ఆయుష్
యూట్యూబ్లో యోగా ప్రత్యక్ష ప్రసారం… భారీ సంఖ్యలో వీక్షకులు... ఆయుష్ మంత్రిత్వ శాఖ గిన్నిస్ రికార్డు
అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆన్లైన్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న 4,35,831 మంది ధ్రువీకృత వీక్షకులు
నాడు పోస్టు చేయడమైనది:
14 JUN 2026 12:56PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) – 2026 నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైన ప్రత్యేక ఆన్లైన్ యోగా కార్యక్రమంలో 4,35,831 మంది వీక్షకులు పాల్గొన్నారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన యూ ట్యూబ్ లైవ్ యోగా ప్రసారంగా సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఐడీవై-2026 కోసం మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ రికార్డు కోసం ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగ సాధకులు, విద్యార్థులు, సంస్థలు, నిపుణులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. కామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)ను ఈ కార్యక్రమం ప్రదర్శించింది. అలాగే యోగా 365 ఉద్యమం ద్వారా యోగాను రోజువారీ సాధనగా ప్రోత్సహించాలనే మంత్రిత్వ శాఖ దార్శనికతను బలోపేతం చేసింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ 4,35,831 మంది ధ్రువీకృత వీక్షకుల సంఖ్యను నమోదు చేసి 2024 నాటి 2,46,252 వీక్షకుల గిన్నిస్ ప్రపంచ రికార్డును అధిగమించింది. మునుపటితో పోలిస్తే 1,89,579 మంది ఎక్కువ వీక్షకులతో యూట్యూబ్ లైవ్ యోగా ప్రసారానికి అత్యధిక వీక్షణలు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు దోహదపడిన ప్రపంచ పౌరులను అభినందించారు. ‘‘ఆరోగ్యం, సంక్షేమం అనే ఉమ్మడి నిబద్ధత ద్వారా వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, దేశాలకు చెందిన ప్రజలను అనుసంధానించడంలో యోగాకున్న అసాధారణ శక్తిని ఈ రోజు సాధించిన విజయం ప్రదర్శిస్తుంది. జీవన మార్గంగా యోగాను అనుసరించడంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆమోదాన్ని ఈ సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రతిబింబిస్తుంది. దైనందిన జీవితంలో యోగాను సమగ్ర భాగంగా మార్చాలనే మన సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 సమీపిస్తున్న తరుణంలో ‘యోగా-365’ స్ఫూర్తిని స్వీకరించాలనీ, ఆరోగ్యమైన, దృఢమైన, స్థిరమైన సమాజాన్ని నిర్మించేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
భాగస్వాములకూ, ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నవారికీ ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ విజయం కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు మాత్రమే కాదు. ఇది మనం ప్రపంచానికి పంపుతున్న సందేశం. ఆరోగ్యానికీ, సంక్షేమానికీ శక్తిమంతమైన సాధనంగా యోగాకు పెరుగుతున్న గుర్తింపును ఈ భారీ భాగస్వామ్యం తెలియజేస్తుంది. యోగాను ఒక రోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా.. దైనందిన జీవితంలో భాగంగా చేసి ‘యోగా-365’ను సాకారం చేయడమే మా లక్ష్యం’’ అని మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.
ఒడిశా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ముఖేష్ మహాలింగ్, కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరెణ్ రిజిజు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పంపిన ప్రత్యేక సందేశాలు ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నవారిని అభినందిస్తూ.. నివారణ ఆరోగ్య సంరక్షణకూ, సమగ్ర ఆరోగ్యానికీ దోహదపడే సాధనంగా యోగాకున్న ప్రాధాన్యాన్ని వారు తెలియజేశారు. దైనందిన కార్యకలాపాల్లో యోగాను భాగం చేసుకోవడం ద్వారా యోగా-365 స్ఫూర్తిని స్వీకరించాలని పౌరులకు పిలుపునిచ్చారు.
మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై), ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందినవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతటా హాబిల్డ్ నిపుణుల బృందం అందించిన మార్గదర్శకత్వంతో కామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)ను ప్రదర్శించారు.
‘‘ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా’’ (స్వస్థ ఆయు కేలియే యోగా) అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026ను నిర్వహించేందుకు భారత్ సన్నద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ విజయం లభించింది. అన్ని వయసుల వారికి ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రోత్సహించడంలోనూ, జీవన నాణ్యతను పెంపొందించడంలోనూ, శారీరక, మానసిక, భావోద్వేగ సంక్షేమానికి తోడ్పటంలోనూ యోగా పోషించే పాత్రను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2026 ప్రధాన వేడుక జూన్ 21న పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఆరోగ్యం, సామరస్యం కోసం జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఉద్యమం.. యోగా ఔత్సాహికులనూ, సాధకులనూ, భాగస్వాములనూ ఏకతాటిపైకి తీసుకువస్తుంది.
చరిత్రాత్మక విజయం సాధించేలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికీ, యోగా సంస్థలకూ, విద్యా సంస్థలకూ, ప్రభుత్వ విభాగాలకూ, కార్పొరేట్ సంస్థలకూ, సామాజిక బృందాలకూ, ప్రవాస భారతీయులకూ ఆయుష్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సమీపిస్తున్న నేపథ్యంలో యోగాను ఒక జీవన మార్గంగా ఎంచుకోవాలనీ, ‘‘హర్ ఘర్ యోగా, హర్ దిన్ యోగా’’ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనీ మంత్రిత్వ శాఖ కోరింది.
***
(రిలీజ్ ఐడి: 2272780)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam