ప్రధాన మంత్రి కార్యాలయం
వీడియో అనుసంధానం ద్వారా రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
प्रविष्टि तिथि:
26 FEB 2024 2:35PM by PIB Hyderabad
నమస్కారం!
నవ భారత్ కొత్త పనితత్వానికి నేటి కార్యక్రమం ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రోజు దేశం ఏం చేసినా.. అది అపూర్వమైన వేగం, స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుత భారత్ ఇకపై చిన్న కలలకే పరిమితం కాదు.. దీనికి బదులుగా ఆశయాలను సాకారం చేసుకొనేందుకు ప్రతిష్ఠాత్మకంగా, అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఈ దృఢ సంకల్పం అనే స్ఫూర్తి.. 'వికసిత్ భారత్- వికసిత్ రైల్వే' కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న నా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ గవర్నర్లు, ముఖ్యమంత్రులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు, ప్రముఖులు, పద్మ అవార్డు గ్రహీతలు, భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు, మన భవిష్యత్ తరం లేదా యువ స్నేహితులు సహా 500 లకు పైగా రైల్వే స్టేషన్లు, 1500 లకు పైగా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది మనతో ఉన్నారు.
మీ అందరి సమక్షంలో ఈ రోజు 2000 లకు పైగా రైల్వే సంబంధిత ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశాం. జూన్ నుంచి మా ప్రభుత్వ మూడో పదవీకాలం ప్రారంభం కానున్నందన మేం చేస్తున్న పని స్థాయి, వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని రోజుల క్రితం జమ్మూ నుంచే ఐఐటీలు, ఐఐఎంల వంటి అనేక ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను ఒకేసారి ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నిన్న రాజ్కోట్ నుంచి నేను ఏకకాలంలో ఐదు ఎయిమ్స్, ఇతర అనేక వైద్య సౌకర్యాలను ప్రారంభించాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో 27 రాష్ట్రాలలోని 300 లకు పైగా జిల్లాల్లో 500 లకు పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన చేశాం. ఉత్తరప్రదేశ్లో కొత్తగా ప్రారంభించిన గోమతినగర్ రైల్వే స్టేషన్ నిజంగా ఆకట్టుకుంటోంది. 1500లకు పైగా రోడ్డు, పైవంతెన, అండర్పాస్ ప్రాజెక్టులు ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. రూ. 40 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టనున్నాం. కొన్ని నెలల క్రితం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని మేం ప్రారభించాం. ఇందులో భాగంగా 500 స్టేషన్ల ఆధునీకరణ పనులను అప్పుడే మొదలుపెట్టాం. ఇవాల్టి కార్యక్రమం దీని పురోగతిని తెలియజేస్తోంది. భారత్ పురోగతి ఎంత వేగంగా ముందుకు సాగుతుందో ఇది వివరిస్తుంది. దేశంలోని రాష్ట్రాలకు, నా తోటి ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు నా యువ స్నేహితులకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి చెందిన భారత్ గురించి మోదీ చెబుతున్నారంటే.. దాని వల్ల లబ్ధి పొందేది దేశాన్ని నిర్మించే యువతే. ఈ రోజు ఆవిష్కరించిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తాయి. రైల్వేల పునరుజ్జీవనం అనేది ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారికి.. అలాగే 30-35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మన యువత కలలకు సంబంధించిన దార్శనికతే అభివృద్ధి చెందిన భారత్. అందుకే దేశ భవిష్యత్తును రూపొందించే ప్రధాన హక్కు వారికే ఉంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు వివిధ పోటీల ద్వారా అభివృద్ధి చెందిన భారతీయ రైల్వేలు అనే లక్ష్యం కోసం వారి కలలను ముందుకు తీసుకొస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ యువతలో చాలామంది అవార్డులను అందుకున్నారు. ఇందులో ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు చెబుతున్నాను. మీ ఆకాంక్షలే మోదీ నిబద్ధత అని మన దేశంలోని ప్రతి యువతకు తెలియజేస్తున్నాను. మీ కలలు, మీ అంకితభావంతో పాటు మోదీ సంకల్పం.. అభివృద్ధి చెందిన భారత్కు పునాదిగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ అమృత్ భారత్ స్టేషన్లు సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి.. రెండింటికీ చిహ్నాలుగా ఉండటం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఒడిశాలోని బాలేశ్వర్ రైల్వే స్టేషన్ను తీసుకుంటే.. దీనిని జగన్నాథ భగవానుడి ఆలయం ఇతివృత్తంతో రూపొందించారు. సిక్కింలోని రంగ్పో రైల్వే స్టేషన్లో స్థానిక నిర్మాణ శైలి ఉంది. రాజస్థాన్లోని సంగనేర్ రైల్వే స్టేషన్లో 16వ శతాబ్దానికి చెందిన హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్ ఉంది. తమిళనాడులోని కుంభకోణం స్టేషన్ రూపకల్పన చోళుల కాలం నాటి వాస్తుశిల్ప కల నుంచి ప్రేరణ పొందింది. మోధేరా సూర్య దేవాలయం నుంచి ప్రేరణతో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దారు. అదేవిధంగా గుజరాత్లోని ద్వారక స్టేషన్లో ద్వారకాధీష్ ఆలయం స్ఫూర్తి ఉంది. ఐటీ సిటీ గుర్గావ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకమైన ఐటీ ఇతివృత్తంతో ఉంది. ఈ విధంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రతి నగర ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ స్టేషన్ల నిర్మాణంలో వికలాంగులు, వృద్ధుల సౌకల్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.
మిత్రులారా,
గత దశాబ్దంలో మనం ఒక కొత్త భారత్ ఆవిర్భవించటాన్ని చూశాం. రైల్వేలలో వచ్చిన మార్పు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మన దేశ ప్రజల ఊహకే పరిమితమైన సౌకర్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఒక దశాబ్దం క్రితం వందే భారత్, ఆధునిక సెమీ-హైస్పీడ్ రైళ్లు లేదా అమృత్ భారత్, ఆధునిక లగ్జరీ రైళ్లు వంటివి ఎవరికీ తెలియవు. అదేవిధంగా నమో భారత్ వంటి విలాసవంతమైన రైళ్లు, భారతీయ రైల్వేల్లో విద్యుదీకరణ వేగవంతం కావటం అనేవి ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపించింది. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండటం అంటే ఒక పెద్ద సవాలునే భావన ఒకప్పుడు ఉండేది. కానీ నేడు ఇది రోజువారీ జీవితంలో ఒక సాధారణ అంశంగా మారింది. ఒకప్పుడు ఎక్కువగా కనిపించిన మానవరహిత గేట్ల స్థానంలో పైవంతెనలు, అండర్బ్రిడ్జిలు వచ్చాయి. ఇవి ఆటంకం లేని ప్రమాద రహిత ప్రయాణం కొనసాగేలా చూసుకుంటున్నాయి. వీటితో పాటు ఒకప్పుడు విమానాశ్రయాలకు మాత్రమే ప్రత్యేకమైన ఆధునిక సౌకర్యాలు ఇప్పుడు రైళ్లపై ఆధారపడే పేదలు, మధ్యతరగతి ప్రజలతో సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
మిత్రులారా,
దశాబ్దాలుగా రైల్వేలు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు అనే భారాన్ని మోసాయి. అయితే ఇవిప్పుడు మన ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించే మూలస్తంభంగా మారాయి. గతంలో నష్టాల్లో ఉందన్న విమర్శను ఎదుర్కొన్న రైల్వేలు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన పరివర్తన దశలో ఉన్నాయి. ఈ పురోగతి ఫలితంగా భారతదేశం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 11 నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఒక దశాబ్దం క్రితం అంటే మనం 11వ స్థానంలో ఉన్నప్పుడు.. రైల్వేల సగటు బడ్జెట్ సుమారు రూ. 45 వేల కోట్లు. నేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి కేంద్రంగా మనం ఎదిగినప్పుడు మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో ఊహించుకోండి. అందుకే వీలైనంత త్వరగా భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు మోదీ అంకితభావంతో కృషి చేస్తున్నారు.
కానీ మిత్రులారా,
పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం ఉంది. నదులు, కాలువలలో ఎంత సమృద్ధిగా నీళ్లున్నా.. కట్ట తెగిపోతే చాలా తక్కువ నీరు రైతుల పొలాలకు చేరుకుంటుంది. అదే మాదిరిగా బడ్జెట్ పరిమాణంతో సంబంధం లేకుండా అవినీతి, నిర్లక్ష్యం కొనసాగితే బడ్జెట్ వల్ల స్పష్టమైన ప్రభావం క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కనిపించదు. గత దశాబ్దంలో మేం భారీగా కుంభకోణాలను, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకున్నాం. తత్ఫలితంగా కొత్త రైల్వే మార్గాల నిర్మాణ వేగం రెట్టింపు అయింది. నేడు భారతీయ రైల్వేల పరిధి జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య ప్రాంతాలకు వరకు విస్తరిస్తోంది. గతంలో ఊహకు కూడా అందని ప్రాంతాలకు రైళ్లు వెలుతున్నాయి. 2500 కిలోమీటర్లకు పైగా ఉన్న ప్రత్యేక సరకు రవాణా కారిడార్ నిర్మాణం పూర్తి చేయడం అనేది నిజాయితీతో ప్రాజెక్టులను చేపట్టే తీరుకు ఉదాహరణగా నిలుస్తోంది. టికెట్ ఆదాయంతో సహా పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది. భారత ప్రభుత్వం ప్రతి రైల్వే టికెట్ను సుమారు 50 శాతం తగ్గింపుతో ప్రజలకు అందిస్తోంది.
మిత్రులారా,
బ్యాంకుల్లో జమ చేసిన డబ్బుపై వడ్డీ వచ్చినట్లే.. మౌలిక సదుపాయాల కోసం పెట్టే ప్రతి పైసా కొత్త ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. కొత్త రైల్వే మార్గం నిర్మాణం వల్ల కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు వివిధ రకాల వాళ్లకు ఉపాధి లభిస్తుంది. దీనితో పాటు సిమెంట్, ఉక్కు, రవాణా వంటి అనుబంధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది. లక్షల కోట్ల రూపాయల ఈ భారీ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలకు భరోనిస్తాయి. స్టేషన్లు పెద్దవిగా, ఆధునికంగా మారడంతో ఎక్కువ రైళ్లు, ప్రయాణికులు వెళ్తారు. తద్వారా సమీపంలో ఉన్న వీధి వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మన రైల్వేలు చిన్న రైతులు, చేతివృత్తులవారు, విశ్వకర్మ మిత్రుల ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తాయి. వీరి ఉత్పత్తుల విక్రయాన్ని సులభతరం చేసేందుకు 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం' కింద స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాం. ఇందులో వేలాది స్టాళ్లు ఏర్పాటయ్యాయి.
మిత్రులారా,
భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా దేశ వ్యవసాయ, పారిశ్రామిక పురోగతికి ప్రాథమిక సహాయకారిగా కూడా పనిచేస్తాయి. రైళ్ల వేగం పెరగటం వల్ల సమయం ఆదా అవుతుంది. దీనివల్ల పాలు, చేపలు, పండ్లు వంటి పాడైపోయే ఉత్పత్తులను మార్కెట్కు వేగంగా రవాణా చేయొచ్చు. ఇది పారిశ్రామిక ఖర్చులను తగ్గించటంతో పాటు 'భారత్లో తయారీ', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ను పరిగణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి ఆధునిక మౌలిక సదుపాయాలే. రాబోయే ఐదు సంవత్సరాల్లో వేలాది స్టేషన్ల ఆధునీకరణ జరిగి, రైల్వేల సామర్థ్యం పెరగటం వల్ల మరో ముఖ్యమైన పెట్టుబడి విప్లవం వస్తుంది. పరివర్తన చెందుతున్నందుకు భారతీయ రైల్వేకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా లక్షలాది మంది ప్రజల సమష్టిగా భాగస్వామ్యం కావటం అనేది భారతదేశ సాంస్కృతిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందని నమ్ముతున్నాను. నేటి కార్యక్రమం భవిష్యత్ పనులకు సానుకూల ఉదాహరణగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ఈ రోజు మనం తెలుసుకున్నట్లుగా మన సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ, అన్ని రకాలుగా అభివృద్ధిని వేగవంతం చేద్దాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీ ప్రసంగానికి అనువాదం.
***
(रिलीज़ आईडी: 2168980)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam