సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్థానికంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర నిర్మాణం చేపట్టడాన్ని సులభతరం చేసేందుకు ఇండియా సినీ హబ్ పోర్టల్ను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం
వెనుకబడిన ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో కూడిన సినిమా హాళ్లను ప్రోత్సహించడానికి ఒక రోడ్మ్యాప్ను ఇచ్చిన ప్రభుత్వం
చలనచిత్ర అనుమతులను క్రమబద్ధీకరించటంతో చలనచిత్ర రంగంలో సులభతరం కానున్న చిత్ర నిర్మాణం
క్షేత్రస్థాయి (గ్రాస్ రూట్) సినిమా కార్యక్రమాలు మహిళలు, స్థానికులను శక్తిమంతం చేస్తాయన్న సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్
మీడియా - వినోద రంగంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించటం ద్వారా కేంద్ర-రాష్ట్ర సమన్వయం కోసం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాల సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పత్రికల నమోదు, అవి చట్టబద్ధంగా నిబంధనలను పాటించటాన్ని సులభతరం చేసేందుకు నిర్దిష్ట అధికారులను నియమించటం ద్వారా ప్రెస్ సేవా పోర్టల్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం
చిత్రీకరణకు అనుగుణమైన ప్రాంతాలు, అవసరమైన ప్రతిభ, సులభతరమైన అనుమతుల ప్రక్రియను ప్రదర్శించేందుకు ఐఎఫ్ఎఫ్ఐ, వేవ్స్లను ఉపయోగించుకోవాలని కోరిన కేంద్రం
వినోదానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు తరం సృజనాత్మక మేధను పెంపొందించేందుకు కూడా ఐ
Posted On:
05 AUG 2025 6:39PM by PIB Hyderabad
2025 అగస్టు 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచార, ప్రజా సంబంధాల శాఖ (ఐఎన్పీఆర్) కార్యదర్శులతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ డాక్టర్ ఎల్. మురుగన్.. సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సమాచారంలో కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం.. ప్రెస్ సేవా పోర్టల్, ఇండియా సినీ హబ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణను తయారు చేయటం.. చలనచిత్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు, దేశవ్యాప్తంగా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి భాగస్వామ్య అవకాశాలను అన్వేషించటమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
మీడియా సంస్కరణలు, భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను విస్తరించడం
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడారు. ఇండియన్ సినిమా హబ్ పోర్టల్ను ఏకీకృత సింగిల్-విండో వ్యవస్థగా పునరుద్ధరించినట్లు తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా చిత్రనిర్మాణ అనుమతులు, వాటికి సంబంధించిన సేవలు ఒక పద్ధతిలో లభించేలా చేస్తుందని అన్నారు. జీఐఎస్ సమాచారం, ఉమ్మడి ఫోరమ్లతో సులభతర చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రధానమంత్రి మోదీ సారథ్యంలోని భారతదేశ చలనచిత్ర అనుకూల విధానాలను ఇది ప్రదర్శిస్తోంది.
తక్కువ ఖర్చుతో కూడిన థియేటర్ల ద్వారా మహిళలు, స్థానిక ప్రజలకు సాధికారత కల్పించే క్షేత్రస్థాయి సినిమా కార్యక్రమాలను కూడా మంత్రి ప్రధానంగా తెలియజేశారు. ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడం, భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక దౌత్యాన్ని ప్రోత్సహించడం, రేపటి సృజనాత్మక మేధస్సులను శక్తిమంతం చేస్తోన్న వేవ్స్-2025, ఐఎఫ్ఎఫ్ఐ గోవా వంటి ప్రధాన ప్రపంచ స్థాయి కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావించారు.
దేశంలో క్రియేటర్ ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా తెలియజేస్తూ.. ఇటీవల ప్రారంభమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీపై (ఐఐసీటీ) ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇది యానిమేషన్, గేమింగ్, సంగీతం, ఇతర సృజనాత్మక రంగాలలో యువతకు నైపుణ్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
మీడియా పురోగతికి సహకార పాలన
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సమర్థవంతమైన కమ్యూనికేషన్, మీడియా అభివృద్ధిలో కేంద్ర- రాష్ట్ర సహకారం పోషించే కీలక పాత్రను ప్రధానంగా చెప్పారు. డిజిటల్ క్రియేటర్లు, స్థానిక మీడియా పెరుగుదల, జిల్లా స్థాయి ఐఎన్పీఆర్ వ్యవస్థలను శక్తిమంతం చేయవలసిన అవసరాన్ని వివరించారు. ప్రచురణ ప్రక్రియలు మరింత సాఫీగా సాగేందుకు అన్ని రాష్ట్రాలు ప్రెస్ సేవా పోర్టల్తో ఏకీకృతం కావాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాల్లో మీడియా విభాగాల మధ్య సమన్వయం లోపించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సినిమా, కంటెంట్ సృష్టికి ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. మెట్రో నగరాలను దాటి వెళ్లాల్సి ఉందన్న ఆయన.. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. చిత్రనిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు, క్రియేటర్లు కంటెంట్ ద్వారా సంపాదించుకునేందుకు వీలుగా ఇండియా సినీ హబ్ వంటి కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. వేవ్స్ను ప్రపంచ స్థాయి ఉద్యమంగా అభివర్ణించారు. మీడియాకు సంబంధించిన వ్యవస్థలో అన్ని స్థాయిలలో సహకారాన్ని, చర్చలను మరింతగా పెంచేందుకు గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో రేడియో సదస్సును నిర్వహించేందుకు ఉన్న ప్రణాళికలను పంచుకున్నారు.
దృష్టి సారించనున్న కీలక అంశాలు:
రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల సంబంధిత అధికారులను ప్రెస్ సేవా పోర్టల్కు అనుసంధానించటంతో పాటు .. పోర్టల్కు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయటంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం (పీఆర్పీ) - 2023 కింద ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దీనిని అభివృద్ధి చేసింది. పత్రికలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, చట్టబద్ధ పద్ధతులను అనుసరించే ప్రక్రియను ఇది సులభతరం చేయనుంది.
2024 జూన్ 28 నుంచి అందుబాటులోకి వచ్చిన నూతన హంగులతో కూడిన ఇండియా సినీ హబ్ పోర్టల్పై కూడా ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ పోర్టల్ ఇప్పుడు భారతదేశం అంతటా చలనచిత్రాల విషయంలో సింగిల్ విండో వ్యవస్థగా పనిచేస్తోంది. ఇది కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయిలో చిత్రీకరణ అనుమతులు, ప్రోత్సాహకాలు, వనరులను చిత్ర నిర్మాతలు ఒకే దగ్గర పొందేందుకు ఉపయోగపడుతుంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే దీనితో పనిచేస్తున్నాయి. ఇరవై ఒక్క రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఒక సాధారణ దరఖాస్తు ఫారమ్ ద్వారా ఈ వ్యవస్థలోకి వస్తున్నాయి.
జీఐఎస్ ఆధారంగా వివిధ ప్రాంతాల మ్యాపింగ్, పరిశ్రమ నిపుణుల నుంచి సేకరించిన కంటెంట్.. చిత్రీకరణకు సంబంధించిన, సంబంధించని వివిధ ప్రక్రియలు.. ప్రోత్సాహకాల విషయంలో ఇండియా సినీ హబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. చిత్రీకరణ విషయంలో ప్రపంచ గమ్యస్థానంగా భారత్కు ఉన్న ఆకర్షణను మెరుగుపరిచేందుకు దరఖాస్తుల ప్రక్రియ, ధ్రువీకరించిన సమాచారాన్ని పంచుకోవటం గురించి సమావేశంలో చర్చించారు.
సినిమా గురించి తెలియని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కూడిన సినిమా హాళ్లను ప్రోత్సహించటంపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలను నిర్మించే దేశాల్లో భారత్ ఉన్నప్పటికీ చిత్రాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని చోట్లా ఒకేలా లేవు. తృతీయ శ్రేణి, చతుర్ధ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు.. ఆకాంక్షిత జిల్లాల్లో సేవలందించేందుకు మాడ్యులర్, మొబైల్ సినిమా నమూనాల అభివృద్ధిని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది
జీఐఎస్ మ్యాపింగ్ ఉపయోగించి తక్కువ సినిమా హళ్లున్న ప్రాంతాలను గుర్తించటం, ఉన్న ప్రజా మౌలిక సదుపాయాలను తిరిగి ఉపయోగించుకోవటం, సింగిల్-విండో వ్యవస్థల ద్వారా లైసెన్సింగ్ను క్రమబద్ధీకరించటం, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉన్న సినిమా మౌలిక సదుపాయాల విషయంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను, భూ ప్రోత్సాహకాలను అందించటంపై సమావేశంలో చర్చించారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ), వేవ్స్ బజార్ వంటి ప్రధాన చలనచిత్ర, కంటెంట్ ప్లాట్ఫామ్ల గురించి కూడా చర్చ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ చిత్రీకరణ ప్రదేశాలను ప్రదర్శించడానికి, ప్రాంతీయ ప్రోత్సాహకాలను తెలియజేసేందుకు, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి వీటిని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. 55వ ఐఎఫ్ఎఫ్ఐలో 114 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 30 దేశాల నుంచి 2,000 కంటే ఎక్కువ పరిశ్రమ ప్రతినిధులకు వేవ్స్ బజార్ వేదికైంది. ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం, భారతీయ పనోరమాలో పాల్గొనేందుకు ప్రోత్సహించటం, ప్రపంచ స్థాయి వ్యవస్థల్లో పనిచేసే అనుభవాన్ని సంపాదించుకునేందుకు సృజనాత్మక ప్రతిభను నామినేట్ చేయడం ద్వారా రాష్ట్రాలు ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు.
భారతదేశ ప్రత్యక్ష వినోద ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై కూడా సమావేశం దృష్టి సారించింది. వివిధ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఉన్న క్రీడలు, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను ఉపయోగించడం.. ఇండియా సినీ హబ్లో అనుమతి ప్రక్రియను ఏకీకృతం చేయడం.. నోడల్ అధికారులను నియమించడం.. ప్రత్యక్ష వినోదానికి సంబంధించిన మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల కోసం విధాన, ఆర్థిక సహాయాన్ని అందించటం గురించి రాష్ట్ర ప్రతినిధులతో చర్చించారు.
డిజిటల్ సాధికారత సాధించిన, సాంస్కృతికంగా శక్తిమంతమైన సమాజంగా భారతదేశ పురోగతికి దోహపడుతూ కమ్యూనికేషన్, సృజనాత్మక ఆర్థిక అభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ ఉన్నత స్థాయి చర్చా సమావేశం జరిగింది.
***
(Release ID: 2152993)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam