ప్రధాన మంత్రి కార్యాలయం
బాలి, ఇండోనేసియాలో భారతీయ సంతతి ప్రజల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
Posted On:
15 NOV 2022 4:40PM by PIB Hyderabad
నమస్తే! వణక్కం!
ప్రతీ ఒక్కరికీ నమస్కారం! ఇండినేసియాలోని బాలి సందర్శించనప్పుడు ప్రతీ ఒక్క భారతీయునిలోనూ భిన్నమైన భావన ఏర్పడుతుంది. నేను కూడా అదే తరహా ప్రతిస్పందనలు పొందుతున్నాను. వేలాది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంతో భారతదేశం ప్రత్యేక అనుబంధం కలిగి ఉంది. ఎన్నో తరాలు వచ్చాయి, పోయాయి గాని ఒక తరం తర్వాత మరో తరానికి మారినా అదే సాంప్రదాయం కొనసాగుతోంది. భిన్నమైన ఆనంద భావన ఏర్పడుతోంది.
నేను మీతో బాలిలో ఇక్కడి సాంప్రదాయం గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఇక్కడికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ నగరం కటక్ లో మహానది ఒడ్డులో బాలి జాతర వేడుగ్గా జరుగుతోంది. ఈ బాలి జాతరలో ఏముంది? భారత, ఇండోనేసియా మధ్య వేలాది సంవత్సరాల వాణిజ్య బంధాన్ని గుర్తు చేసుకునేదే ఈ జాతర. ఇండోనేసియా ప్రజలు ఈ ఏడాది బాలి జాతరకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వీక్షించినప్పుడు వారి గర్వం, ఆనందం ఇనుమడిస్తాయి. కొత్త ఉత్సుకత ఏర్పడుతుంది. కరోనా కారణంగా జాతర పలు ఇబ్బందుల్లో పడింది. కాని ఇప్పుడు లక్షల సంఖ్యలో ఒడిశా ప్రజలు సంవత్సరాల విరామం అనంతరం భారీ ఎత్తున ఎంతో వైభవంగా బాలి జాతర చేసుకుంటున్నారు. బాలి జాతరను గుర్తు చేసుకుంటూ ఒక పోటీ కూడా జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ప్రపంచ రికార్డు నెలకొల్పడం కోసం వారు కాగితం పడవలు తయారుచేస్తున్నారు. ఈ రోజు ఒడిశాలో ఉన్న ప్రజలు భౌతికంగానే అక్కడ ఉన్నారు తప్పితే వారి మనసంతా బాలి పైన, మీ మీదనే ఉంది.
మిత్రులారా,
మన సంభాషణల సమయంతో దీన్ని ఒక చిన్న ప్రపంచంగా చెబుతాం. కాని భారత, ఇండోనేసియా సంబంధాలను పరిశీలించినట్టయితే ఈ సముద్రపు అలల్లో భారత, ఇండోనేసియా ప్రజల మధ్య గల చెక్కు చెదరని ఆసక్తి కనిపిస్తుంది. ఆ అలల వలెనే మన బంధం కూడా ఎగిసిపడుతూ ఉంటుంది. కళింగ, మెడాంగ్ రాజవంశాల ద్వారా భారత తత్వం, సంస్కృతి ఇండోనేసియా భూభాగానికి చేరిన సమయం ఉంది. నేడు భారతదేశం, ఇండోనేసియా రెండూ 21వ శతాబ్ది అభివృద్ధి కోసం భుజం భుజం కలిపి కృషి చేస్తున్నాయి.
నేడు ఇండోనేసియా ఇక్కడకు వచ్చిన భారతీయులను సాదరంగా ఆహ్వానించి తమ సమాజంలో అంతర్భాగంగా కలిపేసుకుంటుంది. అందుకే మీరంతా ఇండోనేసియా అభివృద్ధి, సుసంపన్నత కోసం మీ వంతు సేవలందిస్తున్నారు. మన సింధీ కుటుంబాలు అనేకం ఇక్కడ నివశిస్తున్నాయి. భారతదేశం నుంచి వచ్చిన మన సింధీ కుటుంబాలు ఇక్కడ టెక్స్ టైల్స్, క్రీడా ఉపకరణాలే కాదు, ఫిలిం-టెలివిజన్ పరిశ్రమకు కూడా తమ వంతు సేవలందిస్తున్నారు. ఆభరణాలు, వజ్రాలు, గనులు, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో శ్రమిస్తున్న గుజరాతీ ప్రజలు కూడా ఎందరో ఉన్నారు. అలాగే భారతదేశం నుంచి వచ్చిన ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వృత్తి నిపుణులు ఇండోనేసియా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. అంతే కాదు ఇక్కడ సంస్కృతిని, కళలను సుసంపన్నం చేస్తున్న తమిళ భాష మాట్లాడే కళాకారులెందరో ఉన్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఇండోనేసియాకు చెందిన న్యోమన్ నౌర్తాకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన సమయంలో రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మార్మోగిపోయిన సందర్భం నాకు గుర్తుంది. ఆయనలోని కళ “గరుడ విష్ణు కెంకానా”ను అభినందించని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇండోనేసియాకు చెందిన వయన్ దిబియా, ఆగస్ ఇంద్ర ఉదయనలకు పద్మశ్రీ ప్రదానం చేసినప్పుడు వారి గురించి నాకు తెలిసింది. ఇక్కడ నివశిస్తున్న మీ అందరికీ ఆగస్ ఇంద్ర ఉదయనజీ గురించి తెలుసు. బాలిలో మహాత్మాగాంధీ ఆదర్శాలను ముందుకు నడిపేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. భారతదేశానికి గల అతి పెద్ద ప్రత్యేకత “అతిథి దేవో భవ” అని, ఆ భావం ప్రతీ ఒక్క భారతీయుని నరనరాల్లో ఉంటుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చదవడాన్ని నేనెంతో ఇష్టపడతాను. కాని నేను ఇక్కడ మరో విషయం చెప్పాలనుకుంటన్నాను. తాను చూపించే ఆదరంతో భారతదేశం ప్రశంసనీయమైనదే కావచ్చు...కాని ఇండోనేసియా చూపించే ఆదరం అంతకన్నా తక్కువేమీ కాదు. ఇంతకు ముందు నేను జకార్తా వచ్చినప్పుడు ఇండోనేసియా ప్రజల ప్రేమాభిమానాలను చవి చూశాను. నా పట్ల ప్రజలు ఎంతో గౌరవం, ప్రేమాభిమానాలు, సాన్నిహిత్యం ప్రదర్శించారు. అధ్యక్షుడు జోకో విడోడోతో గాలిపటాలు ఎగురవేసిన సందర్భం గుర్తుంది. మేమిద్దరం గాలిపటాలు ఎగురవేయడానికి వెళ్లడం ఒక అద్భుత ఘట్టం. గుజరాత్ లో సంక్రాంతి పర్వదినాల్లో గాలిపటాలు ఎగురవేసిన అనుభవం నాకుంది. అలాగే ఇండోనేసియాలో కూడా సంక్రాంతి పర్వదినాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు.
భారత, ఇండోనేసియా బంధం కేవలం ఆనందకరమైన సమయాలకే పరిమితం కాదు. ఆనందంలోనూ, దుఃఖంలోనూ కూడా మనం సహచరులమే. 2018 సంవత్సరంలో ఇండోనేసియాను భారీ భూకంపం కుదిపివేసినప్పుడు తక్షణం భారతదేశం ఆపరేషన్ సముద్ర మైత్రిని ప్రారంభించింది. భారత్, ఇండోనేసియా మధ్య 90 నాటికల్ మైళ్ల దూరం ఉన్న మాట వాస్తవమే అయినా మనం 90 నాటికల్ మైళ్ల చేరువ అని నేను జకార్తా సందర్శించినప్పుడు చెప్పారు.
మిత్రులారా,
భారత్, ఇండోనేసియా ప్రతీ ఒక్క క్షణాన్ని పదిలపరచుకున్నాయి. మహర్షి మార్కండేయ, మహర్షి అగస్త్యుల తపస్సుతో బాలి పవిత్రమైనది. భారతదేశంలో హిమాలయాలుంటే బాలిలో ఆగంగ్ పర్వత శ్రేణులున్నాయి. భారత్ లో గంగామాత ఉంటే బాలిలో తీర్థ గంగ ఉంది. ప్రతీ ఒక్క సందర్భంలోనూ మేం గణేశుని పూజిస్తాం, ఇక్కడ కూడా ప్రతీ ఇంటిలోనూ గణేశుడుంటాడు. పౌర్ణమి, ఏకాదశి సమయంలో ఉపవాసం, త్రికాల సంధ్యల్లో సూర్యోపాసన, మేథస్సును మా సరస్వతి రూపంలోనూ పూజించడం వంటివన్నీ ఉభయదేశాలను కలిపి ఉంచిన అంశాలు. మహాభారత కథలతో బాలి ఎదిగింది. నేను గుజరాత్ లో శ్రీకృష్ణుని జన్మస్థలం ద్వారకాధీశ్ తో అనుసంధానమై ఎదిగాను. నా జీవితం అక్కడే గడిపాను. బాలి ప్రజలకు మహాభారతం పట్ల ఎంత నమ్మకం ఉందో అలాగే భారతీయులు బాలి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నారు. మీరు భగవాన్ విష్ణుమూర్తిని, శ్రీరాముని పూజిస్తారు, రామాయణ సాంప్రదాయాన్ని పాటించే ఇండోనేసియాను మేం గర్వగా గుర్తు చేసుకుంటాం. శ్రీరాముని జన్మస్థలంలో భారీ రామాలయ నిర్మాణానికి మేం పునాది వేశాం. కొన్నేళ్ల క్రితం మేం రామాయణ ఉత్సవం నిర్వహించిన సమయంలో ఎందరో కళాకారులు ఇండోనేసియా నుంచి అక్కడకి వచ్చారు. యాత్ర చివరి అంకానికి చేరడానికి ముందు అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నోలో వారు రామాయణ ఉత్సవం నిర్వహించారు. రామాయణ ఉత్సవం ముగింపు అయోధ్యలో జరిగింది. దానికి ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది. వారి ప్రదర్శనల గురించి దేశవ్యాప్తంగా వార్తాపత్రికలన్నీ ప్రశంసించాయి.
సోదర సోదరీమణులారా,
తన జీవితంలో ఒక్కసారైనా అయోధ్య లేదా ద్వారకను సందర్శించాలని ఆకాంక్షించని వ్యక్తి ఎవరూ బాలిలో ఉండరు. అలాగే భారత ప్రజలు ప్రాంబణన్ దేవాలయాలు, కెంకానాలోని అతి పెద్ద గరుడ విగ్రహం వీక్షించాలని తపన పడుతూ ఉంటారు. కరోనాకు ముందు కాలంలో ఐదు లక్షల మందికి పైగా భారతీయులు బాలిని సందర్శించడమే ఇందుకు తార్కాణం.
మిత్రులారా,
ఉమ్మడి వారసత్వం, మానవాళి పట్ల సార్వత్రిక విశ్వాసం ఉన్నప్పుడు పురోగతికి ఉమ్మడి మార్గాలు ఏర్పడతాయి. కొద్ది నెలల క్రితం ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇండోనేసియా స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 17 అంటే భారత స్వాతంత్ర్య వేడుకలకు రెండు రోజుల తర్వాత వస్తుంది. భారతదేశం కన్నా రెండేళ్ల ముందు ఇండోనేసియా స్వాతంత్ర్యం పొందింది. ఇండోనేసియా నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాగే ఈ 75 సంవత్సరాల అభివృద్ధి యానం ద్వారా ఇండోనేసియాకు భారతదేశం అందించేది ఎంతో ఉంది. భారతదేశ ప్రతిభ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, పరిశ్రమలు ప్రపంచంలో సొంత గుర్తింపు సాధించాయి. నేడు భారత సంతతికి చెందిన సిఇఓల సారథ్యంలోని కంపెనీలెన్నో ఉన్నాయి. నేడు ప్రపంచంలోని ప్రతీ పది యునికార్న్ లలోను ఒకటి భారత్ లో ఉంది. నేడు భారతదేశం ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఫిన్ టెక్ లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఐటిబిపిఎన్ ఔట్ సోర్సింగ్ లో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. పలు ఔషధాల సరఫరా, వ్యాక్సిన్ల తయారీలో కూడా భారతదేశానిదే అగ్రస్థానం.
మిత్రులారా,
2014 సంవత్సరానికి ముందు, తర్వాత భారతదేశంలో ఎంతో తేడా ఉంది. కేవలం మోదీ వల్లనే కాదు ఈ మార్పు వేగం, నైపుణ్యాల కారణంగా వచ్చిన మార్పు అది. నేడు భారతదేశం గతంలో చూడనంత అమిత వేగంతోనే కాదు, ఊహించలేని పరిధిలో కూడా పని చేస్తోంది. నేడు భారతదేశం ఏదీ చిన్నగా ఆలోచించదు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహాలు, పెద్ద స్టేడియంలు నిర్మించగలదు. 2014 నుంచి 32 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను భారతదేశం తెరిపించింది. అంటే అమెరికా జనాభా కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు మేం తెరిపించాం.
2014 నుంచి 3 కోట్ల మంది పేదలైన పౌరుల కోసం భారతదేశం ఉచితంగా ఇళ్లు నిర్మించింది. ఒక వ్యక్తి ఇంటి యజమాని అయితే అతను “లక్షాధికారి” అవుతాడు. నేను 3 కోట్ల ఇళ్ల గురించి మాట్లాడానంటే ఏమిటి? ఆస్ర్టేలియా జనాభాతో సమాన సంఖ్యలో మేం ఇళ్లు నిర్మించాం. గత ఏడెనిమిది సంవత్సరాల కాలంలో భారతదేశం 55 వేల కిలోమీటర్ల నిడివి గల జాతీయ రహదారులు నిర్మించింది. నేను ఈ పరిధి గురించి మాట్లాడుతున్నానంటే దాని అర్ధం ఈ భూగోళం చుట్టుకొలతకు ఒకటిన్నర రెట్లు అధికం అన్న మాట. నేడు భారతదేశం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రజలందరికీ రూ.5 లక్షల మేరకు ఉచిత చికిత్సలందిస్తోంది. అంటే రూ.5 లక్షల వరకు వైద్య బిల్లులు ప్రభుత్వమే భరిస్తోంది. ఎంత మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో తెలుసునా? యూరోపియన్ యూనియన్ జనాభా కన్నా ఎక్కువ మందికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యచికిత్స సదుపాయం అందుబాటులో ఉందన్న మాట. కరోనా కాలంలో భారత పౌరులకు అందించిన ఉచిత వ్యాక్సిన్లు అమెరికా, యూరోపియన్ యూనియన్ రెండింటి జనాభా కన్నా రెండున్నర రెట్లు అధికం అన్నమాట. ఇదంతా వింటుంటే మీ హృదయం ఉప్పొంగడంలేదా? మీ తల గర్వంతో పైకి లేవడంలేదా? అందుకే ఇండియా మారిందని నేను చెప్పగలుగుతున్నాను.
మిత్రులారా,
వారసత్వం నుంచి అందుకున్న గర్వంతో సుసంపన్న వారసత్వం వారధిగా తన మూలాలతో అనుసంధానం కలిగి ఉంటూనే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం భారతదేశం ఏర్పరచుకుంది. అయితే భారతదేశం పెట్టుకున్న ఈ లక్ష్యం కేవలం దేశానికే పరిమితం కాదు. భారత ప్రజలు స్వార్థపరులు కారు. అలాంటి సంకుచిత విలువలు మాకు లేవు. 21వ శతాబ్ది భారతదేశం నుంచి ప్రపంచానికి ఎన్నో అంచనాలున్నాయి. ఆ ఆకాంక్షలను తన బాధ్యతగా తీసుకుని ప్రపంచం మెరుగుదలకు పాటు పడేందుకు భారతదేశం కృతనిశ్చయంతో ఉంది. నేడు భారతదేశం అభివృద్ధికి “అమృతకాల” చిత్రపటం రూపొందించుకుని ముందుకు సాగుతోంది. ఇందులో ప్రపంచ ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలు కూడా ఉన్నాయి.
భారతదేశం ప్రతిపాదించిన స్వయం సమృద్ధ విజన్ కు ప్రపంచ సంక్షేమం కూడా ఒక స్ఫూర్తి. పునరుత్పాదక ఇంధన రంగం కోసం “ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్” మంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అలాగే ప్రపంచ సంక్షేమం కోసం “ఒకే భూమండలం, ఒకే ఆరోగ్యం” సూత్రం ఆవిష్కరించింది. వాతావరణ మార్పుల విషయంలో ద్వీపకల్ప దేశాలకు భారతదేశం ఒక వరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల సమస్యను డీల్ చేసే విషయంలో భారతదేశం ప్రపంచానికి “మిషన్ లైఫ్” సూత్రం ఇచ్చింది. “మిషన్ లైఫ్” అంటే పర్యావరణ కోసం జీవనశైలి. ప్రజల్లో ప్రతీ ఒక్కరూ పర్యావరణమిత్రమైన జీవన శైలి పాటించాల్సి ఉంటుంది. అంటే ప్రతీ క్షణం వాతావరణ మార్పుల సవాలును దృష్టిలో ఉంచుకునే జీవనం సాగించడం అన్న మాట. ప్రపంచం మొత్తం పర్యావరణ మిత్రమైన జీవనశైలి, సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం పట్ల ఆసక్తిని ప్రదర్శించినప్పుడు దానికి భారతదేశానికి చెందిన యోగా, ఆయుర్వేద వరాలుగా ఉంటాయి. ఆయుర్వేద గురించి మాట్లాడాల్సివస్తే భారత, ఇండోనేసియా మధ్య గల మరో అనుసంధానత కూడా నాకు గుర్తుకొస్తుంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ ఆయుర్వేదిక విశ్వవిద్యాలయం, ఇండోనేసియాకు చెందిన యూనివర్సిటాస్ హిందూ మధ్య ఒక ఒప్పందం జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితం అదే విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభించడం నాకు ఆనందంగా ఉంది.
మిత్రులారా,
ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని చెప్పే “వసుధైవ కుటుంబకం” సూత్రం ప్రపంచ సంక్షేమానికి బాటవేస్తుంది. కరోనా కాలంలో ఔషధాల నుంచి టీకాల వరకు అన్ని కీలకమైన వనరుల విషయంలో భారత్ స్వయం-సమృద్ధంగా ఉంది. ఆ ప్రయోజనం ప్రపంచం యావత్తు పొందింది. భారతదేశ సామర్థ్యం పలు దేశాలకు కవచంగా ఉపయోగపడింది. ఇండోనేసియా వంటి పొరుగు, మిత్ర దేశాలతో భుజం భుజం కలిపి నడిచాం. అలాగే నేడు అంతరిక్ష రంగంలోభారతదేశం ప్రపంచ సూపర్ పవర్ గా ఎదుగుతోంది. ఆ ప్రయోజనం దక్షిణాసియా దేశాలన్నీ అందుకుంటున్నాయి.
రక్షణ రంగంలో దశాబ్దాల పాటు విదేశీ దిగుమతులపై ఆధారపడిన భారతదేశం ఇప్పుడు ఆ విభాగంలో సామర్థ్యాలు పెంచుకుంటోంది. బ్రహ్మోస్ క్షిపణి లేదా తేజస్ యుద్ధ విమానం పట్ల ప్రపంచ ఆకర్షణ నిరంతరం పెరుగుతోంది. భారతదేశం పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కఠినంగా శ్రమిస్తోంది. విజయ మంత్రంతో కూడిన ఈ సంకల్పమే 21వ శతాబ్దిలో నవభారతానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నేడు ఈ సందర్భంగా నేను త్వరలో జరగబోయే “ప్రవాసి భారతీయ సమ్మేళన్”కు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. జనవరి 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగనుంది. గత ఐదారు విడతలుగా ఇండోర్ నగరం దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా నిలుస్తోంది. మీరంతా తేదీలు సద్దుబాటు చేసుకుని ప్రవాసి భారతీయ దివస్ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలి. మీరు ఇండోర్ వచ్చే సమయంలోనే ఒకటి, రెండు రోజుల్లో అహ్మదాబాద్ లో గాలిపటాల పండుగ జరుగుతుంది. మరి ఆ గాలిపటాల పండుగలో పాల్గొనకుండా ఇండోనేసియా ఉండగలదా? మీరు భారతదేశానికి ఒంటరిగా రావద్దు, మీ కుటుంబాలను కూడా తీసుకురండి. కొన్ని ఇండోనేసియన్ కుటుంబాలను కూడా తీసుకురండి. భారత, ఇండోనేసియా బంధాన్ని బలపరచడంలో మీ సహకారం, క్రియాశీల భాగస్వామ్యం కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరంతా “కర్మభూమి” అయిన మీ మాతృభూమి సంక్షేమం కోసం కృషి కొనసాగించాలి, మీకు వీలైనంత ఎక్కువగా మీ వాటా అందించాలి. ఇవే భారతదేశం పాటించే విలువలు. అది మన బాధ్యత కూడా. నేను ఇక్కడ బోహ్రా సొసైటీకి చెందిన పలువురు మిత్రులను చూస్తున్నాను. సైదానా సాహిబ్ తో నేను చాలా సాన్నిహిత్యం కలిగి ఉన్నాను. నేను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అక్కడ బోహ్రా కుటుంబాన్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
మిత్రులారా,
మీరంతా మీ సమయం వెచ్చించి ఎంతో ఉత్సాహంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. ఒడిశాలో బాలి జాతరలో కనిపించే ఉత్సాహమే ఇక్కడ నేను వీక్షిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు, భారతదేశం పట్ల మీరు చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా, ధన్యవాదాలు?
గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.
***
(Release ID: 1879927)
Visitor Counter : 89
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada