ప్రధాన మంత్రి కార్యాలయం
లావోస్ దేశాధ్యక్షుడితో ప్రధాని భేటీ
Posted On:
11 OCT 2024 1:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లావోస్ అధ్యక్షుడు, లావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ (ఎల్పీఆర్పీ) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి థాంగ్లౌన్ సిసౌలిత్తో వియాంటియాన్లో సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సును, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన ఇరువురు నేతలు.. సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్-లావోస్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యం పురాతన నాగరిక సంబంధాల్లో చాలా పటిష్ఠంగా ఉందని ఇద్దరు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో భాగస్వామ్యం, వారసత్వ సంపద పునరుద్ధరణ, సాంస్కృతిక మార్పిడి వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీకి 2024తో దశాబ్దం నిండుతుందని తెలిపిన ప్రధాన మంత్రి... లావోస్తో భారత్ సంబంధాలను మరింత వేగంగా మెరుగుపరచటంలో దాని ప్రాముఖ్యతను ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య నాగరిక సంబంధాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ.. పునఃప్రారంభం చేసిన నలంద విశ్వవిద్యాలయం అందించే అవకాశాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యాగీ తుఫాను వరదలకు సంబంధించి లావోస్కు భారత్ అందించిన మానవతా సహాయం పట్ల ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు సిసౌలిత్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-ఆసియాన్ సంబంధాల బలోపేతం విషయంలో లావోస్ అందించిన సహాయసహకారాలకు ఆ దేశ అధ్యక్షుడు సిసౌలిత్కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
****
(Release ID: 2064187)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam