ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్టోనియా దేశాధ్యక్షుడితో భారత ప్రధాన మంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 8:35PM by PIB Hyderabad
ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ సందర్భంగా 2026 ఫిబ్రవరి 18 నాడు ఎస్టోనియా దేశాధ్యక్షుడు శ్రీ అలార్ కారిస్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
గతేడాది పారిస్లో జరిగిన 'ఏఐ యాక్షన్ సమ్మిట్' సందర్భంగా భేటీ అయిన సందర్భాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు కారిస్ ఈ సందర్భంగా ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పరిపాలన వంటి ఉమ్మడి విలువలు.. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం అనే ఉమ్మడి లక్ష్యాలపై ఆధారపడిన భారత్-ఎస్టోనియా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
జనవరి 2026లో జరిగిన 16వ భారత్-ఈయూ సదస్సులో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా చేసుకోవటంతో ఇరు పక్షాల మధ్య సంబంధాల్లో సాధించిన గణనీయమైన వ్యూహాత్మక పురోగతిని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
ద్వైపాక్షిక సంబంధాలను ముఖ్యంగా ఐటీ, డిజిటలైజేషన్ రంగాలలో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు.. భవిష్యత్తును శాసించే సాంకేతికతలు, ఈ-గవర్నెన్స్, సైబర్ భద్రత, అంకురాలు, విద్యా-నైపుణ్య అభివృద్ధి రంగాలలో కృత్రిమ మేధ వినియోగం వంటి అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు స్వచ్ఛ ఇంధనం, స్మార్ట్ ఇంధన నిర్వహణ రంగాలలో భాగస్వామ్యానికి ఉన్న సామర్థ్యంపై కూడా వారు చర్చించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్- ఎస్టోనియా మధ్య పెరుగుతున్న సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టోనియా అభివృద్ధిలో అక్కడి భారతీయ నిపుణులు అందిస్తున్న సహకారాన్ని అధ్యక్షుడు కారిస్ ప్రత్యేకంగా అభినందించారు. ఇరు దేశాల మధ్య నైపుణ్యవంతులైన మానవ వనరుల రాకపోకలు, పర్యాటక రంగాన్ని మరింత సులభతరం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
***
(రిలీజ్ ఐడి: 2230172)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2