ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా సమాచారం

Posted On: 01 APR 2020 5:37PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు సంయుక్తంగా అనేకరకాల చర్యలు తీసుకోవడంతోపాటు ఉన్నతస్థాయిలో అనుక్షణం పర్యవేక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన ‘దిగ్బంధం’ నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ- వలస కార్మికుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలనూ కోరారు. తదనుగుణంగా సహాయ శిబిరాలు, దిగ్బంధ చికిత్స కేంద్రాల్లో వారికి ఆహారం, నీరు, వైద్య సరఫరాలతోపాటు పరిశుభ్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కూడా నిన్న ఇదేవిధంగా వారి సంక్షేమం దిశగా ఒక సూచనపత్రం (https://www.mohfw.gov.in/pdf/RevisedPsychosocialissuesofmigrantsCOVID19.pdf.లో దీన్ని చూడవచ్చు) జారీచేసింది.

   సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సహాయ శిబిరాల్లో వలస కార్మికులకు చైతన్యం కల్పించేందుకు మానసిక-సామాజిక నిపుణులను నియమించాలని రాష్ట్రాలను ఆదేశించింది. సాంకేతిక సందేహాలను తీర్చేందుకు technicalquery.covid19[at]gov[dot]in పేరిట ఈ-మెయిల్‌ చిరునామా ఇచ్చింది. సాంకేతికపరమైన మార్గదర్శకాలకు https://www.mohfw.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చునని తెలిపింది. కోవిడ్‌-19 సంబంధిత సందేహాలపై ఫోన్‌ చేయడానికి 1075 ఉచిత నంబరుతో సహాయ కేంద్రంసహా ncov2019[at]gov[dot]in ఈ-మెయిల్‌ ఏర్పాటు చేసింది. దీంతోపాటు 24 రకాల వైద్య పరికరాల ధరల నియంత్రణ బాధ్యతను ఏప్రిల్‌ 1 నుంచి జతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.

   వ్యాధి నిరోధకత పెంపు దిశగా స్వీయ సంరక్షణ చర్యలపై... ప్రత్యేకించి కోవిడ్‌-19 బారినుంచి రక్షణలో అత్యంత ముఖ్యమైన శ్వాసకోశ ఆరోగ్యం లక్ష్యంగా నిరోధకత పెంచుకోవడంపై ‘ఆయుష్‌’ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 1,637 కాగా- 38 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 376 కేసులు నమోదవగా, 3 మరణాలు సంభవించాయని, 132 మంది వైరస్‌ బారినుంచి కోలుకుని, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారని సమాచారం అందింది.

 

****


(Release ID: 1610044)