రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐఎస్‌వో క్లాస్-3 ప్రమాణాలకు అనుగుణంగా 1.10 ల‌క్ష‌ల క‌వ‌రాల్స్ ఉత్ప‌త్తి మొద‌లుపెట్టిన ఓఎఫ్‌బీ

Posted On: 14 APR 2020 2:41PM by PIB Hyderabad

 కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ) ఐఎస్‌వో క్లాస్-3 ఎక్స్‌పోజర్ ప్రమాణాలకు అనుగుణంగా క‌వ‌రాల్స్ ఉత్ప‌త్తిని ప్రారంభించింది. హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌ఎల్) నుంచి ల‌భించిన 1.10 లక్షల క‌వ‌రాల్స్ త‌యారీ ప్రాథ‌మిక ఆర్డరు ప్ర‌కారం సంస్థ పూర్తి స్థాయిలో ఉత్ప‌త్తిని మొద‌లుపెట్టింది. ఈ మొత్తం ఆర్డ‌ర్ స‌ర‌ఫ‌రాను 40 రోజుల్లో పూర్చి చేసేలా ఓఎఫ్‌బీ అన్ని చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. కోవిడ్ ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ప్రత్యేక రెండు మీటర్ల గుడారాలను కూడా అభివృద్ధి చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ, స్క్రీనింగ్, హాస్పిటల్ ట్రయాజ్, క్వారెంటైన్ కోసం ఉప‌యోగించేలా వీటిని ఓఎఫ్‌బీ రూపొందించింది. జల నిరోధిత ఫాబ్రిక్ ఉప‌యోగించి తేలికపాటి ఉక్కు మరియు అల్యూమినియం మిశ్రమాల‌తో దీనిని రూపొందించారు. వీటి సరఫరాను కూడా ఇప్పటికే ప్రారంభించారు. చేతులు శుభ్రం చేసుకొనేందుకు వినియోగించే హ్యాండ్ శానిటైజర్ తయారీని కూడా సంస్థ యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టింది. ఇప్పటికే 70,000 లీటర్లకు పైగా హ్యాండ్ శానిటైజర్ త‌యారు చేసి వివిధ ఏజెన్సీలకు సరఫరా చేసింది. కోవిడ్ నేప‌థ్యంలో బ్ల‌డ్ పెన‌ట్రీష‌న్ ప‌రీక్ష‌ల కోసం చెన్నై, కాన్పూర్‌ల‌లో రెండు రక్త ప‌రీక్షా కేంద్రాల‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప‌ది ఆసుపత్రులలో సుమారు 280 ఐసోలేష‌న్ పడకల‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ) అవసరానికి అనుగుణంగా వీటిని సిద్ధం చేసి ఉంచారు. హెచ్‌ఎల్‌ఎల్ ఉంచిన ప్ర‌యోగాత్మ‌క ఆర్డర్ పరిమాణం ప్రకారం ఫేస్ మాస్క్‌ల ఉత్పత్తికి కూడా ఓఎఫ్‌బీ ప్రయ‌త్నాల‌ను ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 90,000 కంటే ఎక్కువగా వైద్యేతర ముసుగులు తయారు చేసి ఓఎఫ్‌బీ పంపిణి చేసింది. ఓఎఫ్‌బీ నుంచి మెడికల్ మాస్క్‌ల పరీక్షా సౌకర్యాలు కూడా మ‌రో వారంలో అందుబాటులోకి రానున్నాయి. 

 



(Release ID: 1614357) Visitor Counter : 136