ప్రధాన మంత్రి కార్యాలయం

కచ్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి


"నీతి, విధేయత, నిర్ణయాత్మకత, నాయకత్వాలకు ప్రతిబింబం - స్రీలు"

"మహిళలు దేశానికి దిశా నిర్దేశం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని మన వేదాలు, సంప్రదాయాలు పిలుపునిచ్చాయి"

"మహిళల పురోగతి దేశ సాధికారతకు ఎల్లప్పుడూ బలాన్నిస్తుంది"

"ఈ రోజు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళల పూర్తి భాగస్వామ్యంలో నే దేశ ప్రాధాన్యత ఉంది"

'స్టాండప్ ఇండియా' కింద 80 శాతానికి పైగా రుణాలు మహిళల పేరిట ఉన్నాయి. ముద్రా యోజన కింద దాదాపు 70 శాతం రుణాలు మన సోదరీమణులు, కుమార్తెలకు అందించడం జరిగింది."

Posted On: 08 MAR 2022 6:58PM by PIB Hyderabad

కచ్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.

స‌భ‌నుద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా సదస్సుకు హాజరైన వారికి ఆయన శుభాకాంక్ష‌లు తెలిపారు.  శతాబ్దాల తరబడి నారీ శక్తి కి చిహ్నంగా కచ్ భూమి యొక్క ప్రత్యేక ప్రదేశాన్ని ఆయన గుర్తించారు, ఎందుకంటే మా ఆశాపురా మాతృశక్తి రూపంలో ఇక్కడ ఉంది.  "ఇక్కడి మహిళలు మొత్తం సమాజానికి కఠినమైన సహజ సవాళ్లతో జీవించడం నేర్పించారు, పోరాడటం నేర్పారు, గెలవడం నేర్పించారు" అని ఆయన ప్రశంసించారు.  నీటి సంరక్షణ కోసం  తపించడంలో కచ్‌ లోని మహిళల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.  సరిహద్దు గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా, 1971 యుద్ధంలో ఆ ప్రాంత మహిళలు అందించిన సహకారాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.

మహిళలు నీతి, విధేయత, నిర్ణయాత్మకత, నాయకత్వానికి ప్రతిబింబమని ప్రధానమంత్రి అభివర్ణించారు.  "అందుకే,  స్త్రీలు దేశానికి దిశానిర్దేశం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని, మన వేదాలు, సంప్రదాయాలు పిలుపునిచ్చాయి" అని ఆయన అన్నారు. 

ఉత్తరాదిన మీరాబాయి నుండి దక్షిణాదిలోని సంత్ అక్క మహాదేవి వరకు, భక్తి ఉద్యమం నుంచి జ్ఞాన దర్శనం వరకు సమాజంలో సంస్కరణ, మార్పు కోసం భారతదేశంలోని పవిత్రమైన స్త్రీలు, తమ స్వరం వినిపించారని ప్రధానమంత్రి చెప్పారు.  అదేవిధంగా, కచ్ మరియు గుజరాత్  భూమి పవిత్రమైన సతీ తోరల్, గంగా సతి, సతి లోయన్, రాంబాయి, లిర్బాయి వంటి స్త్రీలను చూసింది.  దేశంలోని అసంఖ్యాక దేవతలకు ప్రతీకగా నిలిచిన నారీ చైతన్యం, దేశ ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట జ్వాల రగిలించిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

భూమిని తల్లిగా భావించే దేశంలోని మహిళల ప్రగతి, ఆ దేశ సాధికారతకు ఎల్లప్పుడూ బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  “మహిళల జీవితాలను మెరుగుపరచడమే, ఈ రోజు దేశ ప్రాధాన్యత.   నేడు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళల పూర్తి భాగస్వామ్యంలోనే  దేశ ప్రాధాన్యత ఆధారపడి ఉంది."  అని ఆయన పేర్కొన్నారు.  11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 9 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 23 కోట్ల జన్ ధన్ ఖాతాలు మహిళలకు గౌరవం, జీవన సౌలభ్యాన్ని కలుగజేసే చర్యలని ఆయన వివరించారు. 

మహిళలు ముందుకు వెళ్లేందుకు, వారి కలలను నెరవేర్చుకునేందుకు, సొంతంగా పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.   "స్టాండప్ ఇండియా - పథకం కింద 80 శాతానికి పైగా రుణాలు మహిళల పేరు మీద ఉన్నాయి.  ముద్రా యోజన కింద మన సోదరీమణులకు, కుమార్తెలకు 70 శాతం రుణాలు అందించాం." అని ఆయన చెప్పారు.  అదేవిధంగా, పి.ఎం.ఏ.వై. కింద నిర్మించిన 2 కోట్ల గృహాల్లో ఎక్కువ భాగం మహిళల పేరు మీద ఉన్నాయి.  ఈ  చర్యలన్నీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాయి.

ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు ప్రభుత్వం పెంచిందని ప్రధానమంత్రి తెలియజేశారు.  పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం చట్టాలను మరింత కఠినతరం చేశామని, కూడా ఆయన చెప్పారు.   అత్యాచారం వంటి అతి క్రూరమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన కూడా ఉంది.  కుమారులు, కుమార్తెలు సమానమేనని భావించిన ప్రధానమంత్రి, కుమార్తెల వివాహ వయస్సును కూడా 21 ఏళ్ళకు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.  సాయుధ దళాల్లో బాలికలు కూడా గొప్ప పాత్ర పోషించే విధంగా, ఈ రోజున  ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ,  సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, ప్రధానమంత్రి తెలియజేశారు. 

దేశంలో నెలకొన్న పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి సహకరించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు.  "బేటీ-బచావో-బేటీ-పడావో" కార్యక్రమంలో మహిళల పాత్రను కూడా ఆయన నొక్కి చెప్పారు.  'కన్యా-శిక్ష-ప్రవేశ్-ఉత్సవ్- అభియాన్' లో కూడా మహిళలు చురుకుగా  పాల్గొనాలని ఆయన కోరారు.

'వోకల్ ఫర్ లోకల్' అనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పెద్ద అంశంగా మారింది, అయితే ఇది మహిళా సాధికారత కు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  చాలా స్థానిక ఉత్పత్తుల శక్తి మహిళల చేతుల్లోనే ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి తన ప్రసంగం చివరిలో స్వాతంత్య్ర పోరాటంలో సంత్ పరంపర పాత్ర గురించి ప్రస్తావిస్తూ,   రాన్ ఆఫ్ కచ్ (ఉప్పు ఎడారి) సౌందర్యం, ఆధ్యాత్మిక వైభవాన్ని పరిశీలించాలని కూడా సదస్సులో పాల్గొన్నవారిని కోరారు.

*****



(Release ID: 1804768) Visitor Counter : 147