ఆర్థిక మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనే కర్తవ్యాన్ని ప్రకటించిన కేంద్ర బడ్జెట్
రైతుల ఆదాయాన్ని పెంచడం, దివ్యాంగులను శక్తిమంతులను చేయడం, బలహీన వర్గాలకు అండగా నిలవడంతో పాటు పూర్వోదయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు లక్షిత చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి
కొబ్బరి ప్రోత్సాహక పథకం, భారతీయ జీడిపప్పు- కోకో కోసం ప్రత్యేక కార్యక్రమం, చందనం సాగును ప్రోత్సహించడం, అక్రోటు- బాదం - పైన్ నట్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 12:50PM by PIB Hyderabad
ప్రతి కుటుంబం, వర్గం, ప్రాంతం, రంగానికి వనరులు, సౌకర్యాలు, అవకాశాలను అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా ప్రతి ఒక్కరూ అర్థవంతమైన తీరులో భాగస్వాములు కావాలన్న 'మూడో కర్తవ్యం' ప్రభుత్వ ఆలోచన అయిన 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్'కు అనుగుణంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.. నేటి 2026-27 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ మూడో కర్తవ్యాన్ని సాధించేందుకు ఆర్థిక మంత్రి ఒక సమగ్రమైన రోడ్మ్యాప్ను ప్రకటించారు. “దీనికి ఈ అంశాలపై లక్షిత చర్యలు అవసరం: ఏ) చిన్న, ఉపాంత రైతులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఉత్పాదకత పెంపు, వ్యవస్థాపకత ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం బీ) ఉపాధి అవకాశాలు, శిక్షణ, నాణ్యమైన సహాయక పరికరాల ద్వారా దివ్యాంగులను శక్తిమంతులను చేయటం సీ) మానసిక ఆరోగ్యం, ట్రామా కేర్ పొందేలా బలహీన వర్గాలకు సాధికారత కల్పించడం డీ) అభివృద్ధి, ఉపాధి అవకాశాలను వేగవంతం చేయడానికి పూర్వోదయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతంపై దృష్టి సారించడం” అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
రైతుల ఆదాయం పెంచటం
రైతుల ఆదాయాన్ని పెంచే విస్తృత లక్ష్యంలో భాగంగా 500 జలాశయాలు- అమృత్ సరోవర్ల సమగ్ర అభివృద్ధి, తీర ప్రాంతాలలో మత్స్య రంగ విలువ వ్యవస్థను బలోపేతం చేయడం, చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కలిసి అంకురాలు- మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ మార్కెట్ అనుసంధానాలను కల్పించే నిబంధనలను బడ్జెట్లో పొందుపరిచారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కీలకమైన రంగాల్లో పశుసంవర్ధక రంగం ఒకటిగా ఉంటుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ఈ విధానాల ద్వారా పశుసంవర్ధక రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధికి మద్దతునిస్తుంది: (ఏ) రుణ ఆధారిత రాయితీ పథకం (బీ) పశుసంవర్ధక సంస్థల విస్తరణ, ఆధునికీకరణ (సీ) పశుసంపద, డైరీ, పౌల్ట్రీ ఆధారిత సమగ్ర విలువ ఆధారిత అనుసంధాన వ్యవస్థలను సృష్టిని పెంపొందించడం (డీ) పశుకాపరుల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించడం.
తీరప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి అధిక విలువ కలిగిన పంటలకు మద్దతు ఇవ్వడం ద్వారా ‘ఉన్నత విలువ కలిగిన వ్యవసాయం' గురించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. “ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్లు.. పర్వత ప్రాంతాల్లో బాదం, వాల్నట్స్, పైన్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ సాగుకు కూడా మద్దతు లభిస్తుంది” అని అన్నారు.
“ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 10 మిలియన్ల రైతులు సహా 30 మిలియన్ల మంది ప్రజలు జీవనోపాధి కోసం కొబ్బరిపై ఆధారపడుతున్నారు. కొబ్బరి ఉత్పత్తిలో పోటీతత్వాన్ని మరింత పెంచడానికి, ప్రధాన కొబ్బరి సాగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉత్పాదకత లేని చెట్ల స్థానంలో కొత్త మొక్కల రకాలను నాటడం వంటి వివిధ చర్యల ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు నేను ఒక కొబ్బరి అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదిస్తున్నాను' అని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా పచ్చి జీడిపప్పు, కోకో ఉత్పత్తిలో భారత్ను స్వయం సమృద్ధిగా మార్చడానికి, ఎగుమతి పోటీతత్వాన్ని పెంచేందుకు, 2030 నాటికి భారతీయ జీడిపప్పు - కోకోలను అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లుగా మార్చేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని 2026-27 బడ్జెట్ ప్రతిపాదించింది.
భారతీయ చందన వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు, సాగు - పంట అనంతర ప్రాసెసింగ్ను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయనుంది.
తక్కువ దిగుబడినిచ్చే పాత తోటలను పునరుద్ధరించడానికి.. వాల్నట్స్, బాదం, పైన్ నట్స్ వంటి వాటిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడాన్ని విస్తరించేందుకు.. యువతను భాగస్వామ్యం చేస్తూ విలువ జోడింపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే ప్రత్యేక కార్యక్రమానికి బడ్జెట్ మద్దతునిస్తుంది.
'భారత్-విస్తార్’
భారత్-విస్తార్ (వ్యవసాయ వనరులను పొందేందుకు వర్చువల్ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ) ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ‘విస్తార్’ను బహుభాషా ఏఐ సాధనంగా రూపొందించనున్నారు. ఇది అగ్రిస్టాక్ పోర్టల్లను, వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఇది వ్యక్తిగతీకరించిన సలహాల విషయంలో మద్దతునివ్వటం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. దీనితో పాటు రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించటంతో పాటు నష్టభయాన్ని ఇది తగ్గిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2221470)
సందర్శకుల సూచీ సంఖ్య : : 118
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam