ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లోక్సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరం: పీఎం
గత రెండు-మూడు వారాలుగా ఈ అంశంపై అవసరమైన సమాచారాన్ని జై శంకర్, హర్దీప్ పూరీ సభకు అందిస్తున్నారు: పీఎం
మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది, ఈ సంక్షోభాన్ని త్వరితగతిన పరిష్కరించాలని అన్ని పక్షాలను ఈ ప్రపంచమంతా కోరుతోంది: పీఎం
గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న, నివసిస్తున్న భారతీయుల సంఖ్య సుమారుగా కోటి.. అందువల్ల ఈ ప్రాంతం మనకు ముఖ్యమైనది: పీఎం
ఈ సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో పనిచేసే భారతీయ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువే: పీఎం
ఇలాంటి అనేక కారణాల వల్ల భారత్ ఆందోళలను సహజంగానే ఎక్కువగా ఉంటాయి, ఈ సంక్షోభంపై భారత
పార్లమెంటు నుంచి ముక్తకంఠంతో ఏకగ్రీవంగా వ్యక్తమయ్యే అభిప్రాయం ప్రపంచానికి చేరడం అవసరం: పీఎం
యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు, యుద్ధం వల్ల ప్రభావితమైన దేశాలతో భారత్కు విస్తృతమైన వాణిజ్య
సంబంధాలున్నాయి, ఇతర దేశాలతో మన వాణిజ్యానికి యుద్ధం జరుగుతున్న ఈ ప్రాంతం చాలా కీలకమైన మార్గం: పీఎం
దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి చమురు, సహజవాయువు, ఎరువుల్లో సింహ భాగం హర్మూజ్ జలసంధి గుండా
వస్తుంది, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల ప్రయాణం సవాలుగా మారింది: పీఎం
అయినప్పటికీ, దేశంలో పెట్రోలు, డీజిలు సరఫరాపై పెద్ద ప్రభావం పడకుండా, సాధారణ కుటుంబాలకు ఎదురయ్యే అసౌకర్యాన్ని తక్కువ స్థాయికే పరిమితం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: పీఎం
మానవ ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యమిస్తుంది, ఈ సమస్యలకు చర్చలు, దౌత్యమే పరిష్కారం: పీఎం
ఉద్రిక్తతలను తగ్గించడం, ఈ సంఘర్షణను ముగించడమే మా ప్రయత్నాల లక్ష్యం: పీఎం
యుద్ధంలో ఎవరి ప్రాణాలనైనా ప్రమాదంలోకి నెట్టడం మానవత్వం కాదు, వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారాన్ని తీసుకువచ్చేలా ముందుకు రావాలని అన్ని పక్షాలను భారత్ కోరుతోంది: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 3:47PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల భారత్ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్సభలో ప్రసంగించారు. ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, మానవ జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దీనిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. ‘‘ఈ సంక్షోభాన్ని వీలైనంత తర్వగా పరిష్కరించాలని అన్ని పక్షాలకు ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తోంది’’ అన్నారు.
భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ల స్వభావం గురించి ప్రధానమంత్రి వివరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ యుద్ధం ఆర్థిక, జాతీయ భద్రత, మానవతాపరమైన ఒత్తిళ్లను సృష్టించిందన్నారు. యుద్ధం చేస్తున్న, యుద్ధ ప్రభావానికి గురైన దేశాలతో భారత్కు విస్తృతమైన వాణిజ్య సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. సంక్షోభ ప్రాంతంలోనే కీలకమైన వాణిజ్య మార్గాలు విస్తరించి ఉన్నాయన్నారు. దేశ ముడిచమురు, సహజ వాయు అవసరాల్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతమే తీరుస్తోందని వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న, నివసిస్తున్న భారతీయుల సంఖ్య దాదాపుగా కోటి వరకు ఉందని గుర్తుచేశారు. అలాగే ఈ ప్రాంత సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల సిబ్బందిలో భారతీయ సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ‘‘దీనివల్ల సహజంగానే భారత్కు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంక్షోభంపై భారత పార్లమెంటు నుంచి ముక్త కంఠంతో ఏకగ్రీవ అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం చాలా అవసరం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
భారతీయ పౌరుల భద్రత కోసం తక్షణమే స్పందించిన ప్రభుత్వం తీరును వివరిస్తూ.. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రభావిత దేశాల్లో ఉన్న ప్రతి భారతీయునికి అవసరమైన సాయం అందించామని సభకు ప్రధానమంత్రి తెలియజేశారు. పశ్చిమాసియా దేశాల అధిపతులతో రెండు సార్లు వ్యక్తిగతంగా మాట్లాడానని, భారతీయుల భద్రతకు వారు పూర్తి హామీ ఇచ్చారని తెలిపారు. ‘‘గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తున్నారు’’ అని శ్రీ మోదీ వివరించారు.
విదేశాల్లో ఉన్న భారతీయులకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన దౌత్యపరమైన, సంస్థాగతమైన సహాయక వ్యవస్థ గురించి ప్రధానమంత్రి మరిన్ని వివరాలు అందించారు. ప్రభావిత దేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు నిరంతరాయంగా సహాయాన్ని అందిస్తున్నాయని, ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తున్నాయని చెప్పారు. ప్రభావిత దేశాలతో పాటు, భారత్లోనూ 24/7 కంట్రోల్ రూములు, అత్యవసర హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘భారతీయ కార్మికులైనా, పర్యాటకులైనా, ప్రభావితమైన వారందరికీ ఈ వ్యవస్థల ద్వారా తక్షణమే అవసరమైన సమాచారం అందుతోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.
విదేశాల నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి వివరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 3,75,000 మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చినట్టు శ్రీ మోదీ సభకు తెలిపారు. వీరిలో ఇరాన్ నుంచే 1,000 మంది వరకూ ఉండగా, వారిలో 700 మందికి పైగా యువ వైద్య విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలల్లో జరగాల్సిన పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిందనీ, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ.. ‘‘ప్రభుత్వం అత్యంత సున్నితంగా వ్యవహరిస్తూ, అప్రమత్తంగా ఉంది. అన్ని విధాలా సాయమందించేందుకు సిద్ధంగా ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఇంధన వనరుల సరఫరాకు సంబంధించిన కీలక అంశంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మనకు అవసరమైన ముడి చమురు, గ్యాస్, ఎరువులు, ఇతర అత్యవసర వస్తువులు చాలావరకూ హార్ముజ్ జలసంధి ద్వారానే దేశానికి చేరుతున్నాయనీ, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకా రవాణా సవాలుగా మారిందనీ ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాల దుష్ప్రభావం సామాన్య కుటుంబాలపై పడకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ వినియోగంలో గృహ అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, దేశీయంగా దాని ఉత్పత్తిని పెంచడం వంటి చర్యలను ప్రస్తావించారు. ‘‘దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా నిరంతరం కృషి చేస్తున్నాం’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
గత పదేళ్లుగా మనం అనుసరిస్తున్న ఇంధన వైవిధ్యీకరణ వ్యూహం ఎంత విలువైనదో ఈ సంక్షోభ సమయంలో స్పష్టమైందని ప్రధానమంత్రి చెప్పారు. గత 11 ఏళ్లలో భారత్ తన ఇంధన దిగుమతి వనరులను 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించుకుందని సభకు తెలిపారు. తద్వారా ఒకే ప్రాంతంపై ఆధారపడడం తగ్గిందన్నారు. ఈ విధానంలోని ముందుచూపును ప్రస్తావిస్తూ.. ‘‘ఇంధన భద్రత విషయంలో గత దశాబ్ద కాలంగా తీసుకున్న చర్యలు నేటి పరిస్థితుల్లో మరింత సందర్భోచితంగా ఉన్నాయి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వ్యూహాత్మక నిల్వల విషయానికి వస్తే, ఇలాంటి సంక్షోభ సమయాలను ఎదుర్కోవడానికే.. ముడి చమురు నిల్వ చేయడానికి భారత్ అత్యంత ప్రాధాన్యాన్నిచ్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చమురు కంపెనీల వద్ద ఉన్న నిల్వలకు అదనంగా.. ప్రస్తుతం భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలున్నాయనీ, మరో 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కొత్త నిల్వ కేంద్రాల నిర్మాణం జరుగుతోందని ఆయన సభకు తెలిపారు. ‘‘గత 11 ఏళ్లలో మన దేశ చమురు శుద్ధి సామర్థ్యం కూడా విశేషంగా పెరిగింది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెప్పారు.
అంతర్జాతీయ సరఫరాదారులతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందనీ.. అలాగే దేశానికి అవసరమైన చమురు, గ్యాస్, ఎరువులు, ఇతర అత్యవసర వస్తువులను మోసుకొచ్చే నౌకలు సురక్షితంగా చేరుకునేలా రవాణా మార్గాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామనీ ప్రధానమంత్రి వివరించారు. సముద్ర కారిడార్ల రక్షణ కోసం అంతర్జాతీయ భాగస్వాములందరితో నిరంతరం చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘ఈ ప్రయత్నాల వల్లే హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన కొన్ని మన నౌకలు కూడా ఇటీవల సురక్షితంగా భారత్కు చేరుకున్నాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
దేశ అంతర్గత ఇంధన పరివర్తనపై ప్రధానమంత్రి మాట్లాడారు. ఇథనాల్ మిశ్రణలో సాధించిన అసాధారణ పురోగతిని వివరించారు. దశాబ్దం కిందట ఇథనాల్ మిశ్రణ రక్రియ 1 నుంచి 1.5 శాతానికే పరిమితమై ఉండేదనీ, అది నేడు దాదాపు 20 శాతానికి చేరిందనీ తెలిపారు. దీనివల్ల ఏటా దాదాపు నాలుగున్నర కోట్ల బారెల్స్ చొప్పున చమురు దిగుమతులు తగ్గాయని ఆయన చెప్పారు. రైల్వేల విద్యుదీకరణ ద్వారా ఏటా దాదాపు 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతోందని ఆయన పేర్కొన్నారు. 2014లో 250 కి.మీ లోపే ఉన్న మెట్రో నెట్వర్కు నేడు 1,100 కి.మీ వరకు విస్తరించిందని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 15,000 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రాలకు అందజేసినట్టు వెల్లడించారు. దేశ ఇంధన భవితపై ధీమా వ్యక్తం చేస్తూ.. ‘‘ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా నేడు చేపడుతున్న ఈ భారీ చర్యలు దేశ భవిష్యత్తును మరింత సురక్షితంగా తీర్చిదిద్దుతాయి’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
విస్తృతమైన ఆర్థిక పరిణామాలపై మాట్లాడుతూ.. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అనీ, ప్రపంచ ఇంధన అవసరాలకు పశ్చిమాసియా ప్రధాన వనరుగా ఉందనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందుకే ప్రస్తుత సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు సవాలుగా మారిందని వివరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమగ్ర స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలతో పనిచేస్తోందని ప్రధానమంత్రి సభకు తెలియజేశారు. బలమైన ఆర్థిక పునాదులు, వివిధ రంగాల భాగస్వాములతో సంప్రదింపులు, ప్రతిరోజూ సమావేశమై దిగుమతి - ఎగుమతి వ్యవస్థల్లో ప్రతి ఇబ్బందినీ గుర్తించి పరిష్కరించే ఓ ప్రత్యేక అంతరమంత్రిత్వ శాఖా బృందం ప్రభుత్వ చర్యలకు ఊతమిస్తున్నాయన్నారు. ‘‘ప్రభుత్వం, పరిశ్రమల ఉమ్మడి కృషితో ఈ పరిస్థితులను మనం సమర్థంగా ఎదుర్కోగలమన్న పూర్తి విశ్వాసం నాకుంది’’ అని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యవసాయంపై యుద్ధ ప్రభావం గురించి ప్రస్తావిస్తూ.. మన రైతుల కృషి వల్ల దేశంలో తగిన ఆహార ధాన్యాల నిల్వలున్నాయని ప్రధానమంత్రి సభకు భరోసా ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ సాగు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలనూ అందిస్తోందనీ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా బలమైన ఆహార ఏర్పాట్లను ఇటీవలి సంవత్సరాల్లో సిద్ధం చేసిందనీ ఆయన తెలిపారు. గతంలో కోవిడ్-19 విపత్తు, తద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తలెత్తిన సమయంలో.. అంతర్జాతీయ మార్కెట్లలో యూరియా ధరలు బస్తాకు రూ. 3,000కి పెరిగినప్పటికీ, భారతీయ రైతులకు అదే బస్తాను రూ. 300 కన్నా తక్కువ ధరకే అందేలా ప్రభుత్వం చూసుకుందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ‘‘మా ప్రభుత్వం గతంలోనూ అంతర్జాతీయ సంక్షోభాల భారాన్ని మన రైతులపై పడనీయలేదు’’ అని ఆయన సభకు వివరించారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను వివరిస్తూ.. గత దశాబ్దంలో 6 నూతన యూరియా ప్లాంట్లను నెలకొల్పినట్లు ప్రధానమంత్రి తెలిపారు. వీటి ద్వారా 76 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని.. దేశీయంగా డీఏపీ, ఎన్పీకేఎస్ ఎరువుల ఉత్పత్తి 50 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగినట్లు వెల్లడించారు. వివిధ దేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాల గురించి చెబుతూ.. "వివిధ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకున్నట్లే.. డీఏపీ, ఎన్పీకేఎస్ ఎరువుల దిగుమతికి వివిధ దేశాల నుంచి మార్గాలను విస్తరించుకున్నాం" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు మేడ్ ఇన్ ఇండియా నానో యూరియా ఆవిష్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటం.. పీఎం కుసుమ్ పథకం ద్వారా 22 లక్షలకుపైగా సోలార్ పంపుల పంపిణీ ద్వారా రైతులు, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించినట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ సవాలును ఎదుర్కొనేందుకు.. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ ప్లాంట్ల వద్ద తగినంత బొగ్గు నిల్వలున్నాయని, వరుసగా రెండో ఏడాది 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తితో భారత్ రికార్డును సృష్టించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విప్లవాత్మక పురోగతితో ప్రభుత్వ సంసిద్ధత క్రమంగా పెరిగిందన్నారు. భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక వనరుల నుంచి సగం వాటా వస్తుండగా.. దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం రికార్డు స్థాయిలో 250 గిగావాట్లను అధిగమించిందని పేర్కొన్నారు. 11 ఏళ్లలో సౌరశక్తి సామర్థ్యం సుమారు 3 గిగావాట్ల నుంచి 140 గిగావాట్లకు పెరిగిందని, సుమారు 40 లక్షల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, గోబర్దన్ పథకం ద్వారా 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అణుశక్తి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూనే, రానున్న అయిదేళ్లలో 1,500 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించేలా నూతనంగా ఆమోదించిన స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ పథకాన్ని ప్రస్తావించారు. "ఈ ప్రయత్నాలన్నీ ఈ రోజు దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయి. భారతదేశ ఇంధన భవిష్యత్తును ఇవి మరింత సురక్షితంగా మారుస్తాయి" అని తెలిపారు.
పశ్చిమాసియా పరిస్థితులపై మొదట్నుంచీ భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ విషయంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసిందని.. ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రజలపై దాడులను, ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్రిక్తలు తగ్గించి, యుద్ధాన్ని ముగించాలని పశ్చిమాసియా కీలక దేశాధినేతలను కోరినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటుకు తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయటం, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జలమార్గాలకు ఆటంకం కలిగించటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. "యుద్ధ వాతావరణంలోనూ, భారత నౌకల సురక్షిత ప్రయాణానికి దౌత్యపరంగా దేశం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
మానవత్వం, శాంతి పట్ల భారత్ నిబద్ధతను స్పష్టం చేస్తూ.. చర్చలు, దౌత్య సంబంధాలే సమస్య పరిష్కారానికి ఏకైక మార్గమని ప్రధానమంత్రి అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించటం, యుద్ధాన్ని ముగించటంపైనే భారత ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ యుద్ధంలో ఏ ఒక్క ప్రాణానికి ముప్పు వాటిల్లినా మావవ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. "అన్ని పక్షాలు వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది" అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.
ఈ సంక్షోభంలోని అంతర్గత భద్రతా అంశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని హెచ్చరించారు. శాంతిభద్రతలకు సంబంధించిన సంస్థలన్నింటినీ అప్రమత్తం చేశామని.. తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో సైబర్, వ్యూహాత్మక సంస్థలతో సహా అన్ని రంగాల్లో భద్రతను మరింత కఠినతరం చేస్తున్నట్లు సభకు తెలిపారు. "తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో సైబర్, వ్యూహాత్మక సంస్థల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాం" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ ముందస్తు సూచన చేశారు.
యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని.. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలిచినట్లుగా, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా, ఐక్యతతో ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓపికతో ఉంటూ, సంయమనం పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ, బ్లాక్ మార్కెట్ ద్వారా నిత్యావసరాల కొరత సృష్టిస్తూ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే వారి పట్ల నిఘా పెట్టాలని, అలాంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సభ ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశ ఉమ్మడి సంకల్పంపై అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. "దేశంలోని ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు కలిసి ఏ సవాలునైనా ఎదిరించవచ్చు. ఇదే మన గుర్తింపు, ఇదే మన బలం" అని అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2244208)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6