ప్రధాన మంత్రి కార్యాలయం

జోషిమఠ్ పరిస్థితిపై ప్రధాని ముఖ్య కార్యదర్శి ఉన్నతస్థాయి సమీక్ష


స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనలో
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలు.. నిపుణుల తోడ్పాటు;

ఇప్పటికే జోషిమఠ్‌ చేసుకున్న ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌.. 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు;

బాధిత కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు;

పరిస్థితిపై అంచనా నిమిత్తం రేపు ఉత్తరాఖండ్‌కు
సరిహద్దు నిర్వహణ కార్యదర్శి.. ఎన్డీఎంఏ సభ్యులు;

జోషిమఠ్‌ నుంచి ‘పీఎంవో’కు సమాచారమిచ్చిన ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి;

పరిస్థితులపై అధ్యయనం.. సిఫారసుల కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి నిపుణుల బృందం

Posted On: 08 JAN 2023 6:50PM by PIB Hyderabad

   జోషిమఠ్‌లో భూమి కుంగుబాటు, భవనాలకు నష్టంపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఇవాళ- 2023 జనవరి 8న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి; హోంశాఖ  కార్యదర్శి; కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు; జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యులుసహా ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జోషిమఠ్‌ జిల్లా కలెక్టర్‌, అధికారులు; ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు; ఐఐటీ రూర్కీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థల నిపుణులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ- గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతో ఆందోళనకు గురయ్యారని, అక్కడి పరిస్థితులపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రితో సమీక్షించారని తెలిపారు.

   జోషిమఠ్‌ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ నిపుణుల తోడ్పాటుతో రాష్ట్ర, జిల్లా అధికారులు అంచనా వేశారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారమిచ్చారు. దాదాపు 350 మీటర్ల వెడల్పున భూమి కుంగుబాటుకు గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంతోపాటు నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పారు. బాధిత కుటుంబాలను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, వసతి, భద్రత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ దళంతోపాటు ఎస్పీ కూడా అక్కడే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జోషిమఠ్ వాసులకు అక్కడి పరిణామాలను తెలిపి, వారి సహకారం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే స్వల్ప-దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన కోసం నిపుణుల సలహాలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

   రోవైపు రేపు- జనవరి 9న సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, నలుగురు ఎన్డీఎంఏ సభ్యులు ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తారు. జోషిమఠ్‌లో పరిస్థితులపై సాంకేతిక నిపుణుల (ఎన్డీఎంఏ, ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐహెచ్‌, వాడియా ఇన్‌స్టిట్యూట్‌, ఐఐటీ-రూర్కీ) బృందాల పరిశీలన ఫలితాలను వీరు సమగ్రంగా పరిశీలిస్తారు. అటుపైన పరిస్థితులను చక్కదిద్దడానికి చేపట్టాల్సిన స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తారు.

   ప్రభావిత ప్రాంతంలో నివసించే ప్రజల భద్రతే రాష్ట్రానికి తక్షణ ప్రాధాన్యమని సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులతో విస్పష్ట, నిరంతర సమాచార మార్గం ఏర్పరచుకోవాలని సూచించారు. సాధ్యమైనన్ని ఆచరణాత్మక చర్యల ద్వారా పరిస్థితి మరింత క్షీణించకుండా తక్షణ ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ప్రభావిత ప్రాంతంపై వివిధ శాఖల ప్రమేయంతో విచారణ చేపట్టాలని కోరారు. వివిధ కేంద్ర సంస్థలు- నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కీ (ఐఐటీ), వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్‌), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ)ల నిపుణులు ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సంయుక్తంగా “సంపూర్ణ ప్రభుత్వ” స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు. స్పష్టమైన కాలపరిమితితో పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని, తప్పనిసరిగా నిరంతర భూకంప పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ అనుభవాలను గుణపాఠంగా తీసుకుని, జోషిమఠ్‌ కోసం ముప్పు నివారణ పట్టణాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

******



(Release ID: 1889671) Visitor Counter : 185