రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు గతేడాది కంటే 32 శాతం అధికంగా విక్రయాలు గతం కంటే 46 శాతం ఎక్కువ సరుకు కొన్న డీలర్లు విత్తనాలు వేసే సమయానికి రైతులకు చేరనున్న ఎరువులు

Posted On: 28 APR 2020 5:08PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ సమయంలోనూ, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఎరువుల డిపార్ట్‌మెంట్‌, రికార్డ్‌ స్థాయిలో ఎరువులు విక్రయించింది. 1 ఏప్రిల్‌ 2020 నుంచి 22 ఏప్రిల్‌ 2020 మధ్యకాలంలో రైతులకు 10.63 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అమ్మారు.గతేడాది ఇదే సమయంలో ఇది 8.02 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దానితో పోలిస్తే, ఈ ఏడాది 32 శాతం అధికంగా ఎరువులు విక్రయించారు. 1 ఏప్రిల్‌ 2020 నుంచి 22 ఏప్రిల్‌ 2020 మధ్యకాలంలో డీలర్లు 15.77 మెట్రిక్‌ టన్నుల ఎరువులు కొన్నారు. గతేడాది ఇదే సమయంలో ఇది 10.79 మెట్రిక్‌ టన్నులు. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది 46 శాతం అధికంగా డీలర్లు కొనుగోళ్లు చేశారు.

కేంద్రం సహా రాష్ట్రాల సమష్టి కృషి

    లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా కదలికలపై ఆంక్షలు కొనసాగుతున్నా, ఎరువుల డిపార్టుమెంట్‌, రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, నౌకాశ్రయాల సమష్టి ప్రయత్నాలతో, దేశవ్యాప్తంగా ఎరువుల ఉత్పత్తి, పంపిణీ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగింది. లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా, వచ్చే ఖరీఫ్‌ నాటికి ఎరువులు అందించాలన్న రసాయనాలు, ఎరువుల శాఖ నిబద్ధతతో ఇది సాధ్యమైంది.

ఎరువుల కొరత లేదు: శ్రీ సదానంద గౌడ

    దేశంలో ఎరువుల కొరత లేదని, కేంద్రం వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి శ్రీ D.V.సదానంద గౌడ చెప్పారు. రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. విత్తనాలు వేసే సమయానికి రైతులకు ఎరువులు అందించేందుకు తన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని శ్రీ సదానంద గౌడ స్పష్టం చేశారు.

    17, ఏప్రిల్‌ 2020న 41 ఎరువుల ర్యాకులు ఉత్పత్తి ప్లాంట్లు, నౌకాశ్రయాల నుంచి కదిలాయి. ఇది, లాక్‌డౌన్‌ సమయంలో ఒక్కరోజులో తరలించిన అత్యధిక పరిమాణం. ఒక్కో ర్యాకులో 3 వేల మెట్రిక్‌ టన్నుల సరుకు ఉంటుంది. ఎరువుల పరిశ్రమల్లో తయారీ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో కొనసాగుతోంది. అత్యవసర సరుకుల చట్టం కింద దేశంలోని అన్ని ప్లాంటుల్లో ఎరువుల తయారీని అనుమతించడంతో, ఎరువుల విషయంలో వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్‌ ప్రభావం పడలేదు. 

    ప్లాంట్లు, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయాల వద్ద 
ఎరువుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చురుగ్గా సాగుంతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మాస్కులు సహా అన్ని రక్షణ పరికరాలను కూలీలు, ఇతర ఉద్యోగులకు అందించారు.



(Release ID: 1619020) Visitor Counter : 184