గౌరవ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే,
రెండు దేశాల ప్రతినిధులకు,
మీడియా మిత్రులకు,
హలో!
ఆయు బోవన్!
వణక్కం!
అధ్యక్షుడు విక్రమసింఘే, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్కు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుడిగా విక్రమసింఘే ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడచిన ఏడాదిలో శ్రీలంక ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు ఎప్పటిలాగానే ఆప్తమిత్రునిగా అండగా నిలిచాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న శ్రీలంక ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
స్నేహితులారా,
మన నాగరికతల మాదిరిగానే మన సంబంధాలు కూడా ప్రాచీనమైనవి, విస్తృతమైనవి. భారత్ అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’,‘సాగర్’ విధానాలు రెండింటిలోనూ శ్రీలంకకు ముఖ్యమైన స్థానం ఉంది. ఈ రోజు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకున్నాం. భారత్, శ్రీలంకల భద్రతా ప్రయోజనాలు, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నామని మేం విశ్వసిస్తున్నాం. అందుకే.. ఉభయ పక్షాల భద్రత, సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.
స్నేహితులారా,
ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన దార్శనిక పత్రాన్ని ఈ రోజు స్వీకరించాం. రెండు దేేశాల మధ్య సముద్ర, వైమానిక, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలను ఇది బలోపేతం చేస్తుంది. పర్యాటకం, విద్యుత్, వాణిజ్యం, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిలో పరస్పర భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే శ్రీలంక పట్ల భారత్కున్న దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.
స్నేహితులారా,
ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందంపై చర్చలు త్వరలోనే ప్రారంభించాలని మేం నిర్ణయించాం. ఇది వాణిజ్యం, ఆర్థిక సహకారంలో రెండు దేశాలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
భారత్ శ్రీలంక మధ్య విమాన అనుసంధానతను విస్తరించేందుకు మేం అంగీకరించాం. వాణిజ్య, ప్రజల రాకపోకలను పెంచేందుకు వీలుగా తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించాం.
రెండు దేశాల మధ్య విద్యుత్ గ్రిడ్లను అనుసంధానించే పనులను వేగవంతం చేయాలని నిర్ణయించాం. భారత్, శ్రీలంక మధ్య పెట్రోలియం పైపు లైను వేయడానికి ఉన్న సాధ్యసాధ్యాలపై అధ్యయనం జరుగుతుంది. వీటితో పాటుగా, ల్యాండ్ బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించాం. శ్రీలంకలో యూపీఐ ప్రారంభించే ఒప్పందంపై ఈరోజు చేసిన సంతకంతో ఫిన్టెక్ అనుసంధానం కూడా పెరుగుతుంది.
స్నేహితులారా,
మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశాల గురించి సైతం మేం చర్చించాం. ఈ అంశంలో మానవతా దృక్పథంతో ముందుకెళ్లేందుకు మేం అంగీకరించాం. శ్రీలంకలో పునరుద్ధరణ, సర్దుబాటు గురించి కూడా మేం చర్చించాం. అలాగే.. శ్రీలంకలో తాను అనుసరిస్తున్న సమ్మిళిత విధానం గురించి అధ్యక్షుడు విక్రమసింఘే తెలియజేశారు.
శ్రీలంక ప్రభుత్వం తమిళుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, సమానత్వం, న్యాయం, శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. పదమూడో సవరణను అమలు చేసి, ప్రావిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలనే వాగ్దానాన్ని నెరవేరుస్తుందని, శ్రీలంకలో తమిళ సమాజానికి మర్యాదను, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుందని భావిస్తున్నాం.
స్నేహితులారా,
మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ఏడాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరంతో మన దౌత్య సంబంధాలకు 75 వసంతాలు పూర్తయ్యాయి. భారతీయ సంతతికి చెందిన తమిళ సమాజం శ్రీలంకకు వచ్చి 200 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీలంకలో ఉన్న భారతీయ మూలాలున్న తమిళ కుటుంబాలకు రూ.75 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. వీటికి అదనంగా.. శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ సహకరిస్తుంది.
మహాశయా,
భారత్కు మాత్రమే కాకుండా.. మొత్తం హిందూ మహా సముద్ర ప్రాంతానికి అతి ముఖ్యమైన అంశం.. స్థిరమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన శ్రీలంక. ఈ సంక్షోభ సమయంలో భారత పౌరులు శ్రీలంక ప్రజలకు అండగా ఉంటారని నేను మరోసారి హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన పత్రికా ప్రకటనకు అనువాదం.
***