పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
నివాస ధ్రువీకరణ పత్రం లేకుండా చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డుతో ఎల్పీజీ పంపిణీదారుల వద్ద అందుబాటులో 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు
నిన్న 71,000 లకుపైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయం.. మార్చి 23 నుంచి 5.7 లక్షల సిలిండర్ల పంపిణీ
మార్చి 2026 వరకు 3.5 లక్షలకుపైగా పీఎన్జీ కనెక్ష్లన్లకు గ్యాస్ సరఫరా
ఏప్రిల్ 6 నుంచి ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ సరఫరా.. గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 90 శాతం పెంపు
దేశవ్యాప్తంగా ఎల్పీజీ నిల్వలు, నల్లబజారు విక్రయాలపై కొనసాగుతున్న చర్యలు.. నిన్న ఒక్కరోజే 3,700కు పైగా దాడులు
46,650 ఎంటీ ఎల్పీజీ కార్గోతో హర్మూజ్ జలసంధిని దాటిన గ్రీన్ సాన్వి నౌక
ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న 1,320 మంది భారత నావికులు
ఆ ప్రాంతంలోని భారత పౌరులకు 24X7 గంటల పాటు హెల్ప్లైన్లను నిర్వహిస్తున్న భారత రాయబార కార్యాలయాలు
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2026 3:06PM by PIB Hyderabad
పశ్చిమాసియాలోని పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల్లో సంసిద్ధతను పెంపొందించేందుకు, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలను భారత ప్రభుత్వం తీసుకుంటోంది. ఆ ప్రాంతంలోని తాజా పరిణామాల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, అక్కడ నివసిస్తున్న భారతీయులకు అందిస్తున్న సహాయసహకారాలకు సంబంధించిన వివరాలు:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హర్మూజ్ జలసంధి మూసివేయటంతో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా చర్యలు చేపడుతోంది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం:
ప్రభుత్వ ప్రకటన, ప్రజలకు అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు ఆందోళనతో పెట్రోల్, డీజిల్ నిల్వలు పెట్టుకోవద్దని, అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేయవద్దని సూచించింది.
· పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల ద్వారా సరైన సమాచారం తెలుసుకోవాలని పౌరులను కోరింది.
· డిజిటల్ పద్ధతుల్లో ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవాలని, అవసరమైతే తప్ప గ్యాస్ ఏజెన్సీలను సందర్శించవద్దని విజ్ఞప్తి చేసింది.
· అవకాశమున్న చోట పీఎన్జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ స్టౌవ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించమని పౌరులను ప్రోత్సహిస్తుంది.
· ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని ఆదా చేయటానికి ప్రయత్నించాలని కోరింది.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ, పీఎన్జీలకు, ఆస్పత్రులు, విద్యా సంస్థలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
· సరఫరా, డిమాండ్ను సమన్వయం చేయటానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంచటం, ఎల్పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచటం, ప్రాధాన్యత గల రంగాలకు సరఫరాను క్రమబద్ధీకరించటం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎంపిక చేసుకునేలా అందుబాటులోకి తెచ్చింది.
· చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేయటానికి రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్కు బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు నూతన పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
· ఇటీవల అన్ని రాష్ట్రాలు, యూటీల అదనపు ప్రధాన కార్యదర్శులు, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శులతో ఎంఏపీఎన్జీ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించిన ఆయన.. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన లభ్యత ఉండేందుకు తీసుకున్న చర్యలను గురించి వివరించారు. ముఖ్యంగా గృహ, నిత్యావసరాల నిమిత్తం ఎల్పీజీ పంపిణీకి ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రాలను ఆదేశించారు. ఇంధన నిల్వలు పెంచటం, దారి మళ్లించటం, తప్పుడు సమాచార ప్రచార అంశాలపై నిఘా ఉంచాలని సూచించారు. వలస కార్మికులకు అందించే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలుగుతోందన్న నివేదికలపై రాష్ట్రాలు స్పందించాయి. వలస కార్మికులకు ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని, సరఫరా స్థిరంగా ఉందని స్పష్టం చేశాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఓఎంసీల సమన్వయంతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, యూటీలు, సంస్థాగత వ్యవస్థలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావతసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ (నియంత్రణ) ఉత్తర్వులు-2000 ప్రకారం నిల్వలు చేపట్టేవారిపై, బ్లాక్ మార్కెట్ సృష్టించేవారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించటంలో, నియంత్రించటంలో రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అన్ని రాష్ట్రాలకు, యూటీలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
· అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులకు కింది విషయాలు విజ్ఞప్తి చేసింది.
· రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోజువారీ మీడియా సమావేశాలను నిర్వహించటం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయటం,
· ప్రత్యేక కంట్రోల్ రూంలు, హెల్ప్లైన్ల ఏర్పాటు
· సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షిస్తూ, వాటిని తిప్పికొట్టటం,
· జిల్లా వ్యవస్థ ద్వారా రోజువారీ అమలు చర్యలను పెంచటం, ఓఎంసీల సమన్వయంతో దాడులు, తనిఖీలను కొనసాగించటం,
· ఆయా రాష్ట్రాలు, యూటీల్లో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయటం,
· రాష్ట్రాలకు కేటాయించిన ఎస్కేఓ పంపిణీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయటం
· సీజీడీ విస్తరణ పనులను వేగవంతం చేయటం, ఇందులో భాగంగా ఆర్ఓడబ్ల్యూ, ఆర్ఓయూ అనుమతులు, 24x7 పని చేసే అనుమతులను త్వరితగతిన మంజూరు చేయటం,
· పీఎన్జీ వినియోగాన్ని, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించటం,
· ఎంఓపీఎన్జీతో సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించటం.
· భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రాసిన లేఖల ద్వారా పలు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది. ఇందులో భాగంగా ప్రజా సమాచార వ్యవస్థను బలోపేతం చేయటం, రోజువారీ విలేకరుల సమావేశాలు, తప్పుడు ప్రచారాలను నిరోధించటం, ప్రజల్లో భరోసా కల్పించటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
· ప్రస్తుతం 21 రాష్ట్రాలు, యూటీలు ఈ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశాల ద్వారా సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· అక్రమంగా ఎల్పీజీని నిల్వచేయటం, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టటానికి అనేక రాష్ట్రాలు, యూటీల్లో దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3,700కు పైగా దాడులు జరిగాయి.
· నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి ఘటనలను నిరోధించటానికి ఆకస్మిక తనిఖీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పీఎస్యూ ఓఎంసీల అధికారులను ఆదేశించారు.
· ఇప్పటివరకు 1000 మంది డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను పాటించని 27 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్లను సస్పెండ్ చేశారు.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ సరఫరా వివరాలు:
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడినప్పటికీ ఎక్కడా గ్యాస్ కొరత ఏర్పడకుండా, డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు పూర్తిగా అయిపోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
· నిన్నటి గణాంకాల ప్రకారం పరిశ్రమ వ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 95 శాతానికి పెరిగాయి.
· గ్యాస్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ద్వారా డెలివరీలను పెంచారు. ఫిబ్రవరి 2026లో ఇది 53 శాతం ఉండగా, నిన్నటికి 89 శాతానికి చేరుకుంది.
· నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగింది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
· భారత ప్రభుత్వ 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం, దేశంలోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా రిఫైనింగ్ కంపెనీలు సీ3, సీ4 స్ట్రీమ్లను నిర్ణీత కనీస పరిమాణంలో అందుబాటులో ఉంచేందుకు అనుమతించింది. ఇవి ఫార్మాస్యూటికల్స్, ఆహారం, ప్రజా పంపిణీ, రసాయనాలు, పెట్రోకెమికల్స్ వంటి కీలక విభాగాలకు కేటాయిస్తారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్ణయించిన దాని ప్రకారం, నిర్దిష్ట పరిమాణం, రిఫైనరీ వనరుల ఆధారంగా ఈ సరఫరా జరుగుతుంది.
· సంక్షోభానికి ముందున్న స్థాయి కంటే 70 శాతం మేర మొత్తం వాణిజ్య కేటాయింపులను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 10 శాతం కేటాయింపులు సంస్కరణల ఆధారంగా ఉంటాయి.
· నిన్న ఒక్కరోజే 71,000లకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయం జరిగింది.
· మార్చి 23, 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 5.7 లక్షల 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయి.
· సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును చూపించి వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం నివాస ధ్రువీకరణ పత్రం అవసరం లేదు.
· రాష్ట్రాలు, యూటీల్లో వాణిజ్య ఎల్పీజీ విక్రయ ప్రణాళికను.. ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల ముగ్గురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఖరారు చేస్తుంది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటుంది.
· మార్చి 14, 2026 నుంచి ఇప్పటివరకు మొత్తం 72,047 ఎంటీల వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ-పీఎన్జీ, సీఎన్జీ రవాణా వినియోగదారులకు 100శాతం సరఫరాను అందిస్తూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు.
· గ్రిడ్కు అనుసంధానించిన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80శాతం వరకు సరఫరా అందుతోంది.
· ప్రస్తుతం నడుస్తున్న యూరియా కేంద్రాలలకు గత ఆరు నెలల సగటు వినియోగంలో 70-75 శాతం మేర సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ చేసిన ఎల్ఎన్జీ కార్గో రాకను దృష్టిలో ఉంచుకుని.. 06 ఏప్రిల్ 2026 నుంచి ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ సరఫరాను వారి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 90 శాతానికి పెంచనున్నారు. సీజీడీ నెట్వర్కుల ద్వారా అందే సరఫరాతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 06 ఏప్రిల్ 2026 నుండి మరో 10 శాతం పెంచనున్నారు.
· ఎరువుల కర్మాగారాలతో సహా పారిశ్రామిక వినియోగదారులందరూ తమకు కావాల్సిన అదనపు గ్యాస్ అవసరాలను స్పాట్ ప్రాతిపదికన తెలియజేయాలని సూచించారు. తద్వారా గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వాటిని ఏర్పాటు చేయగలవు.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై వస్తున్న ఆందోళనలను పరిష్కరించడానికి, రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత ప్రభుత్వం సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలను ఆదేశించింది.
· గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· ఎల్పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది. పీఎన్జీ విస్తరణ సంస్కరణ చర్యల కింద 12 రాష్ట్రాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి. దీనికి అదనంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి దరఖాస్తు అందింది. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది.
· పైప్లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట, నివాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, అంగన్వాడీ కిచెన్లు మొదలైన వాటికి 5 రోజులలోపు పీఎన్ జీ కనెక్షన్లు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సీజీడీ సంస్థలను 23 మార్చి 2026 నాటి ఉత్తర్వుల ద్వారా పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఆదేశించింది.
· రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 నాటి లేఖ ద్వారా ‘‘తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం త్వరితగతిన ఆమోదించే విధానాన్ని’’ 3 నెలల పాటు ఒక ప్రత్యేక చర్యగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. దీని వల్ల సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు వీలవుతుంది.
· నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· రక్షణ శాఖకు చెందిన అన్ని నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్లలో పీఎన్జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 27 మార్చి 2026 నాటి లేఖ ద్వారా స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది. ఇది జూన్ 30 2026 వరకు అమలులో ఉంటుంది.
· గృహాలకు పీఎన్జీ కనెక్షన్లను త్వరగా అందించాలని సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో కొనసాగుతున్న వేగాన్ని నిలబెట్టడానికి అంతకుముందు మార్చి 31తో ముగియాల్సిన జాతీయ పీఎన్జీ కార్యక్రమం 2.0ను ఇప్పుడు 30 జూన్ 2026 వరకు పొడిగించారు.
· మార్చి 2026 నుంచి ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా కొత్త పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. అలాగే కొత్త కనెక్షన్ల కోసం 3.8 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నిర్ణయ చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· · మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. ఈ ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడటానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
· దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి డీజిలుపై లీటరుకు రూ. 21.5, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
· కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేసినట్లు నివేదికలు అందాయి. దీనివల్ల కొన్ని చోట్ల అసాధారణ అమ్మకాలు, విపరీతమైన రద్దీ కనిపించింది. అయితే దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని మరోసారి తెలియజేస్తున్నాం.
· పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
· వదంతులను నమ్మవద్దని మరోసారి ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. వదంతులను అరికట్టడానికి పత్రికా సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
· భారత ప్రభుత్వం 29 మార్చి 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేవలం వంట, వెలుతురు అవసరాల కోసం పీడీఎస్ కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ సేవా కేంద్రాలలో (ప్రాధాన్యంగా సంస్థ స్వయంగా నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ కిరోసిన్ను నిల్వ చేయడానికి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు నిర్దేశిస్తాయి.
· ఇప్పటికే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· యుద్ధ ప్రభావ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న భారతీయ నౌకలు, నావికుల రక్షణ, భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం..
· సముద్ర వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే, నౌకా రవాణా కదలికలు, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రతను ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· గ్రీన్ సాన్వి అనే ఎల్పీజీ నౌక 25 మంది నావికులతో పాటు 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకును తీసుకువెళుతూ హర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది.
· 460 మంది భారతీయ నావికులతో కూడిన 17 భారత జెండా నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ సంస్థలు, భారతీయ రాయబార కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5,015 కాల్స్.. 10,425 ఈమెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లోనే 31 కాల్స్, 129 ఈమెయిళ్లు అందాయి.
· ఇప్పటి వరకు 1,320 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహాయపడింది. ఇందులో గత 24 గంటల్లో గల్ఫ్లోని విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుండి 190 మంది ఉన్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు ఎలాంటి రద్దీ లేకుండా సాధారణంగానే కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సముద్ర వాణిజ్య బోర్డులు తమ పరిధిలోని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· నావికుల సంక్షేమాన్ని, నిరంతర నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· యుద్ధ ప్రాంతంలోని భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, పౌరుల భద్రత, క్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయం అందిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సమాచారం ప్రకారం:
· ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ మత్స్యకారుల బృందం నేడు అర్మేనియా మీదుగా స్వదేశానికి తిరిగి వస్తోంది. వీరి విమానం ఈ సాయంత్రం భారత్కు చేరుకుంటుందని భావిస్తున్నారు.
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది.
· మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తోంది. ఇది భారతీయ రాయబార కార్యాలయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తుంది..
· విదేశాల్లోని రాయబార కార్యాలయాలు, ప్రత్యేక కేంద్రాలూ 24 గంటలూ పనిచేస్తూ, కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇవి భారతీయ సమాజం, సంస్థలు, సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి.
· రాయబార కార్యాలయాలు స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. నావికులు, విద్యార్థులు, భారతీయ పౌరులకు వీసా సదుపాయం, కాన్సులర్ సేవలు, రవాణా సంబంధిత సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాయి.
· గగనతల ఆంక్షల నేపథ్యంలో పొరుగు దేశాల ద్వారా ప్రయాణించేందుకు వీసాల జారీకి, కాన్సులర్ సేవలకు, అవసరమైన చోట రవాణా సదుపాయాలకు రాయబార కార్యలయాలు సహకరిస్తున్నాయి.
· భారతీయ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. వారి సమస్యల పరిష్కారం కోసం స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, విద్యా బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటున్నాయి.
· సముద్ర నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ
వారికి కాన్సులర్ సహాయం, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సౌకర్యం కల్పించడంతో పాటు స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలను పరిశీలిస్తున్నాయి.
· జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేరళ బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో రాయబార కార్యాలయాలు సమన్వయం చేసుకుంటున్నాయి.
· విమాన కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయి. ఆ ప్రాంతం నుంచి భారత్కు అదనపు విమానాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,75,000 మంది ప్రయాణికులు భారత్కు చేరుకున్నారు.
· యూఏఈ: పరిమిత సంఖ్యలో నాన్-షెడ్యూల్డ్ విమానాలు నడుస్తున్నాయి. భారత్కు సుమారు 90 విమానాలు నడిచే అవకాశం ఉంది.
· సౌదీ అరేబియా, ఒమన్: వివిధ విమానాశ్రయాల నుంచి భారత్కు విమానాలు నడుస్తున్నాయి.
· ఖతార్: గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో ఖతార్ ఎయిర్వేస్ నేడు భారత్కు సుమారు 8 నుంచి 10 విమానాలను నడపనుంది.
· కువైట్, బహ్రెయిన్: గగనతలాలు మూసివేసే ఉన్నాయి. ఆయా విమానయాన సంస్థలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్కు విమానాలను నడుపుతున్నాయి.
· ఇరాన్: గగనతలం మూసివేత కారణంగా అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా ప్రయాణానికి సౌకర్యం కల్పించారు
· ఇజ్రాయెల్: ఆంక్షల నేపథ్యంలో ఈజిప్టు, జోర్డాన్ మీదుగా ప్రయాణ సౌకర్యాలను కల్పించారు.
· ఇరాక్: జోర్డాన్, సౌదీ అరేబియా మార్గాల ద్వారా ప్రయాణాలకు ఏర్పాట్లు చేశారు.
· కువైట్, బహ్రెయిన్ దేశాల్లో మూసివేతల కారణంగా సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సదుపాయాలు కల్పిస్తున్నారు.
అబుదాబిలో జరిగిన దాడిలో అయిదుగురు భారతీయ పౌరులు గాయపడ్డారు. వీరిలో నలుగురు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఒకరు చికిత్స పొందుతున్నారు. భారత రాయబార కార్యాలయం బాధితులకు పూర్తి సహాయాన్ని అందిస్తూ, స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
***
(రిలీజ్ ఐడి: 2249024)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam