ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో పెట్టుబడుల ను పెంచే వ్యూహాల ను చర్చించడం కోసం ఒక విస్తృత సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి

Posted On: 30 APR 2020 4:59PM by PIB Hyderabad

కోవిడ్-19 విశ్వమారి నేపథ్యం లో దేశ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి పరచడానికి స్థానిక పెట్టుబడుల ను ప్రోత్సహించడం తో పాటు మరిన్ని విదేశీ పెట్టుబడుల ను భారతదేశం లోకి ఆకర్షించడం కోసం తగిన వ్యూహాల ను గురించి చర్చించడానికి గాను ఒక సమగ్ర సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు.

దేశం లోని ప్రస్తుత పారిశ్రామిక భూములు/స్థలాలు/పారిశ్రామిక వాడల లో అన్ని రకాల అనుమతుల ను వెనువెంటనే అందించేటటువంటి మౌలిక వ్యవస్థ కు పెద్ద పీట వేయడం తో పాటు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సమకూర్చేందుకు ఉద్దేశించిన ఒక పథకాన్ని గురించి కూడాను ఈ సమావేశం లో చర్చించడమైంది.  సమావేశం సాగిన క్రమం లో, పెట్టుబడిదారుల కు మార్గదర్శకత్వం వహించే, వారి సమస్యల పట్ల శ్రద్ధ ను వహించే మరియు కాలబద్ధమైన పద్ధతి లో అవసరమైనటువంటి అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర అనుమతుల ను మంజూరు చేసి వారి కి తోడ్పడే మరింత అధిక క్రియాశీల దృష్టికోణాన్ని అలవరచుకోవాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించారు.

భారతదేశం లోకి పెట్టుబడుల ను శీఘ్రతరమైనటువంటి విధానం లో  తీసుకువచ్చే మరియు దేశం లోని వివిధ రంగాల కు దన్ను గా నిలచే వేరు వేరు వ్యూహాల పై సమావేశం లో చర్చ చోటు చేసుకొంది.  పెట్టుబడుల ను ఆకట్టుకోవడం లో రాష్ట్రాలకు వాటి వాటి వ్యూహాల ను అవి రూపొందించుకోగలిగేటట్టు గాను, ఈ విషయం లో రాష్ట్రాలు మరింత సక్రియాత్మకం గా వ్యవహరించేటట్టు గాను రాష్ట్రాల కు మార్గదర్శనం చేసే అంశం పై విపులమైన చర్చ ను చేపట్టడం జరిగింది.

వివిధ మంత్రిత్వ శాఖ లు అమలు పరుస్తున్నటువంటి సంస్కరణ కార్యక్రమాలు అదే పని గా కొనసాగాలన్న అంశం, అదే విధం గా పారిశ్రామిక వృద్ధి లో మరియు పెట్టుబడుల కు ప్రోత్సాహం లో ఎదురయ్యే అవరోధాల ను తొలగించేందుకు కాలబద్ధ ప్రణాళిక సాయం తో గట్టి చర్యల ను తీసుకొని తీరాలన్న అంశం సమావేశం లో చర్చ కు వచ్చాయి.

ఆర్థిక మంత్రి, హోం మంత్రి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి లతో పాటు భారత ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు ఈ సమావేశాని కి హాజరయ్యారు.

**



(Release ID: 1619735) Visitor Counter : 198