ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణసీ లో దేవ్ దీపావళి మహోత్సవ్ లో పాల్గొన్న ప్రధాన మంత్రి

చోరీ కి గురైన మాత అన్నపూర్ణ విగ్రహాన్ని తిరిగి పొందినందుకు గాను కాశీ కి అభినందనలు తెలిపారు

గురు నానక్ దేవ్ జీ సంస్కరణలకు అతి పెద్ద ప్రతీక గా ఉన్నారు: ప్రధాన మంత్రి

Posted On: 30 NOV 2020 7:27PM by PIB Hyderabad

వారాణసీ లో ఈ రోజు న జరిగిన దేవ్ దీపావళి మహోత్సవ్ లో ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది కాశీ కి మరొక ప్రత్యేక సందర్భం అన్నారు.  గడచిన వంద సంవత్సరాల కు పైగా కాలం లో కాశీ నుంచి చోరీ కి గురైన మాత అన్నపూర్ణ విగ్రహం ఇప్పుడు తిరిగి ఇక్కడకు వచ్చింది అని ఆయన చెప్పారు.  ఇది కాశీ చేసుకొన్న మహద్భాగ్యం అని ఆయన అన్నారు.  మన దేవీ దేవత ల పురాతన విగ్రహాలు మన ధర్మానికి సంకేతాలు, అంతే కాదు అవి మన అమూల్య వారసత్వానికి కూడా ప్రతీకలు అని ఆయన అన్నారు.
 
ఇటువంటి ప్రయత్నం ఇంతకు పూర్వం జరిగివుంటే, దేశం ఆ తరహా విగ్రహాలను అనేకం తిరిగి సంపాదించుకొని ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు.   మాకు వారసత్వం అంటే దేశ వారసత్వం అని అర్థం; మరికొందరికేమో, దీని అర్థం వారి కుటుంబం, వారి కుటుంబం పేరు అని ఆయన అన్నారు.  మాకు వారసత్వం అంటే మన సంస్కృతి, మన ధర్మం, మన విలువలు; ఇతరులకు మట్టుకు వారి విగ్రహాలు, కుటుంబ ఛాయాచిత్రాలు అని దీని భావం కావచ్చు అని కూడా ఆయన అన్నారు.

గురు నానక్ దేవ్ జీ స్వయానా సమాజం లో, వ్యవస్థ లో సంస్కరణల అతి పెద్ద ప్రతీక గా ఉన్నారు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.  సమాజం లో మార్పులు చోటుచేసుకొన్నప్పుడల్లా, దేశ హితం ప్రస్తావన కు వచ్చినప్పుడల్లా, పిలువని పేరంటం లా ప్రతిపక్ష స్వరాలు ఎలాగోలా ఎలుగెత్తి పలుకుతాయి అని ఆయన అన్నారు.   అయితే ఈ సంస్కరణ ల ప్రాముఖ్యం స్పష్టం అయినప్పుడు, ప్రతిదీ చక్కబడుతుంది అని ఆయన చెప్పారు.  గురు నానక్ దేవ్ జీ జీవితం నుంచి మనం పొందిన పాఠం ఇది అని ఆయన ఉదాహరించారు. 

కాశీ కోసం అభివృద్ధి పనులు మొదలైనప్పుడు, నిరసనకారులు నిరసన తెలపడం కోసమే ఆ పని ని చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.  బాబా దర్బార్ వరకు విశ్వనాథ్ కారిడార్ ను నిర్మించాలని కాశీ నిర్ణయించినప్పుడు, నిరసనకారులు దానిని కూడా విమర్శించారు; కానీ ప్రస్తుతం బాబా కరుణ వల్ల కాశీ కీర్తి పునరుద్ధరణ జరుగుతోంది అని ఆయన అన్నారు.  శతాబ్దాల నాటి నుంచి బాబా దర్బార్ కు, మాత గంగ కు మధ్య ఉన్న ప్రత్యక్ష బంధం తిరిగి ప్రతిష్ఠాపన కు నోచుకొంటోంది అని ఆయన అన్నారు.

భగవాన్ కాశీ విశ్వనాథ్ దయ వల్ల కాశీ లో జరిగే దీపోత్సవం లో పాలు పంచుకొనే అవకాశం తనకు దక్కింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ ప్రాచీన నగరం యశస్సు ను ఆయన గుర్తు కు తెచ్చుకొంటూ, కాశీ యుగ యుగాలు గా ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని పేర్కొన్నారు.  కరోనా ఆంక్షల కారణం గా తాను నగరానికి రాలేకపోతున్నానని, ఈ  నగరం తన నియోజకవర్గం కూడా అని ఆయన ప్రస్తావిస్తూ, ఈ కారణం గా ఏర్పడిన లోటు తనకు తరచు గా అనుభూతి లోకి వస్తోందన్నారు.  అయినప్పటికీ ఈ కాలం లో ప్రజలకు ఎన్నడూ తాను దూరం కాలేదని, మహమ్మారి కాలం లో ఇక్కడ చేస్తున్న ఏర్పాట్ల ను గురించి తెలుసుకొంటూనే ఉన్నానని ఆయన వెల్లడించారు.  మహమ్మారి నేపథ్యం లో కాశీ ప్రజలు చాటిన ప్రజాసేవ తాలూకు స్ఫూర్తి ని ఆయన ప్రశంసించారు.


***



(Release ID: 1677297) Visitor Counter : 176