సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
తప్పుడు సమాచారం పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో పత్రికల విశ్వసనీయతను కాపాడటం మన సమష్టి బాధ్యత
పాత్రికేయుల ఆలోచనలను నడిపించే తీర్పు, ఆత్మ ప్రబోధం, బాధ్యతా స్ఫూర్తిని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయజాలదు: పీసీఐ
సాంప్రదాయ, సామాజిక మాధ్యమాలు రెండింటిలోనూ సమాచారం ఇవ్వడంలో
వేగం కంటే కచ్చితత్వం తప్పనిసరి: పీటీఐ సీఈఓ
న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
Posted On:
16 NOV 2025 4:44PM by PIB Hyderabad
“ఒక ప్రజాస్వామ్య దేశంలో పత్రికలే ప్రజలకు కళ్లూ, చెవులు. తప్పుడు సమాచారం పెరుగుతున్న ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో పత్రికల విశ్వసనీయతను కాపాడటం ప్రజల సాధికారతకు అత్యంత కీలకం” అని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు స్పష్టం చేశారు. ఈ ఏడాది జాతీయ పత్రికా దినోత్సవానికి ఇతివృత్తంగా నిర్ణయించిన “పెరుగుతున్న తప్పుడు సమాచారం మధ్య పత్రికల విశ్వసనీయత సంరక్షణ” అంశంపై భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) రంజనా ప్రకాష్ దేశాయ్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. “మానవ మేధను కృత్రిమ మేధ ఎప్పటికీ భర్తీ చేయలేదని” అన్నారు. ప్రతి జర్నలిస్టును నడిపించే తీర్పు, అంతరాత్మ ప్రబోధం, బాధ్యతా స్ఫూర్తి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించాలని పేర్కొన్నారు.
పీటీఐ సీఈఓ శ్రీ విజయ్ జోషి ప్రధానోపన్యాసం చేస్తూ, నేడు మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించే సమాచారాన్ని నిరోధించడానికి ఎదుర్కోవడానికి ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. "సంప్రదాయ పత్రికా మాధ్యమాల్లోనూ, ఏఐ సూచనలతో పని చేసే డిజిటల్ మీడియాలోనూ కూడా వేగం కంటే కచ్చితత్వానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఆయన స్పష్టం చేశారు.
"ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, పీసీఐ కార్యదర్శి శ్రీమతి శుభా గుప్తా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బాధ్యతాయుత జర్నలిజం కోసం పీసీఐ పిలుపు
భారత ప్రెస్ కౌన్సిల్ పై రెండు బాధ్యతలు ఉన్నాయని, ఒకటి పత్రికా స్వేచ్ఛను కాపాడడం, మరొకటి ఉన్నత పత్రికా ప్రమాణాలను నిలబెట్టడం అని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ పేర్కొన్నారు. తప్పుడు సమాచార వ్యాప్తి, సాంకేతికత దుర్వినియోగం పెరగడం వంటి ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజానికి నిజాయితీ, కచ్చితత్వం, సరైన సమాచారాన్ని అందించాలనే నిబద్ధత అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
కమిటీలను, నిజ నిర్ధారణ బృందాలను పీసీఐ ఏర్పాటు చేసిందని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ పేర్కొన్నారు. జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పూర్తి ధ్రువీకరణతోనే సమాచారాన్ని అందించాలని కోరారు. సంక్షేమ పథకాలు, బీమా ద్వారా జర్నలిస్టులకు ఆర్థిక భద్రత కల్పించవలసిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. ప్రెస్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఇంటర్న్షిప్ కార్యక్రమాలు యువ జర్నలిస్టులు నైతిక పద్ధతులను నేర్చుకోవడానికి సహాయపడతాయని ఆమె అన్నారు.
ఏఐ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రెస్ కౌన్సిల్ అప్రమత్తంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సాధనాలు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, అవి తీర్పు, అంతరాత్మ ప్రబోధం వంటి విషయాల్లో మానవ మేధస్సు ను ఎప్పటికీ భర్తీ చేయలేవని పేర్కొన్నారు.
ఏఐ యుగంలో విశ్వసనీయత పరిరక్షణ
పిటిఐ సిఇఒ శ్రీ విజయ్ జోషి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి నైతిక కాపలాదారుగా పత్రికలు బలమైన నైతికతను పాటించాలని అన్నారు. చెల్లింపు వార్తలు, ప్రచార సంపాదకీయాలు, ఎల్లో జర్నలిజం ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీస్తాయని హెచ్చరించారు. డిజిటల్ ప్రాబల్యం ఇప్పుడు కచ్చితత్వం కంటే సంచలనానికి, ఆకర్షణకు ప్రాధాన్యత ఇస్తూ, పక్షపాత సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. మహమ్మారి సమయంలో వాస్తవం, తప్పుడు సమాచారం ఎంత త్వరగా కలసిపోతాయో రుజువైందని, ఇప్పుడు ఏఐ ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విశ్వసనీయమైన సత్యాన్ని నిర్ధారించడంలో పాత్రికేయులు సమిష్టి బాధ్యతను తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. పీటీఐ ఏర్పాటయిన నాటి నుంచి 99 వార్తాపత్రికల ద్వారా సత్యం, కచ్చితత్వం, నిష్పాక్షికత, స్వతంత్రతలను వారసత్వంగా కొనసాగిస్తోందని తెలిపారు. వేగం కంటే కచ్చితత్వానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని, వార్తా కథనాలు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.
ఫ్యాక్ట్ చెక్ వంటి కార్యక్రమాలు బహుళ-స్థాయి ధ్రువీకరణతో తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడతాయని, విశ్వసనీయతను కాపాడటానికి భవిష్యత్తు జర్నలిస్టులకు నైతికత, విమర్శనాత్మక ఆలోచనలో శిక్షణ ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛ సమాచార వ్యవస్థను కలుషితం చేయడానికి ఒక లైసెన్స్ కాదని, జర్నలిజం విశ్వాసంపై ఆధారపడిన ప్రజా సేవారంగమని శ్రీ జోషి గుర్తు చేశారు.
భారత ప్రెస్ కౌన్సిల్ గురించి
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, బాధ్యతాయుతంగా వార్తలు అందించడానికి పత్రికలకు అంతర్గత స్వీయ-నియంత్రణ యంత్రాంగం ఉండాలనే లక్ష్యంతో 1966లో పార్లమెంటు చట్టం ద్వారా ఒక పాక్షిక న్యాయాధికార సంస్థగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. 1979లో దానిని పునర్వ్యవస్థీకరించారు. అప్పటి నుంచి ప్రెస్ కౌన్సిల్ దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి, వార్తాపత్రికలు, వార్తా సంస్థల ప్రమాణాలను పెంచడానికి నిరంతరం కృషి చేస్తోంది. అలాగే, చట్టసభలు, ఇతర అధికారులకు సలహా మండలిగా కూడా ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
***
(Release ID: 2190623)
Visitor Counter : 5
Read this release in:
Gujarati
,
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam