ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి – బహ్రెయిన్‌ రాజు మధ్య టెలిఫోన్‌ సంభాషణ

Posted On: 06 APR 2020 8:34PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన బహ్రెయిన్‌ రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుత కోవిడ్‌-19 ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో రవాణా శృంఖలాలు, ఆర్థిక విపణులుసహా వివిధ రంగాలపై దాని పరిణామాల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించారు. ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో బహ్రెయిన్‌లో పెద్దసంఖ్యలోగల భారతీయుల బాగోగులపై తాము స్వయంగా దృష్టి సారిస్తామని ప్రధానమంత్రికి గౌరవనీయులైన రాజు హామీ ఇచ్చారు. ప్రవాస భారతీయులపై బహ్రెయిన్‌ అధికార యంత్రాంగం చూపుతున్న ఆదరాభిమానాలకు ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కోవిడ్‌-19 విసిరిన సవాళ్లను ఎదుర్కొనడంలో పరస్పర సహకారానికి, రెండు దేశాల అధికారుల మధ్య నిత్య సంబంధాల కొనసాగింపునకు నాయకులిద్దరూ అంగీకరించారు. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల్లో బహ్రెయిన్‌ను తన కీలక భాగస్వామిగా భారత్‌ గౌరవిస్తుందని గౌరవనీయులైన రాజుకు ప్రధానమంత్రి వివరించారు. నిరుడు బహ్రెయిన్‌ పర్యటన సందర్భంగా తనకు లభించిన గౌరవాదరాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

*****



(Release ID: 1611859) Visitor Counter : 210