ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్-బంగ్లాదేశ్ వాస్తవిక సాదృశ సదస్సుపై సంయుక్త ప్రకటన

Posted On: 17 DEC 2020 4:07PM by PIB Hyderabad
  1. మాననీయ గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయ గణతంత్ర బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2020 డిసెంబర్ 17న వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగమైన అన్ని అంశాలపై ఉభయ పక్షాలు సమగ్రంగా చర్చించాయి. దీంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాల ఆదానప్రదానం కూడా సాగింది.

భారత-బంగ్లాదేశ్ భాగస్వామ్యం

  1. రెండు దేశాల చరిత్ర, సంస్కృతి, భాష, భాగస్వామ్యాన్ని విపులీకరించే ఇతర విశిష్ట సారూప్యాలు ప్రాతిపదికగాగల ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రులిద్దరూ ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్-భారత సంబంధాలు సౌభ్రాత్ర బంధాలపై ఆధారపడి ఉన్నాయని వారు నొక్కి చెప్పారు. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించిన సార్వభౌమాధికారం, సమానత్వం, విశ్వాసం, అవగాహన పునాదులుగా సంపూర్ణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భాగంగా 1971లో అసమాన త్యాగాలు చేసిన అమరవీరులకు, విముక్తి యోధులు, భారత సైనికులకు ప్రధానులిద్దరూ ఘనంగా నివాళి అర్పించారు. రెండు స్నేహపూర్వక దేశాల ప్రజాకాంక్షలకు అనుగుణంగా అమూల్యమైన ప్రజాస్వామ్య, సమానత్వ విలువలను సమున్నత స్థాయిలో ఉంచుతూ పరిరక్షిస్తామని వారు ప్రతినబూనారు.
  2. ప్రధాని షేక్ హసీనా అక్టోబర్ 2019నాటి ఢిల్లీ అధికారిక పర్యటన సందర్భంగా తీసుకున్న వివిధ నిర్ణయాల ప్రగతిపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు 2020 సెప్టెంబర్‌లో నిర్వహించిన సంయుక్త సంప్రదింపుల కమిషన్ 6వ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడాన్ని ఉభయపక్షాలూ గుర్తుచేసుకున్నాయి.

ఆరోగ్య రంగంలో సహకారం- ప్రపంచ ప్రజారోగ్య సవాలుకు పరిష్కారం

  1. రెండు దేశాలలో ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులపై ఉభయపక్షాలూ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ సంక్షోభ సమయాన రెండు దేశాల మధ్య నిరంతర సహకారం కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయి. భారత్ అనుసరిస్తున్న ‘పొరుగుకు ప్రాధాన్యం’ విధానానికి అనుగుణంగా బంగ్లాదేశ్‌కు అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వడాన్ని ఈ సందర్భంగా భారత్ పునరుద్ఘాటించింది. భారతదేశంలో కోవిడ్ టీకాల ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు బంగ్లాదేశ్‌కు అందుబాటులో ఉంచుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి రెండు దేశాల్లో ప్రైవేటు రంగాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని దేశాధినేతలిద్దరూ ప్రశంసించారు.
  2. టీకాల ఉత్పాదనతోపాటు చికిత్స విధానాల్లో సహకారానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తమ వైద్య నిపుణుల కోసం బంగ్లా భాషలో సామర్థ్య వికాస కోర్సులను భారత్ నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ ప్రశంసించింది.

సాంస్కృతిక సహకారం- చారిత్రక సంబంధాల సంయుక్తాచరణ

  1. ‘ముజిబ్ బొర్షో’ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణద్వారా భారత్ ప్రదర్శించిన సౌహార్దతను ప్రధాని షేక్ హసీనా వేనోళ్ల కొనియాడారు. బంగబంధు షేక్ ముజీబ్-ఉర్-రహ్మాన్ శతజయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం జారీచేసిన స్మారక తపాలాబిళ్లను ఇద్దరు ప్రధానమంత్రులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కాగా, గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మాగాంధీ గౌరవార్థం బంగ్లాదేశ్ ప్రభుత్వం 2020 సెప్టెంబరులో ప్రత్యేక తపాలా బిళ్లను జారీ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
  2. ఈ సదస్సు సందర్భంగా మహనీయులైన 20వ శతాబ్దపు నాయకులు మహాత్మా గాంధీ, బంగబంధు స్మారకార్థ డిజిటల్ ప్రదర్శనలో భాగంగా పరిచయ వీడియోను ప్రదర్శించారు. బంగ్లాదేశ్, భారతదేశాల్లోని వివిధ నగరాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలతోపాటు ఐక్యరాజ్య సమితిలోనూ ఈ వీడియోను ప్రదర్శిస్తారు. తద్వారా మహా నాయకులు ప్రబోధించిన న్యాయం, సమానత్వం, అహింస విలువలు ప్రజానీకాన్ని- ముఖ్యంగా యువతరాన్ని ఉత్తేజితం చేయగలవని దేశాధినేతలిద్దరూ ఆశాభావం వ్యక్తం చేశారు.
  3. ప్రముఖ భారత చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో 2021 జనవరి నుంచి బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్ జీవితచరిత్ర ఆధారిత చిత్ర ప్రదర్శన ప్రారంభం కానుండటంపై ఉభయపక్షాలూ హర్షం వ్యక్తంచేశాయి.
  4. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50వ వార్షికోత్సవం, భారత-బంగ్లా దౌత్య సంబంధాలు శ్రీకారం చుట్టుకోవడాన్ని స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించబోయే 2021 సంవత్సరం రెండు దేశాల్లో చారిత్రక సందర్భంగా నిలిచిపోతుందని నాయకులిద్దరూ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ శకంలోనే గొప్పవైన రెండు సంఘటనలను స్ఫురణకు తెస్తూ భారత్-బంగ్లాలతోపాటు తృతీయ ప్రపంచ దేశాలలో వివిధ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించాలని ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.
  5. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ముజీబ్ నగర్-నోడియా రహదారికిగల చారిత్రక ప్రాధాన్యాన్ని  గుర్తిస్తూ బంగ్లా-భారత సరిహద్దులోని ఈ మార్గానికి ‘‘షాధినోతా షొడోక్’’గా నామకరణం చేయాలన్న బంగ్లాదేశ్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని భారత పక్షానికి విజ్ఞ‌ప్తి చేశారు.
  6. రెండు దేశాల మధ్య సాంస్కృతి, విద్యా, శాస్త్ర-సాంకేతిక, యువజన, క్రీడా, ప్రజామాధ్యమ రంగాలను ప్రోత్సహించే దిశగా ఆయా బృందాల నిరంతర ఆదానప్రదానం కొనసాగించాలన్న సంకల్పాన్ని ఉభయపక్షాలూ పునరుద్ఘాటించాయి.

సరిహద్దుల నిర్వహణ – భద్రతా సహకారం

  1. ఇచ్చామతి, కాళింది, రాయ్‌మంగ‌ళ్‌, హరియాభంగా నదుల ప్రధాన స్తంభం 1 నుంచి భూ సరిహద్దుల కూడలి వరకూ నిర్దేశిత సరిహద్దుల విభజనను ఖరారు చేసే దిశగా కొత్త స్ట్రిప్ మ్యాప్‌ల రూపకల్పనపై ఉమ్మడి సరిహద్దు సదస్సుకు సంబంధించిన సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించడంపై ఉభయపక్షాలూ అంగీకరించాయి. దీంతోపాటు కుహ్సియారా నదివెంబడి అంతర్జాతీయ సరిహద్దును స్థిరహద్దుగా మార్చే దిశగా అవసరమైన పనులు చేపట్టేందుకు అంగీకారం కుదిరింది.
  2. రాజ్‌షాహి జిల్లా వద్ద పద్మా నది వెంబడి 1.3 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని ‘నిరభ్యంతర ప్రయాణ మార్గం’గా ప్రకటించాలన్న అభ్యర్థనను బంగ్లా పక్షం పునరుద్ఘాటించగా దాన్ని పరిశీలించేందుకు భారత్ అంగీకరించింది.
  3. రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులోగల త్రిపుర (భారత్)-బంగ్లాదేశ్ సెక్టార్ పరిధిలో నిలిచిపోయిన కంచె నిర్మాణం పూర్తికి దేశాధినేతలిద్దరూ అంగీకరించారు. కంచెలేని కారణంగా ఈ సరిహద్దుల వద్ద పౌరుల ప్రాణనష్టం ఆందోళనకర అంశమేనని వారిద్దరూ అంగీకరించారు. ఇటువంటి సరిహద్దు దుస్సంఘటనలను పూర్తిస్థాయిలో నివారించే కృషిలో భాగంగా సమన్వయ చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత సరిహద్దు దళాలను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుత సమన్వయ సరిహద్దు నిర్వహణ ప్రణాళిక సంపూర్ణ అమలు ఆవశ్యతకను నాయకులిద్దరూ నొక్కి చెప్పారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ కరెన్సీ దొంగ రవాణాతోపాటు ముఖ్యంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణా నిరోధానికి రెండు దేశాల సరిహద్దు గస్తీ దళాలు ఇటీవల చేసిన కృషిపై ఉభయపక్షాలూ సంతృప్తి వ్యక్తంచేశాయి.
  4. భారత-బంగ్లాదేశ్ తరచూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉంటాయి కాబట్టి, విపత్తు నిర్వహణ సహకారంపై అవగాహన ఒప్పందం సత్వర ఖరారుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఉభయపక్షాలూ ఆదేశించాయి.
  5. ప్రపంచ శాంతిభద్రతలకు పెనుముప్పుగా పరిణమించిన అన్ని రకాల, రూపాల్లోని ఉగ్రవాదం నిర్మూలనకు రెండు దేశాలూ తమ బలమైన సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి.
  6. రెండు దేశాల మధ్య ప్రజా సంచారం ప్రక్రియ సరళీకరణ ప్రాధాన్యాన్ని ఉభయపక్షాలూ నొక్కిచెప్పాయి. ఈ మేరకు అఖౌడా (త్రిపుర) ఘోజడాంగా (పశ్చిమ బెంగాల్) వద్దగల తనిఖీ కేంద్రాల గుండా చెల్లుబాటు కాగల పత్రాలతో ప్రయాణించే బంగ్లాదేశీయులకు భారతదేశంలోని భూ ఓడరేవుల ప్రవేశం/నిష్క్రమణకు అనుమతించాలని బంగ్లా పక్షం కోరింది. ఈ దిశగా మిగిలిన ఆంక్షలను కూడా దశలవారీగా సడలించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

వృద్ధి కోసం వాణిజ్య భాగస్వామ్యం

  1. భారతదేశానికి బంగ్లా ఎగుమతుల విషయంలో 2011 నుండి ‘సాఫ్టా’ కింద సుంకంరహిత, కోటారహిత సౌలభ్యం కల్పించడాన్ని ప్రధాని షేక్ హసీనా ప్రశంసించారు. కాగా, రేవుల ఆంక్షలు, విధానపరమైన అడ్డంకులు, దిగ్బంధం పరిమితులుసహా సుంకమేతర అవరోధాలు, వాణిజ్య సౌలభ్య సమస్యల పరిష్కారంపై ప్రధానమంత్రులిద్దరూ తమ సంకల్పాన్ని నొక్కిచెప్పారు. తద్వారా రెండు దేశాలూ ‘సాఫ్టా’ సానుకూలతను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భారతదేశం నుంచి నిత్యావసరాల ఎగుమతులు తమ దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం కాబట్టి, భారత ఎగుమతి-దిగుమతి విధానంలో ఏవైనా సవరణలు చేపడితే ముందుగా తెలియజేయాలని బంగ్లాదేశ్ పక్షం కోరగా, పరిశీలనకు భారత పక్షం అంగీకరించింది.
  2. కోవిడ్-19 సమయంలో సరఫరా శృంఖలాలు నిరంతరాయంగా కొనసాగేలా విశేష సహకారం అందించిన వాణిజ్య, రైల్వే అధికార యంత్రాంగాలను దేశాధినేతలిద్దరూ ప్రశంసించారు. అంతేకాకుండా ప్రస్తుత రైలు మార్గాల్లో సైడ్-డోర్ కంటైనర్, పార్శిల్ రైళ్లను నడపడంద్వారా ద్వైపాక్షిక వాణిజ్య సౌలభ్యం కల్పించడాన్ని కొనియాడారు.
  3. ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలకుగల అపార సామర్థ్యాన్ని ప్రధానమంత్రులు గుర్తించారు. ఈ మేరకు ‘ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ఖరారు దిశగా సాగుతున్న సంయుక్త అధ్యయనాన్ని త్వరగా పూర్తిచేయాలని వారు అధికారులను ఆదేశించారు.
  4.       ఈ ఏడాది ప్రారంభంలో భారత్-బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ మండలి  మొదటి సమావేశానికి స్వాగతం పలుకుతూ, వస్త్ర రంగంలో పెరిగిన అనుసంధానం, సహకారం యొక్క ప్రాముఖ్యతను నాయకులు నొక్కి చెప్పారు.  భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన జౌళి,  జనపనార మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులు సాధ్యమైనంత త్వరగా ముగించాలని వారు అధికారులను ఆదేశించారు.  బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి జనపనార ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన యాంటీ డంపింగ్ / యాంటీ-సర్కవెన్షన్ సుంకాలపై ఇటీవల జరిగిన సంప్రదింపులను కూడా వారు స్వాగతించారు.  ఏ.డి.డి. కి సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని వారు  ఆశాభావం వ్యక్తం చేశారు
  5.  శ్రేయస్సు కోసం అనుసంధానత 
  6. 22.     ఇరు దేశాల మధ్య రైల్వే సంబంధాల పునరుద్ధరణకు 1965 సంవత్సరానికి పూర్వం సాధించిన పురోగతిని ఇరువురు ప్రధానమంత్రులు సంతృప్తిగా గుర్తుచేసుకున్నారు.  హల్దిబారి (ఇండియా) మరియు చిలహతి (బంగ్లాదేశ్) మధ్య కొత్తగా పునరుద్ధరించబడిన రైల్వే మార్గాన్ని వారు సంయుక్తంగా ప్రారంభించారు.  ఈ రైలు మార్గం, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.  కోవిడ్ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం ఈ మార్గంలో రైళ్ళు నడపాలని నిర్ణయించారు.

     

     

     

    23.     రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక అనుసంధాన చర్యల పురోగతిని, ఇరువురు నాయకులు సమీక్షించారు.    అంతర్గత జల రవాణా మరియు వాణిజ్యానికి సంబంధించిన నియమ నిబంధనల (పి.ఐ.డబ్ల్యు.టి.టి) రెండవ అనుబంధంపై సంతకం చేయడం;  కోల్‌కతా నుండి చటోగ్రామ్ ద్వారా అగర్తలాకు భారతీయ వస్తువుల రవాణా కోసం చేసే ట్రయల్ రన్;  పి.ఐ.డబ్ల్యు.టి.టి.  కింద సోనామురా-దౌడ్కండి ప్రోటోకాల్ మార్గం యొక్క కార్యాచరణ; తో సహా, ఇటీవలి కార్యక్రమాలను వారు  స్వాగతించారు.  ఛటో గ్రామ్ మరియు మొంగ్లా నౌకాశ్రయాల ద్వారా భారతీయ వస్తువుల రవాణాను వేగంగా అమలు చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. 

     

    24.     మెరుగైన కనెక్టివిటీని సులభతరం చేయడంతో పాటు, దేశాల మధ్య ప్రయాణీకులు, వస్తువుల కదలికను సులభతరం చేయడానికి, బంగ్లాదేశ్, భారత్, నేపాల్ దేశాలకు ఉపయోగపడే విధంగా, వస్తువులు మరియు ప్రయాణీకుల కదలికలను ప్రారంభించడానికి వీలుగా,  భూటాన్ కొన్ని రోజుల తర్వాత ఈ ఒప్పందంలో చేరడానికి అవకాశం కల్పిస్తూ, అవగాహనా ఒప్పందంపై, వెంటనే సంతకాలు చేయడం ద్వారా,  బి.బి.ఐ.ఎన్. మోటారు వాహనాల ఒప్పందాన్ని తొందరగా కార్యాచరణలో పెట్టడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

    25.     ప్రస్తుతం కొనసాగుతున్న భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టుపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి,  తీవ్ర ఆసక్తిని వ్యక్తం చేశారు.  దక్షిణ మరియు ఆగ్నేయాసియా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ని పెంచే ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానం కావడానికి, ఆమె, భారతదేశం యొక్క మద్దతు కోరారు.  అదే స్ఫూర్తితో, పశ్చిమ బెంగాల్ (హిల్లి) నుండి మేఘాలయ (మహేంద్రగంజ్) వరకు బంగ్లాదేశ్ మీదుగా కనెక్టివిటీ ని అనుమతించాలని భారతదేశం తరఫున బంగ్లాదేశ్‌ను కోరడం జరిగింది. 

    26.     అగర్తాలా-అఖౌరాతో ప్రారంభించి, భారతదేశం మరియు బంగ్లాదేశ్ లకు చెందిన ప్రతి పొరుగు రాష్ట్రానికీ మధ్య కనీస ప్రతికూల జాబితాతో కనీసం ఒక ల్యాండ్ పోర్టును కలిగి ఉండాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను, భారతదేశం, పునరుద్ఘాటించింది.  ఛటోగ్రామ్ నౌకాశ్రయం నుండి ఈశాన్య భారతదేశానికి సరుకుల రవాణా కోసం,  ఫెని వంతెన నిర్మాణం పూర్తియైన తర్వాత బంగ్లాదేశ్ ట్రక్కులను అనుమతించాలని, బంగ్లాదేశ్ ప్రతిపాదించింది.


    27.     ఇరు దేశాల మధ్య ఉత్సాహభరితమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని అంగీకరించి, ఎల్.‌ఓ.సి. ప్రోజెక్టులు త్వరగా పూర్తికావడానికి వీలుగా, వాటి పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడానికి, బంగ్లాదేశ్ ‌కు చెందిన ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి, ఢాకాలోని భారత హైకమిషనర్ ల  నేతృత్వంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ చురుకుగా పనిచేయాలని, ఇరు పక్షాలు నొక్కిచెప్పాయి. 
    28.     కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇరువైపుల ప్రయాణికుల అత్యవసర అవసరాలను సులభతరం చేయడానికి రెండు వైపుల మధ్య తాత్కాలిక ఎయిర్ ట్రావెల్ బబుల్ ప్రారంభించడాన్ని ఇరుపక్షాలు సంతృప్తిగా గుర్తించాయి.  ల్యాండ్ పోర్టుల ద్వారా బంగ్లాదేశ్ వైపు నుంచి రెగ్యులర్ ప్రయాణాలను,  త్వరగా ప్రారంభించాలని  భారతదేశం కోరింది

    నీటి వనరులు, విద్యుత్తు మరియు ఇంధనంలో సహకారం:

    29.     రెండు ప్రభుత్వాలు, 2011 సంవత్సరంలో అంగీకరించినట్లుగా, తీస్తా జలాలను పంచుకోవడానికి మధ్యంతర ఒప్పందంపై ముందస్తు సంతకం చేయవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి షేక్ హసీనా ఎత్తిచూపారు.  ఆ విషయంలో, భారతదేశ హృదయపూర్వక నిబద్ధతనూ,  నిరంతర కృషినీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పునరుద్ఘాటించారు.

    30.     మను, ముహూరి, ఖోవై, గుమ్తి, ధర్లా, దుధ్ ‌కుమార్ అనే ఆరు ఉమ్మడి నదుల జలాలను పంచుకోవడంపై మధ్యంతర ఒప్పందం ముసాయిదాను వెంటనే రూపొందించాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు.

    31.     కుషియారా నదీ జలాలను నీటిపారుదల అవసరాల కోసం ఉపయోగించుకోవటానికి రహీంపూర్ ఖల్ యొక్క మిగిలిన భాగాన్ని తవ్వకం పనులను అనుమతించాలని, తమ సంబంధిత సరిహద్దు అధికారులకు తెలియజేయాలని, బంగ్లాదేశ్, భారతదేశాన్ని కోరింది.  కుషియారా నది నీటిని పంచుకోవటానికి సంబంధించిన ఒప్పందం / ఒప్పందంపై సంతకం పెండింగ్‌లో ఉన్నందువల్ల, కుషియారా నది నుండి నీటిని రెండు వైపులా ఉపసంహరించుకోవడాన్ని పర్యవేక్షించడానికి ఇరు దేశాల మధ్య సంతకం చేయబోయే ప్రతిపాదిత అవగాహన ఒప్పందంపై ముందస్తు అనుమతినివ్వాలని కూడా భారతదేశం కోరింది.  ఉమ్మడి నదుల కమిషన్ సానుకూల సహకారాన్ని ఇరువురు నాయకులు గుర్తుచేసుకున్నారు.  తదుపరి విడత కార్యదర్శుల స్థాయి జె.ఆర్.సి. సమావేశం సాధ్యమైనంత త్వరగా జరగాలని వారు ఎదురు చూశారు.

    32.     ప్రైవేటు రంగానికి మధ్య విద్యుత్, ఇంధన రంగంలో బలమైన సహకారం పట్ల ఇరువర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.  భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్, మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి అంగీకారం కుదిరింది.   జీవ ఇంధనాలతో సహా విద్యుత్తు సామర్థ్యం మరియు స్వచ్ఛమైన విద్యుత్తు సహకారాన్ని పెంచడానికి కూడా అంగీకరించబడింది.  హరిత, పరిశుభ్రమైన, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వెళ్ళడానికి ఇరు దేశాల నిబద్ధతకు అనుగుణంగా, నేపాల్ మరియు భూటాన్లతో సహా ఉప ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించబడింది.  విద్యుత్ మరియు శక్తి అనుసంధాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

    మయన్మార్ లోని రాఖైన్ రాష్ట్రం నుండి బలవంతంగా నిర్వాశితులైన వ్యక్తులు

    33.     మయన్మార్ రాఖైన్ రాష్ట్రం నుండి బలవంతంగా నిర్వాశితులైన 1.1 మిలియన్ల మందికి ఆశ్రయం కల్పించడంలోనూ, మానవతా సహాయం అందించడంలోనూ, బంగ్లాదేశ్ చూపిన ఔదార్యాన్ని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.  తమ సురక్షితమైన, వేగవంతమైన,  స్థిరమైన రాబడి యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రులిద్దరూ, పునరుద్ఘాటించారు.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా భారత్ ఎన్నికైనందుకు బాంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అభినందించారు.  బలవంతంగా నిర్వాశితులైన రోహింగ్యాలను మయన్మార్ ‌కు తిరిగి రప్పించడానికి ఇండియా సహాయం చేయాలని, బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు, ఆమె తెలియజేశారు. 

    ప్రాంతం మరియు ప్రపంచంలోని భాగస్వాములు

    34.     ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికలలో భారతదేశానికి సహకరించినందుకు, బాంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కృతజ్ఞతలు తెలిపారు.  ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి చెందిన ప్రారంభ సంస్కరణలను సాధించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, సుస్థిరాభివృధి లక్ష్యాలను (ఎస్.డి.జి.లను) సాధించడంతో పాటు వలసదారుల హక్కుల పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి.  2020-ఎజెండా లో పేర్కొన్న విధంగా ఎస్.‌డి.జి. లను అమలు చేసే మార్గాలను నిర్ధారించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం కింద అభివృద్ధి చెందిన దేశాలు తమ కట్టుబాట్లను నెరవేర్చాల్సిన అవసరాన్ని ఇద్దరు ప్రధానమంత్రులూ, పునరుద్ఘాటించారు.

    35.      కోవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రాంతీయ పరిస్థితులతో పాటు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను బట్టి, సార్క్ మరియు బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ సంస్థలకు ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉందని ఇరువురు నాయకులు ప్రధానంగా పేర్కొన్నారు.   కోవిడ్-19 వ్యాప్తి చెందిన నేపథ్యంలో, 2020 మార్చి నెలలో సార్క్ సభ్య దేశాల నాయకుల వీడియో కాన్ఫరెన్సు ‌ను ఏర్పాటు చేసినందుకు,  భారత ప్రధానమంత్రి కి,  బంగ్లాదేశ్ ప్రధానమంత్రి  కృతజ్ఞతలు తెలియజేశారు.  దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ మహమ్మారి ప్రభావాలను ఎదుర్కోవడానికి సార్క్ అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినందుకు,  ఆమె,  భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  సార్క్ వైద్య, ప్రజారోగ్య పరిశోధనా సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పునరుద్ఘాటిస్తూ, ఈ విషయంలో భారత్ మద్దతును కోరారు.   బంగ్లాదేశ్ 2021 సంవత్సరంలో ఐ.ఓ.ఆర్.ఏ. చైర్మన్ పదవిని చేపట్టనున్న నేపథ్యంలో, మరింతగా సముద్ర భద్రత మరియు రక్షణ కోసం కృషి చేయడానికి వీలుగా భారతదేశం యొక్క మద్దతును అభ్యర్థించారు.  ప్రస్తుత పదవీకాలంలో పర్యావరణ ప్రభావిత వేదిక లో బంగ్లాదేశ్ అధ్యక్ష పదవిని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు.

    36.     న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు కృషిని ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రశంసించారు.  ఈ సంస్థలో చేరవలసిందిగా బంగ్లాదేశ్ ‌ను ఆహ్వానించినందుకు, ఆమె, భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పలు రంగాల్లో బ్యాంకు చేసిన కృషిని ఆమె స్వాగతిస్తూ, ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవడానికి బంగ్లాదేశ్ తమ సుముఖతను వ్యక్తం చేసింది.

    ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు మరియు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు 

    37.     ఈ సందర్భంగా, భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులు ఈ క్రింది ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు: 

    *     హైడ్రోకార్బన్ రంగంలో సహకారం కోసం కార్యాచరణ తో కూడిన అవగాహన (ఎఫ్.ఓ.యు); 

    *     ఇరుదేశాల సరిహద్దుల వెంబడి ఏనుగుల సంరక్షణ పై  నియమ,నిబంధనలు; 

    *     స్థానిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు  (హెచ్.‌ఐ.సి.డి.పి.లు) అమలు కోసం భారత ఆర్ధిక సహాయానికి సంబంధించిన అవగాహనా ఒప్పందం;

    *     బారిషల్ నగర కార్పొరేషన్ కోసం పరికరాల సరఫరా మరియు లామ్‌ చోరీ ప్రాంతంలోని చెత్త, ఘన వ్యర్ధ పదార్ధాల నిర్మూలన మైదానం మెరుగుదలపై అవగాహన ఒప్పందం;

    *     భారత-బంగ్లాదేశ్ సి.ఈ.ఓ. ల సంఘం నిబంధనలు;

    *     బాంగ్లాదేశ్, ఢాకా లోని జాతిపిత, బంగాబందు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మెమోరియల్ మ్యూజియం, మరియుభారతదేశం, న్యూ ఢిల్లీ లోని, జాతీయ మ్యూజియం మధ్య అవగాహన ఒప్పందం; 

    *     వ్యవసాయ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.

    ఈ సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టులు : 

    *     రాజా ‌షాహి నగరంలో సుందరీకరణ మరియు నగర అభివృద్ధి ప్రాజెక్టు;

    *     ఖుల్నాలో ఖలీష్పూర్ కాలేజియేట్ బాలికల పాఠశాల నిర్మాణం;

    38.     ప్రస్తుతం నెలకొన్న నూతన అసాధారణ పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రులు ఇద్దరూ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. 

    39.      బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ 50వ వార్షికోత్సవం మరియు  బంగ్లాదేశ్-భారతదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలలో పాల్గొనడానికి, 2021 మార్చి నెలలో తమ దేశాన్ని సందర్శించాలన్న తమ ఆహ్వానాన్ని అంగీకరించినందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా,  భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.

     

     

    *****

 



(Release ID: 1681593) Visitor Counter : 276