 100 రోజులు మాత్రమే మిగిలి ఉండటాన్ని సూచిస్తోంది. ఆయుష్ శాఖ తన వివిధ ఆసక్తిదారులతో కలిసి, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకో 100 రోజులే మిగిలాయని ఒక్కొక్క రోజును గణించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో 100 సంస్థలు వంద ప్రదేశాలు/నగరాల్లో యోగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నెల 13న విజ్ఞాన్ భవన్లో ఉదయం 9 గంటల నుంచి ఒక మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కేబినెట్ మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖకు చెందిన సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)తో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్రావ్ జాదవ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా, బెంగళూరులోని ఎస్-వ్యాస సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ హెచ్.ఆర్. నాగేంద్ర, కేంద్ర ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి మోనాలిసా డాష్, ఇతర ప్రముఖులు, యోగా గురువులు, యోగా పండితులు, ఆయుష్ నిపుణులు, ఆధునిక వైద్యంతో పాటు సంబంధిత విజ్ఞానశాస్త్ర నిపుణులు, ప్రతినిధులు, యోగ ప్రేమికులు, యోగ సాధకులు కూడా పాలుపంచుకుంటారు.
ఈ సందర్భంగా ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, ‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు ఐక్యరాజ్యసమితి 2014వ సంవత్సరంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలనే చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న సంగతి మీకందరికీ తెలుసు. యోగాకు ప్రపంచవ్యాప్త ఆమోదం లభించడం మన దేశానికి గర్వకారణం. యోగా మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో విడదీయలేని భాగం. అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)ని నిర్వహించే బాధ్యత నోడల్ మంత్రిత్వ శాఖగా ‘ఆయుష్’పై ఉంది. ప్రతి ఏటా, ఐడీవై ముఖ్య కార్యక్రమంలో భాగంగా ఒక సామూహిక యోగా ప్రదర్శన ఉంటుంది. దీనికి ప్రధాని స్వయంగా నాయకత్వం వహిస్తారు. ఐడీవై సన్నాహాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి’’ అన్నారు.
ఐడీవై చోటుచేసుకోవడానికి మిగిలి ఉన్న 100 రోజులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఉత్సవానికి సన్నాహాలు చేయడానికి ముఖ్య దశను నిర్వహిస్తుంటారు. ఈ కాలంలో, మంత్రిత్వ శాఖ తన ప్రచారాన్నీ, ప్రసారాన్నీ విస్తృత స్థాయిలో చేపట్టడానికీ, యోగా సందేశాన్ని మరింత మంది చెంతకు చేరవేయడానికీ ప్రయత్నిస్తుంటుంది. దేశం నలుమూలలా ప్రజలను కలుపుకొని ముందుకు పోవడంతో పాటు ఐడీవై 2026కు ముందటి 100 రోజుల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం పంచుకొనేటట్లు వారిని ప్రోత్సహించడం ఈ ప్రయత్నాల లక్ష్యం.
రాబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా, ఆయుష్ శాఖ 100 కీలక స్థానాల్లో ఈ సందర్భాన్ని నిర్వహించాలని ప్రతిపాదించింది. 100 రోజులకు ముందే సన్నాహాలు మొదలుపెట్టారు. ఐడీవై-2026 సన్నాహాలు వేగం పుంజుకొంటున్నాయి.. ఈ సన్నాహక చర్యలు యోగాను ఓ సంపూర్ణ శ్రేయో సాధన మార్గంగా స్వీకరించి ఈ పండుగలో పాల్గొనేందుకు దేశమంతటా ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2239001)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam