ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2025-26 సారాంశం
Posted On:
01 FEB 2025 1:31PM by PIB Hyderabad
రూ. లక్ష వరకు సరాసరి నెలవారీ ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు, మధ్యతరగతి గృహాల్లో పొదుపు, వినియోగానికి ప్రోత్సాహం
నూతన పన్ను విధానంలో ఉద్యోగులు ఏడాదికి రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు
అభివృద్ధికి నాలుగు చోదక శక్తులను కేంద్ర బడ్జెట్ గుర్తించింది - వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు
తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’
కందులు, మినుములు, ఎర్రకందులపై దృష్టి సారిస్తూ ‘‘పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్’’
సవరించిన వడ్డీ రాయితీ పథకం కేసీసీ ద్వారా రూ. 5 లక్షల వరకు రుణాలు
4.8 శాతం ద్రవ్యలోటుతో ఆర్థిక సంవత్సరం-25 ముగుస్తుందని అంచనా, 2026 నాటికి దాన్ని 4.4 శాతాన్ని తగ్గించాలని లక్ష్యం
ఎంఎస్ఎంఎఈలకు ప్రభుత్వ హామీతో ఇచ్చే రుణాల పరిమితి రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు
‘‘మేక్ ఇన్ ఇండియా’’కు మరింత ప్రోత్సహించేందుకు చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు అనువైన జాతీయ తయారీ కార్యక్రమం
రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు
రూ. 500 కోట్ల అంచనాలతో విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
పీఎం స్వనిధి ద్వారా బ్యాంకులు అందించే రుణాల పరిమితి పెంపు, రూ.30,000కు పెరిగిన యూపీఐ అనుసంధాన క్రెడిట్ కార్డుల పరిమితి
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదు, పీఎం జన్ ఆరోగ్య యోజన ద్వారా ఆరోగ్య సేవలు
‘అభివృద్ధి కేంద్రాలుగా నగరాల’ను తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ నిధి
రూ. 20,000 కోట్ల అంచనా వ్యయంతో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధికి అణు శక్తి కార్యక్రమం
120 కొత్త ప్రదేశాలకు ప్రాంతీయ అనుసంధానతను పెంపొందించేలా ఉడాన్ పథకానికి మార్పులు
లక్ష ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ. 15,000 కోట్లతో స్వామిహ్ నిధి ఏర్పాటు
ప్రైవేటు రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు రూ. 20,000 కోట్ల కేటాయింపు
సుమారు కోటికి పైగా పురాతన రాత ప్రతులను సేకరించి వాటిని భద్రపరిచేందుకు జ్ఞానభారతం కార్యక్రమం
బీమాకు ఇచ్చే ఎఫ్డీఐ పరిమితి 74 నుంచి 100 శాతానికి పెంపు
వివిధ చట్టాల్లోని 100కు పైగా నిబంధనలను నేరరహితం చేసేందుకు ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ చట్టం 2.0
ఆదాయపు పన్ను రిటర్నుల కాలపరిమితి రెండు నుంచి నాలుగేళ్లకు పెంపు
టీసీఎస్ చెల్లింపుల్లో జాప్యం ఇక నేరరహితం
అద్దెపై రూ. 2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెరిగిన టీడీఎస్ పరిమితి
క్యాన్సర్, అరుదైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 36 రకాల ఔషధాలపై బీసీడీ మినహాయింపు
ఐఎఫ్పీడీపై విధించే బీసీడీ 20 శాతానికి పెరిగింది, ఓపెన్ సెల్స్ పై 5 శాతానికి తగ్గింది
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు విడి పరికరాలు, ఓపెన్ సెల్స్ కు బీసీడీ నుంచి మినహాయింపు
బ్యాటరీల ఉత్పత్తిని పెంచడానికి, ఈవీలు, మొబైల్ బ్యాటరీ తయారీకి వినియోగించే అదనపు మూలధన పరికరాలకు కూడా మినహాయింపు
నౌకా నిర్మాణానికి వినియోగించే ముడి పదార్థాలు, విడి భాగాలకు పదేళ్లపాటు బీసీడీ మినహాయింపు
ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్పై విధించే బీసీడీ 30 నుంచి 5 శాతానికి తగ్గింపు, ఫిష్ హైడ్రోలైజేట్పై 15 నుంచి 5 శాతానికి తగ్గింపు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగ సారాంశం.
పార్ట్ ఎ
‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న ప్రముఖ తెలుగు కవి శ్రీ గురజాడ అప్పారావు మాటలను ఉటంకిస్తూ 2025-26 బడ్జెట్ను కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు. ‘సబ్ కా వికాస్’ ఇతివృత్తంతో దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ ఉంది.
ఈ ఇతివృత్తానికి అనుగుణంగా, దిగువన పేర్కొన్న వికసిత్ భారత్ విస్తృత లక్ష్యాలను ఆర్థిక మంత్రి వివరించారు.
a) సున్నా పేదరికం
b) నూరు శాతం నాణ్యమైన పాఠశాల విద్య
c) అందుబాటులో నాణ్యమైన, సరసమైన, సమగ్ర ఆరోగ్యసేవలు
d) నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితోనే ఫలవంతమైన ఉద్యోగాలు
e) ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళల భాగస్వామ్యం
f) రైతులు మనదేశాన్ని ‘ప్రపంచానికి ఆహార కేంద్రం’గా మారుస్తున్నారు.
వృద్ధిని వేగవంతం చేయడం, మరోవైపు సమ్మిళిత అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, గణనీయమైన మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించడం వంటి అంశాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రతిఫలిస్తోంది. పేద, యువత, రైతు, మహిళలపై దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను బడ్జెట్ ప్రతిపాదించింది.
భారత అభివృద్ధి సామర్థ్యాన్ని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించేలా పన్ను విధానాలు, విద్యుత్ రంగం, నగరాభివృద్ధి, గనులు, ఆర్థిక రంగాల్లో గుణాత్మక మార్పులు, రెగ్యులేటరీ సంస్కరణలు అవలంబించడమే ఈ బడ్జెట్ లక్ష్యం.
వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులే వికసిత్ భారత్ను నిర్మించే సాధనాలుగా కేంద్ర బడ్జెట్ వర్ణించింది. ఈ దిశగా సంస్కరణలే ఇంధనంగా, సమ్మిళిత స్పూర్తితో మార్గ నిర్దేశం చేస్తుంది.
మొదటి చోదక శక్తి: వ్యవసాయం
రాష్ట్రాల భాగస్వామ్యంతో వంద జిల్లాల్లో అమలు చేసేలా పంటల దిగుబడిని పెంచేలా ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ పథకాన్ని బడ్జెట్లో ప్రకటించారు. సాగులో వైవిధ్యాన్ని అవలంబించేందుకు, గోదాములు, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను అందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.
నైపుణ్యం, పెట్టుబడులు, సాంకేతికత ద్వారా వ్యవసాయంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తూ, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేలా విభిన్న రంగాల్లో సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘గ్రామీణ సంక్షేమం, అభ్యున్నతి’ కార్యక్రమం ప్రారభించారు. మహిళలు, యువ రైతులు, అణగారిన వర్గాలకు చెందినవారు, సన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలమైన అవకాశాలను సృష్టించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
కందులు, మినుములు, ఎర్ర కందులపై దృష్టి సారిస్తూ ఆరేళ్ల కాలానికి ‘‘పప్పు ధాన్యాల కోసం ఆత్మనిర్భరత మిషన్’’ ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రానున్న నాలుగేళ్లలో రైతుల నుంచి ఈ మూడు పప్పుధాన్యాలను కేంద్ర సంస్థలు (నాఫెడ్, ఎన్సీసీఎఫ్) ద్వారా సేకరిస్తారు.
కూరగాయలు-పండ్లకు సమగ్ర విధానం, అధిక రాబడినిచ్చే విత్తనాలకు జాతీయ కార్యక్రమం, పత్తి దిగుబడిని పెంచడంతో సహా వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఐదేళ్ల కాలవ్యవధికి చేపట్టే చర్యలను బడ్జెట్లో వివరించారు.
సవరించిన వడ్డీ రాయితీ పథకం ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు శ్రీమతి సీతారామన్ ప్రకటించారు.
రెండో చోదక శక్తి: ఎంఎస్ఎంఈలు
మన ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45 శాతం వరకు ఉన్న నేపథ్యంలో వాటిని అభివృద్ధికి రెండో చోదక శక్తిగా ఆర్థికమంత్రి వర్ణించారు. ఎంఎస్ఎంఈలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవర్లను వరుసగా 2.5, రెండు రెట్లకు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ హామీతో కూడిన రుణలభ్యతను కూడా పెంచినట్లు చెప్పారు.
షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన 5 లక్షల మంది తొలి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు వచ్చే ఐదేళ్లలో రూ. రెండు కోట్ల చొప్పున టర్మ్ రుణాలను అందిస్తారు.
దేశాన్ని ‘మేకిన్ ఇండియా’ బ్రాండ్ ప్రాముఖ్యాన్ని చాటే ఆటబొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని శ్రీమతి సీతారామన్ ప్రకటించారు. ఈ దిశగా, చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలతో కూడిన జాతీయ ఉత్పాదన కేంద్రాన్ని స్థాపిస్తామని చెప్పారు.
మూడో చోదకశక్తి: పెట్టుబడులు
అభివృద్ధిలో పెట్టుబడులది మూడో చోదకశక్తి పాత్ర అని మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్లో ప్రజలపై పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, సృజనాత్మకత పెట్టుబడులకు ప్రాముఖ్యాన్నిచ్చారు.
ప్రజలపై పెట్టుబడికి అనుగుణంగా రానున్న 5 ఏళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను నెలకొల్పుతామని చెప్పారు.
భారత్నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించనున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
పాఠశాల విద్యార్థులు, ఉన్నత విద్యనభ్యసించే వారి ప్రయోజనార్థం భారతీయ భాషల పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడానికి ‘భారతీయ భాషా పుస్తక్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
"మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" తయారీకి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేసేందుకు ప్రపంచస్థాయి నైపుణ్యాలు, భాగస్వామ్యాలతో ఐదు ‘నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్’ ఏర్పాటవుతాయి.
రూ. 500 కోట్ల వ్యయంతో విద్యా రంగం కోసం కృత్రిమ మేధ ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతుంది.
గిగ్ వర్కర్లకు (అసంఘటిత రంగ కార్మికులు) గుర్తింపు కార్డులు, ఇ-శ్రమ్ పోర్టల్లో వారి పేర్ల నమోదు, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఏర్పాట్లు జరుగుతాయని బడ్జెట్ ప్రకటించింది.
ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి దిశగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో 3 సంవత్సరాల వరస ప్రాజెక్టులతో సిద్ధమవుతాయని శ్రీమతి సీతారామన్ చెప్పారు.
మూలధన వ్యయం, సంస్కరణలకు ప్రోత్సాహకాల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలను అందించేందుకు రూ. 1.5 లక్షల కోట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు.
కొత్త ప్రాజెక్టులలో రూ. 10 లక్షల కోట్ల మూలధనాన్ని తిరిగి పెట్టుబడిగా వినియోగించేందుకు రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్ (వ్యర్థమైన ఆస్తుల నుంచీ సంపద సృష్టి) 2025-30ని కూడా మంత్రి ప్రకటించారు.
“జన్ భగీదారి” (ప్రజా భాగస్వామ్యం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు సరఫరా చేసే మౌలిక వ్యవస్థల నాణ్యత, నిర్వహణలపై దృష్టి సారించాలని, జల్ జీవన్ మిషన్ ను 2028 సంవత్సరం వరకూ పొడిగించాలని నిర్ణయించారు.
‘అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు’, ‘నగరాల సృజనాత్మక పునరాభివృద్ధి’, ‘నీరు, పారిశుద్ధ్యం’ పేరిట గల ప్రతిపాదనల అమలు కోసం ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తుంది.
ఇన్నోవేషన్లో పెట్టుబడి కింద ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకాల కోసం రూ. 20,000 కోట్ల కేటాయింపును ప్రకటించారు.
నగరాల అభివృద్ధి ప్రణాళికలకు ఉపయుక్తంగా ఉండే మౌలిక జియోస్పేషియల్ వ్యవస్థలను అభివృద్ధి పరిచేందుకు ‘నేషనల్ జియోస్పేషియల్ మిషన్’ను ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
విద్యా సంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద గల 1 కోటికి పైగా అమూల్యమైన పత్రాల సర్వే, నమోదు, పరిరక్షణల కోసం ‘జ్ఞాన్ భారతం మిషన్’ను ప్రారంభించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. విజ్ఞానాన్ని పంచుకునేందుకు ‘నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్’ పేరిట భారతీయ విజ్ఞాన భాండాగారాన్ని ప్రారంభించాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు.
నాలుగో చోదకశక్తి: ఎగుమతులు
వాణిజ్యం, ఎంఎస్ఏంఈ, ఆర్థిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ఎగుమతుల రంగం, వృద్ధి సాధనలో నాలుగో శక్తిగా ఉండగలదని, ఎంఎస్ఏంఈలు ఎగుమతి మార్కెట్ల లబ్ధి పొందేందుకు ‘ఎగుమతుల ప్రోత్సాహక పథకం’ సహాయపడుతుందని శ్రీమతి సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ‘భారత్ ట్రేడ్నెట్' (బీటీఎన్) పేరిట డిజిటల్ ప్రజా వ్యవస్థను స్థాపించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని మంత్రి వెల్లడించారు. ఇది వ్యాపారాల నమోదు సహా ఆర్థిక వ్యవహారాలకు ఏకీకృత వేదికగా పని చేస్తుందని తెలిపారు.
ప్రపంచ సరఫరా వ్యవస్థలతో మన ఆర్థిక వ్యవస్థ అనుసంధానం కోసం దేశీయ తయారీ సామర్థ్యాల అభివృద్ధికి తోడ్పాటును అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ‘ఇండస్ట్రీ 4.0’కి సంబంధించిన అవకాశాలను వినియోగించుకునేందుకు దేశీయ ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమకు ప్రభుత్వం మద్దతునిస్తుందని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న రెండో శ్రేణి (టైర్ 2) నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (బహుళ జాతి కంపెనీలకు సేవలందించే స్థానిక సంస్థలు) ప్రోత్సహించడానికి జాతీయ విధానాన్ని రూపొందించాలన్న ప్రతిపాదనలు జరిగాయి.
విలువైన, నిల్వ సామర్థ్యం తక్కువగా గల ఉద్యానవన ఉత్పత్తులు సహా రవాణా విమానాల సేవలను వినియోగించుకునే వివిధ ఉత్పత్తుల కోసం మౌలిక సదుపాయాలు, గిడ్డంగులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభివృద్ధి ఇంజన్లకు సంస్కరణలే ఇంధనం
అభివృద్ధి ఇంజిన్లకు సంస్కరణలే ఇంధనమని శ్రీమతి సీతారామన్ అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఫేస్లెస్ అసెస్మెంట్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్ (పన్ను చెల్లింపు దారుల హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం) వేగవంతమైన రిటర్న్స్, దాదాపు 99 శాతం సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా రిటర్న్లు, ‘వివాద్ సే విశ్వాస్’ పథకం వంటి అనేక సంస్కరణలను అమలు చేసిందని సీతారామన్ చెప్పారు. ఈ ప్రయత్నాలను కొనసాగిస్తూ, “తొలుత విశ్వాసం, తదనంతరం పరిశీలన" అన్న సూత్రానికి పన్నుల శాఖ కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు.
ఆర్థిక రంగ అభివృద్ధి, సంస్కరణలు
‘సులభతర వాణిజ్యం' పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా దేశ ఆర్థిక రంగం మొత్తంలో అనేక మార్పులను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ మార్పులు సులభతర అనుమతులు, సేవల విస్తరణ, బలమైన నియంత్రణ వ్యవస్థల రూపకల్పన, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక, కాలం చెల్లిన చట్టపరమైన నిబంధనలను నేరరహితం చేసేందుకు దారితీయగలవు.
భారతదేశంలో మొత్తం ప్రీమియం పెట్టుబడి పెట్టే బీమా కంపెనీలకు అందుబాటులో ఉండేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) పరిమితిని 74 నుండి 100 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
ఉత్పాదకత పెంపు, ఉపాధి కల్పనకు ఊతం లక్ష్యాలుగా, ఆదర్శాలు, విశ్వాసం ఆధారంగా సరళమైన నియంత్రణ వ్యవస్థను శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. 21వ శతాబ్దానికి అనువైన ఆధునిక, సులభమైన విశ్వాస-ఆధారిత నియంత్రణ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధిపరిచేందుకు మంత్రి నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు:
i. నియంత్రణపరమైన సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీ
· అన్ని ఆర్థికేతర రంగ నిబంధనలు, ధృవపత్రాలు, లైసెన్స్లు, అనుమతులను సమీక్షించడం.
· విశ్వాస - ఆధారిత ఆర్థిక పాలన బలోపేతం, 'సులభతర వాణిజ్యం' మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా తనిఖీలు, సమ్మతుల విషయాల్లో అవసరమైన పరివర్తన చర్యలు.
· ఏడాదిలోపు సిఫార్సులు
· రాష్ట్రాలు ఆన్బోర్డింగ్ ప్రక్రియలో భాగ్యమయ్యేలా ప్రోత్సహం
ii. రాష్ట్రాల పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచీ
· పోటీ సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంచేందుకు 2025లో రాష్ట్రాల పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచీ ప్రారంభం.
iii. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) కింద చర్యలు
· ప్రస్తుత ఆర్థిక నిబంధనలు, అనుబంధ సూచనల ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన చర్యలు.
· ఆర్థిక రంగ ప్రతిస్పందన, అభివృద్ధిలను మెరుగుపరిచేందుకు తగిన వ్యూహ రూపకల్పన.
iv. జన్ విశ్వాస్ బిల్లు 2.0
· వివిధ చట్టాలలోని 100కు పైగా నిబంధనలను నేర పరిధి నుంచి తప్పించడం
ఆర్థిక ఏకీకరణ
ఆర్థిక ఏకీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన మంత్రి, ఏటా స్థూల దేశీయోత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి తగ్గుదల చూపే విధంగా ద్రవ్య లోటును నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. రాబోయే ఆరు సంవత్సరాలకు సంబంధించిన వ్యూహాన్ని ఎఫ్ఆర్ఎంబీ (ద్రవ్య విధాన పత్రం) లో పేర్కొన్నారు. 2024-25కి సంబంధించి సవరించిన అంచనా ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటు 4.8 శాతంగా, 2025-26 లో స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటు 4.4 శాతంగా ఉండగలదని అంచనా వేసినట్లు శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.
2024-25 కి సంబంధించి సవరించిన అంచనాలు
సవరించిన అంచనాల ప్రకారం రుణాలు పోగా మొత్తం ఆదాయం రూ. 31.47 లక్షల కోట్లు, నికర పన్ను వసూళ్లు రూ. 25.57 లక్షల కోట్లు అని మంత్రి తెలిపారు. మొత్తం వ్యయం సవరించిన అంచనా రూ. 47.16 లక్షల కోట్లు, ఇందులో మూలధన వ్యయం రూ. 10.18 లక్షల కోట్లు అని ఆమె తెలిపారు.
బడ్జెట్ అంచనాలు 2025-26
2025-26 ఆర్థిక సంవత్సరం కోసం అప్పులు మినహా మొత్తం రాబడులు రూ. 34.96 లక్షల కోట్లుగా, ఖర్చులు రూ. 50.65 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. నికర పన్ను రాబడులు రూ. 28.37 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
భాగము B
దేశాభివృద్ధిలో మధ్యతరగతిపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, కేంద్ర బడ్జెట్ 2025-26 కొత్త ఆదాయ పన్ను విధానం కింద కొత్త ప్రత్యక్ష పన్ను స్లాబ్లు, రేట్లను ప్రతిపాదించింది దీని ద్వారా రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారు అంటే మూలధన లాభాల వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా నెలకు సగటున రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందే వారికి ఎటువంటి పన్ను లేదు. దీని ప్రకారం రూ. 75వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపి, రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం గల పన్ను చెల్లించే వేతనదారులు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించే అవసరం ఉండదు. ఈ కొత్త పన్ను విధానం, ఇతర ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనల వల్ల ప్రభుత్వం దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో ప్రజల అవసరాలను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు, టీడీఎస్ / టీసీఎస్ హేతుబద్దీకరణ, అనుమతుల భారాన్ని తగ్గిస్తూ స్వచ్ఛంద అనుమతులను ప్రోత్సహించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం, ఉపాధి, పెట్టుబడులను ప్రోత్సహించడం వంటివి ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయి.
కొత్త పన్ను విధానంలో, సవరించిన పన్ను రేటు నిర్మాణాన్ని బడ్జెట్లో కింది విధంగా ప్రతిపాదించారు:
మొత్తం వార్షిక ఆదాయం
|
పన్ను రేటు
|
0-4 లక్షల రూపాయలు
|
ఎలాంటి పన్ను లేదు
|
4-8 లక్షల రూపాయలు
|
5 శాతం
|
8-12 లక్షల రూపాయలు
|
10 శాతం
|
12-16 లక్షల రూపాయలు
|
15 శాతం
|
16-20 లక్షల రూపాయలు
|
20 శాతం
|
20- 24 లక్షల రూపాయలు
|
25 శాతం
|
24 లక్షల రూపాయల కంటే ఎక్కువ
|
30 శాతం
|
టీడీఎస్/టీసీఎస్ హేతుబద్దీకరణ కోసం, వయోవృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.50వేల నుంచి రూ,1 లక్షకు అంటే రెట్టింపు మొత్తానికి పెంచారు. అలాగే అద్దెలపై విధించే టీడీఎస్ వార్షిక పరిమితిని రూ. 2.4లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచారు. టీసీఎస్ పరిమితిని రూ. 10లక్షల వరకు పెంచడం, నాన్-పాన్ సందర్భాల్లో మాత్రమే అధిక టీడీఎస్ మినహాయించుటను కొనసాగించడం వంటివి ఇతర చర్యల్లో భాగంగా ఉన్నాయి. టీడీఎస్ చెల్లింపులో జాప్యాన్ని క్రమబద్దీకరించిన తరువాత, ఇప్పుడు టీసీఎస్ చెల్లింపుల్లో జాప్యాన్ని క్రమబద్దీకరిస్తున్నారు.
స్వచ్ఛంద అనుమతులను ప్రోత్సహిస్తూ, ఏదైనా అసెస్మెంట్ సంవత్సరం కోసం అప్డేట్ చేసిన రిటర్న్లను దాఖలు చేయుటకు ప్రస్తుతం రెండేళ్లుగా ఉన్న కాలపరిమితిని నాలుగేళ్లకు పొడగించారు. 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని అప్డేట్ చేయడానికి అదనపు పన్ను చెల్లించారు. చిన్న ఛారిటబుల్ ట్రస్ట్లు/సంస్థలకు వారి రిజిస్ట్రేషన్ వ్యవధిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచడం ద్వారా ప్రయోజనం కలిగించడంతో వాటి కోసం అనుమతుల భారం తగ్గించారు. ఇంకా, పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఎటువంటి షరతులు లేకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తుల వార్షిక విలువను సున్నాగా క్లెయిమ్ చేయవచ్చు. గత బడ్జెట్లో అందించిన వివాద్ సే విశ్వాస్ పథకానికి గొప్ప స్పందన లభించింది, దాదాపు 33వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. వయోవృద్ధులకు అలాగే అత్యంత వయోవృద్ధుల కోసం 2024, ఆగస్టు 29న లేదా ఆ తర్వాత జాతీయ పొదుపు పథకం ఖాతాల నుంచి చేసిన ఉపసంహరణలకు మినహాయింపు ప్రయోజనాలు ఇచ్చారు. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలకు కూడా ఇవే ప్రయోజనాలు వర్తించనున్నాయి.
ఉపాధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలను స్థాపించే లేదా నిర్వహిస్తున్న స్థానిక కంపెనీకి సేవలను అందించే ప్రవాసుల కోసం ఒక అంచనాత్మక పన్ను విధానాన్ని రూపొందించారు. ఇంకా, ప్రస్తుత టన్నేజ్ పన్ను పథకం ప్రయోజనాలను అంతర్గత నౌకలకు విస్తరించాలని ప్రతిపాదించారు. అంకుర సంస్థల రంగాన్ని ప్రోత్సహించడానికి, వ్యాపార సంస్థ నమోదు కోసం వ్యవధిని 5 సంవత్సరాల కాలానికి పొడిగించారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు గడువును బడ్జెట్ మరో ఐదు సంవత్సరాలకు అంటే 2030, మార్చి 31 వరకు పొడిగించింది.
పారిశ్రామిక వస్తువుల కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధీకరించడంలో భాగంగా, బడ్జెట్ కింది ప్రతిపాదనలు చేసింది; (i) ఏడు సుంకాలను తొలగించడం, (ii) ప్రభావవంతమైన సుంకాల అమలును కొనసాగించడానికి తగిన సెస్ను వర్తింపజేయడం (iii) ఒకటి కంటే ఎక్కువ సెస్ లేదా సర్ఛార్జ్ విధించకుండా ఉండడం.
మందులు/ఔషధాల దిగుమతిపై ఉపశమనం కలిగిస్తూ, క్యాన్సర్ అలాగే అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ప్రాణాలను రక్షించే మందులు, ఔషధాలను సాధారణ కస్టమ్స్ సుంకం (బీసీడీ) నుంచి పూర్తిగా మినహాయించారు. ఇంకా, రోగి సహాయ కార్యక్రమాల కింద 37 మందులు, 13 కొత్త మందులు, ఔషధాలను రోగులకు ఉచితంగా సరఫరా చేసే సందర్భాల్లో, వాటిపై సాధారణ కస్టమ్స్ సుంకం (బీసీడీ) పూర్తిగా మినహాయించనున్నారు.
దేశీయ తయారీ, విలువ జోడింపుకు మద్దతుగా, దేశీయంగా లభించని 25 ముఖ్య ఖనిజాలపై 2024, జూలై నెలలో బీసీడీని మినహాయించారు. తాజాగా 2025-26 బడ్జెట్లో కోబాల్ట్ పౌడర్, వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, సహా 12 కీలక ఖనిజాలపై బీసీడీని పూర్తిగా మినహాయించారు. దేశీయ వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పూర్తి మినహాయింపు గల వస్త్ర సంబంధిత యంత్రాల జాబితాకు మరో రెండు రకాల షటిల్-లెస్ లూమ్స్ జోడించారు. 10శాతం నుంచి 20శాతం వరకు తొమ్మిది టారిఫ్ల కిందకు వచ్చే అల్లిక వస్త్రాలపై బీసీడీని 20శాతం లేదా కిలోగ్రాముకు రూ.115లలో ఏది ఎక్కువ ఉంటే దానిని వర్తింపజేయనున్నారు.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సరిదిద్దడానికి, “మేక్ ఇన్ ఇండియా”ను ప్రోత్సహించడానికి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే (ఐఎఫ్పీడీ) లపై బీసీడీని 20శాతానికి పెంచారు అలాగే ఓపెన్ సెల్స్పై 5శాతానికి తగ్గించారు. ఓపెన్ సెల్ల తయారీని ప్రోత్సహించడానికి, ఓపెన్ సెల్ల భాగాలపై బీసీడీ మినహాయింపు ఇచ్చారు.
దేశంలో లిథియాన్-అయాన్ బ్యాటరీ తయారీని ప్రోత్సహించడానికి, ఈవీ బ్యాటరీ తయారీకి 35 అదనపు మూలధన వస్తువులను, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు మూలధన వస్తువులను మినహాయింపు గల మూలధన వస్తువుల జాబితాలో చేర్చారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ఓడ నిర్మాణానికి సంబంధించిన ముడి పదార్థాలు, విడి భాగాలు, వినియోగ వస్తువులు లేదా భాగాలపై బీసీడీ మినహాయింపును మరో పదేళ్ల పాటు కొనసాగిస్తుంది. నాన్-క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లతో సమానంగా ఉండేలా క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లపై బీసీడీని బడ్జెట్లో 20శాతం నుంచి 10శాతానికి తగ్గించారు.
ఎగుమతులను ప్రోత్సహించుట కోసం, బడ్జెట్ 2025-26 హస్తకళల ఎగుమతులను సులభతరం చేస్తుంది, విలువ జోడింపు, ఉపాధి కోసం వెట్ బ్లూ లెదర్పై బీసీడీని పూర్తిగా మినహాయించింది, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్పై బీసీడీని 30శాతం నుంచి 5శాతానికి తగ్గించింది అలాగే చేపలు, రొయ్యల దాణా తయారీ కోసం చేపల హైడ్రోలైజేట్పై బీసీడీని 15శాతం నుంచి 5శాతానికి తగ్గించింది.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్లను వికసిత్ భారత్ ప్రయాణంలో కీలకమైన స్తంభాలుగా అభివర్ణించారు. మధ్యతరగతి వర్గాలు దేశ వృద్ధికి బలాన్ని ఇస్తారని అలాగే వారి సహకారానికి గుర్తింపుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ‘పన్ను రహిత' శ్లాబ్ను పెంచుతోందని ఆమె తెలిపారు. ప్రతిపాదిత కొత్త పన్ను నిర్మాణం వల్ల మధ్యతరగతి ప్రజల చేతుల్లో మరింత ఎక్కువ డబ్బు అందుబాటులోకి వచ్చి వినియోగం, పొదుపు, పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2098825)
Visitor Counter : 71
Read this release in:
Hindi
,
Kannada
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam