ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఇన్వెస్ట్‌ కర్ణాటక-2022’ కింద నవంబరు 2న నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 01 NOV 2022 6:13PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 2వ తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ఇతివృత్తంగా నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు.

   సక్తిగల పెట్టుబడిదారులను ఆకర్షించడంతోపాటు రానున్న దశాబ్ద కాలంలో అభివృద్ధి సంబంధిత ప్రణాళిక రూపకల్పన లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటైంది. బెంగళూరులో నవంబర్ 2 నుంచి 4వ తేదీదాకా మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 80కిపైగా ప్రసంగపూర్వక గోష్ఠులుంటాయి. వీటికి హాజరయ్యే వక్తలలో కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, విక్రమ్ కిర్లోస్కర్ వంటి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలున్నారు. దీనికి సమాంతరంగా 300కుపైగా ప్రదర్శకులతో అనేక వ్యాపార ప్రదర్శనలు, దేశాల తరఫు గోష్టులు కూడా నడుస్తాయి. ఈ గోష్టులు భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాల ద్వారా నిర్వహించబడతాయి- ఇందులో భాగంగా ఆయా దేశాల నుంచి మంత్రులు, పారిశ్రామికరంగ దిగ్గజాలు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు దీనికి హాజరయ్యేలా ఆయా దేశాలు ఏర్పాట్లు చేశాయి. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం తన సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.

******



(Release ID: 1872883) Visitor Counter : 146