మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈ నెల 6న పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్
దేశవ్యాప్తంగా బహుళ ప్రాంతాల విద్యార్థుల భాగస్వామ్యం గల
తొలి కార్యక్రమంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 4:42PM by PIB Hyderabad
పరీక్షల ఒత్తిడిపై సమగ్రంగా చర్చించడం ద్వారా పరీక్షలను జీవితంలో ఒక అంతర్భాగంగా, ఒక ఉత్సవంగా భావించాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం 'పరీక్షా పే చర్చ' (పీపీసీ) 9వ ఎడిషన్ ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్, దూరదర్శన్ (డిడి), విద్యా మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రసారం కానుంది. వేవ్స్ ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో, జీ5, సోనీ లివ్, స్పాటిఫై (ఆడియో ప్లాట్ఫామ్) వంటి వేదికలూ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
ఎన్ఈపీ-2020కి అనుగుణంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని, సంపూర్ణ శ్రేయస్సును పెంపొందించడం ద్వారా వారి పరీక్షా అనుభవాన్ని ఉత్సాహంగా మార్చుతూ, పరీక్షల కాలాన్ని వారు ఒక ఉత్సవంగా భావించేలా చేయడం పీపీసీ భావన లక్ష్యం. ప్రధానమంత్రి తన అభిప్రాయాలను 'ఎగ్జామ్ వారియర్స్' అనే తన పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం బ్రెయిలీతో పాటు అనేక భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో ఆత్మవిశ్వాసం గురించి ప్రధానమంత్రి స్పష్టమైన సందేశం ఇచ్చారు. మన పిల్లలు వారికి అర్హత గల ఆనందకరమైన బాల్యం పొందడం కోసం ఈ సమస్యల గురించి చర్చించాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి రూపొందించిన 'పరీక్షా పే చర్చ' ఒక చైతన్యవంతమైన, వినూత్నమైన కార్యక్రమం. ఇది ప్రతి సంవత్సరం కొత్త అంశాలను పరిచయం చేస్తుంది. తొలిసారి దేశంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ బహుళ ప్రదేశాల్లో పీపీసీ-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీతో పాటుగా దేశంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలను కవర్ చేస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, గుజరాత్లోని దేవ్ మోగ్రా, అస్సాంలోని గౌహతి వంటి 4 వేర్వేరు ప్రదేశాల్లోనూ పీపీసీ-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరీక్షా పే చర్చ-2026కు సన్నాహకంగా... దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థి-కేంద్రిత కార్యకలాపాలు నిర్వహించారు. స్వయం-సమృద్ధి స్ఫూర్తిని ప్రోత్సహించేలా విద్యార్థులచే నిర్వహించిన స్వదేశీ సంకల్ప దౌడ్, పరాక్రమ దివస్ సందర్భంగా ప్రముఖ కేంద్రీయ విద్యాలయాల్లో నిర్వహించిన క్విజ్, వ్యాస రచన పోటీలు వీటిలో భాగంగా ఉన్నాయి. ఈ కార్యకలాపాల్లో సుమారు 4.81 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సంవత్సరాలుగా, ఈ కార్యక్రమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అపూర్వ భాగస్వామ్యాన్ని నమోదు చేస్తోంది. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ కోసం నమోదైన రిజిస్ట్రేషన్లు మునుపటి అన్ని రికార్డులనూ అధిగమించాయి. మైగవ్ పోర్టల్ ద్వారా 4.50 కోట్లకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమం కోసం పేరు నమోదు చేసుకున్నారు. విద్యా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలోఈ అద్భుత భాగస్వామ్యం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థల నిరంతర మద్దతు, సమష్టి నిబద్ధతలకు నిదర్శనం. కాలక్రమేణా, పరీక్షా పే చర్చలో చేరుతున్న భాగస్వాముల సంఖ్య... ఈ కార్యక్రమం విద్యార్థులందరి జీవితాల్లో తీసుకువస్తున్న విలువకు స్పష్టమైన సంకేతం.
***
(రిలీజ్ ఐడి: 2224191)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
हिन्दी
,
Khasi
,
Urdu
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada