ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ స్వామినారాయణ మందిరం ద్విశతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
11 NOV 2024 2:53PM by PIB Hyderabad
జై స్వామినారాయణ్!
భగవాన్ శ్రీ స్వామినారాయణ పాదాలకు నమస్కరిస్తున్నాను. భగవాన్ శ్రీ స్వామినారాయణ్ అనుగ్రహంతో వడ్తాల్ ధామ్ లో ఘనంగా ద్విశతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సేవ లేకుండా ఏ ప్రయత్నమూ సాగదనేది స్వామినారాయణ్ సమాజంలోఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. నేడు ప్రజలు ఉత్సాహంగా వివిధ సేవాకార్యక్రమాలకు సహకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బుల్లితెరపై, మీడియాలో చూసిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు నా సంతోషాన్ని రెట్టింపు చేశాయి.
మిత్రులారా,
వడ్తాల్ ధామ్ ఏర్పాటు ద్విశతాబ్ది వేడుక చరిత్రలో ఒక సంఘటన లేదా తేదీ కంటే చాలా ఎక్కువ. వడ్తాల్ ధామ్ పై అచంచల విశ్వాసంతో ఎదిగిన నాలాంటి వారికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం. భారతీయ నిరంతర సంస్కృతీ ప్రవాహానికి ఈ వేడుక నిదర్శనంగా నిలుస్తుంది. రెండు శతాబ్దాల క్రితం భగవాన్ శ్రీ స్వామినారాయణ్ స్థాపించిన వడ్తాల్ ధామ్ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం సంరక్షించుకున్నాం. భగవాన్ శ్రీ స్వామినారాయణుని బోధనలు, దివ్యశక్తిని నేటికీ ఇక్కడ చూడవచ్చు. మహత్తరమైన ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహర్షులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మీ అందరికీ, మన తోటి దేశప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం రూ.200 వెండి నాణెం, స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ చిహ్నాలు రాబోయే తరాలకు ఈ ముఖ్యమైన సంఘటన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి సహాయపడతాయి.
మిత్రులారా,
భగవాన్ స్వామినారాయణతో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ, ఈ సంప్రదాయంతో నా బంధం ఎంత లోతైనదో తెలుసు. అక్కడ ఉన్న రాకేష్ ఆయనతో నా సంబంధం ఎప్పటిదో, ఎంత ముఖ్యమైనదో మీతో పంచుకోవచ్చు. ఈ బంధం కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాక, సామాజిక సంబంధానికీ ప్రతీక. గుజరాత్ లో ఉన్న సమయంలో రుషులతో గడపడం, సత్సంగాల్లో పాల్గొనడం నా అదృష్టం. ఆ క్షణాలను పొందడం నా అదృష్టం. వాటిలో ప్రతిదాన్ని నేను ఆస్వాదించాను. భగవాన్ స్వామినారాయణ్ అనుగ్రహంతో నేటికీ ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ బంధం కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో, రుషుల ఆశీర్వాదం పొందే భాగ్యం నాకు లభించింది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై లోతుగా ఆలోచించడానికి నన్ను ప్రోత్సహించింది.
ఈ రోజు వడ్తాళ్ ధామ్లో జరిగే ఈ పవిత్ర ఉత్సవానికి హాజరుకావాలని నేను గాఢంగా కోరుకున్నాను. మీ అందరితో కలిసి కూర్చుని, అనేక మధుర స్మృతులను నెమరువేసుకుంటూ, ఈ పవిత్ర సందర్భంలోని ఆనందాన్ని పంచుకోవాలని ఆశించాను. సహజంగా, అలాంటి మహత్తర క్షణాలను అనుభవించడం అందరికీ మధురమైన అనుభూతే. కానీ, నా బాధ్యతలు, కట్టుబాట్ల కారణంగా ఇది సాధ్యపడలేదు. అయినప్పటికీ, నా మనసు, నా ఆత్మ మీ అందరితోనే ఉంది. ఈ పవిత్ర క్షణంలో, నా హృదయం పూర్తిగా వడ్తాళ్ ధామ్తో మమేకమయింది.
మిత్రులారా,
భారతదేశ విశిష్టమైన లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, ప్రతి క్లిష్ట పరిస్థితిలో మహర్షులు, సంతులు, మహాత్ములు సమాజానికి మార్గదర్శనం చేసేందుకు, దాన్ని ఉత్తేజపరిచేందుకు ముందుకు రావడం. శతాబ్దాలపాటు పరాధీనతను అనుభవించిన తర్వాత మన దేశం దుర్బలమై, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మ విమర్శలో మునిగిపోయిన సమయంలో, భగవాన్ స్వామినారాయణ్ అవతరించి సమాజానికి దివ్య మార్గదర్శనం అందించారు. అటువంటి కీలక సమయంలో భగవాన్ స్వామినారాయణ్, ఆ యుగపు పీఠాధిపతులు మనలో నూతన ఆధ్యాత్మిక శక్తిని నింపారు. అవి మన ఆత్మగౌరవాన్ని మేల్కొలిపాయి. మన గుర్తింపు భావాన్ని పునరుజ్జీవింపజేశాయి. శిక్షపత్రి, వచనామృతుల బోధనలు ఈ విషయంలో ఎనలేని కృషి చేశాయి. ఈ ఉపదేశాలను ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం.
ఈ దార్శనికత నుండి స్ఫూర్తిని పొంది, వడ్తాల్ ధామ్ మానవాళికి సేవ చేయడానికి, యుగాన్ని రూపొందించడానికి అంకితమైన గొప్ప సంస్థగా మారినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పుణ్యక్షేత్రం అణగారిన వర్గాలకు చెందిన సాగరం వంటి భక్తులకు జన్మనిచ్చింది. ఈ రోజు, అసంఖ్యాకమైన పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్యను అందించే ప్రాజెక్టులతో సహా మీ ప్రయత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంతేకాక, మారుమూల అటవీ ప్రాంతాలలో అనేక సేవా సంబంధిత కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు చేపట్టారు. పేదలకు సేవ చేయడం అయినా, కొత్త తరాన్ని పెంపొందించడం అయినా, ఆధునికతను ఆధ్యాత్మికతతో మేళవించి భారతీయ సంస్కృతిని పరిరక్షించడం అయినా ఇలా మెరుగైన భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ప్రచారం మీ అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది. పరిశుభ్రత కోసమో, పర్యావరణ పరిరక్షణ కోసమో నేను చేసిన ప్రతి విజ్ఞప్తికి మీ ఉత్సాహభరితమైన ప్రతిస్పందన ఎల్లప్పుడూ లభించింది. మహర్షులు, మీ వంటి భక్తులు నన్ను ఎన్నడూ నిరాశపరచలేదు. మీరు నా ప్రతి అభ్యర్థనను మీ స్వంత బాధ్యతగా స్వీకరించారు, వాటిని నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా కృషి చేశారు.
నేను ప్రతిపాదించిన ఒక ప్రచారం గురించి నేను ఇటీవల విన్నాను: తల్లి పేరు మీద ఒక చెట్టును నాటడం (ఏక్ పెడ్ మా కే నామ్). ఈ కార్యక్రమం లో స్వామినారాయణ్ కుటుంబం ఉత్సాహంగా పాల్గొని లక్షకు పైగా మొక్కలు నాటింది.
మిత్రులారా,
ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది, అది మన ఉనికిని రూపొందిస్తుంది. ఇది మన ఆలోచనలు, చర్యలు, మాటలను ప్రభావితం చేస్తుంది. మన జీవిత లక్ష్యం ఏమిటో కనుగొన్నప్పుడు, ప్రతిదీ మారుతుంది. మన చరిత్రలో, సంతులు, ఋషులు ప్రజలకు వారి జీవితాల అర్థం, ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడ్డారు. ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకులు సమాజానికి చేసిన సేవలు అపారమైనవి. మొత్తం సమాజం లేదా మొత్తం దేశం ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు ఏకమైతే, విజయం అనివార్యం. అనేక ఉదాహరణలు దీన్ని నిరూపించాయి. మనం గతంలో ఇది సాధించాము—మన ఋషులు, మన సమాజం, మన మత సంస్థలు కూడా దీన్ని సాధించాయి.
నేడు, మన యువత ముందు ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది, దేశం కూడా మొత్తం స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ ను సాకారం చేసుకోవడమే ఈ లక్ష్యం. వడ్తాల్ సాధువులు, ఋషులు, మొత్తం స్వామినారాయణ్ కుటుంబం కూడా అందరినీ ప్రేరేపించి, ఈ పవిత్ర కర్తవ్యంలో భాగస్వాములను చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో, స్వేచ్ఛ కోసం ఉన్న అచంచల తపన శతాబ్దానికి పైగా సమాజంలోని అన్ని వర్గాల హృదయాలను ప్రేరేపించింది. ప్రతి రోజు, ప్రతి క్షణం, స్వాతంత్ర్య సాధన కోసం ప్రజల హృదయాల్లో ఆ తపన జీవించి ఉండేది. ఇప్పుడు, మన 140 కోట్ల దేశవాసులందరిలో కూడా, వికసిత భారత్ సాధన కోసం అదే స్థాయిలో అచంచల నిబద్ధత అవసరం. వికసిత్ భారత్ దిశగా ఒక ముఖ్యమైన అడుగు స్వావలంబన సాధించడం. స్వావలంబన దేశాన్ని నిర్మించాలంటే బయటి నుంచి సహాయం ఆశించకుండా మనపై మనం ఆధారపడాలి. 140 కోట్ల మంది పౌరులందరూ ఈ బాధ్యతను స్వీకరించాలి, ఇక్కడ ఉన్న భక్తులు దీనికి మినహాయింపేమీ కాదు. స్థానిక ఉత్పత్తులు, వ్యాపారాలను ప్రోత్సహించే ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమంతో మనం ప్రారంభించవచ్చు.
అభివృద్ధి చెందిన భారతదేశానికి మన ఐక్యత, జాతీయ సమగ్రత కీలకం. దురదృష్టవశాత్తు, కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, పరిమిత అవగాహనతో, కులం, మతం, భాష, సామాజిక స్థితి, లింగం, పట్టణ-గ్రామీణ విభజనల ఆధారంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారత ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలను దెబ్బతీస్తున్నారు. దేశ ప్రత్యర్థులు విసురుతున్న ఈ ముప్పుల తీవ్రతను గుర్తించి, ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవాలి. మనందరం కలిసి ఈ విచ్ఛిన్నకర చర్యలను అడ్డుకుని అవి విజయవంతం కాకుండా నిరోధించాలి. మన జాతీయ ఐక్యతను కాపాడుకోవడంలో మనం ఐక్యంగా, దృఢంగా నిలబడాలి.
మిత్రులారా,
భగవాన్ శ్రీ స్వామినారాయణ్ గొప్ప లక్ష్యాలను సాధించేందుకు అపారమైన అంకితభావం, కఠోర శ్రమ అవసరమని మనకు బోధించారు. దేశాన్ని నిర్ణయాత్మకంగా రూపుదిద్దగల సామర్థ్యం కలిగి ఉన్న యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలదనే విశ్వాసాన్ని ఆయన మనలో నింపారు. దీన్ని సాకారం చేసుకోవాలంటే శక్తి, సామర్ధ్యం, విద్య కలిగిన యువత అవసరం. వికసిత్ భారత్ కోసం, మన యువతకు సాధికారత చాలా అవసరం. నైపుణ్యం కలిగిన యువకులు మనకు గొప్ప ఆస్తి అవుతారు. మన యువతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. నేను కలుసుకుంటున్న చాలా మంది ప్రపంచ నాయకులు భారతదేశ యువత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఐటి రంగ నిపుణులు తమ దేశాలలో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. భారత యువత చురుకుదనానికి ప్రపంచం అబ్బురపడుతోంది. ఈ యువత మన దేశ అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచ అవసరాలను కూడా తీరుస్తారు. నైపుణ్యం కలిగిన యువతను అభివృద్ధి చేయడానికి మా ప్రయత్నాలు దేశ నిర్మాణానికి గణనీయంగా దోహదం చేస్తాయి.
మీకు మరో విన్నపం. మాదక ద్రవ్యాల వ్యసనంపై పోరాటంలో స్వామినారాయణ్ బృందం ఎల్లప్పుడూ గణనీయమైన కృషి చేసింది. మన సాధువులు, మహాత్ములు, భక్తులు మన యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంలో, వ్యసనం నుండి వారిని విముక్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా నిరోధించడానికి ప్రచారాలు, కార్యక్రమాలు కీలకమైనవి. వాటిని కొనసాగించాలి. ఈ ప్రయత్నాలు అన్ని సమాజాలలో, దేశంలోని ప్రతి మూలలో అవసరం. మనం ఈ కర్తవ్యాన్ని నిరంతరం కొనసాగించాలి.
మిత్రులారా,
ఒక దేశం తన వారసత్వాన్ని గర్వంగా, పరిరక్షించుకున్నప్పుడే పురోభివృద్ధి సాధిస్తుంది. అందువలన, వారసత్వ పరిరక్షణతో పాటు అభివృద్ధి మా మార్గదర్శక సూత్రం. మన ప్రాచీన వారసత్వ ప్రదేశాల్లో వైభవం పుంజుకోవడం, పోయినట్లు భావించిన అనేకం ఇప్పుడు తిరిగి రావడం హర్షణీయం. 500 ఏళ్లుగా కలలుగన్న కల ఎట్టకేలకు సాకారమైందనడానికి అయోధ్యలో వచ్చిన మార్పే ప్రధాన ఉదాహరణ. తరతరాలు ఈ కలను నిలబెట్టుకున్నాయి, దాని కోసం పోరాడాయి, దానిని సాకారం చేసుకోవడానికి త్యాగాలు చేశాయి. ఈ పునరుజ్జీవనానికి నిదర్శనాలుగా నిలిచే కాశీ, కేదార్ నాథ్ పునరుజ్జీవనాన్ని నేడు మనం చూస్తున్నాం. పావగఢ్ లో 500 ఏళ్ల తర్వాత మన విశ్వాస పతాకం ఇప్పుడు సగర్వంగా ఎగురుతోంది. మోధేరా సూర్య దేవాలయం, సోమనాథ్ వైభవం ఇతర అద్భుతమైన ఉదాహరణలు. ఎక్కడ చూసినా ఒక కొత్త స్ఫూర్తి, సాంస్కృతిక విప్లవం మన కళ్లముందు ఆవిష్కృతమవుతున్నాయి.
అంతే కాదు శతాబ్దాలుగా మన దేశంలోని మన దేవతామూర్తుల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. అవి కనిపించకుండా పోయినా ఎవరూ పట్టించుకోలేదు. అపహరణకు గురైన. ఈ ఎన్నో దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాల తర్వాత బయటపడి తిరిగి మన దేవాలయాలకు చేరుతున్నాయి. మన ప్రాచీన నాగరికతకు చిహ్నమైన ధోలావీరా, లోథాల్ వారసత్వం పట్ల గుజరాత్ ప్రజలమైన మేము ఎంతో గర్వపడుతున్నాం. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడం, పునరుజ్జీవింపజేయడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు; ఈ భూమిని ప్రేమించే, ఈ దేశాన్ని గౌరవించే, దాని సంప్రదాయాలను ఆదరించే, దాని సంస్కృతిని గర్వించే, దాని వారసత్వాన్ని మెచ్చుకునే ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత. మనలో ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు, ఈ విషయంలో మీరు గొప్ప ప్రేరణను అందించగలరు. భగవాన్ స్వామినారాయణ్ కు సంబంధించిన అనేక వస్తువులను కలిగి ఉన్న వడ్తాల్ ధామ్ లోని అక్షర్ భువన్ మ్యూజియం ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ విజయానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ మ్యూజియం కొత్త తరానికి అతి తక్కువ సమయంలోనే మన వారసత్వాన్ని అందిస్తుంది. భారత శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వానికి అక్షర భువన్ ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా
ఇటువంటి ప్రయత్నాల ద్వారానే ‘అభివృద్ధి చెందిన భారతదేశం‘ దార్శనికత విజన్ సాకారం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 140 కోట్ల మంది భారతీయులు ఒక ఉమ్మడి లక్ష్యంతో ఏకమైతే విజయం సహజంగానే వస్తుంది. ఈ ప్రయాణంలో మన పీఠాధిపతుల మార్గదర్శకత్వం చాలా కీలకం, దేశవిదేశాల నుంచి వేలాది మంది సాధువులు, భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో, నేను ఈ కుటుంబంలో ఒక భాగమైనట్లు భావిస్తున్నాను. ఇది మిమ్మల్ని మరో మిషన్ లో నిమగ్నం చేయడానికి నాకు అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో పూర్ణ కుంభమేళా జరుగుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పూర్ణ కుంభమేళా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ అపారమైన వారసత్వానికి ఒక వేడుక. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే కుంభమేళాకు సుమారు 40 నుంచి 50 కోట్ల మంది తరలిరానున్నారు. నాదో వినమ్రపూర్వకమైన అభ్యర్థన. మీరు ఈ ప్రయత్నాన్ని చేపట్టగలరా? మీరు అనేక దేశాల్లో ఆలయాలను నిర్వహిస్తున్నందున, ఈ ప్రయత్నంలో మీ పాత్ర కీలకం. ప్రయాగ్లో జరిగే కుంభమేళా వంటి మహత్తర ఉత్సవాల గురించి విదేశీయులకు అవగాహన కల్పించడం ద్వారా, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. ప్రతి విదేశీ శాఖ నుండి కనీసం 100 మంది విదేశీయులను కుంభమేళాకు ఆహ్వానించడం ద్వారా, ఈ ప్రయత్నం సఫలమవుతుంది. ఈ విధంగా, ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక చైతన్యాన్ని వ్యాప్తి చేయడం సులభమవుతుంది.
మీతో వ్యక్తిగతంగా ఉండలేకపోయినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నాను, కానీ మీ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞుడిని. ఇంతమంది సుపరిచితమైన ముఖాలను చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. దూరంలో ఉన్నా, ఈ క్షణం నాలో సంతోషాన్ని నింపింది. నేను ఈ ద్విశతాబ్ది ఉత్సవంలో మానసికంగా పాల్గొనడం పట్ల ఆనందంగా ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు!
జై స్వామినారాయణ్.
***
(Release ID: 2106552)