ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2026-27 సంగ్రహ స్వరూపం
प्रविष्टि तिथि:
01 FEB 2026 1:14PM by PIB Hyderabad
పేదలు, అణగారిన వర్గాలు వెనుకబడిన వారిపై దృష్టి సారించే ప్రభుత్వ 'సంకల్పాన్ని' స్పష్టంగా ప్రతిబింబించిన యువశక్తి ఆధారిత బడ్జెట్,
మూడు కర్తవ్యాల ప్రేరణ... కర్తవ్య భవన్లో రూపుదిద్దుకున్న మొదటి బడ్జెట్
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, స్థిరంగా కొనసాగించడం మొదటి కర్తవ్యం
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం రెండో కర్తవ్యం
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ దార్శనికతకు అనుగుణంగా మూడో కర్తవ్యం
ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025
సరళీకరించిన ఆదాయపు పన్ను నిబంధనలు ఫారాలపై త్వరలోనే నోటిఫికేషన్
పెనాల్టీ (జరిమానా), ప్రాసిక్యూషన్ను హేతుబద్ధం చేయడానికి బహుళ విచారణల ప్రక్రియ సులభతరం
కొన్ని ప్రాథమిక సహకార సంఘాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మినహాయింపును,
ఇకపై పశుగ్రాసం, పత్తి గింజలకు కూడా వర్తింపు
15.5% సాధారణ భద్రతా హామీ మార్జిన్తో ఒకే కేటగిరీగా సమాచార సాంకేతిక సేవలు
ఐటి సేవల కోసం భద్రతా హామీ పొందే పరిమితి రూ. 300 కోట్ల నుంచి రూ. 2000 కోట్లకు పెంపు
విదేశీ క్లౌడ్ సేవా సంస్థలకు 2047 వరకు పన్ను విరామం
అంచనా ప్రాతిపదికన పన్ను చెల్లించే ప్రవాస భారతీయులందరికీ
కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) మినహాయింపు
పన్ను సంవత్సరం 2027-28 నుంచి ఐసీడీఎస్ ఆధారంగా ప్రత్యేక అకౌంటింగ్ అవసరం లేకుండా, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ను సవరించేందుకు
సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్న మంత్రిత్వ శాఖ
ఫ్యూచర్స్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్ఐటీ) ప్రస్తుతం ఉన్న 0.02% నుంచి 0.05%కి పెంపు
బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగించే మూలధన వస్తువులపై
ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పొడిగింపు
ముఖ్యమైన ఖనిజాల శుద్ధికి అవసరమైన మూలధన వస్తువుల దిగుమతిపై
ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల సుంకం విధించదగిన వస్తువులపై
టారిఫ్ రేటు 20% నుంచి 10%కి తగ్గింపు
17 రకాల డ్రగ్స్ (మందులు) లేదా ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
బయోలాజిక్స్, బయోసిమిలర్ల దేశీయ ఉత్పత్తికి అనుకూలమైన వ్యవస్థను నిర్మించడానికి
రూ. 10,000 కోట్ల వ్యయంతో 'బయోఫార్మా శక్తి'
ఎంఎస్ఎంఈలను భవిష్యత్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి రూ. 10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్
పబ్లిక్ క్యాపెక్స్ (ప్రభుత్వ మూలధన వ్యయం) 2025-26 బడ్జెట్ అంచనాలలోని రూ. 11.2 లక్షల కోట్ల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 12.2 లక్షల కోట్లకు పెంపు
పర్యావరణపరంగా స్థిరమైన ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించడానికి నగరాల మధ్య 'గ్రోత్ కనెక్టర్లు' గా
ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధి
ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ద్వారా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు
ఉన్నత విద్యను అందించే స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సంస్థల్లోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహం ఏర్పాటు
ఐఐఎం సహకారంతో, హైబ్రిడ్ విధానంలో నిర్వహించే ప్రామాణికమైన, నాణ్యమైన 12 వారాల శిక్షణ కోర్సు ద్వారా 20 పర్యాటక కేంద్రాల్లో 10,000 మంది గైడ్ల నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త పథకం
రాబోయే దశాబ్ద కాలంలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చడానికి ఖేలో ఇండియా మిషన్
అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐసీఏఆర్ వ్యవసాయ పద్ధతుల ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానించడానికి బహుభాషా ఏఐ సాధనం భారత్-విస్తార్
విదేశీ పర్యటన ప్రోగ్రామ్ ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం, 20 శాతం పన్ను 2 శాతానికి తగ్గింపు
కస్టమ్స్ వేర్హౌసింగ్ విధానం సెల్ఫ్-డిక్లరేషన్లు, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, రిస్క్ ఆధారిత ఆడిట్తో కూడిన వేర్హౌస్ ఆపరేటర్ కేంద్రీకృత' వ్యవస్థగా మార్పు
వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి కార్గో క్లియరెన్స్ ఆమోదాలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి
ఒకే పరస్పర అనుసంధానిత డిజిటల్ విండో ద్వారా అంతరాయం లేకుండా ప్రాసెస్ చేసే ఏర్పాటు
కేంద్ర బడ్జెట్ 2026-27 ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1, 2026) పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
పార్ట్- ఏ
ఈ రోజు మాఘ పూర్ణిమ, గురు రవిదాస్ జయంతి కూడా కావడాన్ని ప్రస్తావిస్తూ, కర్తవ్య భవన్లో తయారైన ఈ మొదటి బడ్జెట్ మూడు కర్తవ్యాల నుంచి స్ఫూర్తి పొందిందని ఆర్థిక మంత్రి తెలిపారు.
1. మొదటి కర్తవ్యం - ఉత్పాదకత పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. దానిని స్థిరంగా కొనసాగించడం. అలాగే అస్థిరమైన ప్రపంచ పరిణామాలను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంపొందించడం.
2. రెండో కర్తవ్యం: ప్రజల ఆకాంక్షలను తీర్చడం. వారి సామర్థ్యాన్ని పెంపొందించడం. వారిని భారతదేశ సంప్రదాయ మార్గంలో బలమైన భాగస్వాములుగా తీర్చిదిద్దడం.
3. మూడో కర్తవ్యం - సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతకు అనుగుణంగా, ప్రతి కుటుంబం, సంఘం, ప్రాంతం, రంగం అర్థవంతమైన భాగస్వామ్యం కోసం అవసరమైన వనరులు, సౌకర్యాలు, అవకాశాలను పొందేలా చూడటం.
పేదలు, అణగారిన, వెనుకబడిన వర్గాలపై దృష్టి సారించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేస్తూ యువశక్తి ఆధారిత బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి, మహత్తర లక్ష్యాలను, అందరినీ కలుపుకుని పోవడాన్ని సమతుల్యం చేస్తూ, వికసిత్ భారత్ దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం కొనసాగిస్తుందని చెప్పారు. విస్తరిస్తున్న వాణిజ్య మూలధన అవసరాలు కలిగిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, భారత్ అంతర్జాతీయ మార్కెట్లతో లోతైన అనుసంధానాన్ని కలిగి ఉండాలని, ఎగుమతులను పెంచడంతో పాటు స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగించాలని స్పష్టం చేశారు.
వాణిజ్యం, బహుపాక్షికత ముప్పులో ఉన్నాయని, అలాగే వనరులు, సరఫరా వ్యవస్థల లభ్యతకు ఆటంకాలు ఏర్పడుతున్న బాహ్య వాతావరణాన్ని దేశం ఎదుర్కొంటోందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను సమూలంగా మారుస్తున్నాయని, అదే సమయంలో నీరు, ఇంధనం, కీలక ఖనిజాల అవసరాలను గణనీయంగా పెంచుతున్నాయని ఆమె వివరించారు.
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటన తర్వాత, 350కి పైగా సంస్కరణలు అమలులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. వీటిలో జీఎస్టీ సరళీకరణ, కార్మిక చట్టాల నోటిఫికేషన్, తప్పనిసరి నాణ్యత నియంత్రణ ఆదేశాల హేతుబద్ధీకరణ వంటివి ఉన్నాయి. ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు అయ్యాయి. వాటికి సమాంతరంగా, నిబంధనల సడలింపు, నిబంధనల అమలు భారాన్ని తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, స్థిరంగా కొనసాగించడానికి ఉద్దేశించిన మొదటి కర్తవ్యం కింద, ఆరు రంగాలలో చర్యలను ప్రతిపాదించారు.
-
ఏడు వ్యూహాత్మక, అగ్రగామి రంగాలలో తయారీ రంగాన్ని భారీగా విస్తరిస్తారు.
-
వారసత్వ పారిశ్రామిక రంగాలకు పునరుజ్జీవం కల్పిస్తారు.
-
ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను సృష్టిస్తారు.
-
మౌలిక సదుపాయాల రంగానికి శక్తిమంతమైన ఉత్తాజాన్ని అందిస్తారు.
-
దీర్ఘకాల ఇంధన భద్రత, స్థిరత్వం కల్పిస్తారు.
-
నగర ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు.
భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, బయోలాజిక్స్, బయోసిమిలర్ల దేశీయ ఉత్పత్తికి అవసరమైన వ్యవస్థను నిర్మించేందుకు రూ. 10,000 కోట్ల వ్యయంతో 'బయోఫార్మా శక్తి' పథకాన్ని రాబోయే 5 ఏళ్లలో అమలు చేస్తారు. ఈ వ్యూహంలో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐపీఈఆర్) ఏర్పాటుతో పాటు, ప్రస్తుతం ఉన్న ఏడు సంస్థలను అప్గ్రేడ్ చేయడం ద్వారా బయోఫార్మాపై దృష్టి సారించిన నెట్వర్క్ను రూపొందిస్తారు. అలాగే, 1000కి పైగా గుర్తింపు పొందిన ఇండియా క్లినికల్ ట్రయల్స్ కేంద్రాల నెట్వర్క్ను కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. ప్రపంచ ప్రమాణాలకు, నిర్ణీత ఆమోద కాలపరిమితులకు అనుగుణంగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ను బలోపేతం చేస్తారు. దీనికోసం ఒక ప్రత్యేక శాస్త్రీయ సమీక్షా కేడర్ ను, నిపుణులను నియమిస్తారు.
విస్తృతమైన కార్మిక ఆధారిత జౌళి రంగానికి ఐదు ఉపభాగాలతో కూడిన సమగ్ర కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. పట్టు, ఉన్ని, జనపనార వంటి సహజ నూలు రకాలు, మానవ తయారీ నూలు, ఆధునిక కాలపు నూలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం నేషనల్ ఫైబర్ స్కీమ్ ను ఉద్దేశించారు. యంత్రాల కొనుగోలుకు మూలధన మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణ, ఉమ్మడి పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా సాంప్రదాయ క్లస్టర్లను ఆధునీకరించడానికి జౌళి విస్తరణ, ఉపాధి పథకాన్ని (టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్) ఉద్దేశించారు. ప్రస్తుతం ఉన్న పథకాలను సమగ్రపరచడానికి, బలోపేతం చేయడానికి, అలాగే చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు నిర్దేశిత మద్దతును అందించడం కోసం నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకోగల పర్యావరణహిత వస్త్రాలు, దుస్తుల తయారీని ప్రోత్సహించడం కోసం టెక్స్-ఎకో ఇనిషియేటివ్ కింద పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహకారం ద్వారా వస్త్ర రంగ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఆధునీకరించడానికి, మెరుగుపరచడానికి 'సమర్థ్ 2.0' ను అమలు చేస్తారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ల వృద్ధికి కీలకమైన శక్తులుగా గుర్తిస్తూ, భవిష్యత్ ఛాంపియన్లను (అత్యుత్తమ సంస్థలను) సృష్టించేందుకు రూ.10,000 కోట్లతో ఒక ప్రత్యేక ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ను ప్రతిపాదించారు. ఎంపిక చేసిన ప్రమాణాల ఆధారంగా ఈ నిధి ద్వారా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ మూలధన వ్యయాన్ని (పబ్లిక్ క్యాపెక్స్) 2025-26 బడ్జెట్ అంచనాలలో రూ. 11.2 లక్షల కోట్ల కేటాయింపునకు భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇదే వేగాన్ని కొనసాగించడానికి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో దీనిని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు.

పర్యావరణహితంగా సరుకు రవాణాను ప్రోత్సహించడానికి తూర్పున ఉన్న దాంకుణి నుంచి పశ్చిమాన ఉన్న సూరత్ వరకు అనుసంధానిస్తూ కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటును ఆర్ధిక మంత్రి ప్రతిపాదించారు. వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఒడిశాలోని ఎన్ డబ్ల్యూ-5 తో ప్రారంభించి, ఖనిజ సంపద అధికంగా ఉన్న తాల్చేర్, అంగుల్ ప్రాంతాలను, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తారు. అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం శిక్షణా సంస్థలను రీజినల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఏర్పాటు చేస్తారు.
నగరాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింత పెంచడం ఈ బడ్జెట్ లక్ష్యం. ఇందులో భాగంగా, ఆయా నగరాల వృద్ధి కారకాలను బట్టి'నగర ఆర్థిక ప్రాంతాలను (సిఈఆర్) మ్యాపింగ్ చేస్తారు. సంస్కరణలు, ఫలితాల ఆధారిత నిధుల యంత్రాంగంతో (ఛాలెంజ్ మోడ్ ద్వారా తమ ప్రణాళికలను అమలు చేయడానికి ఒక్కో సిఈఆర్ కు 5 ఏళ్ల కాలానికి రూ.5,000 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు.
పర్యావరణ హితమైన ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించడానికి, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను గ్రోత్ కనెక్టర్లుగా అభివృద్ధి చేస్తారు. వాటిలో 1. ముంబయి-పుణే 2. పుణే-హైదరాబాద్ 3. హైదరాబాద్-బెంగళూరు 4. హైదరాబాద్-చెన్నై 5. చెన్నై-బెంగళూరు 6. ఢిల్లీ-వారణాసి 7. వారణాసి-సిలిగురి ఉన్నాయి.
ప్రభుత్వం రెండో కర్తవ్యం... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, సామర్థ్యాన్ని పెంచడం అని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా నిరంతరంగా చేస్తున్న సంస్కరణల ఫలితంగా దాదాపు 25 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని ఆమె పేర్కొన్నారు.
భారత్ ను మెడికల్ టూరిజం సేవల కేంద్రంగా ప్రోత్సహించడానికి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు మద్దతు ఇచ్చే పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ కేంద్రాలు వైద్యం, విద్య, పరిశోధనా సౌకర్యాలతో కూడిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ సముదాయాలుగా పనిచేస్తాయి. ఈ కేంద్రాలలో ఆయుష్ విభాగాలు, మెడికల్ వాల్యూ టూరిజం ఫెసిలిటేషన్ కేంద్రాలు, వ్యాధి నిర్ధారణ (డయాగ్నోస్టిక్స్), చికిత్స తదుపరి సంరక్షణ (పోస్ట్-కేర్), పునరావాసం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ హబ్లు వైద్యులు, అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా ఆరోగ్య రంగ నిపుణులకు విభిన్న ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.
పశువైద్య నిపుణుల లభ్యతను 20,000 పైగా పెంచడానికి, ప్రైవేట్ రంగంలో పశువైద్య, పారా వెట్ కళాశాలలు, పశువైద్య ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు, బ్రీడింగ్ కేంద్రాల ఏర్పాటుకు మద్దతుగా రుణం ఆధారిత మూలధన సబ్సిడీ పథకాన్ని ప్రతిపాదించారు.
భారతదేశంలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసి) రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. దీనికి 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రి మద్దతు ప్రకటించారు.
ఉన్నత విద్యా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సంస్థల్లో సుదీర్ఘ గంటల అధ్యయనం, ప్రయోగశాల పనులు విద్యార్థినులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించడానికి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేదా మూలధన మద్దతు ద్వారా ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని ఉన్నతీకరించడం ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇది విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) సహకారంతో, 20 పర్యాటక ప్రాంతాల్లోని 10,000 మంది గైడ్ల నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఒక పైలట్ పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీని కోసం హైబ్రిడ్ మోడ్లో 12 వారాల ఉన్నత నాణ్యతా, ప్రామాణిక శిక్షణా కోర్సును నిర్వహిస్తారు.
ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రారంభమైన క్రీడా ప్రతిభను క్రమబద్ధంగా ప్రోత్సహించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ, రాబోయే దశాబ్ద కాలంలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చడానికి ఖేలో ఇండియా మిషన్ ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మిషన్ క్రింద - ఎ) శిక్షణా కేంద్రాల మద్దతుతో సమగ్ర ప్రతిభా అభివృద్ధి మార్గాన్ని రూపొందిస్తారు. బి) కోచ్లు, సహాయక సిబ్బందిని క్రమబద్ధంగా అభివృద్ధి చేస్తారు. సి) క్రీడలలో సైన్స్ , టెక్నాలజీని అనుసంధానిస్టారు. డి) క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, వేదికలను కల్పించడానికి పోటీలు, లీగ్లను నిర్వహిస్థారు. ఈ) శిక్షణ, పోటీల కోసం క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.
బడ్జెట్ మూడో కర్తవ్యం వికసిత భారత్ దిశగా 'సబ్కా సాత్, సబ్కా వికాస్' దార్శనికతతో అనుసంధానమై ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీని కోసం రైతుల ఆదాయాన్ని పెంచడం, దివ్యాంగులను సాధికారత వైపు నడిపించడం, బలహీన వర్గాలకు మానసిక ఆరోగ్య చికిత్స, ట్రామా కేర్ అందుబాటులోకి తీసుకురావడం వంటి లక్ష్యంతో కూడిన ప్రయత్నాలు అవసరం. అలాగే, అభివృద్ధి, ఉపాధి అవకాశాలను వేగవంతం చేయడానికి 'పూర్వోదయ' రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడతారు.
భారత్-విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టం టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్) అనే బహుభాషా కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టల్లను, వ్యవసాయ పద్ధతులపై ఐసీఏఆర్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు, రైతులకు వ్యక్తిగత సలహాలను అందించడం ద్వారా వారు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి, నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది
లఖ్పతి దీదీ కార్యక్రమం విజయం స్ఫూర్తితో, సెల్ఫ్-హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ (ఎస్హెచ్ఈ) మార్ట్లను క్లస్టర్ స్థాయి సమాఖ్యలలో ఏర్పాటు చేస్తారు. మెరుగుపరిచిన, వినూత్నమైన ఆర్థిక సాధనాల ద్వారా ఈ మార్ట్లను సమాజ యాజమాన్యంలో రిటైల్ అవుట్లెట్లుగా అభివృద్ధి చేస్తారు.
మానసిక ఆరోగ్యం, ప్రమాద చికిత్స పట్ల ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, 'నిమ్హాన్స్-2' ఏర్పాటును ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాంచీ, తేజ్పూర్లలో ఉన్న జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను ప్రాంతీయ అత్యున్నత సంస్థలుగా స్థాయి పెంచనున్నట్లు ఆమె తెలిపారు.
దుర్గాపూర్ వద్ద పటిష్టమైన అనుసంధానత కలిగిన నోడ్తో కూడిన సమగ్ర తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిని, ఐదు పూర్వోదయ రాష్ట్రాలలో 5 పర్యాటక ప్రాంతాల ఏర్పాటును, 4,000 ఈ-బస్సుల సరఫరాను ఆమె ప్రతిపాదించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం ఒక పథకాన్ని కూడా ప్రతిపాదించారు. ఈ పథకం కింద దేవాలయాలు, మఠాల పరిరక్షణ, యాత్రీకుల సమాచార వివరణాత్మక కేంద్రాలు, రవాణా సౌకర్యాలు, యాత్రికులకు అవసరమైన ఇతర వసతులను కల్పిస్తారు.
ఆర్థిక సమీకరణ
2025-26 సవరించిన అంచనాల ప్రకారం రుణం - జీడీపీ నిష్పత్తి 56.1 శాతంగా ఉండగా, 2026-27 బడ్జెట్ అంచనాల నాటికి ఇది 55.6 శాతానికి తగ్గుతుందని అంచనా. రుణం -జీడీపీ నిష్పత్తి క్రమంగా తగ్గడం వల్ల వడ్డీ చెల్లింపుల భారం తగ్గుతుంది. తద్వారా ప్రాధాన్యత కలిగిన రంగాలపై ఖర్చు చేయడానికి మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. 2025-26 సవరించిన అంచనాల ప్రకారం, ఆర్థిక లోటు 2025-26 బడ్జెట్ అంచనాలకు సమానంగా జీడీపీలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా.. అప్పుల ఏకీకరణకు సంబంధించిన కొత్త ఆర్థిక ఆలోచనా మార్గానికి అనుగుణంగా, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆర్థిక లోటు జీడీపీలో 4.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు.
2025-26 సవరించిన అంచనాలు
అప్పుయేతర చెల్లింపుల సవరించిన అంచనాలు రూ. 34 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు రూ. 26.7 లక్షల కోట్లు. మొత్తం వ్యయ సవరించిన అంచనా రూ. 49.6 లక్షల కోట్లు కాగా, అందులో మూలధన వ్యయం సుమారు రూ.11 లక్షల కోట్లుగా ఉంది.

బడ్జెట్ అంచనాలు 2026-27

2026-27 బడ్జెట్ విషయానికి వస్తే, అప్పుయేతర వసూళ్లు రూ. 36.5 లక్షల కోట్లుగా, మొత్తం వ్యయం రూ.53.5 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు రూ.28.7 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా.
ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి, డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సేకరించే నికర మార్కెట్ అప్పులు రూ. 11.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మిగిలిన నిధులను చిన్న మొత్తాల పొదుపులు, ఇతర వనరుల ద్వారా సేకరించాలని భావిస్తున్నారు. కాగా, స్థూల మార్కెట్ అప్పులను రూ. 17.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
పార్ట్ - బి

ప్రత్యక్ష పన్నులు
కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రత్యక్ష పన్నులకు సంబంధించి అనేక కొత్త సంస్కరణలు ప్రతిపాదించారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 (ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే, సరళీకరించిన ఆదాయపు పన్ను నిబంధనలు, ఫారమ్లను త్వరలో నోటిఫై చేస్తారు. సాధారణ పౌరులు సులభంగా పన్ను నిబంధనలను పాటించేలా ఈ ఫారమ్లను తిరిగి రూపొందించారు.
టిసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) రేట్లలో కూడా తగ్గింపు.ను ప్రతిపాదించారు. విదేశీ పర్యటన ప్రోగ్రామ్ ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం, 20 శాతం పన్నును, ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా 2 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ విద్య, వైద్య అవసరాల కోసం చేసే ఖర్చులపై టిసీఎస్ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
మానవ వనరుల సరఫరాను కూడా ఇకపై టీడీఎస్ ప్రయోజనం కోసం 'కాంట్రాక్టర్లకు చేసే చెల్లింపుల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ సేవలపై టీడీఎస్ రేటు 1 శాతం లేదా 2 శాతం మాత్రమే ఉంటుంది. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం, అసెసింగ్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, నిబంధనల ఆధారిత స్వయంచాలక ప్రక్రియ (రూల్-బేస్డ్ ఆటోమేటెడ్ ప్రాసెస్) ద్వారా తక్కువ లేదా శూన్య పన్ను మినహాయింపు సర్టిఫికేట్ను పొందే సదుపాయం కల్పిస్తారు. ఆదాయపు పన్ను రిటర్న్లను సవరించుకోవడానికి ప్రస్తుతం ఉన్న గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే, దీని కోసం స్వల్ప రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పన్ను రిటర్న్లను దాఖలు చేసే గడువులను వివిధ వర్గాలకు వేర్వేరు సమయాల్లో ఉండేలా క్రమబద్ధీకరిస్తారు.
చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను పరిష్కరించడానికి, విదేశీ ఆస్తుల వెల్లడి కోసం ఒకేసారి అవకాశం కల్పించే '6 నెలల విదేశీ ఆస్తుల వెల్లడి పథకాన్ని' ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు, టెక్ ఉద్యోగులు, తిరిగి భారతదేశానికి వచ్చిన ఎన్నారైలు, ఇతరులు ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ ఉన్న తమ విదేశీ ఆదాయం లేదా ఆస్తులను వెల్లడించడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.
జరిమానా, ప్రాసిక్యూషన్ హేతుబద్ధీకరణ
జరిమానా, ప్రాసిక్యూషన్ ప్రక్రియలను హేతుబద్ధీకరించే ఉద్దేశంతో, కేంద్ర బడ్జెట్ 2026-27 అనేక రకాల విచారణల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదించింది. ఇకపై అసెస్మెంట్ (పన్ను నిర్ధారణ), పెనాల్టీ విచారణలు రెండింటికీ కలిపి ఒకే ఉమ్మడి ఉత్తర్వు జారీ చేయడం ద్వారా ఈ రెండింటినీ అనుసంధానిస్తారు. అంతేకాకుండా, ప్రీ-పేమెంట్ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీనిని కేవలం ప్రధాన పన్ను డిమాండ్ మీద మాత్రమే లెక్కిస్తారు. న్యాయపరమైన వివాదాలను తగ్గించడానికి, రీఅసెస్మెంట్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లను అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అయితే, సంబంధిత సంవత్సరానికి వర్తించే పన్ను రేటుపై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
తక్కువ ఆదాయాన్ని చూపిన సందర్భాల్లో వర్తించే జరిమానా, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు నిబంధనలను, ఇకపై తప్పుడు సమాచారం అందించిన కేసులకు కూడా వర్తింపజేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. దీని కోసం పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన అసలు పన్ను, వడ్డీతో పాటు, అదనపు ఆదాయపు పన్నుగా ఆ పన్ను మొత్తంలో 100 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద ప్రాసిక్యూషన్ విధానాన్ని హేతుబద్ధం చేస్తారు. ఖాతా పుస్తకాలు, పత్రాలను సమర్పించకపోవడం, అలాగే వస్తు రూపంలో చెల్లింపులు జరిగినప్పుడు చేయాల్సిన టీడీఎస్ చెల్లింపు నిబంధనలను నేరరహితం చేస్తారు. మొత్తం విలువ రూ. 20 లక్షల కంటే తక్కువ ఉన్న స్థిరాస్తి కాని, విదేశీ ఆస్తులను వెల్లడించని పక్షంలో, వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు కల్పిస్తారు.. ఇది 01.10.2024 నుంచి వర్తిస్తుంది.
సహకార సంస్థలు
సభ్యులు సేకరించిన లేదా పండించిన పాలు, నూనెగింజలు, పండ్లు లేదా కూరగాయలను సరఫరా చేసే ప్రాథమిక సహకార సంఘాలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపును ఇకపై సభ్యులు ఉత్పత్తి చేసే పశుగ్రాసం, పత్తి గింజల సరఫరాకు కూడా వర్తింపజేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సహకార సంఘాలు డివిడెండ్ ఆదాయాన్ని తిరిగి తమ సభ్యులకు పంపిణీ చేసిన పక్షంలో, కొత్త పన్ను విధానం కింద మినహాయింపు ఉంటుంది. నోటిఫై చేసిన జాతీయ సహకార సమాఖ్య 31.01.2026 వరకు కంపెనీలలో చేసిన పెట్టుబడుల ద్వారా పొందే డివిడెండ్ ఆదాయానికి మూడు సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు (ఇస్తారు. అయితే, ఈ ఆదాయాన్ని అవి తమ సభ్య సహకార సంఘాలకు తిరిగి పంపిణీ చేయాల్సి ఉంటుంది.
భారత వృద్ధి చోదకశక్తిగా ఐటి రంగానికి మద్దతు
భారత వృద్ధి పథంలో ఐటి రంగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ, సాఫ్ట్వేర్ అభివృద్ధి సేవలు, ఐటి ఆధారిత సేవలు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సేవలు, సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించిన కాంట్రాక్ట్ సేవలను కలిపి 'సమాచార సాంకేతిక సేవలు' అనే ఒకే కేటగిరీ కిందకు తీసుకురావాలని బడ్జెట్ ప్రతిపాదించింది. వీటన్నింటికీ 15.5 శాతం ఉమ్మడి భద్రత హామీ మార్జిన్ను నిర్ణయించారు. అంతేకాకుండా, ఐటి సేవల కోసం భద్రత హామీ ప్రయోజనాన్ని పొందేందుకు ఉండాల్సిన పరిమితిని రూ. 300 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచుతారు. ఐటి సేవల కోసం భద్రత హామీని ఇకపై (స్వయంచాలక నిబంధనల ఆధారిత ప్రక్రియ) ద్వారా ఆమోదిస్తారు. ఒక ఐటి కంపెనీ ఈ సౌకర్యాన్ని ఒకసారి పొందితే, దానిని వరుసగా 5 ఏళ్ల పాటు కొనసాగించుకోవచ్చు.
ఐటి సేవల కోసం ఏకపక్ష అడ్వాన్స్డ్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రక్రియను రెండు ఏళ్లలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అయితే పన్ను చెల్లింపుదారుల అభ్యర్థన మేరకు దీనిని మరో 6 నెలలు పొడిగించవచ్చు. అంతేకాకుండా, ఏపీఏ ఒప్పందంలోకి ప్రవేశించే సంస్థకు అందుబాటులో ఉన్న సవరించిన రిటర్న్ల సదుపాయాన్ని, ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు కూడా వర్తింపజేయనున్నారు.
అంతర్జాతీయ వ్యాపారాలు, పెట్టుబడుల ఆకర్షణ
భారతదేశంలోని డేటా సెంటర్ సేవలను ఉపయోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు క్లౌడ్ సేవలను అందించే ఏ విదేశీ కంపెనీకైనా 2047 వరకు పన్ను విరామం ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే, ఈ కంపెనీలు భారతీయ కస్టమర్లకు సేవలు అందించాలంటే ఒక 'ఇండియన్ రీసెల్లర్' సంస్థ ద్వారా మాత్రమే అందించాల్సి ఉంటుంది. భారతదేశం నుంచి డేటా సెంటర్ సేవలను అందించే సంస్థ గనుక సదరు విదేశీ కంపెనీకి అనుబంధ సంస్థ అయితే, ఖర్చుపై 15 శాతం భద్రత హామీ మార్జిన్ను కూడా ప్రతిపాదించారు. అంతేకాకుండా, గోడౌన్ (బాండెడ్ వేర్హౌస్) లో భాగాల నిల్వ చేపట్టే ప్రవాసులకు ఇన్వాయిస్ విలువపై 2 శాతం లాభ పరిమితితో భద్రత హామీ సౌకర్యం కల్పిస్తారు. దీనివల్ల నికర పన్ను సుమారు 0.7 శాతంగా ఉంటుంది. ఇది ఇతర పోటీ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అని కేంద్ర మంత్రి తెలిపారు.
బాండెడ్ జోన్ లోని ఏదైనా టోల్ మాన్యుఫ్యాక్చరర్కు క్యాపిటల్ గూడ్స్, పరికరాలు లేదా టూలింగ్ను సరఫరా చేసే ఏ నాన్-రెసిడెంట్కైనా 5 ఏళ్ల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రతిభావంతులు ఎక్కువ కాలం భారతదేశంలో పనిచేసేలా ప్రోత్సహించడానికి, నోటిఫైడ్ స్కీమ్ల కింద 5 ఏళ్ల పాటు భారత్లో ఉండేవారికి, వారి గ్లోబల్ ఆదాయంపై (భారతదేశం వెలుపల సంపాదించినది) పన్ను మినహాయింపు ఇస్తారు.. దీనితో పాటు, అంచనా ఆధారంగా (ప్రిజంప్టివ్ బేసిస్) పన్ను చెల్లించే నాన్-రెసిడెంట్లందరికీ కనీస ప్రత్యామ్నాయ పన్ను (మినిమమ్ ఆల్టర్నేట్ టాక్స్-(ఎంఏటీ) నుంచి మినహాయింపు లభిస్తుంది.
పన్నుల నిర్వహణ
పన్ను నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష. పన్నుల బోర్డులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీ ఏర్పాటును బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ కమిటీ ఆదాయ గణన, వెల్లడి ప్రమాణాల అవసరాలను నేరుగా భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలలోనే విలీనం చేసేలా పనిచేస్తుంది. దీనివల్ల, 2027-28 పన్ను సంవత్సరం నుంచి ఐసీడీఎస్ ఆధారంగా విడిగా అకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే, భద్రత హామీ నిబంధనల కోసం 'అకౌంటెంట్' నిర్వచనాన్ని కూడా హేతుబద్ధీకరిస్తారు.
ఇతర పన్ను ప్రతిపాదనలు
మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా, అన్ని రకాల వాటాదారులకు సంబంధించిన బైబ్యాక్ (వాటాల తిరిగి కొనుగోలు)ను క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించి పన్ను విధించాలని కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం ప్రమోటర్లు అదనపు బైబ్యాక్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కార్పొరేట్ ప్రమోటర్లకు 22 శాతం, నాన్-కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతం వరకు ప్రభావవంతమైన పన్ను వర్తిస్తుంది.
నిర్దిష్ట వస్తువులైన మద్యం, స్క్రాప్, ఖనిజాల విక్రయదారులకు టిసిఎస్ రేటును 2 శాతానికి హేతుబద్ధీకరిస్తామని, అలాగే తునికాకుపై పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫ్యూచర్స్పై ఎస్టిటి ని ప్రస్తుతం ఉన్న 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచడం మరో ముఖ్యమైన పన్ను ప్రతిపాదన. ఆప్షన్స్ ప్రీమియం, ఎక్సర్సైజ్ ఆఫ్ ఆప్షన్స్పై ఎస్టిటిని కూడా ప్రస్తుతం ఉన్న 0.1 శాతం, 0.125 శాతం నుంచి వరుసగా 0.15 శాతానికి పెంచుతారు. .
కంపెనీలను కొత్త పన్ను విధానంలోకి మారేలా ప్రోత్సహించడానికి, గతంలో ఉన్న మ్యాట్ (ఎంఏటీ) క్రెడిట్ను సెట్-ఆఫ్ చేసుకునే సదుపాయం కేవలం కొత్త విధానాన్ని ఎంచుకునే కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. అందుబాటులో ఉన్న మ్యాట్ క్రెడిట్ను కొత్త విధానంలోని పన్ను బాధ్యతలో 1/4 వంతు వరకు మాత్రమే సెట్-ఆఫ్ చేయడానికి అనుమతిస్తారు. ఇకపై మ్యాట్ను తుది పన్నుగా ప్రతిపాదిస్తూ, ఏప్రిల్ 1, 2026 నుంచి తదుపరి క్రెడిట్ నిల్వలు ఉండవని శ్రీమతి సీతారామన్ తెలిపారు. ప్రస్తుత మ్యాట్ రేటు 15 శాతం నుంచి తుది పన్ను రేటును 14 శాతానికి తగ్గిస్తారు. అంతేకాకుండా, పన్ను చెల్లింపుదారులు 31 మార్చి 2026 వరకు పోగుచేసుకున్న మ్యాట్ క్రెడిట్ను పైన పేర్కొన్న విధంగా సెట్-ఆఫ్ చేసుకోవడానికి తదుపరి కాలంలో కూడా వినియోగించుకోవచ్చు.
పరోక్ష పన్నులు
సుంకాల నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేయడం, దేశీయ ఉత్పాదకతను ప్రోత్సహించడం, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడం, డ్యూటీ ఇన్వర్షన్ను సరిదిద్దడమే కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ప్రతిపాదనల ప్రధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ
సముద్ర, తోలు, జౌళి ఉత్పత్తులలో, ఎగుమతి కోసం సీఫుడ్ ఉత్పత్తుల ప్రాసెసింగ్లో ఉపయోగించే నిర్దిష్ట పరికరాల సుంకం లేని దిగుమతుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 1 శాతం నుంచి ఎఫ్ఓబి విలువలో 3 శాతానికి పెంచుతారు. ప్రస్తుతం లెదర్ లేదా సింథటిక్ పాదరక్షల ఎగుమతులకు అందుబాటులో ఉన్న నిర్దిష్ట పరికరాల డ్యూటీ-ఫ్రీ దిగుమతులను ఇకపై అనుమతిస్తారు.
ఇంధన రంగంలో, బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగించే క్యాపిటల్ గూడ్స్కు ఇచ్చే ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపు పొడిగిస్తారు. అలాగే, సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటిమోనేట్ దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తారు.
అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువుల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపును 2035 సంవత్సరం వరకు పొడిగిస్తామని, అలాగే మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట విడిభాగాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
కీలక ఖనిజాల శుద్ధికి అవసరమైన క్యాపిటల్ గూడ్స్ దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయిస్తారు. అలాగే, బయోగాస్ మిశ్రమ సిఎన్జిపై చెల్లించాల్సిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని లెక్కించేటప్పుడు, బయోగాస్ పూర్తి విలువను మినహాయిస్తారు.
పౌర, రక్షణ విమానయాన రంగంలో, పౌర, శిక్షణ ఇతర విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలు, కాంపోనెంట్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇస్తారు. అలాగే, రక్షణ రంగంలోని యూనిట్ల నిర్వహణ, మరమ్మత్తు లేదా ఓవర్హాల్ అవసరాల కోసం ఉపయోగించే విమాన విడిభాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయిస్తారు.
ప్రత్యేక ఆర్థిక మండలాల్లోని అర్హత కలిగిన తయారీ యూనిట్లు, దేశీయ టారిఫ్ ఏరియా (డీటీఏ) కు రాయితీ సుంకాలతో విక్రయాలు జరిపేందుకు వీలుగా ఒక ప్రత్యేక వన్-టైమ్ చర్యను ప్రతిపాదించారు.
జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే అన్ని సుంకం విధించదగిన వస్తువులపై టారిఫ్ రేటును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 17 రకాల ఔషధాలు లేదా మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయిస్తారు. వీటితో పాటు, మందులు, ప్రత్యేక వైద్య అవసర ఆహారం (ఎఫ్ఎస్ఎంపి) వ్యక్తిగత దిగుమతులపై సుంకం మినహాయింపు ఇచ్చే ఉద్దేశంతో, మరో 7 అరుదైన వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తారు.
కస్టమ్స్ ప్రక్రియలు
వస్తు రవాణా మరింత వేగంగా, సాఫీగా సాగేలా చేయడానికి, కస్టమ్స్ ప్రక్రియలలో మానవ జోక్యాన్ని కనీస స్థాయికి తగ్గిస్తారు. టైర్ 2, టైర్ 3 ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్లకు (ఏఈఓ) సంబంధించి సుంకం చెల్లింపు వాయిదా వ్యవధిని ప్రస్తుతం ఉన్న 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచుతారు. ఇదే సదుపాయాన్ని అర్హత కలిగిన తయారీదారు-దిగుమతిదారులకు ( కూడా పొడిగిస్తారు. కస్టమ్స్పై బాధ్యత కలిగించే అడ్వాన్స్ రూలింగ్ చెల్లుబాటు కాలాన్ని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థలు తమ కార్గోను క్లియర్ చేయడంలో ప్రాధాన్యత పొందడం కోసం ఏఈఓ అక్రిడిటేషన్ను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు.
బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కస్టమ్స్ వేర్హౌసింగ్ విధానాన్ని నిర్వాహకులే కీలకంగా ఉండే వ్యవస్థగా మారుస్తారు. ఇందులో స్వయం నిర్ధారణ, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ రిస్క్ ఆధారిత ఆడిట్ వంటి అంశాలు ఉంటాయి.
వ్యాపార నిర్వహణ సౌలభ్యం
సులభ వ్యాపార నిర్వహణలో బహుళ చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కార్గో క్లియరెన్స్ ఆమోదాలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఒకే అంతర్గత అనుసంధానం కలిగిన డిజిటల్ విండో ద్వారా సజావుగా ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తారు. ఎటువంటి షరతులు లేని వస్తువుల విషయంలో, దిగుమతిదారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వెంటనే కస్టమ్స్ ద్వారా క్లియరెన్స్ లభిస్తుంది. అన్ని కస్టమ్స్ ప్రక్రియల కోసం ఒకే రకమైన, సమగ్రమైన, విస్తరించదగిన వేదికగా 'కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్' (సీఐఎస్) ను రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తారు. అలాగే, నష్టం అవకాశం అంచనా (రిస్క్ అసెస్మెంట్) కోసం అధునాతన ఇమేజింగ్, ఏఐ సాంకేతికతతో కూడిన నాన్-ఇంట్రూసివ్ స్కానింగ్ను దశలవారీగా విస్తరిస్తారు. అన్ని ప్రధాన ఓడరేవులలో ప్రతి కంటైనర్ను స్కాన్ చేయడం దీని ప్రధాన లక్ష్యం
కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం, దేశీయ మత్సకార నౌకలు ప్రత్యేక ఆర్థిక మండలి లేదా అంతర్జాతీయ సముద్ర జలాల్లో పట్టే చేపలపై ఎటువంటి సుంకం ఉండదు. ఇటువంటి చేపలను విదేశీ రేవులలో దించడాన్ని వస్తువుల ఎగుమతిగా పరిగణిస్తారు. కొరియర్ ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న ఒక కన్సైన్మెంట్కు రూ. 10 లక్షల గరిష్ట విలువ పరిమితిని పూర్తిగా తొలగించాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ఇది ఇ-కామర్స్ ద్వారా ప్రపంచ మార్కెట్లను చేరుకోవాలనే భారతీయ చిన్న వ్యాపారులు, కళాకారులు, స్టార్టప్ల ఆకాంక్షలకు మద్దతుగా నిలుస్తుంది.
అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో బ్యాగేజీ క్లియరెన్స్కు సంబంధించిన నిబంధనలను కూడా సవరిస్తారు. ప్రస్తుత ప్రయాణ పరిస్థితులకు అనుగుణంగా డ్యూటీ-ఫ్రీ అలవెన్సులను పెంచేలా నిబంధనలను సవరించనున్నారు. అంతేకాకుండా, వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులు, జరిమానాకు బదులుగా అదనపు మొత్తాన్ని చెల్లించి కేసులను ముగించుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
***
(रिलीज़ आईडी: 2221881)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Assamese
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia