ఆర్థిక మంత్రిత్వ శాఖ
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం - 2025
స్క్రాప్, ఖనిజాలపై టీసీఎస్ రేటు 2 శాతానికి హేతుబద్దీకరణ
సరళీకృత నిధుల బదిలీ పథకం ద్వారా విద్య, వైద్య చికిత్సలకు సంబంధించి విదేశాలకు
పంపే మొత్తానికి సంబంధించి టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గింపు
మూలధన లాభాలుగా పరిగణించి షేర్ల బైబ్యాక్పై అన్ని విభాగాల మదుపరులకు పన్ను విధింపు
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:53PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత సంస్కరణల వేగాన్ని కొనసాగించే ‘కర్తవ్యం’గా దీనిని అభివర్ణించారు. పన్నుల విధానాన్ని సరళీకరించేందుకు, పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ప్రత్యక్ష పన్ను సంస్కరణలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
నూతన ఆదాయపు పన్ను చట్టం
2026 ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వస్తుంది. సరళీకరించిన ఆదాయపు పన్ను నిబంధనలు, ఫారాలు తగిన సమయంలో నోటిఫై చేస్తారు. తద్వారా వీటిని అర్థం చేసుకొనేందుకు పన్ను చెల్లింపు దారులకు తగినంత సమయం లభిస్తుంది. సాధారణ పౌరులకు సులభంగా అర్థమయ్యేలా, నిబంధనలను పాటించడానికి వీలుగా ఈ ఫారాలను తిరిగి సిద్ధం చేశారు.
పన్నుల నిర్వహణ
ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఐఎన్డీఏఎస్)లో ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ (ఐసీడీఎస్) అవసరాలను చేర్చేందుకు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)తో కూడిన ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. 2027-28 పన్ను సంవత్సరం నుంచి ఐసీడీఎస్ ఆధారిత ప్రత్యేక అకౌంటింగ్ అవసరం ఉండదు.
దేశీయంగా ఉన్న అకౌంటింగ్, అడ్వైజరీ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు తోడ్పాటును అందించేలా.. సేఫ్ హార్బర్ నియమాల కోసం అకౌంటెంట్ నిర్వచనాన్ని హేతుబద్దీకరించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
ఇతర పన్ను ప్రతిపాదనలు
-
ప్రమోటర్లు బైబ్యాక్ విధానాన్ని దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు.. అన్ని విభాగాల మదుపరులకు మూలధన లాభాలుగా పరిగణించి షేర్ల బైబ్యాక్పై పన్ను విధిస్తారు. అయితే ట్యాక్స్ ఆర్బిట్రేజ్ను దుర్వినియోగం చేయకుండా ఆపేందుకు అదనపు బైబ్యాకు పన్నును ప్రమోటర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కార్పొరేట్ ప్రమోటర్లకు 22 శాతం పన్ను వర్తించేలా చేస్తుంది. కార్పొరేటేతర ప్రమోటర్లకు 30 శాతం పన్ను వర్తిస్తుంది.
-
ఆల్కహాలిక్ లిక్కర్, స్క్రాప్, ఖనిజాలు వంటి నిర్దిష్ట వస్తువుల అమ్మకందారులకు టీసీఎస్ రేటును 2 శాతానికి హేతుబద్దీకరించగా, తునికాకుపై 5 నుంచి 2 శాతానికి తగ్గింది. సరళీకృత నిధుల బదిలీ పథకం ద్వారా రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పంపిస్తే.. దానిపై టీసీఎస్ రేటు - (ఎ) విద్య లేదా చికిత్స అవసరాలకు 2 శాతంగా, (బి) విద్య లేదా వైద్య చికిత్సేతర అవసరాలకు 20 శాతంగా ఉంటుంది.
-
ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను 0.02 నుంచి 0.05 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఆప్షన్ల ప్రీమియం, ఆప్షన్ల వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీను 0.15కు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
-
కార్పొరేట్లకు సరళీకృత విధానాన్ని, తక్కువ పన్ను రేటును అందించేలా కొత్త పన్ను విధానానికి సంస్థలు మారేలా ప్రోత్సహించడానికి గతంలో మిగిలిన ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) క్రెడిట్ను కొత్త విధానంలో మాత్రమే ఉపయోగించుకొనేలా ఓ ప్రతిపాదన చేశారు. దీనికి ప్రకారం కొత్త విధానంలో అందుబాటులో ఉన్న ఎంఏటీ క్రెడిట్ ఉపయోగించి పన్ను బకాయిల్లో నాలుగో వంతు మాత్రమే సర్దుబాటు చేయడానికి అనుమతించేలా ప్రతిపాదించారు.
-
2026 ఏప్రిల్ 1 నుంచి ఎంఏటీ మరింత పెరగకుండా చూసేందుకు దానిని తుది పన్నుగా చేయాలని ప్రతిపాదించారు. ఈ మార్పుతో ప్రసుత్తమున్న 15 శాతం నుంచి 14 శాతానికి ఎంఏటీ రేటు తగ్గుతుంది. 2026 మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారుల వద్ద జమ అయిన ఎంఏటీ క్రెడిట్ను.. పైన పేర్కొన్న విధంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
***
(रिलीज़ आईडी: 2221544)
आगंतुक पटल : 28