ఉప రాష్ట్రపతి సచివాలయం
తిరువారూర్లోని తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవానికి హాజరైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
జ్ఞానం ఒక్కటే సరిపోదు.. జీవితాంతం నేర్చుకోవడం, ఆవిష్కరణలు, మార్పులకు అనుగుణంగా మారడం భవిష్యత్తుకు కీలకం: ఉపరాష్ట్రపతి
విద్య పరీక్షలు, మార్కులకే పరిమితం కాకుండా స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి
తప్పు చేసిన వారిని శిక్షించి, నిజాయితీగా పరీక్షలు రాసే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వ పరీక్షల్లో సంస్కరణలు అవసరం: ఉపరాష్ట్రపతి
తన కోసం జీవించడం తప్పు కాదు.. తన కోసం మాత్రమే జీవించడం తప్పు: ఉపరాష్ట్రపతి
“జ్ఞానానికి వినియోగదారులుగా కాకుండా సృష్టికర్తలుగా.. అనుకరించేవారిగా కాకుండా ఆవిష్కర్తలుగా.. అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాలి”: ఉపరాష్ట్రపతి
మాదకద్రవ్యాల దుర్వినియోగంపై భద్రతా సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలి: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
17 AUG 2026 1:56PM by PIB Hyderabad
తిరువారూర్లోని తమిళనాడు సెంట్రల్ విశ్వవిద్యాలయం (సీయూటీఎన్) 11వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ జీవితంలో కీలక దశకు చేరుకున్న సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. స్నాతకోత్సవం కేవలం డిగ్రీల ప్రదాన కార్యక్రమం మాత్రమే కాదని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విద్య అందించే పరివర్తన శక్తికి, జ్ఞానాన్వేషణకు, విద్యార్థులును ఈ కీలక దశకు చేర్చిన వారి అంకితభావం, పట్టుదల, దృఢ సంకల్పానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.
పట్టాలు అందుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఆయన అభినందించారు. వారి త్యాగాలను గుర్తుచేస్తూ.. తమ పిల్లలు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు తమ జీవితంలోని ఎన్నో సౌకర్యాలను త్యాగం చేశారని పేర్కొన్నారు.
తిరువారూరు ప్రాముఖ్యతను వివరిస్తూ.. అద్భుతమైన త్యాగరాజ ఆలయానికి నిలయమైన ఈ పవిత్ర పట్టణం శతాబ్దాలుగా ఆధ్యాత్మికత, పాండిత్యం, కళా వైభవానికి కేంద్రంగా నిలిచిందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
ఈ పవిత్ర భూమి ఎందరో సాధువులు, పండితులతో పాటు కర్ణాటక సంగీతంలోని దిగ్గజ త్రిమూర్తులను తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు. సంస్కృతి, విద్య, విలువలు కలిసి వికసించినప్పుడే నిజమైన గొప్పతనం ఆవిర్భవిస్తుందని తెలిపారు.
గత 12 ఏళ్లలో ఉన్నత విద్య గణనీయంగా విస్తరించిందని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగే స్నాతకోత్సవాల్లో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు డిగ్రీలు, పతకాలు అందుకోవడం తాను తరచూ చూస్తున్నానని చెప్పారు. ఈ పరిణామం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు.
నేటి విద్యను కేవలం పరీక్షలు, మార్కుల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని ఉపరాష్ట్రపతి అన్నారు.
“స్వతంత్రంగా ఆలోచించడం, సమర్థవంతంగా సంభాషించడం, ఇతరులతో కలిసి పనిచేయడం, జీవితాంతం నేర్చుకుంటూ ఉండగలగడం వంటి సామర్థ్యాల ఆధారంగా విద్యను అంచనా వేయాలి” అని తెలిపారు.
బహుళ శాస్త్ర విద్యావిధానం, పరిశోధన, ఆవిష్కరణలు, విలువల ఆధారిత అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ దార్శనికతను ఆచరిస్తున్న తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అభినందించారు.
ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును ప్రస్తావిస్తూ.. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన కాలాన్ని గుర్తుచేసుకుంటూ.. తన పదవీకాలంలో జార్ఖండ్ ప్రభుత్వం ఇదే తరహా బిల్లును ఆమోదించిందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. అప్పటి గవర్నర్గా తాను వెంటనే ఆమోదం తెలపడంతో అది చట్టంగా మారిందని పేర్కొన్నారు.
“మంచి వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు సమాజంలోని చెడు వ్యక్తులను శిక్షించాలి” అని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పట్టభద్రులు “జ్ఞానాన్ని వినియోగించేవారిగా కాకుండా సృష్టికర్తలుగా.. అనుకరించేవారిగా కాకుండా ఆవిష్కర్తలుగా.. అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాలి” అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధన దిశగా భారత్ పనిచేస్తోందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. యువత తమ చర్యల్లో “దేశమే ముందు-రాష్ట్ర ప్రథమం” అనే నినాదాన్ని ప్రధానంగా పాటిస్తూ.. జాతీయాభివృద్ధి కోసం తమ జ్ఞానం, నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలను వినియోగించాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై, మాదకద్రవ్యాల విస్తరణకు కారణమవుతున్న వ్యక్తులపై పోలీసులు, భద్రతా సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడటం అందరి సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు.
“మాదకద్రవ్యాలకు నో చెప్పండి” అంటూ విద్యార్థులకు మరోసారి పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి.. తమ స్నేహితులు కూడా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి ఒక్క పట్టభద్రుడికి విజయాలు, సంతృప్తి, మంచి ఆరోగ్యం కలగాలని, సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడంలో తగిన పాత్ర పోషించినందుకు సంతృప్తి పొందాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షిస్తూ ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1,103 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. వీరిలో విద్యా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందిన 50 మంది స్వర్ణ పతక విజేతలు ఉన్నారు. మొత్తం పట్టభద్రుల్లో 616 మంది మహిళలు కాగా, స్వర్ణ పతకం సాధించిన వారిలో 37 మంది మహిళలే ఉండటం విశేషం.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, నాగపట్నం లోక్సభ సభ్యుడు తిరు వీ సెల్వరాజ్, ఛాన్సలర్ ప్రొఫెసర్ జీ పద్మనాభన్, వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ సులోచన శేఖర్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2300499)
आगंतुक पटल : 6