PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
08 AUG 2020 6:31PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్ వ్యాధి నయమైనవారి సంఖ్య 14.2 లక్షలకుపైగా నమోదు.
- కోలుకునేవారి జాతీయ సగటు స్థిరంగా పెరుగుతూ 68.32 శాతానికి చేరిక.
- జాతీయంగా మరణాల సగటు మరింత తగ్గి 2.04 శాతానికి పతనం.
- ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాకు కేసుల సగటు 2425; భారత్లో అత్యల్పంగా 1469.
- కోవిడ్-19 మరణాల సగటు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలతో కేంద్ర ఆరోగ్యశాఖ చర్చ.
- దేశంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 6,19,088.


దేశంలో కోవిడ్ నయమైనవారి సంఖ్య 14.2 లక్షలకుపైగానే; కోలుకునేవారి సగటు 68.32 శాతానికి చేరిక; మరణాల సగటు 2.04 శాతానికి పతనం
అంతర్జాతీయంగా ప్రతి 10 లక్షల జనాభాకు 2425 కోవిడ్ కేసులు నమోదువుతుండగా దీనితో పోలిస్తే భారత్లో సగటు అత్యల్పంగా 1469గా ఉంది. అంతేకాకుండా క్రమంగా మరింత తగ్గుతుండటం విశేషం. అలాగే నమోదైన కేసులలో మరణాల సగటు కూడా మరింత తగ్గి 2.04 శాతానికి పతనమైంది. భారత్లో మరణాల తగ్గింపుపై నిశితంగా దృష్టి సారించిన నేపథ్యంలో ప్రతి 10 లక్షల జనాభాకు ప్రపంచ సగటు 91 కాగా, మన దేశంలో కేవలం అతి తక్కువగా 30కి పరిమితమైంది. ఇక కోవిడ్ వ్యాధి నయమవుతున్న కేసులలోనూ గణనీయ పెరుగుదల నమోదవుతోంది. ఈ మేరకు గత 24 గంటల్లో 48,900 రోగులు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లగా, ఇప్పటిదాక కోలుకున్నవారి సంఖ్య 14,27,005కు పెరిగింది. తద్వారా కోలుకునేవారి జాతీయ సగటు స్థిరంగా పెరుగుతూ 68.32 శాతానికి చేరింది. ఇక ఇవాళ్టికి చికిత్స పొందే కేసుల సంఖ్య 6,19,088 వద్ద ఉండగా, మొత్తం కేసులలో ఇది 29.64 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా రోగ నిర్ధారణ ప్రయోగశాలల విస్తరణతోపాటు పరీక్షలు సులభతరం కావడంతో గత 24 గంటల్లో 5,98,778 పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,33,87,171కి పెరిగింది. రోగ నిర్ధారణ పరీక్షలపరంగానూ ప్రతి 10 లక్షల జనాభాకు జాతీయ సగటు ఇవాళ 16,947కు దూసుకుపోయింది. కాగా, ప్రస్తుతం దేశంలో 1,396 ప్రయోగశాలలకుగాను ప్రభుత్వ రంగంలో 936, ప్రైవేటు రంగంలో 460 వంతున అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644424
కోవిడ్-19 మరణాల తగ్గింపుపై సకలశక్తులూ కేంద్రీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం
దేశంలో కోవిడ్-19పై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల సంయుక్త, సమన్వయ, ముందుచూపుగల చర్యల ఫలితంగా జాతీయంగా మరణాల సగటు రోజురోజుకూ తగ్గుతూ ఇవాళ 2.04 శాతానికి పతనమైంది. మహమ్మారి నిర్వహణపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్ష, చేయూతలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షతన ఆగస్టు 7, 8 తేదీల్లో రెండు ఉన్నతస్థాయి వాస్తవిక సాదృశ సమావేశాలు జరిగాయి. ఈ మేరకు మరణాల తగ్గింపు దిశగా చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలివ్వడం కోసం జాతీయ సగటును మించి మరణాలు నమోదవుతున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 13 జిల్లాలపై కేంద్రం దృష్టి సారించింది. దేశంలోని చురుకైన మొత్తం కేసులలో దాదాపు 9 శాతం ఈ జిల్లాల్లోనే ఉండగా, మరణాల సగటు 14శాతంగా ఉంది. దీంతోపాటు ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల నిర్వహణలోనూ ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల పరీక్షా సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవాలని ఈ జిల్లాలుగల- అసోం, బీహార్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644458
కోవిడ్-19 మరణాల సగటు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలతో కేంద్ర ఆరోగ్యశాఖ చర్చ
కోవిడ్-19 కేసులలో జాతీయ, రాష్ట్ర సగటును మించి మరణాలు నమోదవుతున్న జిల్లాల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి సమర్థ నియంత్రణ, నిర్వహణ దిశగా కేంద్ర-రాష్ట్ర సమన్వయ వ్యూహంపై నిరంతర సమీక్ష, చేయూతలో భాగంగా నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షతన జరిగిన వాస్తవిక సాదృశ సమావేశంలో ఆయా జిల్లాల పాలనాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చించిన మేరకు మరణాల శాతం తగ్గించే మార్గాలు, ప్రయత్నాలపై ప్రణాళిక రూపొందించాలని వారిని ఆదేశించారు. కాగా- గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో మరణాల సగటు అధికంగా ఉండటమేగాక రోజువారీ నమోదయ్యే చురుకైన కేసులు కూడా జాతీయ స్థాయి కేసులతో పోలిస్తే 17 శాతంగా ఉండటం గమనార్హం. ఇక ప్రతి 10 లక్షల జనాభాకు నిర్వహిస్తున్న పరీక్షల సగటురీత్యా కూడా ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరణాల శాతం తగ్గింపు దిశగా ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీచేసిన సలహాలు-మార్గదర్శకాలతోపాటు వైద్య నిర్వహణ విధివిధానాలను అనుసరించడమేగాక సమర్థంగా అమలు చేయాలని జిల్లాల యంత్రాంగాలకు సూచించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644261
వరుసగా నాలుగోరోజున 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6లక్షల నమూనాల పరీక్ష
కోవిడ్-19 నమూనాల రోజువారీ పరీక్షల సంఖ్యను పెంచడంలో భారత్ తన రికార్డును గురువారం వరుసగా నాలుగో రోజున కూడా కొనసాగించింది. దేశవ్యాప్తంగా రోగ నిర్ధారణ ప్రయోగశాలల విస్తరణతోపాటు పరీక్షలు సులభతరం కావడంతో గత 24 గంటల్లో 6,39,042 పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,27,88,393కు పెరిగింది. దీంతో ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల జాతీయ సగటు 16,513కు పెరిగింది. రోజువారీ పరీక్షల రీత్యా 2020 జూలై 14న సుమారు 2.69 లక్షలుగా ఉన్న 7 రోజుల సగటు గణనీయంగా మెరుగుపడుతూ 2020 ఆగస్టు 6నాటికి 5.66 లక్షలకు పెరిగింది. అదేవిధంగా ఈ తేదీల మధ్య మొత్తం పరీక్షల సంఖ్య కూడా 1.2 కోట్ల నుంచి 2.2 కోట్లకు పెరిగింది. పరీక్షల సంఖ్యకు అనుగుణంగా ఇదే వ్యవధిలో నిర్ధారిత కేసులు కూడా 7.5 శాతం నుంచి 8.87 శాతానికి పెరిగాయి. కాగా, ప్రస్తుతం దేశంలో 1,383 ప్రయోగశాలలకుగాను ప్రభుత్వ రంగంలో 931, ప్రైవేటు రంగంలో 452 వంతున అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=164417
దేశంలోని 21 ఈఎస్ఐసీ ఆస్పత్రులు 2400 ఏకాంత చికిత్స పడకల సౌకర్యంతో ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులుగా మార్పు: సంతోష్ గంగ్వార్
కేంద్రం కార్మిక-ఉపాధిశాఖ మంత్రి (ఇన్చార్జి) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఫరీదాబాద్ (హర్యానా)లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఆస్పత్రిలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గంగ్వార్ మాట్లాడుతూ- కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో దేశంలోని 21 ఈఎస్ఐసీ ఆస్పత్రులను కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులుగా మార్పుచేసినట్లు తెలిపారు. వీటిలో 2400కుపైగా ఏకాంత చికిత్స పడకలు, 200 వెంటిలేటర్లతో కూడిన, 550 ఐసీయూ/హెచ్డీయూ పడకలు కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అల్వార్ (రాజస్థాన్), బిహ్తా, పాట్నా (బీహార్), గుల్బర్గా (కర్ణాటక), కోర్బా (ఛత్తీస్గఢ్) రాష్ట్రాల్లోని 4 ఈఎస్ఐసీ ఆస్పత్రులలో నిర్బంధవైద్య సౌకర్యం (సుమారు 1300 పడకలతో) కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఫరీదాబాద్ (హర్యానా), బసైదరాపూర్ (న్యూఢిల్లీ) హైదరాబాద్ (తెలంగాణ)లోని సనత్ నగర్లోగల ఈఎస్ఐసీ ఆస్పత్రులలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష సదుపాయాలు కూడా ఉన్నాయన్నారు. అలాగే కోవిడ్ వ్యాధి తీవ్రస్థాయికి చేరిన రోగుల కోసం ఫరీదాబాద్, సనత్ నగర్లలోని ఈఎస్ఐసీ ఆస్పత్రులలో ప్లాస్మా చికిత్స సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644413
పీఎంఏవై (అర్బన్) కింద సుమారు 10.28 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)కు సంబంధించి కేంద్ర మంజూరు-పర్యవేక్షణ కమిటీ (CSMC) 51వ సమావేశం న్యూఢిల్లీలో 2020 ఆగస్టు 7న జరిగింది. మొత్తం 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనగా 1,589 ప్రతిపాదనల కింద సుమారు 10.28 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. లబ్ధిదారుల నేతృత్వంతోపాటు అందుబాటు ఇళ్ల నిర్మాణ భాగస్వాములతో సంయుక్తంగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ నివాస వసతి కల్పించడంద్వారా 2022నాటికి ‘అందరికీ ఇళ్లు’ ఆశయ సాధన దిశగా ప్రభుత్వ ప్రాముఖ్యానికి ఇది నిదర్శనం.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644120
నీటి శుద్దీకరణ సాంకేతికత ప్రధానంగా ఎంఎస్ఎంఈల కోసం వివిధ కోవిడ్-19 ఉత్పత్తుల కోసం కొత్త సాంకేతికతలపై వెబినార్
సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆ రెండు సంస్థల సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ, పాట్నాలోని ఎంఎఎస్ఎంఈ-డీఐ డైరెక్టర్ శ్రీ విశ్వమోహన్ ఝా వివరించారు. ఈ మేరకు 2020 ఆగస్టు 7న ఎంఎస్ఎంఈ పరిధిలోని పరిశ్రమలు/వ్యవస్థాపకులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వెబినార్లో వారు ప్రసంగించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644275
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని పాపుంపారే జిల్లా పరిధిలోగల మిడ్పు వద్ద కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిన అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రంలో 35 పడకలతో ఏడు పూర్తి ఎయిర్ కండిషన్డ్ కంటైనర్లున్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలోని లీమాపోక్పామ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు, ఒక నర్సు కోవిడ్ బారినపడ్డారు. దీంతో ఆగస్టు 2 నుంచి 7వ తేదీవరకు ఈ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన రోగులందరికీ అధికారులను సంప్రదించాలంటూ సమాచారం పంపారు.
- మిజోరం: రాష్ట్రంలో ఇవాళ ఏడుగురు డిశ్చార్జి కాగా, మొత్తం 566 కేసులకుగాను ప్రస్తుతం క్రియాశీల కేసులు 270గా ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు 296మంది కోలుకున్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 607 నమూనాలను పరీక్షించగా 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో కొహిమానుంచి 12, దిమాపూర్ నుంచి 10, జున్హెబోటోలో 6, వోఖాలో 3 వంతున ఉన్నాయి.
- కేరళ: కరీపూర్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో 149 మంది చికిత్స పొందుతుండగా 14మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇవాళ ప్రమాద ప్రదేశాన్ని, పరిశీలించి, ఆస్పత్రులకు వెళ్లి, చికిత్స పొందేవారిని పరామర్శించారు. మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు తలా రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50 వంతున మధ్యంతర సాయం ప్రకటించారు. మరోవైపు నిన్న రాష్ట్రంలోని ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. మరో 50మృతదేహాలు బురదలో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. కేరళలో నిన్న 1,251 కొత్త కేసులు నిర్ధారణ కాగా వీటిలో 73 కేసుల మూలాలు తెలియరాలేదు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 12,411మంది చికిత్స పొందుతుండగా 1,49,684మంది నిఘాలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 268 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5067 కాగా, ఇందులో 1953 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య 80కి పెరిగింది; ఇక తమిళనాడులో దిగ్బంధం నుంచి మరిన్ని సడలింపులిస్తూ, ఆగస్టు 10 నుంచి పురపాలక పరిధిలోగల చిన్న ప్రార్థనా స్థలాల్లో బహిరంగ ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ దిశగా 500 అంబులెన్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.103 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో నిన్న 5880 కొత్త కేసులు, 119 మరణాలు నమోదవగా, 6488 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,85,024; క్రియాశీల కేసులు: 52,759; మరణాలు: 4690; చెన్నైలో చురుకైన కేసులు: 11,606గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి బి.ఎస్.యెడియూరప్ప ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినుంచి ఫోన్ద్వారా తెలుసుకున్నారు. తన అనుమతి కోసం ఎదురుచూడకుండా అత్యవసర సహాయక చర్యలను కొనసాగించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. పోలీసులలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బెంగళూరు నగర పోలీసు కమిషనర్ విధుల్లో పోలీసులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీచేశారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను సవరించింది. వారికి లక్షణాలు లేకపోతే 14 రోజులపాటు గృహనిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నిన్న 6670 కొత్త కేసులు, 101 మరణాలతోపాటు 3951 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,64,924; యాక్టివ్ కేసులు: 77,686; మరణాలు: 2998; డిశ్చార్జి: 84,232గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రోగ నిర్ధారణ పరీక్షల నివేదిక కోసం ఎదురుచూడటంలో ఆలస్యం అవుతున్న కారణంగా చికిత్సలో జాప్యం జరుగుతోంది. దీంతో పరీక్ష, నిర్ధారణతో సంబంధం లేకుండా జ్వరం, శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయి తగ్గడంవంటి సమస్యలున్న వారిని ఆస్పత్రుల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు నగరంలో దిగ్బంధం ఆంక్షలను ఆగస్టు 23దాకా పొడిగించారు. ఈ మేరకు దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంల మధ్య మాత్రమే తెరిచి ఉంచాల్సి ఉంటుంది. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ సరఫరాతో 5 నుంచి 10 పడకల లభ్యత ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో నిన్న 10,171 కొత్త కేసులు, 89మరణాలు నమోదవగా 7594 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,06,960; యాక్టివ్ కేసులు: 84,654; మరణాలు: 1842గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో కరోనావైరస్కు నిశ్శబ్ద వాహకులుగాగల లక్షణరహిత రోగులు నేడు తెలంగాణలో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నారు. లక్షణరహిత కేసులు అధిక సంఖ్యలో ఉండటంవల్ల కోలుకునే వారి శాతం అధికంగా ఉంటుందన్నదానికి సూచికగా భావిస్తున్నప్పటికీ అయితే, పెద్దసంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు హైదరాబాద్లో కోవిడ్-19 వ్యాప్తి మందగించింది. కానీ, ఇతర జిల్లాల్లో 2256 కేసులు నిర్ధారణ అయినందున కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక గత 24 గంటల్లో 1091 మంది కోలుకోగా, 14 మరణాలు కూడా నమోదయ్యాయి; కొత్త కేసులలో 464 జీహెచ్ఎంసీనుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 77,513; క్రియాశీల కేసులు: 22,568; మరణాలు: 615; డిశ్చార్జి కేసులు: 54,330గా ఉన్నాయి.
- మహారాష్ట్ర: అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే అధికారులను కోరారు. అలాగే పడకలు, అంబులెన్సుల సమర్ణ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో శుక్రవారం 10,906 కేసులు నమోదవగా మొత్తం కేసులు 4,90,262కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,45,582గా ఉంది.
- గుజరాత్: కోవిడ్ మరణాలరీత్యా జాతీయ, రాష్ట్ర సగటుకు మించిన నమోదవుతున్న నాలుగు రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడంతోపాటు నమోదయ్యే కేసుల సగటును సున్నా స్థాయికి తగ్గించడం లక్ష్యంగా కృషిచేయాలని కేంద్రం సూచించింది. కాగా- అహ్మదాబాద్, సూరత్లలో ఇప్పటివరకు 27,587, 14,777 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 68,885గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో శుక్రవారం 1,161 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 50వేల స్థాయిని దాటింది. కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,195గా ఉన్నాయి. ఇదిలాఉండగా జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద 6,310 మంది సామాజిక ఆరోగ్యాధికారుల నియామక సంబంధిత ప్రతిపాదనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆమోదించారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 734 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 37,298కి చేరాయి. వీరిలో ఇప్పటిదాకా 27,621 మంది కోలుకోగా, మృతుల సంఖ్య 962గా ఉంది.
- ఛత్తీస్గఢ్: రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ గౌరీశంకర్ అగర్వాల్కు కోవిడ్ నిర్ధారణ అయిన రెండు రోజుల తర్వాత ప్రతిపక్ష నేత శ్రీ ధరంలాల్ కౌశిక్కూ ఇవాళ వ్యాధి సోకినట్లు తేలింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో 378 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం క్రియాశీల కేసులు 3,002గా ఉన్నాయి.
FACT CHECK



***
(Release ID: 1644486)
Visitor Counter : 233
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Malayalam