సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే యోచ‌న‌, చర్యలు గానీ లేవు,

ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ దీనిపై చ‌ర్చ జ‌రుగ‌లేదు: మ‌ంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 26 APR 2020 7:02PM by PIB Hyderabad

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 50 సంవత్సరాలకు తగ్గించేలా కేంద్ర ప్ర‌భుత్వం ఒక‌ ప్రతిపాదనను తీసుకువ‌స్తున్నట్టుగా ఇటీవ‌ల కొన్ని మీడియాలోని సంస్థ‌ల నుంచి వ‌స్తున్న వార్తల‌ను స‌ర్కారు ఖండించింది. ఈ విష‌య‌మై ఈశాన్య ప్రాంతం అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా), ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్ & పెన్షన్లు శాఖ,  
అణు ఇంధ‌నం అంత‌రిక్ష శాఖల‌ స‌హాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పూర్తి వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 50 సంవత్సరాలకు తగ్గించే యోచ‌న గానీ చర్యలేవీ లేవని తేల్చి చెప్పారు. అటువంటి ప్రతిపాదనపైన‌ ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ చ‌ర్చ‌ జ‌ర‌గ‌లేదని తెలిపారు.
కొన్ని ప్రేరేపిత శ‌క్తుల అవాస్త‌వ ప్ర‌చారం..
ఇటీవ‌ల గత కొన్ని రోజులుగా కొన్ని ప్రేరేపిత శ‌క్తులు మ‌ళ్లీమ‌ళ్లీ ఇలాంటి అవాస్త‌వ స‌మాచారాన్ని మీడియాలో ఒక విభాగానికి ఉప్పందిస్తూ దానిని ప్రభుత్వ వర్గాలకు లేదా డీఓపీ అండ్ టీ శాఖ‌కు ఆపాదించ‌డం చేస్తున్నార‌ని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వార్త‌లు వ‌స్తున్న ప్ర‌తీసారి భాగ‌స్వామ్య ప‌క్షాల మనస్సుల్లో గూడు క‌ట్టుకుంటున్న గందరగోళాన్ని తొలగించడానికి ప్రతిసారీ సత్వర ఖండిస్తున్న‌‌ట్లు ఆయన చెప్పారు. దేశం కరోనా వైర‌స్ వ్యాప్తి వంటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో కొన్ని ప్రేరేపిత శ‌క్తులు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాల్ని వెలుగులోకి తేవ‌డం శోచ‌నీయ‌మ‌ని మంత్రి అన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని క‌ట్ట‌డి చేసే విష‌యమై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తూ చ‌ర్య‌లు చేప‌డుతున్న త‌రుణంలో ప్ర‌పంచం మొత్తం ప్ర‌ధానిని అభినందిస్తుంటే.  ప్రభుత్వం చేసిన అన్ని మంచి పనులను తక్కువగా చూపించడానికి గాను కొన్ని శ‌క్తులు త‌మ స్వార్థప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి అవాస్త‌వాల‌ను మీడియాలోని ఒక వ‌ర్గం ద్వారా ప్ర‌చారం చేయిస్తున్న‌ట్టుగా మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.
ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు కాపాడేలా చ‌ర్య‌లు..
దేశంలో కరోనా వైర‌స్ వ్యాప్తి స‌వాలు మొద‌లైన తొలినాళ్ల‌ నుంచి, ప్రభుత్వం మరియు డీఓపీ అండ్ టీ, ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సత్వర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. ఉదాహరణకు, స‌ర్కారు లాక్‌డౌన్‌ను అధికారికంగా ప్రకటించక‌ ముందే "క‌చ్చితంగా అవసరమైన లేదా కనీస సిబ్బంది" తో కార్యాలయాల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని డీఓపీటీ త‌న‌వంతుగా సలహా ఇచ్చింద‌ని మంత్రి తెలిపారు. వివిధ అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను ఈ మార్గదర్శకాల‌ నుండి స‌ర్కారు మినహాయించినప్పటికీ, "దివ్యంగ్ ఉద్యోగులను ఈ అత్య‌వ‌సర సేవల నుండి కూడా మినహాయించాలని డీఓపీటీ ఆదేశాలు జారీ చేసిన విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.
మే 3 తర్వాతే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్..
లాక్‌డౌన్ అడ్డంకులను పరిగణనలోకి తీసుకున్న స‌ర్కారు ప్రభుత్వ అధికారులు వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్) నింపడానికి డీఓపీటీ చివరి తేదీని వాయిదా వేసినట్లుగా కూడా మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌ర‌ణ‌నిచ్చారు. అదే సమయంలో, ఐఏఎస్ / సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ యూపీఎస్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. మే 3 వ తేదీ తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ జరుగుతుందని ప్రకటించారు. అదేవిధంగా, మ‌రోవైపు ఎస్ఎస్‌సీ కూడా నియామక ప్రక్రియను వాయిదా వేసిందని మంత్రి వివ‌రించారు.
పెన్ష‌న్ల త‌గ్గింపు వార్త‌లూ అవాస్త‌వ‌మే..
పెన్షన్‌లో 30 శాతం కొత విధించాలని, 80 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్టుగా గ‌త వారం కొన్ని అవాస్త‌వ వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు. ఈ వార్త‌లు అవాస్త‌వ‌మ‌న్న మంత్రి  మార్చి 31 నాటికి తన ఖాతాలో పింఛను జమ కాకుండా దేశంలో ఏ ఒక పింఛనుదారుడు కూడా లేడ‌ని వెల్ల‌డించారు. ఇది మాత్రమే కాద‌ని, అవ‌స‌ర‌మైతే పింఛను సొమ్ము మొత్తాన్ని ఆయా పెన్షనర్ల నివాసంలో అందజేసేలా తాము తపాలా శాఖ సేవలను కూడా అభ్య‌ర్థించిన‌ట్టుగా మంత్రి వివ‌రించారు. గత నాలుగు వారాల్లో సిబ్బంది మంత్రిత్వ శాఖ 20 నగరాల్లో పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్ల నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింద‌ని తెలిపారు. దీనికి తోడు శ్వాస‌కోశ వ్యాధుల వైద్యుడు, ఎయిమ్స్ వైద్య సంస్థ‌ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రణదీప్ గులేరియా వంటి వైద్య రంగ నిపుణులు ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశాల్లో పాల్గొని త‌మ విలువైన స‌ల‌హాలు అందించార‌ని తెలిపారు. అదేవిధంగా, వెబ్‌నార్ వేదిక‌గా వీరికి యోగా సెషన్‌లు కూడా నిర్వహిస్తున్నార‌ని మంత్రి తెలిపారు. 



(Release ID: 1618520) Visitor Counter : 169