ప్రధాన మంత్రి కార్యాలయం

బీహార్ ‌లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను సెప్టెంబర్ 13వ తేదీన దేశానికి అంకితం చేయనున్న - ప్రధానమంత్రి

Posted On: 11 SEP 2020 6:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సెప్టెంబర్, 13వ తేదీన, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, బీహార్‌లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు.  ఈ ప్రాజెక్టులలో -  పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్ ‌లైన్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దుర్గాపూర్-బంకా విభాగం తో పాటు, రెండు ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.  పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు హెచ్.‌పి.సి.ఎల్. సంస్థలు వీటిని నిర్మించాయి. 

ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు.

పైప్ ‌లైన్ ప్రాజెక్టు చెందిన దుర్గాపూర్-బంకా విభాగం :

పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈ 193 కిలోమీటర్ల పొడవైన దుర్గాపూర్-బంకా పైప్‌లైన్ విభాగాన్ని నిర్మించింది.    దీనికి 2019 ఫిబ్రవరి, 17వ తేదీన ప్రధానమంత్రి శంకుస్థాపన వేశారు.  ప్రస్తుతం ఉన్న 679 కిలోమీటర్ల పొడవైన పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ ఎల్‌.పి.జి. పైప్‌లైన్‌ ను బీహార్‌లోని బంకా వద్ద ఉన్న కొత్త ఎల్.‌పి.జి. బాట్లింగ్ ప్లాంట్‌ వరకు పొడిగింపుగా, ఈ దుర్గాపూర్ - బంకా విభాగాన్ని నిర్మించారు.  14” వ్యాసం కలిగిన పైప్ ‌లైన్ మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది. పశ్చిమ బెంగాల్ (60 కి.మీ), జార్ఖండ్ (98 కి.మీ), బీహార్ (35 కి.మీ).  ప్రస్తుతం, పారాడిప్ రిఫైనరీ, హల్దియా రిఫైనరీ మరియు ఐ.పి.పి.ఎల్. హల్దియా నుండి ఈ పైప్ లైన్ వ్యవస్థ ద్వారా ఎల్.పి.జి.ని సరఫరా చేస్తున్నారు.  మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, పారాదీప్ దిగుమతి టెర్మినల్ మరియు బరౌని రిఫైనరీ నుండి కూడా ఎల్.పి.జి.ని సరఫరా చేసే సౌకర్యం లభిస్తుంది.

దుర్గాపూర్-బంకా సెక్షన్ కింద పైప్ ‌లైన్ వేయడానికి అనేక సహజ మరియు మానవ నిర్మిత అడ్డంకులను అధిగమించవలసి వచ్చింది.  ఈ మార్గంలో 13 నదులు (వాటిలో ఒకటి 1077 మీటర్ల పొడవు గల అజయ్ నది), 5 జాతీయ రహదారులు మరియు 3 రైల్వే క్రాసింగ్‌లతో సహా 154 క్రాసింగులను నిర్మించడం జరిగింది.  నీటి ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక క్షితిజసమాంతర దిశగా మార్గం చేసే విధానం ద్వారా పైప్‌లైన్‌ను నదీతీరాల క్రింద ఉంచారు.

బీహార్‌లోని బంకా వద్ద ఎల్.‌పి.జి. బాట్లింగ్ ప్లాంట్ :

బంకా వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్ రాష్ట్రంలో ఎల్.పి.జి. కి పెరుగుతున్న డిమాండు ను తీర్చడం ద్వారా బీహార్ యొక్క ‘ఆత్మ నిర్భరత’ ను పెంచనుంది.  సుమారు 131.75 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన, ఈ బాట్లింగ్ ప్లాంట్, బీహార్‌లోని భాగల్‌పూర్, బంకా, జాముయి, అరారియా, కిషన్‌గంజ్, కటిహార్ జిల్లాలతో పాటు, జార్ఖండ్ లోని గొడ్డా, దేయోఘర్, డమ్కా, సాహిబ్‌గంజ్, మరియు పకూర్ జిల్లాలకు సేవలందిస్తుంది.  1,800 ఎమ్.‌టి. ల ఎల్.‌పి.జి. నిల్వ సామర్థ్యంతో పాటు రోజుకు 40,000 సిలిండర్ల బాట్లింగ్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ ప్లాంట్ బీహార్ రాష్ట్రంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. 

బీహార్‌లోని చంపారన్ (హర్సిద్ధి) వద్ద ఎల్.పి.జి. ప్లాం ట్ :

తూర్పు చంపారన్ జిల్లాలోని హర్సిధి వద్ద, హెచ్.‌పి.సి.ఎల్.‌కు చెందిన 120 టి.ఎమ్.‌టి.పి.ఎ.  ఎల్.‌పి.జి. బాట్లింగ్ ప్లాంట్‌ను, 136.4 కోట్ల రూపాయలతో నిర్మించారు.   29 ఎకరాల భూమిలో నిర్మించిన ఈ ప్లాంట్ కు, 2018 ఏప్రిల్, 10వ తేదీన, ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.  బీహార్‌లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్, సివాన్, గోపాల్‌గంజ్, సీతామార్హి జిల్లాల ఎల్‌పిజి అవసరాలను ఈ బాట్లింగ్ ప్లాంట్ తీర్చనుంది.

ఈ కార్యక్రమం డి.డి.న్యూస్ ఛానెల్ లో ప్రత్యక్షంగా ప్రసారమౌతుంది.  

*****



(Release ID: 1653501) Visitor Counter : 133